
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సంబంధం లేకుండానే ఫొని తుపాను సహాయక పనులు జరుగుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగంపై ఎల్లో మీడియా బురదజల్లే వార్తలను కుమ్మరిస్తోందని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘శ్రీకాకుళం జిల్లా శిబిరాల్లో ఉన్న ప్రజలకు భోజన వసతి సరిగా లేదని గొట్టాలు పెట్టి గోల చేస్తున్నారు.. టీడీపీ కార్యకర్తలతో తిట్టిస్తున్నారు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
హెరిటేజ్ కంపెనీలో ఇలాగే జీతాలు పెంచుతారా?
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజా జీతభత్యాలను ముఖ్యమంత్రి ఒక్కసారిగా పెంచడంపై విజయసాయిరెడ్డి అభ్యంతరం తెలిపారు. ‘జీతభత్యాలను రూ.50 వేల నుంచి రెండు లక్షలకు పెంచడం నీతి మాలిన చర్యకాదా.. చంద్రబాబూ? ఏప్రిల్ 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో బకాయిలు రూ.24 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. మీ హెరిటేజ్ కంపెనీలో అయితే ఇలా 200 శాతం పెంచుతారా?’ అని విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.
అధికారులను బెదిరించేందుకే!
‘అధికారులను బెదిరించడానికి, కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడేందుకే చంద్రబాబు తనదే ఘనవిజయం అని గంతులేస్తున్నారు. టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప. ఓడిపోతాడు కాబట్టే లోకేశ్ను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించకుండానే పోటీకి దింపారు. ఈవీఎంలపై పోరాటం ఎంతవరకొచ్చిందో?’ అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment