
సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు, విభజన హామీలు నెరవేర్చాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. వామపక్ష పార్టీల నాయకులతో పాటు, పలు విద్యార్థి సంఘాల నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో ధర్నా చేసిన ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జ్, అరెస్టులను ఆయన ఖండించారు. ఢిల్లీలో ఉన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్యమ కారులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment