
సాక్షి, కడప: సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని కడప జిల్లాకు చేరుకున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గా వద్దకు చేరుకున్న జననేతకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. దర్గా పెద్దలు కూడా వైఎస్ జగన్కు ఎదురొచ్చి.. లోనికి ఆహ్వానించారు. దర్గాలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి ఆచారం ప్రకారం వైఎస్ జగన్ చాదర్ సమర్పించారు.
ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని, అమీన్ పీర్ దర్గాను దర్శించిన సంగతి తెలిసిందే. అయితే 14 నెలల పాటు కొనసాగిన పాదయాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మొక్కులు చెల్లించుకునేందుకు సంకల్పించుకున్నారు. గురువారం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన వైఎస్ జగన్.. సామాన్య భక్తునిలా క్యూ లైన్లో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. నిన్న రాత్రి తిరుమలలోనే బస చేసిన జననేత నేడు ఉదయం వైఎస్సార్ జిల్లాకు చేరుకున్నారు. వైఎస్సార్ జిల్లాకు చేరుకున్న వైఎస్ జగన్కు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడుగున పూల వర్షం కురిపిస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment