PrajaSankalpaYatra
-
ఏపీ సీఎం స్ఫూర్తితో తలైవా పాదయాత్ర
పెరంబూరు: తలైవా ఎట్టకేలకు రాజకీయ పార్టీని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారా? అందుకు ప్రణాళికను రచించుకుంటున్నారా? అంటే అవునే సమాధానం వస్తోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని అధికారికంగా ప్రకటించి రెండేళ్లు అవుతోంది. 2021 శాసనసభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందని ప్రకటించారు. ఆ తరువాత ఇప్పటి వరకూ రజనీకాంత్ పార్టీని ప్రారంభించలేదు. కానీ పలు చర్చలు, వివాదాలకు కారణంగా నిలుస్తున్నారు. ఆ మధ్య తూత్తుక్కుడి ఘటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల పెరియార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. మరోపక్కసీఏఏ వంటి బిల్లులకు మద్దతు పలికి అన్నాడీఎంకే, బీజేపీలకు అనుకూలుడనే ముద్ర వేసుకున్నారు. అంతేకాదు తాజాగా రజనీకాంత్ భారతీయ జనతాపార్టీ గొంతు అనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమయినట్లు సమాచారం. ఏప్రిల్లోనే పార్టీని ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై రజనీ ప్రజాసంఘంలోని కొందరు ప్రముఖులతోనూ, రాజకీయ సలహాదారులు, ఇతర సన్నిహితులతోనూ సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో మహానాడు సభలను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. వీటిని ముందుగా మదురై, తిరుచ్చి జిల్లాల్లో మహానాడును నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని తలైవా నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు. అలా వారికి దగ్గరై ప్రేమాభిమానాలను పొందారు. అదేతరహాలో ప్రజల్లోకి వెళ్లాలని రజనీకాంత్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే పాదయాత్రతో నిరంతరం ప్రజల మధ్య ఉండాలా? లేక మహానాడు పేరుతో గ్రామాల్లో నిర్వహించే సమావేశాలలో పాల్గొని ప్రజలతో మమేకం కావాలా? అన్న విషయంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. మొత్తం మీద ఏప్రిల్లో పార్టీని ప్రారంభించి, సెప్టెంబర్లో ప్రజల్లోకి వెళ్లాలని తలైవా నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. రజనీకాంత్ ఇతర పార్టీలో పొత్తుకు సిద్ధమేననీ, అయితే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా? అన్నది సందేహమేనని ఆయన రాజకీయ ఆలోచనాపరుడు తమిళరవి మణియన్ అన్నారు. రజనీకాంత్తో పొత్తుకు పాట్టాలి మక్కళ్ కట్చి వంటి పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. రజనీ పార్టీని పెట్టే అవకాశమే లేదు రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రారంభానికి సిద్ధం అవుతున్నారన్న ప్రచారం ముమ్మరం అవుతున్న పరిస్థితుల్లో, ఆయనకు అంత సీన్ లేదని, పార్టీని పెట్టే అవకాశమేలేదని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆదివారం కోవైలో మీడియాతో మాట్లాడారు. ఆయన రజనీకాంత్ రాజకీయ ప్రస్థానంపై స్పందించారు. రజనీ రాజకీయ పార్టీని పెట్టరని అన్నారు. నిజానికి రజనీకాంత్తో ఎప్పుడైనా రాజకీయ పార్టీని ప్రారంభం గురించి స్పష్టంగా చెప్పారా? అని ప్రశ్నించారు. తన నటిస్తున్న చిత్రం విడుదల సమయం వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీ ప్రస్థావన తీసుకొచ్చి తద్వారా ఆ చిత్రానికి ప్రచారాన్ని పొందుతున్నారని అన్నారు. అభిమానుల ఆదరణను కోలోపతున్న రజనీకాంత్కు రాజకీయ పార్టీని ప్రారంభించే సీన్ లేదని అన్నారు. తమిళరువి మణియన్ రజనీకాంత్ను ఆకాశానికి ఎత్తేసే పనిని మానుకోవాలని ముత్తరసన్ హితవుపలికారు. -
అమ్మఒడి..పేదింట చదువుకు భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తానని హామీనిస్తూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయ్యి నేటికి ఏడాది. ఆ ప్రజా సంకల్పయాత్రలో తల్లులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సరిగ్గా అదే రోజున.. నేడు అమ్మఒడి పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ ‘జగనన్న అమ్మఒడి’ని గురువారం చిత్తూరు నగరంలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, బడిబయట ఏ ఒక్క చిన్నారి ఉండకూడదనే గొప్ప లక్ష్యంతో.. పిలల్ని బడికి పంపే ప్రతి పేదతల్లికి అమ్మఒడి పథకంలో ఏటా రూ.15 వేల చొప్పున చేయూతనందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ జగన్ హమీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి కార్యరూపమిస్తూ.. పిల్లల్ని బడికి పంపే దాదాపు 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడిలో లబ్ధి చేకూరుస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఎక్కడ చదివించినా పథకం వర్తింపు అమ్మఒడి పథకంలో పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు అకౌంట్లో ఏడాదికి రూ.15 వేలు నేరుగా జమచేస్తారు. ఈ పథకాన్ని ముందుగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. అనంతరం ఇంటర్ వరకు వర్తింపచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎంత ఖర్చైనా ఫరవాలేదని.. పేద పిల్లల చదువుకు ఖర్చుచేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్న మాటల్ని చేతల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించారు. ‘జగనన్న అమ్మఒడి’ పథకానికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చుచేస్తోంది. ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి రూ.6,500 కోట్లు కేటాయించారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తింపచేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా పిల్లలను ఎక్కడ చదివించినా ఆ తల్లికి సాయం అందేలా పథకం అమలు చేస్తున్నారు. జాబితాలో పేరు లేకపోయినా.. అర్హులైతే లబ్ధి జాబితాలో తల్లులు/సంరక్షకుల పేర్లు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో గ్రామ/వార్డు సచివాలయాల దృష్టికి, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓల దృష్టికి తీసుకెళ్తే వాటిని పరిశీలించి పరిష్కరిస్తారు. ఎవరైనా సకాలంలో ధ్రువీకరణ పత్రాలు అందచేయకపోతే.. వారు ఆ పత్రాల్ని గ్రామ/వార్డు సచివాలయాలు, మండల విద్యాధికారుల దృష్టికి తీసుకెళితే.. వాటిని పరిశీలించి అర్హులైతే లబ్ధిదారులుగా గుర్తిస్తామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. నెరవేరుతున్న అమ్మఒడి ప్రయోజనం ప్రతి ఏడాది జనవరిలో నేరుగా పథకానికి ఎంపికైన అర్హులైన తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదును జమచేస్తారు. ఈ పథకం అమలుతో బడి బయట పిల్లల సంఖ్య భారీగా తగ్గింది. ఆర్థిక సమస్యలతో పిల్లలు మధ్యలోనే చదువు మానేయకుండా ఈ పథకం ఉపయోగపడనుంది. పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించగలుగుతాయి. ప్రతి స్కూల్లో నేడు ప్రారంభోత్సవ కార్యక్రమాలు గురువారం ఉదయం 11.15 గంటలకు చిత్తూరులోని పీవీకేఎస్ గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్స్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణానికి సీఎం చేరుకుని విద్యాశాఖ ఏర్పాటుచేసిన స్టాల్స్ పరిశీలిస్తారు. అనంతరం స్థానికంగా అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం 11.45 గంటలకు అమ్మఒడి కార్యక్రమం ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విద్యాశాఖ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు పంపింది. గురువారం అర్హులైన తల్లులు/సంరక్షకులతో పాటు.. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి ప్రజాప్రతినిధులను ప్రారంభోత్సవ సమావేశానికి ఆహ్వానించాలి. సీఎం ప్రారంభించే అమ్మఒడి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి పాఠశాలలో చూసేందుకు వీలుగా ఏర్పాటు చేయాలి. మాలాంటి వారికి అభయం.. అమ్మఒడి వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): ఈ ఫోటోలోని మహిళ పేరు వెంకటమ్మ. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కోవూరుపాడు స్వగ్రామం.. ఐదేళ్ల క్రితం భర్త మరణించడంతో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేంది. విధివశాత్తూ 7 నెలల క్రితం కూలికి వెళ్లొస్తూ ప్రమాదానికి గురైంది. కాలు విరగడంతో ఇప్పటికీ నడవలేని పరిస్థితి. ఆమె ఇద్దరు కుమారుల్లో సురేష్ 5 వ తరగతి, భాస్కర్ 4వ తరగతి చదివేవాడు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వారు బడి మానేసి పనిలో చేరదామనుకుంటున్న తరుణంలో అమ్మఒడి పథకం అభయంగా మారింది. అమ్మఒడి పుణ్యాన వారిద్దరూ ఇప్పుడు స్కూలుకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం తమలాంటి నిరుపేద కుటుంబాల పిల్లల చదువుకు భరోసా అని వెంకటమ్మ ఆనందంతో చెబుతోంది. ఆసరా దొరికింది ముమ్మిడివరం: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన వక్కలంక బుల్లియ్య, మేరీలు దంపతులు.. మేరీ క్యాన్సర్తో మరణించగా.. బుల్లియ్య అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వారిద్దరి పిల్లలు అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. ఒకరు స్థానికంగా చదువుతుండగా.. మరొకరు రాజమహేంద్రవరంలోని ఒక స్వచ్ఛంద సంస్థ హాస్టల్లో చదువుతున్నాడు. ఇప్పడు అమ్మఒడి పథకం ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. అమ్మఒడి పథకంలో రూ.15వేలు ఆర్థికసాయం రానుండడంతో.. ఇద్దరు పిల్లలను బాగా చదివించేందుకు ఆసరా దొరికిందని అమ్మమ్మ వంగా రాజేశ్వరి ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆ ఇద్దరు పిల్లలు చదువుకు దూరమవుతారని భయపడ్డానని.. అమ్మఒడి పథకం ఆసరాగా నిలిచిందని ఆమె అంటోంది. -
ప్రజాసంకల్ప పాదయాత్రకు రెండేళ్లు
-
చరిత్రాత్మకం ప్రజా సంకల్పం
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చేసిన ప్రజా సంకల్ప యాత్రకు నేటి (బుధవారం)తో సరిగ్గా రెండేళ్లు నిండాయి. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకు రావాలన్న సంకల్పంతో వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర పొడవునా జన నేతను కలుసుకోని వర్గం లేదు. అన్ని జిల్లాల్లో జనం తండోపతండాలుగా తరలి వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. మరోవైపు పూలబాట వేసి స్వాగతం పలికారు. మద్యం మహమ్మారికి బలవుతున్న కుటుంబాల నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, అనాథలు, అర్హతలున్నా ఉద్యోగం, ఉపాధి లేని యువతీ యువకులు, విద్యార్థులు పాదయాత్రలో భాగస్వాములై బాధలు చెప్పుకున్నారు. జగన్ అనే నేను.. పాదయాత్రలో ప్రజలకు ‘జగన్ అనే నేను..’ అంటూ ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, భరోసాలే ఆయన్ను ‘జగన్ అనే నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను’ అని చెప్పే వరకు నడిపించాయి. ఈ ఏడాది మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతల పింఛన్ను రూ.2,250కి పెంచుతూ జగన్ తొలి సంతకం చేశారు. మంత్రివర్గ కూర్పులో తనదైన శైలిని ప్రదర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచలనం కలిగించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేనివిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులను ఇచ్చి చరిత్రను తిరగరాశారు. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ‘మాట తప్పను, మడమ తిప్పను’ అనే మాటలను అక్షరాలా నిజం చేస్తూ కొత్త అసెంబ్లీ ఏర్పడిన తర్వాత తొలి సమావేశాల్లోనే 19 చట్టాలు చేసి భారీ ఎత్తున సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తానని తొలి రోజే ప్రకటించిన జగన్ అందులో పేర్కొన్న ‘నవరత్నాలు’ అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పద వులు, నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అదొక మహా యజ్ఞం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఒక మహాయజ్ఞం. ఆయన సంకల్ప బలమే ఆయన్ను 3,648 కిలోమీటర్లు నడిపించింది. ప్రపంచంలోనే చిరస్థాయిగా నిలిచి పోయిన యాత్ర ఆద్యంతం జగన్లో ఏ మాత్రం అలసట అనేది కనిపించలేదు. మధ్యలో హత్యాయత్నం జరిగినా ఆయన ఏమాత్రం జంకలేదు. – తలశిల రఘురామ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ -
ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్
-
అడుగుజాడలు..
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం మా నాన్న గారు ఒకడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా ప్రజల సంక్షేమం కోసం నేను రెండడుగులు ముందుకు వేస్తాను.. నాన్న గారు చనిపోయాక ప్రతి ఇంటిలోనూ ఆయన ఫొటో పెట్టుకున్నారు. నాకూ అదే ఆశ.. నేను మరణించిన తర్వాత కూడా ప్రతి ఇంటా ఆయన ఫొటో పక్కన నా ఫొటో ఉండాలని, ప్రజల హృదయాల్లో కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రతిపక్ష నేత హోదాలో అన్న మాటలివి. సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత అక్షరాలా పై మాటలను నిజం చేస్తూ ప్రజలకు మేలు చేసే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వడి వడిగా అడుగులు వేస్తున్నారు. అసలు తెలుగు నాట పేదరిక నిర్మూలన కోసం విప్లవాత్మక రీతిలో ప్రజా సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. సామాన్యులకు మేలు చేయాలంటే ప్రధానంగా వారికి వైద్యం, విద్య అందుబాటులోకి తేవాలన్నది వైఎస్ లక్ష్యం. అదే ఆలోచనతో ఆయన నిరుపేదలకు సైతం కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందుబాటులోకి తెచ్చారు. డబ్బు లేక ఉన్నత విద్యకు దూరం కారాదన్న ఒకే ఒక్క సదాశయంతో పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేశారు. అంతలోనే ఆయన మనందరికీ దూరమయ్యారు. తదనంతర రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే.. తాను ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన మేరకు ‘నవరత్నాలు’ అమలు చేసేందుకు నడుం బిగించారు. నవరత్నాల ద్వారా ఇప్పటి వరకూ దేశంలో కనీ వినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను రూపొందించారు. ప్రజలు తనకు 151 శాసనసభ స్థానాలు, 22 లోక్సభ స్థానాల్లో చరిత్రాత్మక విజయం అందించాక తన తొలి ప్రసంగంలో.. ‘ఆరు నెలలు లేదా సంవత్సరంలోనే మీ అందరి (ప్రజలు) చేత జగన్ మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను’ అన్నారు. ఆ మాటలను నిజం చేసేలా ముందుకు దూసుకెళ్తున్నారు. ఏదైనా ఒక మాట ఇస్తే తప్పని గుణం దివంగత వైఎస్కు ఉండేది. అదే విధానాన్ని తాను కూడా పుణికిపుచ్చుకున్న జగన్ ప్రజాసంకల్ప యాత్రలో లక్షలాది మంది జనం సమక్షంలో ఇచ్చిన హామీలను అమలు పరిచేందుకు తహ తహ లాడటం చూస్తుంటే ఆ కుటుంబం జన్యువుల్లోనే మాట తప్పని గుణం ఇమిడి ఉందనేది అవగతం అవుతుంది. అదే వేగం.. అంతకు మించిన దూకుడు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు.. మే 30వ తేదీన తొలి సంతకంతో రాష్ట్రంలోని యావత్ అవ్వా తాతల పింఛన్లు పెంచారు. వారికి ఇచ్చే నెల పింఛన్ మొత్తాన్ని రూ.2000 నుంచి రూ.2250కి పెంచడమే కాకుండా ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.3000కు తీసుకెళ్లే ఫైలుపై తొలి సంతకం చేశారు. అచ్చంగా దివంగత వైఎస్ కూడా.. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అదే వేదికపై నుంచి వ్యవసాయం కుదేలై కునారిల్లుతున్న రైతులకు మేలు కలిగిస్తూ ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేయడం తెలిసిందే. అప్పటి నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా నేటికీ కొనసాగుతోంది. ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి కాగానే ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు అంశాలపై తొలి సంతకాలు చేశారు. కానీ ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. జగన్ సీఎం కావడం కాకతాళీయం కాదు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కాకతాళీయం కాదు. క్లిష్టమైన పరిస్థితుల మధ్య పదేళ్లకు పైగా పోరాడి అనేక సంక్షోభాలను ఎదుర్కొని ముఖ్యమంత్రి గద్దె నెక్కారు. తండ్రీ కొడుకులు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావడం కొత్తేమీ కాదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రథమం. ఎన్నికల్లో గెలిచాక ప్రజలకు మేలు చేయడానికి మీన మేషాలు లెక్కించడం ఎందుకు? అని జగన్ భావించారు. ఇలా అనుకున్నదే తడవుగా గద్దె నెక్కిన పక్షం రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ జరిగిన మూడో రోజునే సుమారు ఏకబిగిన 8 గంటల పాటు సాగిన తొలి మంత్రివర్గ సమావేశంలో పలు సంక్షేమ పథకాల అమలుకు నిర్ణయం తీసుకోవడం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా జరగలేదు. తొలి అడుగుల్లో తనదైన ముద్ర తొలి బడ్జెట్ సమావేశాల్లోనే 19 బిల్లులను ప్రవేశ పెట్టి ఆమోదింప జేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానిదేనని చెప్పాలి. ప్రజాహితం కోరి తానొక నిర్ణయం తీసుకుంటే దానిని ఎంత చిత్తశుద్ధితో అమలు చేస్తారనేది జగన్ ఈ సమావేశాల్లో నిరూపించారు. ముఖ్యమైన బిల్లులివి.. - శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు - నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ,ఎస్టీ మైనారిటీలకు 50% రిజర్వేషన్లు - నామినేటెడ్ పనుల్లో బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు - నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు - నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు - టీటీడీ మినహా అన్ని ఆలయాలు, ట్రస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు 50% రిజర్వేషన్లు - పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే - ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల బిల్లు - మద్య నియంత్రణ చట్టానికి సవరణ.. దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం - ముందస్తు న్యాయ పరిశీలన అనంతరమే టెండర్లు - లోకాయుక్త ఏర్పాటు 8 ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం - ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల,పశు సంపద మార్కెట్ల సవరణ బిల్లు - పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ - ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ -
వైఎస్ జగన్ పాదయాత్రపై పుస్తకావిష్కరణ
సాక్షి, అమరావతి: చారిత్రాత్మక ‘ప్రజాసంకల్పయాత్ర’ పాదయాత్రపై రూపొందించిన జయహో పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్, ది ప్రింట్ ఎడిటర్ చీఫ్ పద్మభూషణ్ శేఖర్ గుప్తా చేతుల మీదుగా సోమవారం ఆవిష్కారం చేశారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జయహో పుస్తకం సంకలనం చేయబడింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ ఎమెస్కో సంస్థ ప్రచురించింది. 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలోని వివిధ చారిత్రాత్మక ఘట్టాలను దీనిలో పొందుపరిచారు. 3,648 కి.మీ సుధీర్ఘంగా సాగిన పాదయాత్రను ఫోటోలతో సహా పుస్తకాన్ని రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు, శేఖర్గుప్తా, రామచంద్రమూర్తి, వైఎస్సార్సీపీ నేతలు, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం: సీఎం వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర అనేది ఒక స్పిరిట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 3648 కి,మీ పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని, ప్రజల సహకారంతోనే పూర్తి చేయగలిగానని అన్నారు. ఏకంగా 14 నెలల పాటు సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి వచ్చాయని సీఎం గుర్తుచేశారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. ప్రతీక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రూపకల్పన చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు.. పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలను, వారసత్వాన్ని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. వైఎస్సార్తో తనక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. దేశంలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయన్నారు. వైఎస్ జగన్ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరముందన్నారు. కార్యక్రమంలో రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. తన నాలుగున్నర దశాబ్దాల పాత్రికేయ అనుభవంలో పాదయాత్రపై పుస్తకాన్ని రూపొందిచడం గొప్ప విషయమన్నారు. -
‘అమ్మ ఒడి’పై సీఎంఓ కీలక ప్రకటన
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి వర్తింపజేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని పేర్కొంది. పాదయాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అనుసరించి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ముందుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల స్థితిగతుల్ని, రూపు రేఖల్ని మార్చాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అన్ని చర్యలు తీసుకుంటాం.. పేదల పిల్లలు ప్రతీ ఒక్కరు బడికి వెళ్లి చదువుకోవాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని సీఎంఓ పేర్కొంది. బడిబాట కార్యక్రమంలో అక్షరాభ్యాసం సందర్భంగా, విద్యా శాఖ సమీక్ష సమావేశంలో ఈ పథకం గురించిన విధివిధానాలు రూపొందించాలని ఆయన ఆదేశించారని తెలిపింది. ఇందులో భాగంగా ముందుగా ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించింది. ‘దేశం మొత్తంలో నిరక్షరాస్యుల సగటు 26 ఉంటే.. ఏపీలో 33 శాతం ఉంది. మన రాష్ట్రంలో ప్రతీ 100 మందిలో 33 మంది నిరక్షరాస్యులే. అక్షరాస్యత విషయంలో ఏపీ దేశంలో అట్టడుగున ఉంది. ఈ పరిస్థితిని మార్చి.. పేద కుటుంబాల్లోని పిల్లలు చదువుకునే విధంగా ఈ పథకాన్ని ప్రకటించారు’ అని ‘అమ్మ ఒడి’ పథకం ఆవశ్యకతను వివరించింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావు లేదని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి ఈ పథకం వర్తిస్తుందని సీఎంఓ స్పష్టం చేసింది. -
అవరోధాలను అధిగమించి... జననేతగా ఆవిర్భవించి...
భారత ఇతిహాసాల్లోనే కాదు.. యావత్ ప్రపంచ చరిత్ర మొత్తంలో కూడా అంతిమంగా ధర్మమే గెలిచినట్లు మనకు కనిపిస్తుంది. ఈ పరమసత్యం నేడు ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమైంది. ధర్మం గెలుస్తుందన్న నమ్మకం అందరిలోకంటే, ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న∙వైఎస్ జగన్మోహన్రెడ్డిలోనే ఎక్కువగా కనిపించింది. కనుకనే, తనమీద జరిగిన కుట్రలను, అనైతిక దాడులను నిబ్బరంగా తట్టుకోగలిగారు. అదేపనిగా తనపై సాగిన అసత్య ప్రచారాలను, కల్పిత కథనాలకు కృంగిపోకుండా.. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి.. ప్రజల అండదండలతో.. దేశ చరిత్రలోనే ఓ అరుదైన విజయాన్ని సొంతం చేసుకుని ఓ సరికొత్త అధ్యాయం లిఖించడానికి సమాయత్తం అవుతున్నారు. గత ఐదేళ్ల రాజకీయ ప్రయాణం కత్తుల వంతెన మీద సాగింది. ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రాంతీయ పార్టీల అధినేతలెవరూ ఎదుర్కొన్న దాఖలాలు చరిత్రలో కనపడవు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించినపుడు ఆయనకు ఎన్నో అనుకూల అంశాలు కలిసొచ్చాయి. అప్పటి కాంగ్రెస్ నాయకత్వంపై ఉవ్వెత్తునలేచిన ప్రజావ్యతిరేకతతోపాటు, ఓ ప్రముఖ దినపత్రిక అందించిన అండదండలతోఎన్టీఆర్ అద్భుత విజయం కైవసం చేసుకున్నారు. 2001లో ప్రాంతీయపార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన కె. చంద్రశేఖరరావు 14 ఏళ్లపాటు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ఆయన ఉద్యమానికి తెలంగాణ సమాజం యావత్తూ సహకరించింది. ఎన్టీఆర్, కేసీఆర్లతో పోల్చితే వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం భిన్నమైనది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందినపుడు.. ఆ విషాద వార్తను తట్టుకోలేక.. వందలాదిమంది బలన్మరణాలకు పాల్పడ్డారు. అనాధలై, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబాల వారిని పరామర్శించి వారిలో భరోసా నింపడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ధర్మంగా భావించారు. కానీ, ఆయన నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం వ్యతిరేకించింది. జగన్ ధర్మం వైపే మొగ్గు చూపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని కాదని ముందుకు వెళితే కష్టాలు తప్పవన్న శ్రేయోభిలాషుల హెచ్చరికల్ని ఆయన పట్టించుకోలేదు. కేంద్రమంత్రి పదవి ఆశచూపినా ఆయన నిర్ణయంలో మార్పు జరగలేదు. కొన్నాళ్లు వేచి ఉంటే రాష్ట్ర అధికార పగ్గాలు అప్పజెపుతామన్న అధిష్టానం ‘ఫీలర్ల’కు లొంగలేదు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న ఆ ఒక్క నిర్ణయం వల్ల రాష్ట్ర రాజకీయాల స్వరూపం పూర్తిగా మారింది. ఊహించినట్లుగానే.. కాంగ్రెస్ అధిష్టానం ప్రతీకార చర్యలకు దిగింది. వారి ఆదేశాలతో.. అనుచిత లబ్ధి జరిగిందంటూ జగన్పై కాంగ్రెస్ నేత శంకరరావు పిల్ వేశారు. ముందుగా తయారు చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం.. తెలుగుదేశం నేతలు ఆ కేసుల్లో ఇంప్లీడ్ అయ్యారు. సీబీఐ, ఈడీ తదితర కేంద్ర సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ కేసుల్లో జగన్ను అరెస్ట్ చేసి 17 నెలలపాటు బెయిల్ రాకుండా చంచల్గూడ జైలులో పెట్టారు. ఇదే అదనుగా.. చంద్రబాబు ఆయా వ్యవస్థల్లో ప్రవేశపెట్టిన వ్యక్తులు, శక్తులు చెలరేగిపోయారు. పూటకో కథనం, రోజుకో అభూత కల్పన.. పతాక శీర్షికల్లో వండివార్చిన కథనాలు అచ్చు అయ్యాయి. కొన్ని చానెళ్లు మరో పని లేనట్లు జగన్పై వ్యతిరేక వార్తలు ప్రసారం చేశాయి. వాటిని ఆధారంగా చేసుకొని చంద్రబాబుకు బంటుల్లా మారిన కొన్ని రాజకీయ పార్టీల్లోని వ్యక్తులు మీడియా సమావేశాలు పెట్టడం, విమర్శలు చేయడం నిత్యకృత్యమైంది. తమ పార్టీ ఒక్కటే విమర్శిస్తే.. దానికి తగిన బలం ఉండదు కనుక ఒకరు కొట్టిన దెబ్బమీద ఇంకొకరు మరో దెబ్బవేస్తే తిరిగి కోలుకోలేరన్న దుర్బుద్ధితో నలువైపుల నుండి దాడులు చేశారు. లక్ష కోట్లు అవినీతి జరిగిందన్న విష ప్రచారం తారస్థాయికి చేరింది. జగన్ రాజకీయంగా ఎదిగితే తనకు పుట్టగతులు ఉండవని తెలుగుదేశం అధినేత చంద్రబాబు భయపడి కుట్రలకు తెర తీశారు. అయితే, సామాజిక బాధ్యత కలిగిన కొందరు పత్రికాధిపతులు, ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులు జగన్ను దెబ్బతీయడానికి చంద్రబాబుతో చేతులు కలిపారు. ప్రజాస్వామ్య సౌధానికి నాలుగవ స్తంభంగా చెప్పుకొనే మీడియాలో మెజారిటీ వర్గం చంద్రబాబు పాలనలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపకపోగా.. అవే ఘనతగా కీర్తించాయి. గోదావరి పుష్కరాల తొలిరోజున రాజమండ్రిలో చంద్రబాబు తన కీర్తికండూతి కోసం చేసిన నిర్వాకానికి 29 మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనను కొన్ని పత్రికలు ఏవిధంగా మసిపూసి మారేడు కాయ చేశాయంటే.. సంఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నిద్రా హారాలు లేకుండా కంట్రోల్ రూమ్లో కూర్చొని పరిస్థితుల్ని చక్కదిద్ది భక్తుల ప్రశంసలు పొందారంటూ.. ఆ దుస్సంఘటనను సైతం చంద్రబాబుకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేశాయి. అంతకు ముందు.. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టే క్రమంలో 20 మంది ఎర్రచందనం కూలీల్ని ఎన్కౌంటర్ చేసిన వార్తక్కూడా కొన్ని పత్రికలు, మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. రాష్ట్రానికి చట్టబద్ధంగా లభించవలసిన ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు ఎన్ని ‘యు’ టర్న్లు తీసుకొన్నా, మాటలు మార్చినా, తనను ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేసినా.. చంద్రబాబు వైఖరిని కొన్ని పత్రికలు తప్పుపట్టలేదు. ప్రతిపక్షం గొంతును అసెంబ్లీలో నొక్కిన సందర్భంలో, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించినపుడు.. చివరకు ప్రతిపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను ఫిరా యించుకున్నప్పుడు, నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మంత్రి వర్గంలోకి తీసుకున్నప్పుడు సైతం.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం సబబుకాదని చెప్పలేదు సరికదా.. తన ప్రభుత్వం కూలిపోకుండా.. చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారంటూ వంత పాడాయి, వక్ర భాష్యాలు పలికాయి. అసెంబ్లీలో తమ గొంతు వినిపించే అవకాశం లేదని నిశ్చయమైనప్పుడు, ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల్లోకే వెళ్లాలని నిశ్చయించుకొని.. ‘మహాసంకల్పపాదయాత్ర’ చేప డితే.. ఆ వార్తను సింగిల్ కాలమ్ ఐటమ్గా కొన్ని పత్రికలు లోపలి పేజీలకు పరిమితం చేశాయి. పాదయాత్ర పొడవునా ప్రజలు వెల్లువెత్తినా, కొన్ని పత్రికలకు అవి వార్తలుగా కనిపించలేదు. చివరకు 3800 కిలోమీటర్లకు పైగా సాగిన మహాసంకల్పయాత్ర చరిత్ర సృష్టించినా అది కూడా కొన్ని పత్రికలకు ప్రత్యేకవార్తగా కనిపించలేదు. అవమానకరమైన తెలుగుదేశం పార్టీ ఓటమికి కర్త, క్రియ, కర్మ అన్నీ చంద్రబాబేనని ప్రజలకు తెలుసు. అయినా, ఆయన ఓటమికి జన్మభూమి కమిటీలను నిందిస్తున్నారు. అవినీతికి పాల్పడిన సొంత పార్టీ ఎమ్మెల్యేలను, అక్రమాలకు, భూకబ్జాలకు పాల్పడిన కొంతమంది మంత్రులను, మహిళలపై దాడులు చేసిన నాయకులను వెనకేసుకొచ్చింది ఎవరు? మెజారిటీ వర్గాల ప్రజలు వివిధ సమస్య లతో సతమతమవుతున్నారని క్షేత్రస్థాయి నివేదికలు వెల్లడిస్తున్నా.. ప్రజలలో సంతృప్తస్థాయి 90%కి చేరిందని ఆత్మవంచనకు పాల్పడింది చంద్రబాబుకాదా? చంద్రబాబుకు ఎక్కువ నష్టం చేసింది ఆయనకు గొడుగుపట్టిన కొన్ని పత్రికలు, చానళ్లు. జగన్కు తమ మీడియాలో తగిన ‘స్పేస్’ లభించకుండా చేశాయి. కానీ, ఆయన ప్రజల హృదయాలను ఆక్రమించారని అవి గ్రహించలేకపోయాయి. ఇపుడు, రాష్ట్రానికి వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆ పత్రికలకు, ఆ చానళ్లకు మింగుడు పడకపోవచ్చు. కానీ, ఇంతకుముందులా.. ఆయనకు సంబంధించిన వార్తలను సింగిల్ కాలమ్లో లోపలి పేజీల్లో వేయగలవా? అరచేతిని అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఆపడం కష్టమని మరోసారి రుజువైంది. వ్యాసకర్త : సి. రామచంద్రయ్య, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మొబైల్ : 81069 15555 -
బాబు.. ఆ అడుగుల చప్పుడు వినిపించలేదా?
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించించడం.. టీడీపీ అడ్రస్ లేకుండా గల్లంతవ్వడం తెలిసిందే. ఇప్పటికే టీడీపీ దారుణ ఓటమిపై సోషల్ మీడియాలో కుళ్లు జోకులు కూడా పేలాయి. ముఖ్యంగా చంద్రబాబును నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. తాతకు మనవడితో ఆడుకునే సమయం దొరికిందని, బాబు ప్రయాణం మాయవతి టూ గవర్నర్ వయా సోనియా, మమతలుగా సాగి ముగిసిందనే ఫన్నీమీమ్స్, కామెంట్స్ను ట్రెండ్ చేశారు. అయితే తాజాగా ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య తన ట్విటర్లో షేర్ చేసిన ఓ కార్టూన్ నెటిజన్లను, రాజకీయ వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వైఎస్ జగన్ పాదయాత్రను ప్రతిబింబించేలా ఉన్న ఆ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఏడాది పాటు మొక్కవోని దీక్షతో వైఎస్ జగన్ 3,648 కిలోమీటర్లు మేర చేసిన పాదయాత్ర ఆయనకు అఖండ విజయానందించింది. అయితే ఈ పాదయాత్రను లెక్కచేయని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరవర్గం.. జగన్ పాదయాత్రను అవహేళన చేస్తూ మాట్లాడారు. ఇదే వారిని చావుదెబ్బతినేలా చేసింది. ఈ విషయాన్నే సతీష్ ఆచార్య తన కార్టూన్లో తెలియజేశారు. ఆ కార్టూన్కు ‘చంద్రబాబు ఆ అడుగుల చప్పుడు వినిపించలేదా?’ అనే క్యాప్షన్ ఇచ్చారు. -
ఏపీలో కొనసాగిన ఆనవాయితీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆనవాయితీ కొనసాగింది. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన నాయకులు అధికారం చేపట్టడం అనే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగింది. తన తండ్రి బాటలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా అధికారం చేపట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగిన ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ 3,648 కిలోమీటర్ల దూరం నడిచి నూతన అధ్యాయాన్ని లిఖించారు. కాలినడన అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. టీడీపీ సర్కారు మోసాలను, వైఫల్యాలను సాధికారికంగా ప్రజలకు వివరించి చెప్పారు. ఎల్లో మీడియా, పచ్చ నాయకుల కుట్రలను దీటుగా ఎదుర్కొని తాజా ఎన్నికల్లో వైఎస్ జగన్ విజేతగా నిలిచారు. తండ్రి తగ్గ వారసుడు అనిపించుకున్నారు. 2003లో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2012, అక్టోబర్ 2న ‘వస్తున్నా ... మీ కోసం’ అంటూ పాదయాత్ర చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 శాసనసభ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. తాజా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో వైఎస్ జగన్ సీఎం కాబోతున్నారు. దీంతో పాదయాత్ర చేసిన ముగ్గురు నాయకులు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినట్టైంది. -
అలుపెరగని పోరాట యోధుడు
ఘన వ్యక్తిత్వం సాటిలేని దాతృత్వం తిరుగులేని నేతృత్వం నాయకత్వాన నిశ్చలతత్వం చెక్కుచెదరని దృఢ సంకల్పం ఎప్పుడూ తరగని తెగింపు ధైర్యం నిర్ణయాలలో తొణకని స్థైర్యం అన్యాయాన్ని ఎదిరించే శౌర్యం నిత్యం మెరిసే చిరు దరహాసం సత్యం పలికే వినయ విధేయం ఎవరెదురైనా బెదరని వైనం కేసుల కుట్రకు లొంగని మానం ఒకే ఒక్కడుగా కదిలే సైన్యం ప్రజా సేవలో జన్మం ధన్యం అని భావించే విశాల హృదయం పట్టిన పట్టును వదలని ధ్యేయం ప్రజల కోసమై విడువని ధ్యానం ఎవరేమన్నా మరువని లక్ష్యం కోరిక ఒకటే శాంతి; సుభిక్షం ప్రత్యేక హోదా ఒకటే గమ్యం అని చాటించి శ్రమించు నిత్యం బడుగు జనులకు ఎంతో సాయం ఎవరికీ ఇది కాదిక సాధ్యం తండ్రి బాటలో నడిచే పయనం తండ్రి పేరునే తలచే అధరం తండ్రి రూపునే చూసే నయనం తండ్రి తెగువనే నిలిపే సుగుణం పేదలను ఓదార్చే నైజం ప్రజా యాత్రలో పంచిన స్నేహం గుండె గుండెను తాకిన బంధం గడప గడపకు పూసిన గంధం లేనే లేదు కులమతాల భేదం ఉన్నది ఒకటే లౌకిక వాదం గుండెల నిండా సోదర భావం కోరును ఒకటే సరి సమన్యాయం యువతకు ఇచ్చెను నవ చైతన్యం రావాలంటూ నవ స్వాతంత్య్రం అందుకు సర్వం సంసిద్ధం దానికి సకలం సన్నద్ధం ఒంటరి గెలుపే పౌరుష చిహ్నం అని చాటెను... పులివెందుల సింహం తిరుగులేనిది ఈ పట్టుదల ప్రత్యర్థులకు గుండె దడ దిక్కున నిండిన శంఖారావం జెండా కలిపెను గగనం భువనం తిమిరంతోనే జరపగ సమరం ప్రజలు ఇచ్చును ఘనమగు విజయం పొత్తును ఎంచని ఘన విశ్వాసం ఊపిరి నిండా ధర్మావేశం ప్రజా శ్రేయస్సే తన ఉఛ్వాసం ప్రజా రక్షణే తన విశ్వాసం కపట నక్కలకు భయ భూకంపం ముగింపుకొచ్చెనులే రగడ చెల్లదు ఎవడీ ఎత్తుగడ అధర్మమెక్కును ఇక ఉరికంబం... ఆంధ్ర సీమకు పట్టిన దైన్యం వదిలించేది... ఈ ఎన్నిక యుద్ధం నవ్యాంధ్రకు రావాలి నూతన ఉదయం ఓదార్పు యాత్ర ఓ చరిత్ర.. ఓదార్పు యాత్ర రాష్ట్రంలోనే కాదు.. దేశచరిత్రలోనే..ఇంకా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టం. 12 జిల్లాల్లో 182 రోజుల్లో 15 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తూ ప్రజలతో మమేకమైన ఓ యువకుడి చరిత్ర అది. సమకాలీన రాజకీయాల్లో ఏ నాయకుడూ జనంలో అంత విస్తృతంగా ప్రయాణించిన దాఖలాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి చూసినంత దగ్గరగా పేదరికాన్ని చూసిన రాజకీయనాయకుడు లేనేలేడు. ఓదార్పు నేపథ్యమేమిటంటే..మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని ఆంధ్రావని తట్టుకోలేకపోయింది. అనేక గుండెలు ఆగిపోయాయి. వైఎస్ మరణించిన 22వ రోజున నల్లకాలువ వద్ద జరిగిన సభలో జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తూ తన తండ్రి మరణాన్నితట్టుకోలేక మరణించిన ప్రతి కుటుంబాన్నీ రానున్న రోజుల్లో ఓదార్చుతానని మాట ఇచ్చారు. ఇలా మొదలైన ఓదార్పు యాత్ర అశేష జనాదరణతో ఓ ప్రభంజనంలా మారింది. ఆయనకు అంతటి ఆదరణ లభించడం కొందరికి నచ్చలేదు. ఓదార్పు యాత్ర వద్దని కాంగ్రెస్అధిష్టానం షరతులు విధించింది.అనేక ఆటంకాలు కలిగించింది. ఎన్ని కష్టాలెదురైనాఇచ్చిన మాటకు కట్టుబడిన జగన్ ముందుకే సాగారు. కాంగ్రెస్ అధిష్టానం మాట వింటే జగన్కు కేంద్ర పదవి లభించేది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవీ దక్కేది. ఐటీ నోటీసులు, సీబీఐ కేసులు, ఈడీ జప్తులు ఉండేవి కావు. కానీ ‘‘ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యం’’ అని నమ్మిన వైఎస్సార్ తనయుడు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ముందుకే సాగారు. అలుపెరుగని ప్రయాణంలో లక్షలాది మంది పేదల కష్టాలను జగన్ ప్రత్యక్షంగా చూశారు. వారి బాధలు విని తల్లడిల్లిపోయారు. వేనవేల కిలోమీటర్ల ఓదార్పు యాత్రతో బాధిత జనం గుండె తలుపులు తట్టాక ఓదార్పు యాత్ర ఇక జగన్ది కాకుండా పోయింది. అది ప్రజల ఓదార్పు యాత్రగా మారిపోయింది. ఓదార్పు యాత్రలో తాను గమనించిన కష్టజీవుల కడగండ్లే జెండా, ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఏకబిగిన 4,367 గ్రామాలు, 102 పట్టణాలు – నగరాలలో పర్యటించారు. మొత్తం 2,217 సభల్లో 863 గంటల పాటు ప్రసంగించారు. 447 కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా కల్పించారు. అక్రమ నిర్బంధం నుంచి విడుదలైన అనంతరం వైఎస్సార్ జిల్లాలో మిగిలిన కుటుంబాలను ఓదార్చారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి పూనుకున్నకేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ జగన్ చంచల్ గూడ జైలులోనే 2013 ఆగస్టు 25 నుంచి 31 వరకు వారం రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దీక్షను భగ్నం చేసిన పోలీసులుజగన్ను నిమ్స్కు తరలించారు. అక్రమ నిర్బంధం నుంచి జగన్ బయటకు వచ్చిన తరువాత 2013 అక్టోబర్ 5 నుంచి 9 వరకు హైదరాబాద్లోని తన నివాసం వద్దనే నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత రాష్ట్ర సమైక్యతను కోరుకుంటూ 2013 అక్టోబర్ 26న సమైక్య శంఖారావం సభను భారీ ఎత్తున నిర్వహించి కేంద్రానికి నిరసన తెలిపారు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నేతల మద్దతు కూడగట్టుకునేందుకు కలిశారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా కుప్పం నుంచి సమైక్య శంఖారావం యాత్రను ప్రారంభించారు. విభజన సమయంలో లోక్సభలో ఉన్నజగన్తో సహా పార్టీ ఎంపీలు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసివిభజన బిల్లును ఆమోదించరాదని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పెద్దలకు వినతులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరాన్ని నొక్కి చెబుతూ వైఎస్ జగన్ అలుపెరుగని పోరు సాగించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టడంతో పాటు ఢిల్లీ స్థాయిలో పలువురు ప్రముఖులకు వినతి పత్రాలు ఇచ్చారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల దృష్టికి సమస్యను పలుమార్లు తీసుకెళ్లారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు.. హామీలను అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పలు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజా ఉద్యమాలకు మద్దతు వైఎస్ జగన్ ముఖ్యమైన సమస్యలపై అలుపెరుగని పోరాటం సాగిస్తూనే వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు, రైతుల సమస్యలపై కూడా ఎప్పటికప్పుడు స్పందించి ఆందోళనలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ఇందిరాపార్కువద్దనున్న ధర్నా చౌక్లో 2011 ఫిబ్రవరి 18 నుంచి వారం రోజులపాటు నిరాహార దీక్ష చేశారు.కనీస మద్దతు ధర అందక విలవిల్లాడుతున్న అన్నదాతలకు అండగా గుంటూరులో 2011 మే 15న రైతుదీక్ష చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఒంగోలు కలెక్టరేట్ వద్ద 2012 జనవరి 4న ధర్నా చేపట్టారు. వస్త్ర వ్యాపారులకు మద్దతుగా 2012 జనవరి 27న నరసరావుపేటలోభారీ ధర్నా నిర్వహించారు. విజయవాడలో కల్తీ మద్యం బాధితులను 2015 డిసెంబర్ 8న పరామర్శించారు. సమస్యల సాధన కోసం దీక్షలు చేస్తున్న వీఆర్ఏలకూ సంఘీభావం తెలిపారు. 2017 నవంబర్ 20న హోదా సాధనకు విపక్షాలు చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ 2018 ఫిబ్రవరి 8న నెల్లూరు జిల్లా జవ్వలగుంటపల్లిలో విద్యార్థులతో కలసి నినాదాలు చేశారు. అసెంబ్లీలో అలుపెరుగని పోరాటం ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా అలుపెరుగని పోరాటం చేశారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలతో పాటు, మహిళలను వేధింపులకు గురి చేసిన కాల్మనీ సెక్స్ రాకెట్, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు, ప్రత్యేక హోదా... డ్వాక్రా మహిళల రుణమాఫీ అమలు కాకపోవడం, కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, రాజధాని ఏర్పాటులో జరిగిన అక్రమ వ్యవహారాలు,విద్యార్థులకు ఫీజు చెల్లింపు పథకాన్ని నిర్వీర్యం చేయడం, రిషితేశ్వరి మరణం, ఎమ్మార్వో వనజాక్షిపై దౌర్జన్యం, ఓటుకు కోట్లు వ్యవహారం..ఇలా ఎన్నో సమస్యలపై ఎలుగెత్తి చాటారు. అసెంబ్లీ స్పీకర్ ఏకపక్షంగావ్యవహరించినా... తనకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా కట్ చేసినా ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో ఆయన వెనక్కి తగ్గలేదు. ఒక ప్రతిపక్ష నేతను అసందర్భ వ్యాఖ్యలతో, అవమానకరమైన రీతిలో అధికారపక్షం సభ్యులు దూషిస్తున్నా పంటి బిగువునా ప్రజల కోసం బాధను భరించారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ఫిరాయింపులను అధికారపక్షం ప్రోత్సహించినప్పుడు ఒక సందర్భంలో స్పీకర్పైనా, మరో సందర్భంలోప్రభుత్వంపైనా అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించారు. రైతు భరోసా యాత్ర వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబునాయుడు ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాన్ని అమలు చేయక పోవడంతో చాలా మంది రైతుల రుణ భారం పెరిగి, పంటలు నష్టపోయిన పరిస్థితుల్లో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. నిత్య కరవు జిల్లా అయిన అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో చాలా మంది రైతులు ఇబ్బందులకు తాళలేక అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటనలను టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో వైఎస్ జగన్ ఆ జిల్లాల్లోని రైతుల్లో మనోనిబ్బరాన్ని పాదుగొల్పుతూ మరణించిన వందకు పైగా రైతుల కుటుంబాలను ఓదారుస్తూ రైతు భరోసా యాత్ర చేపట్టారు. 2015 ఫిబ్రవరి 26న ప్రారంభమైన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఐదు విడతలుగా జరిగింది. అంతకు ముందు రైతుల ఆత్మహత్యల విషయాన్ని జగన్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించి నిలదీశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తీరా తాను ఆ జిల్లాల్లో రైతు భరోసా యాత్రను నిర్వహిస్తున్నట్లు జగన్ ప్రకటించగానే టీడీపీ ప్రభుత్వం.. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటామని హడావుడిగా జీవో జారీ చేసింది. ఈ యాత్ర.. రైతులకు పెట్టుబడి నిధి కింద ఏటా రూ.12,500 ప్రకటించడానికి కారణమైంది. సమస్యలు, హామీల వైఫల్యంపై.. చిత్తూరు జిల్లాలో 2011 జూన్ 13న సాగుపోరు చేపట్టారు. 2011 అక్టోబర్ 1న రైతుల సమస్యలపై విజయవాడలో మహాధర్నా, ఇదే సంవత్సరం అక్టోబర్ 11న విద్యుత్ కోతలను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. 2015 ఆగస్టు 25న కృష్ణాజిల్లా కొత్తమాజేరు గ్రామంలో విషజ్వరాలు ప్రబలి చనిపోయిన 18 మంది కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం 2015, సెప్టెంబర్ 30న టంగుటూరు పొగాకు వేలం కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు. వైఎస్సార్ జిల్లా నూతన కలెక్టరేట్ వద్ద 2016, సెప్టెంబర్ 3న రైతు మహాధర్నా నిర్వహించారు. 2016, అక్టోబర్ 4న కరువు, రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా అనంతపురం కలెక్టరేట్ వద్ద రైతు మహా ధర్నా చేపట్టారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ 2016, డిసెంబర్ 9న ఒంగోలులో మహాధర్నా నిర్వహించారు. కరువును ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసనగా 2016, మే 2న మాచర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా చేపట్టారు. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వంచనకు పాల్పడుతున్న చంద్రబాబు వైఖరిపై నిరసనగా 2014, జూలై 24నుంచి మూడు రోజులపాటు ‘నారాసుర వధ’ పేరుతో నిరసన తెలిపారు. ఎన్నికల హామీలు నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంపై నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద «2014, డిసెంబర్ 5న ధర్నా చేపట్టారు. విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఇదే అంశంపై తణుకులో 2015, జనవరి 31, ఫిబ్రవరి 1న రెండు రోజులు రైతు దీక్ష చేపట్టారు. ఇదే విషయమై ప్రజలను జాగృతం చేస్తూ 2016 జూలై 8న ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని ఇడుపులపాయలో ప్రారంభించారు. వంచనపై ప్రజాగర్జన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద 2018, మే 16న ధర్నాలు నిర్వహించారు. ఇదే ఏడాది జూన్ 2న నెల్లూరులో, జూలై 2న అనంతపురంలో, ఆగస్టు 9న గుంటూరులో వంచనపై గర్జన కార్యక్రమాలు నిర్వహించారు.పెట్రోలు ధరల పెరుగుదలకు నిరసనగా 2011, జనవరి 22న విశాఖపట్టణంలో జనదీక్ష నిర్వహించారు. హోదా కోసం అలుపెరుగని పోరాటం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్ తొలి నుంచీ పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలో 2015 జూన్ 3న రెండు రోజుల పాటు సమర దీక్ష చేశారు. కేంద్రంలో మంత్రులను, రాష్ట్రపతిని పలు సందర్భాల్లో కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. 2015 ఆగస్టు 10వ తేదీన హోదా కోసం జంతర్మంతర్ వద్ద ఒక రోజు పార్టీ నేతలతో కలిసి దీక్ష నిర్వహించారు. 2015 అక్టోబర్ 7 నుంచి ఏడు రోజుల పాటు గుంటూరులో నిరాహార దీక్ష చేశారు. 2015 అక్టోబర్ 17 నుంచి మూడు రోజుల పాటు పార్టీ శ్రేణులు రిలే దీక్షలు చేపట్టాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద హోదా కోసం ధర్నాలు జరిగాయి. 2016 మే 10న కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనకు నిరసనగా 2016 ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపు నిచ్చారు. ఆయన జన మోహనుడు ఆ తర్వాత అన్ని జిల్లాల్లో యువభేరీలు నిర్వహించి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై యువతను జాగృతం చేశారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా 2017 జనవరి 26న విశాఖపట్టణంలో నిర్వహిస్తున్న కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి అక్కడకు వెళ్లగా, ఎయిర్పోర్టులోనే అటకాయించి అరెస్టు చేసి వెనక్కి పంపారు. ప్రత్యేక హోదా కోరుతూ మరెన్నో పోరాటాలు చేసిన అనంతరం 2018 మార్చి 3న ఢిల్లీలోని సంసద్ మార్గ్లో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఆ తర్వాత పార్లమెంటులో హోదా కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఎంపీలు తొలుత 13 సార్లు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. తీర్మానం అనుమతించకుండా అడ్డుపడటంతో 2018 ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేసి ఏపీ భవన్లో ఆమరణ నిరాహారదీక్ష చేశారు. ఎంపీలకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. 2016 ఏప్రిల్ 16న ఎంపీల అరెస్టులకు నిరసనగా జగన్ ఒక రోజు బంద్కు పిలుపు నిచ్చారు. ఆ తర్వాత అనేక జిల్లాల్లో ప్రత్యేక హోదాపై చంద్రబాబు, మోదీలు వంచించినందుకు నిరసనగా ‘వంచనపై గర్జన’ సభలు జరిగాయి. హోదా పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేల కొనుగోళ్లపై జాతీయ స్థాయిలో పోరు వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తుపై గెలుపొందిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేసినందుకు నిరసనగా ‘సేవ్ డెమాక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) పేరుతో వైఎస్ జగన్ ఉద్యమాన్ని చేపట్టి జాతీయ స్థాయిలో ఈ దురాగతాన్ని ఎలుగెత్తి చాటారు. 2016 ఏప్రిల్ 22న పార్టీ ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశారు. అదే నెలలో ఢిల్లీకి పార్టీ నేతలతో కలిసి వెళ్లి జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఫిరాయింపుల పర్వం ఆగక పోవడంతో 2017 అక్టోబర్ 27న రాష్ట్రపతిని కలిసి చంద్రబాబు అనైతిక వైఖరిపై ఫిర్యాదు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 2017 నవంబర్ 9న శాసనసభను బహిష్కరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, నలుగురు ఫిరాయింపు మంత్రులపై చర్యలు తీసుకుంటేనే సభకు హాజరవుతామని స్పీకర్కు నివేదించారు. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించక పోవడంతో శాసనసభ సమావేశాలను బహిష్కరించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే సహించలేక ఇక ప్రజల వద్దకే వెళ్లి తేల్చుకుందామని జగన్ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టి 341 రోజుల పాటు ప్రజల్లోనే గడిపారు. చేనేతలకు భరోసా చేనేత రంగంపై సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా అనంతపురం జిల్లా ధర్మవరంలో 2012 ఫిబ్రవరి 12న మూడురోజుల పాటు నిరాహర దీక్ష చేశారు. ఆ తర్వాత చేనేత కార్మికులు దీక్షలు చేపడితే వారికి సంఘీభావం తెలపడానికి 2017 అక్టోబర్ 17న ధర్మవరం వెళ్లారు. అక్కడి చేనేత అక్కచెల్లెమ్మల కష్టాలు చూశాక.. వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేలు ఇవ్వాలన్న ఆలోచన రూపుదిద్దుకుంది. అంతకు ముందు 2010 డిసెంబర్ 21న విజయవాడ కృష్ణా తీరంలో రైతులు, కౌలు రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ 48 గంటల లక్ష్య దీక్ష చేపట్టారు. కృష్ణాజలాల పంపకంలో న్యాయం జరగాలని 2011 జనవరి 11న ఢిల్లీలో, కృష్టా,గోదావరి నదులపై తెలంగాణ ఏకపక్షంగా నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ 2016 మే 16 నుంచి మూడు రోజులపాటు కర్నూలులో జలదీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుపై రైతన్నల ఆకాంక్షను ప్రభుత్వానికి చాటి చెప్పేందుకు 2011, ఫిబ్రవరి 7న హరితయాత్ర (రావులపాలెం నుంచి యాత్ర ప్రారంభం– పోలవరం సభతో ముగింపు) 70 కిలోమీటర్ల మేర పాదయాత్ర పులివెందుల బ్రాంచి కెనాల్కు నీరు విడుదల చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై 2016, డిసెంబర్ 26న పులివెందుల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు మహాధర్నా. 2017, ఫిబ్రవరి 6న హంద్రీ–నీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్తో అనంతపురం జిల్లా ఉరవకొండలో మహాధర్నా. 2015 ఏప్రిల్ 15న పట్టిసీమ వద్దు – పోలవరం ముద్దు అంటూ బస్సు యాత్ర. రాజధాని పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమ భూసేకరణను వ్యతిరేకిస్తూ 2015, ఆగస్టు 26న రైతులకు మద్దతుగా సీఆర్డీఎ కార్యాలయం వద్ద ధర్నా మరో చరిత్ర సృష్టించిన ప్రజా సంకల్పయాత్ర ఇంతింతై వటుడింతై అన్న చందంగా ప్రజా సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించింది. చరిత్రలో ఇదివరకెన్నడూ కనీ, వినీ ఎరుగని రీతిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టాలను కళ్లారా చూశారు. మీకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రారంభమైన పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. దారి వెంట ఆద్యంతం చిన్నారులు మొదలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, అవ్వాతాతల వరకు భారీగా తరలి వచ్చి ఘన స్వాగతం పలుకుతూనే వారి కష్టాలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సాక్ష్యాలతో వివరించారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల ఆగడాలను కన్నీళ్ల పర్యంతమవుతూ ఏకరువు పెట్టారు. కుల వృత్తుల వారు వారి ఇక్కట్లను కళ్లకు కట్టారు. యాత్ర సాగుతున్న కొద్దీ విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, కర్షక, వివిధ ప్రజా సంఘాల నాయకులు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ఒక జిల్లాలో యాత్ర ముగించుకుని మరో జిల్లాలోకి అడుగుపెడుతున్నప్పుడు ఆ ప్రాంతం అభిమానులు, కార్యకర్తలతో జనసంద్రాన్ని తలపించింది. కృష్ణాలో ప్రవేశిస్తున్నప్పుడు జన తాకిడికి కనకదుర్గ వారధి ప్రకంపించడం, రాజమండ్రి వద్ద రైల్ కమ్ రోడ్డు వంతెనపై కనుచూపు మేర జన ప్రవాహం అఖిలాంధ్ర జనాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. సభలకైతే జనం స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలి వచ్చారు. ఆయా ప్రాంతాల్లో వివిధ సామాజిక వర్గాల వారు, కుల వృత్తుల వారు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి వైఎస్ జగన్కు వారి కష్టాలు చెప్పుకున్నారు. అందరి కష్టాలను ఓపికగా వింటూ.. అప్పటికప్పుడు, అక్కడికక్కడే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతూ, మిగతా సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతున్న తరుణంలో పాలక పార్టీ నేతలకు కన్ను కుట్టింది. ఏకంగా ప్రతిపక్షనేతను కడతేర్చాలని కుట్ర పన్నడం, ఇందుకు విశాఖ ఎయిర్పోర్ట్ను వేదికగా ఎంచుకోవడం, త్రుటిలో వైఎస్ జగన్ హత్యాయత్నం నుంచి తప్పించుకోవడం తెలిసిందే. కుట్రలు, కుతంత్రాలు, రోళ్లు పగిలే ఎండలు, ఎముకలు కొరికే చలి, భారీ వర్షాలు, అనారోగ్యం.. ఇవేవీ జగన్ను ఆపలేకపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 341 రోజులు పాటు 231 మండలాల్లో 2,516 గ్రామాల మీదుగా 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రభుత్వ దమన నీతిని, దుర్మార్గాలను కడిగిపడేశారు. 54 మున్సిపాలిటీలు, 8 నగరాలు మీదుగా సాగిన యాత్రలోం 124 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలను కష్టాల కడలి నుంచి బయట పడేసేందుకు నవరత్నాలకు మెరుగులు దిద్దడంతో పాటు విమర్శకుల మన్ననలు సైతం పొందేలా కొత్త హామీలు ఇస్తూ ఈ ఏడాది జనవరి 9న ఇచ్ఛాపురం వద్ద పాదయాత్రను ముగించారు. యాత్రను ఆద్యంతం గమనించిన అన్ని వర్గాల ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు. నాయకుడంటే ఇలా ఉండాలని కితాబులందుకున్నారు.వైఎస్ జగన్కు ఒక్క అవకాశం ఇద్దామని అన్ని వర్గాల ప్రజలూ నిర్ణయించారు. -
జగన్ అనే నేను; అప్నా టైమ్ ఆయేగా...
-
జగన్ అనే నేను; అప్నా టైమ్ ఆయేగా...
అధికారం కోసం పరితపించే వాడు రాజకీయ నాయకుడు మాత్రమే అనిపించుకుంటాడు.. అదే ఆశయసాధన కోసం కష్టాల్ని సైతం లెక్కచేయని మనస్తతత్వం ఉన్నవాడు ప్రజానాయకుడిగా ఎదుగుతాడు.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువు ఉంటాడు. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అందుకే ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగించేందుకు అనేక కష్టనష్టాలకోర్చి 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రజా సమస్యల గురించి స్వయంగా తెలుసుకున్నారు. ఆ క్రమంలో హత్యాయత్నం వంటి ఘటనలు చోటుచేసుకున్నా మడమ తిప్పక ప్రజాక్షేత్రంలోనే గడిపారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రత్యర్థులు తన చిన్నాన్నను హత్య చేసి కుట్ర రాజకీయాలకు తెరతీసినా బాధను దిగమింగి.. సంయమనం పాటిస్తూ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘జగన్ అనే నేను’ అంటూ ఆయన పలికే మాటల కోసం వైఎస్ జగన్ అభిమానులే కాదు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో రాజన్న పాదయాత్ర ఘట్టాన్ని ‘ యాత్ర’గా తెరకెక్కించిన సినిమా దర్శకుడు మహి వి రాఘవ్ ప్రస్తుతం ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. వైఎస్ జగన్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యాలకు.. ‘జైబోలో ఆజాదీ’ అంటూ ఫుల్జోష్గా సాగే బీజీని జతచేశారు. ‘అప్నా టైమ్ ఆయేగా’ అనే క్యాప్షన్తో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
పాదయాత్ర సంకల్పం
-
ఆ సంఘటన నన్ను కలచి వేసింది : వైఎస్ జగన్
-
ఆ సంఘటన నన్ను కలచి వేసింది : వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు : నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ సమర శంఖారావం సభలో.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా... ప్రత్యేక హోదా ఇచ్చిన పార్టీకే వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. నాలుగున్నరేళ్లుగా బీజేపీతో అంటకాగిన బాబు ఏనాడు హోదా ఊసెత్తలేదని.. ఇప్పుడు మాత్రం నల్లచొక్కాలు వేసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా ఆంధ్రా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. 25 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా హోదా కోసం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని పేరొన్నారు. హోదా అంశంలో మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను, పూటకో మాట మార్చే చంద్రబాబును నమ్మవద్దని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఓట్లు తొలగిస్తూ నాటకాలు ఆడుతున్న టీడీపీ మోసాలు అరికట్టేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీవిజిల్ యాప్ను ఉపయోగించుకోవాలని సూచించారు. మంగళవారం నాటి సమర శంఖారావం సభకు నెల్లూరు జిల్లాలోని 10 నియోజక వర్గాల ప్రజలు, బూత్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక ప్రసంగం అనంతరం వైఎస్ జగన్ ఏవైనా సందేహాలు ఉంటే తనను అడగాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ క్రమంలో జూలూరుపేట నియోజకవర్గానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ప్రశ్నకు బదులుగా...దుగ్గరాజపట్నం పోర్టు కచ్చితంగా నిర్మిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అదే విధంగా గ్రామ సెక్రటేరియట్ ద్వారానే సుమారు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అవినీతికి తావు లేకుండా ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఆ సంఘటన నన్ను కలచివేసింది.. నెల్లూరులో సాగిన పాదయాత్రలో భాగంగా మరచిపోలేని సంఘటన ఏదైనా ఉందా అని ఉదయగిరికి చెందిన సుబ్బారెడ్డి ప్రశ్నించగా... ‘పాదయాత్ర చేస్తున్నపుడు ఒక సంఘటన నన్ను కలచివేసింది. ఒక పెద్దాయన, పెద్దమ్మ ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చారు. ఆ అన్న పేరు గోపాల్ అనుకుంటా. వారి గుడిసెలో ఒక ఫొటోకు దండవేసి ఉంది. ఈ విషయం గురించి గోపాలన్న చెబుతూ... ‘అన్నా ఫ్లెక్సీలో దండవేసి ఉన్న వ్యక్తి నా కొడుకు. మంచి మార్కులు వచ్చేవి. అందుకే ఇంజనీరింగ్లో చేర్పించాలని ఆశపడ్డా. మమ్మల్ని పైకి తీసుకువస్తాడనుకున్నా. అయితే ఆ చదువుకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చయ్యేవి. ఫీజు రీయింబర్స్మెంటు ద్వారా 30 నుంచి 35 వేలు మాత్రమే వచ్చేవి. రెండో ఏడాది అవి కూడా రాలేదు. దీంతో తన చదువు కోసం నేను అప్పులు చేయడం తట్టుకోలేక... నా కొడుకు కాలేజీకి వెళ్లి అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. అది నేను మరచిపోలేని సంఘటన. ఆరోజు నా కళ్లలో నీళ్లు వచ్చాయి’ అని వైఎస్ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. వారందరికీ హామీ ఇస్తున్నా.. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావించిన వైఎస్ జగన్... ‘గోపాల్ అన్నకు హామీ ఇచ్చినట్లుగా పేదరికం పోవాలంటే మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. అందుకోసం ఫీజు రీయింబర్స్మెంటుకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా నేను చదివిస్తా. హాస్టల్లో ఉండే ప్రతీ పిల్లాడికి మెస్ చార్జీలకు సంవత్సరానికి 20 వేల రూపాయలు ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. చిన్న పిల్లలను స్కూలుకు పంపిన తల్లులకు ఏడాదికి 15 వేల రూపాయల సాయం చేస్తాం. అప్పులు చేయకుండానే తమ పిల్లలు చదువుకునే పరిస్థితి తీసుకువస్తా అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
మిస్సోరిలో జగన్ కోసం మనం
మిస్సోరి : ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 341 రోజుల పాటు ప్రజాసంకల్పయాత్ర చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం మిస్సోరి ఆధ్వర్యంలో జనం కోసం జగన్.. జగన్ కోసం మనం కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ 3648కిలోమీటర్ల దూరం నడిచి ఓ చరిత్రను సృష్టించారని ఎన్ఆర్ఐలు అన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ టూయిస్లోని వైఎస్ జగన్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కోన రఘుపతి, బాలరాజు పోలవరం, కాటం రెడ్డి శ్రీధర్, అన్నబత్తిన శివకుమార్, తోపుర్తి ప్రకాశ్ రెడ్డి, ఆదిములపు సురేష్, దువ్వాడ శ్రీనివాస్ తమ సందేశాన్ని వీడియో తీసి పంపించారు. కావాలి జగన్ రావాలి జగన్ నినాదాలతో సభాప్రాంగణం మారుమోగిపోయింది. యాత్ర చిత్ర పాటలకి చిన్నారులు డ్యాన్స్ వేశారు. సెయింట్ లూయిస్, మిస్సోరి వైఎస్సార్సీపీ అధ్యక్షులు నవీన్ గుడవల్లి, వెఎస్సార్సీపీ యూఎస్ఏ సెంట్రల్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి పమ్మి, వెఎస్సార్సీపీ యూఎస్ఏ సెంట్రల్ కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి తాటిపత్రి, రంగా చక్క ట్రెజరర్, విజయ్ బైక, హరి తోటపల్లి, రామక్రిష్ణా బోరెడ్డి, రాజేంద్ర ఎమ్, యుగేందర్ తలాటి, సుధాకర్ రెడ్డి, రమేష్ కొరప్రోలు, సుబ్బారెడ్డి తాటిపత్రిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. -
‘ప్రజా సంకల్పయాత్రతోనే ఆ విషయం తెలిసింది’
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయని టీడీపీ ఎన్నికలకు మరో 3 నెలలే ఉండడంతో అన్ని పథకాలను అమలు చేసేందుకు యత్నిస్తోందన్నారు. ఎన్నికలు దగ్గరపడగానే వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు అమలు చేస్తారని, ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా ప్రజందరూ గ్రహించారని అన్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరులో ‘నిను నమ్మం బాబు’ కార్యక్రమాన్ని ప్రభాకర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఫెడరల్ ఫ్రంట్ కోసమే కేటీఆర్తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. కానీ, దానిని కేసీఆర్తో పొత్తులు అని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి వైఎస్ జగన్పై లేనిపోని నిందలు వేస్తున్నారు’ అని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. -
ప్రజాసంకల్పయాత్ర.. చరిత్రలో చెరగని ఓ మైలురాయి
దుబాయ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో చెరగని ఓ మైలురాయిగా నిలిచిపోతుందని సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రులు అభిప్రాయపడ్డారు. ఉమ్నాయాత్రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషాను ఆ పార్టీ నేత షేక్ సలీమ్ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా సౌదీలోని పవాసాంధ్రుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి ప్రత్రం అందించారు. అనంతరం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపి, అంజాద్ బాషా చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే అంజద్ బాషా మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుబడ్డ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మరో రూపమే జగన్ అని ప్రశంసించారు. ప్రజలతో మమేకమవుతూ సాగిన సుదీర్గ ప్రజాసంకల్పయాత్ర అద్భుతమని కొనియాడారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలకు మరలా సంక్షేమ పాలన జగన్ ద్వారానే సాధ్యమన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ జగన్ నవరత్నాలను ప్రవేశపెట్టారన్నారు. వైఎస్ జగన్కు మద్దతుగా రాబోవు ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రవాసాంధ్రుల సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తానని, తప్పకుండా మన ప్రాంత ప్రజలను ఆదుకంటామని వారికి ఎమ్మెల్యే భరోసానిచ్చారు. ముస్లిం మైనార్టీల పట్ల తమ పార్టీ చిత్త శుద్దితో పనిచేస్తుందన్నారు. ప్రతీ విషయం చర్చించి ఇక్కడ నివసిస్తున్న తెలుగువారికి మంచి జరిగేలా చేస్తామని అంజద్ బాషా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కడప పార్టీ నాయకులు అహ్మద్ బాషా, ప్రవాసాంధ్రులు షేక్ సలీమ్, ఎండీ సిరాజ్, షేక్ ఫరీద్, అమేర్, సిరాజుద్దీన్, సయ్యిద్, పర్వేజ్, ఎండీ ఇర్షాద్, సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
రచ్చబండమీద కాసేపు...
ఎన్నికలు దగ్గర పడుతు న్నాయ్. వ్యూహ ప్రతివ్యూహా లతో అన్ని పార్టీలు సిద్ధం అవు తున్నాయ్. మరీ ముఖ్యంగా రాష్ట్రాన్ని వీసంకూడా ముందుకు తీసుకువెళ్లని చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తుతూ ఉంటాయ్. వారిలో వారే తమకి అనుకూలంగా పిచ్చి లెక్కలు వేసుకుని ధైర్యం తెచ్చు కుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏ టెక్నాలజీ వారికి వెన్నుదన్నుగా నిలవదు. పవర్లో ఉన్న వర్గానికి అన్నీ మైనస్ పాయింట్లే ఉంటాయ్. జరిగిన టరమ్లో చెప్పి నవేవీ చెయ్యలేదు. కాబట్టి అదొక మైనస్. తన వర్గాన్ని మినహా మిగతా వర్గాల్ని పూర్తిగా మర్చిపోవడం మరో పెద్ద మైనస్. అవినీతి, బంధుప్రీతి సాగేటప్పుడు ఏలిన వారికి తెలియదు. పిల్లి కుండ లోపలికి మెడపెట్టి తాగినట్టే ఒక దశలో నడుంమీద ఒకే ఒక దెబ్బ పడ్డప్పుడు పిల్లికి తెలుస్తుంది. మన పవర్ పాలిటిక్స్ కూడా అంతే. ‘జనం లోంచి ఒక జెండా గుర్తు మీద గెలిచివచ్చిన ఎమ్మెల్యేలని గుంపుగా కొనేసి పార్టీలో వేసుకోవడం చాలా దారుణం. పైగా ఆ బలంతో పని కూడా ఆ పార్టీకి లేదు. ఈ అప్రజాస్వామిక చర్యని, నైతిక విలువల్ని గౌరవించే వారంతా గమనించారు. ముక్కున వేలేసుకున్నారు. అమ్ముడుబోయిన కొందరికి మంత్రి పదవులు కూడా దక్కినప్పుడు, కొందరు సన్మార్గులు ఈ లోకంలో దేవుడు లేడేమోననే సందేహంలో పడ్డారు. ఆ చర్యకి పాల్పడ్డవారే ఇప్పుడు సాక్షాత్తూ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడి, మైకులు పగుల గొడుతుంటే ప్రజలు అవాక్క యిపోతున్నారు. ‘జగన్మోహన్రెడ్డికి పదవీకాంక్ష ఉందని పదే పదే అంటున్న టీడీపీ తమ్ముళ్లు మనకున్నదేవిటో చెబితే తెలుసుకు ఆనందిస్తామని సామాన్య ఓటర్లు అడుగుతున్నారు. దయచేసి చెప్పరా? మనలో తెలుగుతల్లి ముద్దుబిడ్డలు, దేశభక్తులు ఎవరో చేతులెత్తండి. తెలు సుకుని వారికి పాదాభివందనం చేస్తాం’ అంటున్నారు పాతకాలపు పెద్దమనుషులు. ప్రజాధనంతో ప్రజలకు మంజూరు చేసే ధన స్థల వస్తు వాహనాలను ‘చంద్రన్న కానుకలుగా’ ఇవ్వడం సబబేనా? కనీసం ముఖ్యమంత్రి కానుకగా, ప్రభుత్వ కానుకగా చెప్పవచ్చు. ‘జనం సొమ్ము తిన్నంత తిని జనా నికి పంచడం కూడా గొప్పేనా?’’ అని ఓ స్వాతంత్య్ర సమ రయోధుడు నోరు చేసుకున్నాడు. ఇది చాలా దారుణం అంటూ పళ్లుకొరికాడు. రచ్చబండమీద కూచుని వింటున్న ఓ కొత్త ఓటరు, ‘‘అసలామాటకొస్తే చంద్రబాబు ప్రక టించే పథకాలకి, పింఛన్లకి డబ్బు సిద్ధం చేస్తోంది మన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. రాష్ట్రం కటకట లాడుతున్నా యనమల ఎట్లానో డబ్బు పుట్టిస్తున్నాడు. మాకాపు బిడ్డ! నిజానికి కిరీటం ఆయనకి పెట్టాల. ‘యన మల బాబాయ్సారె’ పేరుతో కొన్నైనా ముట్టజెప్పాలి. లేదంటే ఉద్యమిస్తా’’ అన్నాడు ఆవేశంగా. ‘ఊరుకోరా అబ్బాయ్. అసలే చంద్రబాబు ఎక్కడ ఏ చిన్న అలికిడైనా కంగారు పడుతున్నాడు. ఇప్పుడీమాట తెలిసిందంటే ఇంత చలిలోనూ చెమట్లు పడతాయ్’. ఆ గొంతుతో రచ్చ బండ వంత పలికింది. ‘.... లేకపోతే జగన్ హత్యా ప్రయత్నం కేసు విచారణ ఏ సంస్థకి అప్పగిస్తే చంద్ర బాబుకెందుకు? అసలు ఆయనకేమాత్రం సంబంధంలేని సంగతి కదా? ‘జగన్ పాదయాత్ర సంవత్సరంపైగా సాగి, మనిషి మనిషిని ఆత్మీయంగా పలకరించింది. ప్రజా సంకల్పయాత్రని పవర్ నేతలు దిగజార్చే ప్రయత్నం చేశారు. కానీ అది మరింతగా ప్రతిష్ట పెంచుకుంది. అక్కణ్ణించి బాబు ఆకు కదిలినా ఉలికి ఉలికి పడుతున్నారు’ అని ఓ స్టూడెంట్ కుర్రాడు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పాడు.‘జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ రాష్ట్ర పగ్గాలు పట్టుకో లేదు. పెద్దలనించి సంక్రమించిన వ్యాపారాలని, వ్యాపకా లని నిర్వహించుకుంటున్నారు. ఆయనమీద వీళ్లంతా వేయినోళ్లతో అవినీతి ఆరోపణలు చేయడంలో లాజిక్ ఎక్కడుంది?’ అని వేష్ట పడ్డాడు ఒకాయన. మరొకాయన ఏదో గుర్తొచ్చినవాడిలా నవ్వి, అసలు చంద్రబాబు ఓ నలుగురు పెద్ద మంత్రుల్ని పాదయాత్రకి పంపాల్సింది. వదిలిపోయేది’ అనేసరికి నవ్వులు శ్రుతి కలిపారు. ‘అమ్మో.. ఆయనకి చచ్చే భయం. వాళ్లు నలుగురూ రోడ్డున పడి స్పీచ్లిచ్చుకుంటూ జనం మధ్య తిరిగితే ఇంకే మన్నా ఉందీ.. కొంప కొల్లేరైపోదూ... మీరీ నాలుగేళ్లలో బాబు కాకుండా చినబాబు కాకుండా ఏ మంత్రి అయినా గొంతెత్తి ఒక్కమాట మాట్లాడటం ఎవరైనా విన్నారా?’ ‘కొందరున్నారులే... వాళ్లచేత పనికిమాలిన ప్రకటనలి ప్పిస్తూ, తిట్లు తిట్టిస్తూ ఉంటాడు. పాపం, వాళ్లు దానికే పరిమితం’ అని ముక్తాయించిందో గొంతు. ఓ పెద్దాయన లాల్చీ చేతులు విదిల్చి, మీరెరుగరు గానీ మునుపు దేశంలో ఏ సమస్య వచ్చినా– ‘దీనిలో విదేశీ హస్తం ఉంది’ అని ఆరోపించేవారు. చివరికదొక హాస్యోక్తిగా మారింది. ప్రస్తుతం చంద్రబాబు సంక్రాంతి కోడి పందేల బెట్టింగు లలో ఒక వర్గం యాభై కోట్లు పోగొట్టుకుందంటే ఇదంతా మోదీ కుట్ర అని తేల్చిచెబుతున్నారు. జనం నవ్వు తున్నారు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
వైఎస్ జగన్ సీఎం కావాలి
భూపాలపల్లి అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామికి మొక్కుకున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ తెలిపారు. 14 నెలల క్రితం జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుకోగా ఎలాంటి అవాంతరాలు లేకుండా యాత్ర పూర్తయినందుకు సోమవారం మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. కిషన్ వెంట జిల్లా నాయకులు వెంకటరెడ్డి, నరేష్, కుమార్, సంపత్ ఉన్నారు. -
జన ప్రభంజనం
వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేతవైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు వచ్చినజనంతో పులివెందుల కిక్కిరిసింది. మూడు రోజులుగాప్రతిపక్షనేత స్వస్థలంలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ప్రజలు భారీగా తరలివచ్చారు. దారులన్నీ అటువైపే మళ్లాయి.దీంతో స్థానిక కార్యాలయం లోపల, బయట ఎక్కడ చూసినా జనమే జనం.. వైఎస్ జగన్ సీఎం అంటూ చేస్తున్ననినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. సాక్షి కడప/పులివెందుల : పులివెందులలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం జనసంద్రంగా మారింది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో కలిసి సామాన్యుల కష్టాలను, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి చొరవ చూపారు. జగన్ను కలిసిన ఆరోగ్య మిత్ర,ఏపీ వీవీపీ సిబ్బంది, జియాలజిస్ట్లుఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలు కలిశారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ను మిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ నాయుడుతోపాటు ఇతర సిబ్బంది కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. పదేళ్లకుపైగా ఈ పథకం విజయవంతానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వారు తెలియజేశారు. అనేక రకాల పరీక్షల పేరుతో ఇబ్బందులు సృష్టించినా ఎదుర్కొనిముందుకు వెళుతున్న తమకు ఉద్యోగ భద్రత లేదని వివరించారు. అధికారంలోకి వస్తే అండగా ఉంటామని వారికి జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 11రక్త నిధుల, 51రక్త నిల్వల కేంద్రాల సిబ్బంది వచ్చి ప్రతిపక్షనేతను కలిశారు. వైఎస్సార్ చొరవతో రూరల్, చైల్డ్ హెల్త్ మిషన్ ప్రాజెక్టు కింద రెడ్క్రాస్ వారి నిర్వహణలో ఉన్న తమకు తక్కువ జీతం వచ్చేదని.. వైఎస్సార్ హయాంలో మరింత పెంచడంతో రూ.5,500ల వరకు వచ్చేదన్నారు. అంతేకాకుండా ఒక్క ఏడాదిలోనే రెగ్యులర్ చేస్తామని కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అయితే తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని వివరించారు. అధికారంలోకి రాగానే తమ డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగాలను రెగ్యులైజ్ చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. దేవుడి ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిస్కరిస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, రూరల్ డెవెలప్మెంట్ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అమలు చేస్తున్న ఇందిర జలప్రభ కార్యక్రమం, ఎన్టీఆర్ జలసిరి పథకాల కింద 2011 నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్న జియాలజిస్ట్లు జీతంతోపాటు ఎఫ్టీఈ కోర్సు, ఉద్యోగాలను రెగ్యులైజ్ చేయాలని జగన్ను కలిశారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని పనిచేస్తున్న ఆశించిన మేర అవకాశాలు కల్పించడంలేదని.. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడురోజుల పర్యటన విజయవంతంగా ముగి సింది. దీంతో పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు.. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరిగిపోతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలోని చెన్నారెడ్డి కాలనీకి చెందిన టీడీపీ టి.రఘునాథరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ఆదివారం పులివెందులలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు వైఎస్ జగన్ కండువా కప్పి ఆహ్వానించారు. రఘునాథరెడ్డితోపాటు మరో 20కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని హనుమగుత్తి ఎంపీటీసీ సత్యనారాయణరెడ్డి, పోట్లదుర్తి వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో.. జమ్మలమడుగు ఇన్చార్జి డాక్టర్ సుధీకర్రెడ్డి ఆధ్వర్యంలో పోట్లదుర్తికి చెందిన టీడీపీ నాయకులు టి.వెంకటశివారెడ్డితోపాటు మరో 20కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న వెంకటశివారెడ్డి చేరడంతో వైఎస్సార్సీపీ పోట్లదుర్తిలో బలంగా మారింది. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు చొప్పా యల్లారెడ్డి ఆధ్వర్యంలో ఖాజీపేట మున్సిపాలిటీ పరిధిలోని బోయినపల్లెకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పులివెందులలో వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చిన్న పెంచలయ్య, శేఖర్, శివయ్య, రామకృష్ణ, రాజులతోపాటు మరికొన్ని కుటుంబాలు పార్టీలో చేరాయి. మీ నాయకుడు సుధీర్రెడ్డే.. గెలిపించుకోండి.. వైఎస్ జగన్జమ్మలమడుగుతోపాటు ఎర్రగుంట్ల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నేతలు వచ్చి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పులివెందులలో కలిశా రు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు కేరింతలు కొడుతుండగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ డాక్టర్ సుధీర్రెడ్డి చేయిని పట్టుకొని పైకి ఎత్తి మీ నాయకుడు సుధీర్రెడ్డే.. గెలిపించుకొని రండి అంటూ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన సూచించారు. సుధీర్రెడ్డే మీ నాయకుడు గెలిపించుకోండని ప్రతిపక్షనేత అనగానే పెద్ద ఎత్తున జనాలు నినాదాలతో హోరెత్తించారు. జగన్ను కలిసిన అల్లె ప్రభావతి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని జమ్మలమడుగు వైఎస్సార్సీపీ నాయకురాలు అల్లె ప్రభావతి కలిశారు. ప్రత్యేకంగా సుమారు 50వాహనాలలో అనుచరులతో కలిసి వచ్చిన ఆమె పులివెందులలో వైఎస్ జగన్ను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఎలాంటి చిన్న, చిన్న సంఘటనలు ఉన్నా.. అన్ని మరిచిపోయి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప మాజీ ఎంపీ వైఎస్అవినాష్రెడ్డిలను పలువురు నేతలు కలిశారు. హిందూపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నదీమ్ అహమ్మద్ సుమారు 70వాహనాలలో తరలి వచ్చి వైఎస్ జగన్ను కలిశారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులందరూ వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ నదీమ్తో మాట్లాడారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, అంజాద్ బాష, రవీంద్రనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు, ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్ అభిషేక్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, తదితర నేతలు కలిసి మాట్లాడారు. వైఎస్ భాస్కర్రెడ్డి ఇంట్లో కాసేపు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న పులివెం దుల నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్ భాస్కర్రెడ్డి ఇంటికి వెళ్లి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కాసేపు గడిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ భాస్కర్రెడ్డితోపాటు మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ముచ్చటించారు. రోజంతా ప్రజలతోనే.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఉదయం 9గంటలనుంచి రాత్రి 9గంటల వరకు ప్రజలతోనే మమేకమయ్యారు. పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాలనుంచి ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. యువకులు ఎక్కువగా సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఎక్కడ చూసినా సెల్ఫోన్లతోనే యువత ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వచ్చిన ఏ ఒక్కరిని నిరాశపర్చకుండా అందరితో మాట్లాడుతూ వైఎస్ జగన్ సెల్ఫీలకు అవకాశం ఇచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం భోజన విరామం అనంతరం, రాత్రి వరకు అనుక్షణం ప్రజలతోనే వైఎస్ జగన్ బిజీబిజీగా గడిపారు. -
మహానేత వైఎస్సార్కు నివాళులర్పించిన వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల : ఇడుపులపాయలోని మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను విజయవంతంగా ముగించుకుని వైఎస్ జగన్ శుక్రవారం పులివెందులలోని స్వగృహానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక శనివారం పర్యటనలో భాగంగా తొలుత పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వైఎస్ జగన్.. అనంతరం చక్రయ్యపేట మండలంలోని వీరన్నగట్టుపల్లిలో గల గండి వీరాంజనేయస్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని, అమీన్ పీర్ దర్గాను దర్శించిన సంగతి తెలిసిందే. అయితే 14 నెలల పాటు కొనసాగిన పాదయాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మొక్కులు చెల్లించుకునేందుకు సంకల్పించుకున్నారు. గురువారం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన వైఎస్ జగన్.. సామాన్య భక్తునిలా క్యూ లైన్లో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న ఆయన.. శనివారం వీరంజనేయస్వామి క్షేత్రం, సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరగా ఇడుపులపాయలోని తన తండ్రి, మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పులివెందులలో దారిపొడవునా వైఎస్ జగన్కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. వైఎస్సార్ కడప జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అభిమానులు భారీగా తరలిరావడంతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. జై జగన్.. జోహార్ వైఎస్సార్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. -
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న వైఎస్ జగన్
-
చంద్రబాబు సర్కారు పతనం ఖాయమైపోయింది
-
ప్రజాసంకల్పయాత్ర ఎఫెక్ట్.. పింఛన్ల రెట్టింపు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావడం రాష్ట్ర ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళడంతో.. ప్రభుత్వం మరో డ్రామాకు తెరలేపింది. నాలుగేళ్లపాటు పెన్షన్ల అంశాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రభావంతో పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆకస్మాత్తుగా పింఛన్ల పెంపు ప్రకటన చేశారు. వృద్దులకు 2వేలు, వికలాంగులకు 3 వేల రూపాయల పింఛన్ అందజేస్తామని నవరత్నాల్లో వైఎస్ జగన్ పేర్కొనడంతో పాటు ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇంతకాలం వైఎస్ జగన్ హామీపై విమర్శలు చేస్తూ వచ్చిన చంద్రబాబు.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు అదే హామీని అమలు చేయడానికి సన్నద్ధమయ్యారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా చర్చకు దారి తీసింది. మరో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఫించన్ల పెంపు నిర్ణయం డ్రామాలో భాగంగానే పలువురు అభివర్ణిస్తున్నారు. వైఎస్ జగన్ హామీ వల్లనే చంద్రబాబు ఎన్నికలకు ముందు పింఛన్ రెట్టింపు అంటు ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. -
వైఎస్ జగన్ పాదయాత్ర స్పందనతో ప్రభుత్వంలో కలవరం
-
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న వైఎస్ జగన్
-
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న వైఎస్ జగన్
సాక్షి, కడప: సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని కడప జిల్లాకు చేరుకున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గా వద్దకు చేరుకున్న జననేతకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. దర్గా పెద్దలు కూడా వైఎస్ జగన్కు ఎదురొచ్చి.. లోనికి ఆహ్వానించారు. దర్గాలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి ఆచారం ప్రకారం వైఎస్ జగన్ చాదర్ సమర్పించారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని, అమీన్ పీర్ దర్గాను దర్శించిన సంగతి తెలిసిందే. అయితే 14 నెలల పాటు కొనసాగిన పాదయాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మొక్కులు చెల్లించుకునేందుకు సంకల్పించుకున్నారు. గురువారం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన వైఎస్ జగన్.. సామాన్య భక్తునిలా క్యూ లైన్లో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. నిన్న రాత్రి తిరుమలలోనే బస చేసిన జననేత నేడు ఉదయం వైఎస్సార్ జిల్లాకు చేరుకున్నారు. వైఎస్సార్ జిల్లాకు చేరుకున్న వైఎస్ జగన్కు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడుగున పూల వర్షం కురిపిస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. -
హార్టికల్చర్ విద్యార్థులకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, కడప: అధికారంలోకి రాగానే హార్టికల్చర్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రజాసంకల్ప యాత్ర అనంతరం జిల్లాకు వచ్చిన ఆయనకు ప్రజలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైల్వేకోడూరులో హార్టికల్చర్ వర్శిటీ విద్యార్థులు ప్రతిపక్షనేతను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. హార్టికల్చర్లో కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి జగన్ స్పందిస్తూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ సచివాలయం అనే కాన్సెప్ట్ను అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో అమలు చేస్తామని, ఇందులో అగ్రికల్చర్, హార్టికల్చర్ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రైతులకు టెక్నికల్గా సలహాలు, సూచనలు ఇచ్చే హార్టికల్చర్ విద్యార్థుల సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు. మరో ఆరునెలల్లో దేవుడి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం వస్తుందని, చంద్రబాబు హయాంలో ధర్నాల చేసి అనవసరంగా చదువులు పాడుచేసుకోవద్దని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విద్యార్థులకు సూచించారు. -
వైఎస్ జగన్ అంటే ఒక నమ్మకం..
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆ పార్టీ సీనియర్ నాయకులు తమ్మినేని సీతారాం ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. వైఎస్ జగన్ అంటే ఓ పోరాటం, ఒక నమ్మకం, పాదయాత్ర ద్వారా ప్రజలకు భరోసా కల్పించిన నాయకుడని అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ పాదయాత్రను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాలపై విజయంగా భావిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్ వాళ్ల కాళ్ళ వద్ద పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబుకు తెలుగు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. -
తిరునగరి.. జనహారతి
చారిత్రాత్మక పాదయాత్రను పూర్తిచేసుకుని అడుగుపెట్టిన జననేతకు గురువారం అపూర్వ స్వాగతం లభించింది. రేణిగుంట మొదలు తిరుమల వరకూ దారిపొడవునా జనజాతర తలపించింది. తిరుపతి రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. జై జగన్ నినాదాలతో హోరెత్తిపోయాయి. ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జనసందోహం మధ్య ఆయన వాహనం కదలడానికి చాలా సమయం పట్టింది. అలిపిరి నుంచి తిరుమలకు సాగించిన కాలినడకనూ వేలాదిగా అభిమానులు అనుసరించారు. సాధారణ భక్తునిలా జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్తూరు, తిరుపతి తుడా/ తిరుమల : జననేతకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్రెడ్డి స్వాగతం పలికారు. ఏర్పేడు, శ్రీకాళహస్తి నుంచి వచ్చిన వేలాది మంది కార్యకర్తలతో రైల్వేస్టేషన్ నిండిపోయింది. జగన్ని నాదాలతో మార్మోగింది. తనకోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేసి చంద్రగిరి–రేణిగుంట బైపాస్ రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి బయలుదేరారు. చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట వద్ద నగరంలోకి ప్రవేశించిన జగన్కు ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వినూత్నంగా స్వాగతం పలికారు. రోడ్డుకి రువైపులా మామిడి, అరటి తోరణాలు, బెలూన్లు ఏర్పాటు చేశారు. మహిళలు గుమ్మడికాయలు కొట్టి దిష్టితీశారు. పద్మావతి గెస్ట్హౌస్లో కొంతసేపు సేదదీరారు. అనంతరం ఎమ్మెల్యేలు, కార్యకర్తలను పలకరించారు. జననేత కాన్వాయ్ తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్ పూలే సర్కిల్కు చేరుకోగానే కార్యకర్తలు ప్లకార్డులతో ఘన స్వాగతం పలికారు. దీనికి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యం వహించారు. మార్మోగిన గోవింద నామస్మరణ.. అలిపిరి మెట్ల మార్గంలో గోవింద నామస్మరణ మార్మోగింది. జగన్తో పాటు వేలాది మంది కార్యకర్తలు కాలినడకన నడిచారు. అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మెట్లకు నమస్కరించా రు. సామాన్య భక్తుని వలే కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ శ్రీవారిపై అపారమైన భక్తిని చాటుకున్నారు. మార్గ మధ్యంలో ఆంజనేయస్వామిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టారు. వడివడిగా మెట్లు ఎక్కిన వైఎస్.జగన్ ఎక్కడా ఆగకుండా ముందుకు కదిలారు. అలుపు లేకుండా పాదయాత్ర నిర్వహించిన జననేత తిరుమల మెట్లు ఎక్కడంలోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మెట్ల దారిలో సాటి భక్తులను పలకరిస్తూ ఆత్మీయ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మార్గ మధ్యంలో నరసింహస్వామి ఆలయం మీదుగా మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల చేరుకున్నారు. సామాన్య భక్తునిలా తిరుమలకు కాలినడకన వస్తున్న జననేతను పలకరించడానికి భక్తులు ఆసక్తి కనబరిచా రు. అలిపిరి నుంచి తిరుమల చేరేవరకు జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు గోవింద నామస్మరణ చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1.35 గంటలకు అలిపిరి వద్ద మొదలైన నడక 4.30గంటలకు తిరుమలకు చేరుకుంది. పద్మావతి గెస్ట్హౌస్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. 6 గంటల సమయంలో స్వామి దర్శనానికి వెళ్లారు. రైల్వేస్టేషన్లో మాజీ ఎంపీలు మిథున్ రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, వెంకటేగౌడ తదితరులు స్వాగతం పలికారు. టౌన్క్లబ్ వద్ద భారీగా అభిమానులు టౌన్క్లబ్ సర్కిల్కు రాగానే అక్కడ వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, దివ్యాంగులు చేరుకుని అపూర్వ స్వాగతం పలికారు. మహతి ఆడిటోరియం వద్ద వైస్సార్సీపీ మైనారిటీ నాయకులు ఖాద్రీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు ప్లకార్డులతో రోడ్డుకిరువైపులా నిల్చొని జైజగన్ అంటూ అభిమానాన్ని చాటారు. అనంతరం జ్యోతి థియేటర్ సర్కిల్ వద్ద వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. ఎస్వీ మెడికల్ కళాశాల చేరుకోగానే అక్కడ అభిమానులు రంగురంగుల కాగితాలను వెదజల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
వైఎస్ జగన్ను ఆదరించిన ప్రజలకు కృతఙ్ఞతలు
-
కనీవినీ ఎరుగని రీతిలో సాగిన ప్రజాసంకల్పయాత్ర
-
ఈ సంకల్పం.. అందరికోసం
ఎండమావిలో పన్నీటి జల్లులా...కష్టాల కడలిలో చుక్కానిలా ఇపుడుకొండంత అండ దొరికినట్టయింది.ఒక్కో పథకం ఒక్కో రత్నంలా జనంమోములో వెలుగునింపుతోంది.జననేత ఇచ్చిన భరోసాతోప్రతిఒక్కరిలో ఆశలు నింపుతోంది.భరోసా కలిగిస్తోంది. విశాఖపట్నం, చోడవరం : ప్రస్తుతం చంద్రబాబు పాలనలో ఆధునిక వ్యవసాయం మాట దేవుడికెరుకగాని ఉన్న సాధారణ వ్యవసాయమే చేయలేని పరిస్థితిలో వైఎస్సార్సీపీలో ప్రవేశపెట్టిన నవరత్న పథకాల్లో ‘రైతు భరోసా’ పథకం రైతులకు కొండంత అండగా నిలుస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రతి రైతుకు రూ.12500 ఇవ్వడంతోపాటు పంటల బీమా ప్రీమియం కూడా తమ ప్రభుత్వమే చెల్లించేలా చూస్తామని జగన్ చెప్పడం రైతుల్లో ఎంతో ఆనందాన్ని నింపింది. ఉచితంగా వ్యవసాయ బోర్లు ఏర్పాటు, పంట దిగుబడి ముందే కొనుగోలు గిట్టుబాటు ధరను ప్రకటిస్తామని, ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటాకాల నుంచి రైతులను ఆదుకునేందుకు రూ.4వేల కోట్లు స్థిరీకరణ నిధిని కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తామని చెప్పడం రైతుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. సుగర్ ఫ్యాక్టరీలను, చెరకు రైతులను ఆదుకోవడంతోపాటు పాడి రైతులకు లీటరుకు రూ.4 బోనస్గా ప్రకటించడం, సహకార పాల డెయిరీలను ప్రతి జిల్లాకు ఏర్పాటు చేస్తామని చెప్పడం పాడి రైతుకు ఊరటనిస్తుంది. ‘అమ్మ ఒడి’..ఆలంబనగా.. పేద కుటుంబాలకు ఉన్నత భవిష్యత్తును ఇచ్చేదిగా ఉంది. టీడీపీ పాలనలో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం, ప్రైవేటు పాఠశాలలకు వేలకు వేలు ఫీజులు కట్టలేక దిగాలు పడుతున్న కుటుంబాలను జగన్ ప్రకటించిన అమ్మ ఒడి పథకం అక్షరాస్యత శాతాన్ని నూరుశాతం పెంచేదిగా ఉంది. బడికి పంపిస్తే చాలు ఒక్కో పిల్లోడికి ఏటా రూ.15వేలు నేరుగా తల్లికే ఇస్తానని, ఎంతమంది పిల్లలు ఉన్నా, ఏ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివినా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం అన్ని వర్గాల కుటుంబాలకు ఓ వరం కానుంది. ‘ఫీజు రీయింబర్స్మెంట్’ ఉన్నతంగా.. గడిచిన ఐదేళ్లలో ఇంజినీరింగ్, డాక్టర్తోపాటు ఉన్నత చదువులన్నింటి ఫీజులు రూ.లక్షకు పైగానే పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రతి విద్యార్థికి ఉన్నత చదువుకయ్యే ఎంత ఖర్చయినా రూ.లక్ష వరకు భరించడంతో పాటు హాస్టల్ ఖర్చు కింద రూ.20వేలు ఇస్తామని జగన్ ఇచ్చిన హామీ ‘ఉన్నత’ విద్యార్థి లోకానికి ఓ మంచి అవకాశంగా ఉంది. ‘డ్వాక్రా రుణమాఫీ’ ఒక ఆసరా డ్వాక్రా మహిళలకు వరంగా కానుంది. గత ఎన్నికల్లో మహిళలందరికీ డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు తర్వాత మాఫీ చేయకపోవడంతో మహిళలంతా అప్పుల చేసి మరీ వడ్డీతో సహా అసలు కట్టిన విషయం తెలిసిందే. దీనితో మహిళలంతా ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన తరుణంలో జగన్మోహన్రెడ్డి ప్రకటించిన డ్వాక్రా రుణమాఫీ పథకం మహిళలందరికీ వరంగా మారనుంది. ఇంపుగా ‘పింఛన్ పెంపు’ ఇప్పటి వరకు రూ.వెయ్యి ఇస్తున్న వృద్ధాప్యం పింఛన్ను రూ.2వేలకు, వికలాంగుల పింఛన్ రూ.1500 నుంచి 3వేలకు పెంచుతామని జగన్ చేసిన ప్రకటన వేలాది మంది లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమౌతోంది. గృహ నిర్మాణం పక్కా.. చంద్రబాబు హయాంలో ఊరికి నాలుగైదు కూడా ఇళ్లు మంజూరు చేయని పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితిలో అర్హులైన వారందరికీ పక్కాగృహాలు మంజూరు చేయడంతోపాటు స్కీం మొత్తాన్ని రూ. లక్షన్నర నుంచి రెండున్నర లక్షలకు పెంచి ఇస్తామని చెప్పడం గూడులేని వారికి నమ్మకం ఏర్పడింది. ఆరోగ్య శ్రీ పథకానికి గతంలో కంటే నిధులు పెంచి రూ.వెయ్యికి మించి ఖర్చయ్యే ప్రతి వైద్యానికి ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని జగన్ ప్రకటించడం జనారోగ్యానికి ఢోకాలేదనే భావన ఏర్పడింది. ఇంటివద్దకే ప్రభుత్వ పథకాలు గ్రామ సచివాలయ వ్యవస్థలో స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించి వారికి జీతాలు ఇస్తూ వారి ద్వారా రేషన్తోపాటు అన్ని పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే పంపించే కొత్త విధానికి శ్రీకారం చుట్టేందుకు జగన్ సంకల్పించడం మేధావుల మన్ననలు సైతం పొందుతుంది. పంటకు ముందే ధర నిర్ణయం భేష్ అందరూ రైతులకి ఇదిచేస్తాం అది చేస్తాం అని ఓట్లు అడుగుతారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రైతులనే మరిచిపోతారు. రాజశేఖరరెడ్డి రైతులను ఆదుకున్నారు. అతనిలాగే అతని కుమారుడు చేస్తాడని నమ్మకం ఉంది. ముఖ్యంగా గిట్టుబాటు ధర కల్పించారు. పంట పండించడానికి ముందే పంటకు ధర నిర్ణయించడం అంటే రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. అలాగైతే రైతులు పంటలు పండించడానికి ముందుకు వస్తారు.– బూడి వెంకటరమణ, రైతు, గౌరీపట్నం నిరుద్యోగులకు ఉపాధి వస్తుంది రాష్ట వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలతో పాటు, ఉపాధి అవకాశాలు వస్తాయి. జగనన్న పాదయాత్ర వల్ల ఎంతో మంది నిరుద్యోగుల సమస్యలను దగ్గర నుంచి విన్నారు. జగనన్న తప్పకుండా నిరుద్యోగులకు సముచిత స్ధానం కల్పిస్తారు. కొద్ది రోజుల్లోనే మంచిరోజులు వస్తాయన్న నమ్మకం మా యువతకు కలిగింది. – కంటే వెంకట్, మంగళాపురం, బుచ్చెయ్యపేట -
సంకల్ప భయం
-
ప్రజాసంకల్పయాత్ర అద్వితీయం.. అపూర్వం..
-
హోదా కోసం పోరాడుతున్నది వైఎస్ జగన్ మాత్రమే
-
ప్రజల గుండె చప్పుడు వింటూ..!
-
సంకల్ప సంబరం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైఎస్ జగన్ పాదయాత్ర ముగియగానే జిల్లాలో సంబరాలుఅంబరాన్నంటాయి. సంఘీభావంగా పాదయాత్రలు, బైక్ర్యాలీలు, ర్యాలీలు చేపట్టారు. పార్టీ కార్యాలయాల్లో కేక్లు కట్ చేసి..ప్రజలకు పంచిపెట్టారు. ఆలయాల్లో వైఎస్ జగన్ పేరిట అర్చనలు చేయించారు. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయంలో ఐదు వేల మందితో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి రాఘవేంద్రస్వామి ప్రధాన ముఖద్వారం, రాఘవేంద్ర సర్కిల్, 167 జాతీయ రహదారి మీదుగా హెచ్ఆర్బీ కల్యాణ మండపం వరకు పాదయాత్ర కొనసాగింది. అనంతరం రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా. వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరిట అర్చన చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబం విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటపై నిలబడే నాయకుడని కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లో చెరగని ముద్ర వేయడంతో పాటు చరిత్ర సృష్టించారన్నారు. ♦ కర్నూలు ఎస్బీఐ సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నగర అ«ధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు తెర్నేకల్ సురేందర్రెడ్డి, లక్కీటూ నరసింహులు యాదవ్ తదితరులు భారీ పూలమాల వేసి.. పాలాభిషేకంచేశారు. ఇక్కడే కేక్లు కట్ చేశారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ♦ కర్నూలు వినాయక స్వామి దేవాలయం వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి అనుమంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో వినాయకుడు, సాయిబాబాకు వైఎస్ జగన్ పేరిట అర్చన చేయించారు. అనంతరం 516 కొబ్బరికాయలను సమర్పించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకరరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పర్ల శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ♦ కల్లూరు శరీన్నగర్లోని వైఎస్సార్ విగ్రహానికి కల్లూరు అర్బన్ వార్డుల ఇన్చార్జ్ బెల్లం మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి.. పాలాభిషేకం చేశారు. ♦ నంద్యాలలో మునిసిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, మాజీ చైర్మన్ కైపరాముడు, శిల్పా మహిళా సహకార్ చైర్మన్ శిల్పా నాగినీరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి ఇంటి నుంచి శ్రీనివాస సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ♦ ఆదోనిలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు దేవా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి.. సంబరాలు చేసుకున్నారు. ♦ పత్తికొండలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, జిల్లా నాయకుడు కారం నాగరాజు, మండల కన్వీనర్ బజారప్ప ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి.. ప్రజలకు పంచిపెట్టారు. ♦ బనగానపల్లె మండలం నందవరంలోని చౌడేశ్వరిదేవి ఆలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీఆర్ వెంటేశ్వరరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శివరామిరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే కేక్ కట్ చేసి.. ప్రజలకు పంచిపెట్టారు. ♦ హాలహర్విలో మండల కన్వీనర్ భీమప్ప చౌదరి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి..మిఠాయిలను పంచిపెట్టారు. -
ప్రజాసంకల్పయాత్ర అద్వితీయం.. అపూర్వం!
-
జననేతకు జైకొట్టిన జనసంద్రం
-
కాలినడకన తిరుమలకు వైఎస్ జగన్
-
ఉత్సాహం నింపిన సంకల్పం
బిందువు.. బిందువూ కలిసి సింధువైనట్లు.. అడుగు.. అడుగు కలిసి అభిమాన సంద్రమైంది. 14 నెలలు.. 3648 కిలోమీటర్లు.. అలుపెరగని బాటసారి ప్రజా సంకల్ప యాత్ర సాగింది. నడిచింది తానే అయినా.. నడిపించింది మాత్రం ప్రజలే. అధికార మదం అడ్డంకులు సృష్టించినా.. రాజన్న చల్లని దీవెనలు.. ప్రజల ఆప్యాయత.. ఆత్మీయతలే తోడుగా.. ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన వైఎస్సార్ వారసుడు.. సుదీర్ఘ పాదయాత్ర ఘనంగా ముగిసింది. ఎంత దూరం నడిచామన్నది ముఖ్యం కాదు.. ఎందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నామన్నదే ఆయన సిద్ధాంతం. కష్టం చెప్పుకున్న ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తూ.. రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యం అందించేందుకు చేసిన జన జాతర ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకూ అదే అభిమానం సాగింది. ముగింపులోనూ జననేత జగనన్నకు ఆశీస్సులు, అభినందనలు అందించేందుకు ప్రతి జిల్లా దారులన్నీ.. ఇచ్ఛాపురం వైపే సాగాయి. చిన్నా పెద్దా.. కార్యకర్త, నాయకుడు అనే తారతమ్యం లేకుండా అద్వితీయ ముగింపు సభలో పాలుపంచుకునేందుకు ఉరకలేసే ఉత్సాహం ప్రదర్శించారు. విశాఖ సిటీ: రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర ఘనంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇచ్ఛాపురం చేరుకొని జననేతకు అభినందనలు తెలిపారు. దారులన్నీ.. శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ఇచ్ఛాపురం వైపే సాగాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు జననేతకు జేజేలు పలికేందుకు ఇచ్ఛాపురం వెళ్లారు. జననాయకుడి జైత్రయాత్రకు సంఘీభావంగా తరలివెళ్తున్న జనంతో దారులన్నీ జనసంద్రంగా మారాయి. తమ చెంతకే వచ్చి సమస్యలు సావధానంగా విని భరోసా ఇచ్చిన నాయకుడు దొరికాడంటూ ప్రజలందరూ ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. నిఖార్సైన నేతగా.. నిలువెత్తు నిబద్ధతతో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే ప్రజా సంకల్ప ధీరుడు జగనన్నే అనే ఒక అభయం రాష్ట్ర ప్రజలకు దక్కిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందరూ అక్కడికే.. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు పాదయాత్ర ముగింపు సభాస్థలికి చేరుకునేందుకు ఉత్సాహం చూపారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, వార్డు అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తమ వాహనాల్లో ఇచ్ఛాపురం వెళ్లారు. సంకల్ప ధీరుడికి జన నీరాజనం సంకల్ప ధీరుడికి ముగింపు సభలో అశేష ప్రజానీకం విజయోస్తు అంటూ దీవెనలు పలికారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాసంక్షేమం కోసం చేపట్టే పథకాలను, వాటి అమలుకు తీసుకునే చర్యలను వివరించడాన్ని ప్రజలు కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. అవినీతిరహిత పాలనను ప్రజల చెంతకే చేరువచేస్తానని, రేషన్ సరకులు డోరు డెలివరీ ఇప్పిస్తాననే హామీలు ప్రజల్లో ఆసక్తిని, ఆకాంక్షను కలిగించాయి.– మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం ముగింపు సభలో నిజాయితీ, నిబద్ధతకే పెద్దపీట వేశారు. పంచాయతీలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమిస్తానన్న హామీ పేదల్లో ఆనందాన్ని నింపుతుంది. పార్టీ విజయానికి బాటలు వేసేలా చేసిన జగన్ ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఇదే స్ఫూర్తితో పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఆవశ్యకత ఆసస్నమైంది. – వంశీకృష్ణ శ్రీనివాస్యాదవ్,వైఎస్సార్ సీపీ తూర్పు సమన్వయకర్త వైఎస్ఆర్ అభిమాన కుటుంబం తరలివచ్చింది.. ఇచ్ఛాపురంలో ముగింపు సభకు యావత్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమాన కుటుంబం తరలివచ్చింది. సంక్రాంతి వారం రోజుల ముందే జరిగినట్టు అనిపించింది. 150 రోజులలో మనందరం కలలుకన్న నవరత్నాల వంటి సంక్షేమ పథకాలతో రాజన్న రాజ్యం సాకారం కాబోతోందని అందరూ చర్చించుకున్నారు. మూడు పాదయాత్రలు ఇచ్ఛాపురంలో ముగియడం.. అక్కడే ఈ మూడు పైలాన్లు ఉండటం స్థానిక ప్రజలు చేసుకున్న అదృష్టం. – అక్కరమాని విజయనిర్మల,భీమిలి సమన్వయకర్త, వైఎస్సార్సీపీ ప్రజా సంకల్పయాత్ర అపూర్వ ఘట్టం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ప్రజల కష్టాలను విని, వారికి అండగా నిలబడ్డారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.– తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీగాజువాక సమన్వయకర్త జగన్పై ప్రజల్లో అపార నమ్మకం రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయాల ఏర్పాటు చేస్తాననడంతో వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో అపార నమ్మకం కలిగింది. జగన్ రైతు పక్షపాతిగా చెప్పడానికి ఆయన ప్రకటించిన వరాలు, స్థిర నిధి ఏర్పాటు హామీలే నిదర్శనం. ప్రస్తుతం వ్యవసాయం దండగా అనే నిస్పృహలో ఉన్న రైతులకు అది జగన్ సీఎం అయితే పండగా కాబోతోంది. – తైనాల విజయకుమార్, పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు ప్రజల్లో ఎనలేని ఉత్సాహం ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకుం టూ.. ప్రజలందరికీ భరోసా ఇస్తూ సుదీర్ఘంగా జగనన్న పాదయాత్ర చేయడం ఓ రికార్డు. ఆ తుది ఘట్టం చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, అభిమానులు ఇచ్ఛాపు రం చేరుకున్నారు. ఆ జనసందోహం చూస్తే ఓ పండగ వాతావరణంలా కనిపించింది. పైలాన్ను ఓ సందర్శన స్థలంలా అద్భుతంగా నిర్మించారు. రాష్ట్ర ప్రజలకు జగనన్న ముందస్తు కానుకలు ఎన్నో అందించారు. – వరుదు కల్యాణి, వైఎస్సార్ సీపీ అనకాపల్లిపార్లమెంట్ జిల్లా సమన్వయకర్త ఇచ్ఛాపురంలో ముగింపు అదిరింది.. ఇచ్ఛాపురంలో సంకల్పయాత్ర ముగింపు అదిరింది. సభకు యావత్ రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. చంద్రబాబు మోసపూరిత హామీలపైనే ప్రజలు చర్చించుకున్నారు. ప్రజల్లో, పార్టీ క్యాడర్లో ఉత్సాహం రెట్టింపైంది. వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఆకాంక్ష ప్రజల్లో కనిపించింది.– డాక్టర్ పైడి వెంకట రమణమూర్తి,వైఎస్సార్ సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త ప్రజలకు నమ్మకం కలిగించారు జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు వినడం వల్ల ఆయనపై విపరీతమైన నమ్మకాన్ని ఈ రాష్ట్ర ప్రజలు పెంచుకున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని కళ్లారా చూశారు. ఓ గొప్ప నాయకుడుని కలుసుకుని ప్రతీ కుటుంబం ఎంతో సంతోషపడింది. యువత కష్టాలకు కాలం చెల్లి రేపటి భవిష్యత్ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తోంది. – కె.కె.రాజు,ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్ సీపీ -
సిక్కోలులో ‘తూర్పు’ సందడి
కాకినాడ: ప్రజా సంకల్ప పాదయాత్ర తుది అంకంలో ‘మేముసైతం’... అంటూ జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో బుధవారం జరిగిన పైలాన్ ఆవిష్కరణ, చివరి రోజు పాదయాత్ర ... బహిరంగ సభలో పాల్గొనడానికి జిల్లా నలుమూలల నుంచి ఉత్సాహంగా తరలి వెళ్లారు. అభిమాననేతకు బాసటగా ‘మీ వెంటే మేమం’టూ ఆయా ప్రాంతాల నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లి సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్సీపీ అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్చంద్ర బోస్, కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్ల పర్యవేక్షణలో ఆయా నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కారులు, బస్సుల్లో బుధవారం ఉదయానికే ఇచ్ఛాపురం చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పినపే విశ్వరూప్, పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగంఅధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితర నేతలు పాదయాత్రకు పార్టీశ్రేణులతో తరలి వెళ్లారు. వివిధ నియోజక వర్గాలకు చెందిన కో–ఆర్డినేటర్లు తమ ప్రాంతాలకు చెందిన పార్టీశ్రేణులతో కలిసి ఇచ్చాపురం చేరుకున్నారు. మాజీ మంత్రి కొప్పన మోహనరావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు మార్గాని భరత్, చింతా అనురాధ, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, పొన్నాడ వెంకటసతీష్కుమార్, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా యువజన విభా గం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, మాజీ కార్యదర్శి కర్రి పాపారాయుడు, రాజమహేంద్రవరం, కాకినాడసిటీ పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, ఆర్వీజేఆర్ కుమార్, జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్ తదితరులు వేలాదిగా వెళ్లిన పార్టీశ్రేణులు జగన్ వెంట నడిచారు. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్ను సందర్శించడంతో పాటు చివరి బహిరంగ సభలో ‘జై జగన్’ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో సంబరాలు... జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రం కాకినాడలో పార్టీశ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాకినాడ కొండయ్యపాలెంలో కేక్కట్ చేసి చిన్నారులకు పండ్లు, మిఠాయిలు పంచారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ర్యాలీ నిర్వహించి టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలో రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తనయుడు ఆకుల విజయ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక అచ్చమ్మతల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర లీగల్సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు ఇచ్చాపురంలో పైలాన్వద్ద పాదయాత్ర 341 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 341 బెలూన్లను ఎగురవేశారు. -
విజయోస్తు జగనన్న!
కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని... ప్రతి పేదవాడి గుండెల్లో బాధను నేరుగా తెలుసుకోవాలని... పద్నాలుగు నెలల క్రితం ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. కానీ తాను చేపట్టే ప్రజా సంకల్పయాత్ర 3648 కిలోమీటర్లు సాగుతుందని... తనపై ప్రజలు చూపిస్తున్న అపారమైన ప్రేమాభిమాలను తట్టుకోలేక కుట్రలు పురుడుపోసుకుంటాయని... ఆయనకే తెలియదు. అయితేనేం? ఎన్ని దుర్మార్గపు అవాంతరాలు ఎదురైనా అనిర్వచనీయమైన జనాభిమానం ముందు అవన్నీ కొట్టుకుపోయాయి. మృత్యుంజయుడై వచ్చిన ఆయన అడుగుముందుకే వేశారు. అనితరసాధ్యమైన మహాయజ్ఞాన్ని పూర్తిచేశారు. అ విజయోత్సాహంతోకలియుగవైకుంఠం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని దివ్యదర్శనానికి సంసిద్ధులయ్యారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 341 రోజుల పాటు ప్రజాసంకల్పయాత్ర చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. 3648కిలోమీటర్ల దూరం నడిచి ఇచ్ఛాపురం చేరుకుని ఓ చరిత్రను సృష్టించారు. ఆ చారిత్రక నేపథ్యానికి సాక్ష్యంగా రూపొందించిన విజయస్తూపాన్ని అక్కడ ఆవిష్కరించారు. ఆ అరుదైన ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు జిల్లా నుంచి భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వెళ్లారు. ప్రతి నియోజకవర్గం నుంచి బస్సులు, కార్లలో వేలాదిగా వెళ్లి చివరి సభకు అఘండ విజయాన్ని చేకూర్చారు. ప్రజా సంకల్పయాత్ర విజయ సంకల్ప స్ధూపాన్ని సందర్శించి తరించారు. జగన్మోహన్రెడ్డి సాధించిన గ్రేట్ విక్టరీకి చిహ్నంగా అద్భుతంగాఅద్భుతంగా మలిచిన స్తూపం వద్ద ఫొటోలు దిగి ఆ జ్ఞాపకాన్ని పదిలపరుచుకున్నారు. విజయనగరం నుంచి తిరుపతికి... అశేష జనవాహిని నడుమ ప్రజా సంకల్పయాత్ర చివరి బహిరంగ సభను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించుకుని రోడ్డు మార్గంలో జగన్ బుధవారం రాత్రికి విజయనగరం పట్టణానికి చేరుకున్నారు. దురంతో ఎక్స్ప్రెస్ రైలులో రాత్రి 10.10 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్లా రు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పాదయా త్ర చేసిన ఆయన పాదయాత్ర ముగిసిన జిల్లాలో విశాఖపట్నం విమానాశ్రయం మినహా మరెక్కడికీ మరలా వెళ్లలేదు. ఎప్పుడూ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్ వెళుతుండేవారు. కానీ విజయనగరం జిల్లాలో 36 రోజుల పాటు పాదయాత్ర చేసిన జగన్ పాదయాత్ర చివరిలో కూడా జిల్లాకు వస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రజా సంకల్పయాత్రను దిగ్విజయంగా ముగించుకు న్న తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపేం దుకు రైల్వే స్టేషన్ పరిసరాలకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంత మంతా కోలాహలం గా మారిపోయింది. జగన న్న రాగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం, సీఎం అంటూ నినాదాలు చేస్తూ ప్రతిపక్ష నేతకు జయ జయ ధ్వానాలు పలి కారు. క్షేమంగా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోమం టూ వీడ్కోలు పలికారు. ప్రతిఒక్కరికీ చిరునవ్వుతో చేతులు జోడించి అభివాదం చేస్తూ జగన్ పయనమయ్యారు. రైల్వే స్టేషన్లో జగన్ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్చార్జి భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీ వాణి, కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, బెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స అప్పలనరసయ్య, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్ర శేఖర్, శత్రుచర్ల పరిక్షిత్ రాజు, నెల్లిమర్ల నియోజక వర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, తదితరులు పాల్గొన్నారు. -
జన గర్జన
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నేల ఈనిందా అన్నట్లు ఇచ్ఛాపురం కదం తొక్కింది. రాష్ట్ర ప్రజల్లో ప్రస్తుత చంద్రబాబు పాలనపై ఉన్న నిరసన ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది. ప్రజాసంకల్ప తీవ్రతను రాష్ట్రానికి చాటిచెప్పింది. ఇసుకేస్తే రాలనంతగా కిలోమీటర్ల మేర జనం తరలిరావడంతో ఇచ్ఛాపురం జనసంద్రమైంది. రాష్ట్రంలో ‘నారా’సుర పాలనకు అంతమొందించడానికి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో దిగ్విజయంగా ముగిసింది. ఇడుపులపాయలో మొదటి కిలోమీటర్తో ప్రారంభమైన ఈ చరిత్ర బుధవారానికి ఇచ్ఛాపురం చేరుకుని ఏకంగా 3648 కిలోమీటర్ల మేరకు చేరి యాత్రను ఓ చరిత్రలా ముగించింది. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ఈ దృఢ సంకల్ప ముగింపునకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో వ్యతిరేక సర్కా ర్ వెన్నులో వణుకు పుట్టింది. చంద్రబాబు దుష్ట సర్కార్ను తరిమికొట్టేందుకు నవరత్నాలే సమరాస్త్రాలుగా ప్రజా సంక్షేమమే సంకల్పంగా చేపట్టిన సంకల్ప యాత్రికుడికి జనం జయ జయ ధ్వానాలు పలికారు. ఇందులో భాగంగా ఇచ్ఛాపురంలో నిర్వహించిన ముగింపు సభలో చంద్రబాబు సర్కార్పై ధ్వజమెత్తడంతో పాటు వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలపై జగన్ వివరించారు. వేలాది కిలోమీటర్లు మేరకు తానే నడిచినప్పటికీ నడిపించింది మాత్రం ప్రజలే అని చెప్పడం విశేషంగా చెప్పవచ్చు. ఇదిలావుంటే ముగింపు సభ జరుగుతున్న సమయంలో జిల్లాలో పలు చోట్లతో పాటు ప్రధానంగా ఇచ్చాపురం, పలాస, టెక్కలి తదితర నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. జగన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంగా టీవీల్లో చూసే అవకాశాలు లేకుండా సర్కార్ చేసిన ఈ కుటిల చర్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. హాజరైన నేతలు ప్రజాసంకల్పయాత్రకు రాష్ట్ర స్థాయి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంకల్పానికి తుది లక్ష్యానికి చేరుకోనున్న నేపథ్యంలో పలువురు జగన్తో కలిసి అడుగులు వేశారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, గొర్లె కిరణ్కుమార్, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, రాష్ట్ర పార్టీ సిఈసి సభ్యుడు అంధవరపు సూరిబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతాడ మంజు, ముఖ్యనేతలు దువ్వాడ శ్రీధర్, దువ్వాడ శ్రీకాంత్, ఎన్ని ధనంజయ, మామిడి శ్రీకాంత్, హనుమంతు కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్ను నమ్మం బాబూ..అంటున్నారంతా.. ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను తీవ్ర అవస్థలకు గురిచేసిన చంద్రబాబును ఇక నమ్మేది లేదంటూ జనం గట్టిగా చెబుతున్నారని వైఎస్ జగన్ అనడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ప్రజ లను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరాజకీయాలతో పాటు అవినీతి అక్రమాలను జగన్ ఎండగట్టాడు. పాదయాత్రలో ఎన్నో రకాల సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు చేసిన మోసాలను చెప్పారని, అప్పట్లో చంద్రబాబుకు ఓటేసి మోసపోయామన్నారు. రుణమాఫీపై మోసం చేయడంతో రైతులంతా ‘నిన్ను నమ్మం బాబూ..’ అని అంటున్నారని, పొదుపు రుణాలు, బంగారు రుణాల మాఫీపై మోసం చేయడంతో డ్వాక్రా మహిళంతా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటున్నారని జగన్ చెప్పడంతో జనంలో మంచి స్పందన వచ్చింది. అలాగే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేయడంతో నిరుద్యోగులు, యవత కూడా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటున్నారని, అలాగే యువకులు, గ్రామాల్లో ప్రజలు, ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు చెయ్యకపోవడంతో విద్యార్థులు, వైద్యం సక్రమంగా అందివ్వని కారణంగా రోగులు తదితర వర్గాల ప్రజలంతా ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటూ అంటున్నారని జగన్ చెప్పడంతో విశేష స్పందన వచ్చింది. ఘనంగా విజయ స్తూపం ఆవిష్కరణ ప్రజాసంకల్పయాత్ర ముగింపునకు గుర్తింపుగా ఇచ్ఛాపురానికి సమీపంలో అద్భుతంగా నిర్మించిన విజయ స్తూపాన్ని (పైలాన్) వైఎస్ జగన్ ఘనంగా ఆవిష్కరించారు. 13 జిల్లాలకు గుర్తుగా 13 మెట్లతో అద్భుత రీతిలో టోంబ్తో పాటు గ్రీనరీ లాన్, దివంగత వైఎస్సార్ ఫొటోలు, అలాగే జగన్ పాదయాత్ర చేసిన రూటు తదితర వివరాలన్నీ ఈ స్తూపంలో ఉండడంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ స్తూపాన్ని ఆవిష్కరించినప్పుడు యువకులు పెద్ద సంఖ్యలో సీఎం సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఇదే మార్గంలో దివంగత వైఎస్సార్ చేపట్టిన ప్రజాప్రస్థానం పైలాన్, వైఎస్ షర్మిళ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పైలాన్లు కూడా ఉండడంతో యాత్రలో భాగంగా జగన్ వాటిని తిలకించి సభకు హాజరయ్యారు. పాదయాత్రకు జన నీరాజనం ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఉదయం కవిటి మండలం అగ్రహారం నుంచి భారీ జనసందోహం నడుమ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. జాతీయ రహదారి మీదుగా కొజ్జీరియా కూడలి, ఎ.బలరాంపురం, అయ్యవారిపేట, లొద్దపుట్టి వరకు యాత్ర సాగింది. విరామం అనంతరం ముగింపు పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం మళ్లీ పాదయాత్రగా ఇచ్ఛాపురం పట్టణానికి చేరుకుని బహిరంగ సభను నిర్వహించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో పాదయాత్ర ఆద్యంతం అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. ముగింపు రోజు కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభం నుం చి వేదమంత్రాలు, శంఖారావం, కోలాటాలు, బిందెల నృత్యాలతో జగన్కు స్వాగతం పలి కారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోకి జగన్ రాగానే మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఘన స్వాగతం పలికారు. రైతుల కళ్లల్లోఆనందం చూడాలని.. పాదయాత్ర ముగింపు సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతన్న కళ్లల్లో ఆనందం చూడాలని అనడంతో రైతులంతా హర్షం ప్రకటించారు. పంటలకు ఏటా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని, అలాగే ముందస్తు పెట్టుబడిగా మే నెలలో ప్రతి రైతుకు రూ.12500 నేరుగా ఇస్తామని ప్రకటించడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే రైతులు వినియోగించే ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేస్తామని, రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని, ఉచితంగా బోర్లు వేయిస్తామని, అలాగే రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి, అలాగే పంట భీమాను ఇక రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేసి, రైతన్న ఆదాయం పెంచుతామని జగన్ ప్రకటించడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం లక్షలాది మంది రైతులకు ఆసరాగా మారనుంది. మరో మూడు నెలల్లో.. రాష్ట్రంలో మరో మూడు నెలల్లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నవరత్నాల అమలుతో ప్రజలకు సంక్షేమం చేరవవుతుంది. టీడీపీ చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి.– కంబాల జోగులు,ఎమ్మెల్యే, రాజాం. ఇది చరిత్ర ఇచ్ఛాపురం చరిత్రలో నిలిచి పోతుంది. పాదయాత్ర ముగింపు, పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభ నిర్వహణ చిరస్థాయిగా నిలిచి పోతాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై పూర్తి దృష్టి పెడుతుంది. తిత్లీ బాధిత రైతులను ఆదుకుంటుంది. –పిరియా సాయిరాజ్,ఇచ్ఛాపురం వైఎస్ఆర్ సీపీ సమన్వయ కర్త,మాజీ ఎమ్మెల్యే జగన్ పేదల మనిషి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల మనిషి, పేద ప్రజలకు సేవ చేయాలన్న తపన ఆయనలో ఉంది. రాష్ట్రానికి 30 ఏళ్లు సీఎంగా కొనసాగుతారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు ఓపికగా విన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నిం పారు. విద్య, వైద్యం, సంక్షేమం అన్ని రంగాల్లో ప్రగతికి కృషి చేస్తారు. – తమ్మినేని సీతారాం,పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పాలనలో విఫలం టీడీపీ ప్రభుత్వం పూర్తిగా పాలనలో విఫలమైంది. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోంది. టీడీపీ నాయకులు ప్రజాధనం దోచుకుంటున్నారు. అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.– పేరాడ తిలక్, టెక్కలి, సమన్వయకర్త రాక్షస పాలనకు అంతం తప్పదు ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు రాష్ట్రం రావణ కాష్టంగా ఉండేది. వైఎస్సార్ పాదయాత్రను విజయవంతం చేసి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. మళ్లీ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. మరి కొద్ది రోజుల్లో ధర్మమైన ప్రజా తీర్పుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. – దువ్వాడ శ్రీనివాస్, వైఎస్సార్ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త. విజయం అందజేయాలి సుమారు 14 నెలల పాటు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. గ్రామ స్థాయిలో నవరత్నాలు, ఫ్యాన్ గుర్తుపై ప్రచారం చేసి రాబోయే ఎన్నికల్లో జగనన్నకు సీఎం చేయాలి.– విశ్వాసరాయి కళావతి,ఎమ్మెల్యే, పాలకొండ -
341వ రోజు పాదయాత్ర డైరీ
-
సమయపాలన,క్రమశిక్షణలో జగన్ను మించినవారు లేరు
-
సీఎంగా చూడాలని ఆకాంక్ష..
శ్రీకాకుళం :పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎనలేని ప్రజాదరణ వచ్చింది. ప్రజల సమస్యలు తెలుసుకునే వారే నిజమైన నాయకులు. అలా.. జనంలో నడిచి వారి కష్ట,సుఖాలు తెలుసుకున్నారు. వారి బాధలు తీర్చడానికి భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల వారు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నారు.– పి.నాని, వ్యాపారవేత్త, విశాఖపట్నం -
వచ్చేది రైతు రాజ్యమే!
-
విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద సందడి వాతావరణం
-
గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టాలి...
శ్రీకాకుళం :గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి. ప్రజా సంకల్పయాత్ర చేపట్టి ప్రజల బాధలు, కష్టాలు తెలుసుకోవాలన్న సంకల్పం ఎంతో మంచిది. జనం వద్దకే వెళ్లి జనం సమస్యలు తెలుసుకున్న నాయకుడిగా జగన్మోహన్రెడ్డి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు.– పడాల రామారావు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, తూముకొండ రామచంద్రాపురం, మెళియాపుట్టి మండలం -
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర
శ్రీకాకుళం :ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగిన పాదయాత్రలో జన హృదయాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుచుకున్నారు. బడగు, బలహీన వర్గాలు కష్టాలను తెలుసుకున్నారు. వారికి భరోసానిస్తూ ముందుకు సాగిన తీరు రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోతుంది.– డాక్టర్ బి.కాశినాయుడు,రిటైర్డ్ డీఎంహెచ్ఓ, బలిజిపేట, విజయనగరం జిల్లా -
దివ్యాంగులను పట్టించుకోని టీడీపీ
శ్రీకాకుళం :దివ్యాంగులను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. అంగవైకల్యంతో బాధపడుతున్నాను. పెన్షన్కు దరఖాస్తు చేసినా జన్మభూమి కమిటీలు తొలగించాయి. హిందీ బీఈడీ పూర్తి చేసి డీఎస్సీ రాశాను. పోస్టులు తక్కువగా ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించాలి.– ఏదురు భారతి, కొత్త కొజ్జీరియా, ఇచ్ఛాపురం మండలం -
ఆపరేషన్ చేయించి ఆదుకోండి..
శ్రీకాకుళం :క్యాన్సర్తో బాధపడుతున్నాను. ముంబైలో ఆపరేషన్ కూడా చేశారు. మళ్లీ ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మా వద్ద డబ్బులు లేవు. మీరే ఆదుకోవాలన్నా.. – నెయ్యిల చంద్రమణి,అయ్యవారిపేట, ఇచ్ఛాపురం మండలం -
జనాల కష్టం తెలుసుకున్నారు
శ్రీకాకుళం :పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల ముందుకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్న నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు. రానున్నది రాజన్న రాజ్యమే. ఆంధ్రప్రదేశ్కు సువర్ణ యుగం రాబోతోంది. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. నవరత్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది.బి.కోటేశ్వరరావు నాయక్,అíసిస్టెంట్ ప్రొఫెసర్, గుంటూరు పశువులకు బీమా ఇవ్వాలి మా జిల్లాలో యాదవ సామాజిక వర్గం అన్ని రకాలుగా వెనుకబడి ఉంది. మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. పశువుల కాపరులకు ప్రమాద బీమాగా రూ. 10 లక్షలు వర్తింప జేయాలి. బీసీ–డీ నుంచి బీసీ–ఏగా మార్పు చేయాలి. ప్రమాదవశాత్తు గొర్రెలు మృతి చెందితే రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, గొర్రెలు పెంపకం సొసైటీలు ఏర్పాటు చేయాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అందరికీ న్యాయం జరుగుతుంది.ఎం.వెంకటరావు, యాదవ సంఘ ప్రతినిధి -
జగన్తోనే పేదలకు న్యాయం
శ్రీకాకుళం :దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు అందించిన రామరాజ్యాన్ని నేడు తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తాడన్నది ప్రజాసంకల్పయాత్ర ద్వారా రూఢీ అయింది. లక్షలాది జనం ఆయన పాలన కోసం ఎదురు చూస్తున్నారు. మేమైతే వైఎస్ కుటుంబం కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు అమలైతేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతోంది.– రుద్ర వెంకటరావు, వేపాడ, విజయనగరం జిల్లా -
రాజధాని అంతా గ్రాఫిక్సే
శ్రీకాకుళం :రాజధాని భూములిస్తే మూడున్నరేళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినా కార్యరూపం దాల్చలేదు. నాలుగున్నరేళ్లు ముగుస్తున్నా ఇంత వరకూ ప్లాట్ల అభివృద్ధి జరగలేదు. మా భూముల్లో ప్రభుత్వమే హ్యాపీనెస్ట్ పేరుతో రియల్ వ్యాపారానికి తెరతీయడం సిగ్గుచేటు. రాజధానిలో ఒక్క నిర్మాణం కూడా జరగలేదు. పత్రికలు, టీవీల్లో చూపించేదంతా గ్రాఫిక్సే. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా సమస్యలు పరిష్కారిస్తారని హామీ ఇచ్చారు. – తుమ్మూరు రమణా రెడ్డి, రాజధాని రైతు -
సాగునీటి కాలువ బాగుచేయండి
శ్రీకాకుళం : ధర్మపురం గ్రామంలో సాగునీటి కాలువను అభివృద్ధి చేయాలి. 2000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువ పనులు 1954లో చేపట్టారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా పాడైంది. దీంతో ఏటా సాగునీటి సమస్యలు తప్పడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక కాలువల అభివృద్ధిపై దృష్టి సారించాలి.– ధర్మరాజురెడ్డి బృందం, ధర్మవరం, ఇచ్ఛాపురం మండలం -
అభయ ప్రదాత
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిచేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర అనే మహోన్నత అధ్యాయం ముగిసింది. పేదలకు తమకంటూ ఓ నాయకుడు ఉన్నాడన్న నమ్మకం కలిగించింది. త్వరలోనే కష్టాలన్నీ పరిష్కారమవుతాయనే భరోసా ఇచ్చింది. యాత్ర చివరి రోజైన బుధవారం ఇచ్ఛాపురంలో జరిగిన పాదయాత్రలో సామాన్యులతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు రాజన్న బిడ్డను కలిసి తమ ఆవేదనలు, ఆకాంక్షలు విన్నవించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి సమస్యలు పరిష్కరిస్తానని జగన్ అభయమివ్వడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా నుంచి వచ్చా.. చంద్రబాబు చేసిన అవినీతి సొమ్ముతో ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించుకోవచ్చు. అంతటి అవినీతిని ప్రజలకు తెలిసేలా అవినీతి చక్రవర్తి పేరిట ఆధారాలతో సహా పుస్తక రూపంలో ప్రజలందరికి అందుబాటులోనికి తీసుకురావడం శుభపరిణామం. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించి రాజన్న రాజ్యం తీసుకురావాలి. సౌదీఅరేబియాలో ఉద్యోగం చేస్తున్న నేను ఈ ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు ఇక్కడికి వచ్చాను.– హర్షద్ అయూబ్, పులివెందుల నిరుద్యోగులకు తీరని నష్టం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు పూర్తిగా నష్టపోయారు. ఏటా డీఎస్సీ అని, ఎన్నికలు వస్తున్నాయని ఆదరాబాదరాగా పరీక్షలు నిర్వహించడం వల్ల చాలా మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. నాలుగేళ్లుగా నోటిఫికేషన్లు రాక చాలామంది అర్హత కోల్పోయారు. ప్రభుత్వ శాఖాల్లో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసిన ఉద్యోగాలను టీడీపీ నాయకులు వారి చెప్పిన వారికే కేటాయించుకొని మరింతగా మోసం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.– సప్ప చిరంజీవి, ఇచ్ఛాపురం జగనన్న హామీలతో భరోసా ప్రజలకు భరోసా జగనన్న హామీలే. జనసంద్రంతో ఇచ్ఛాపురం ఉప్పొంగింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనడానికి లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలే ఉదాహరణ. ముగింపు సభకు మేమంతా ఎంతో ఉత్సాహంగా ఇక్కడకు వచ్చాం. సగం గెలుపు ఇక్కడే అన్నది జగనన్న మాటలు, వరాల్లో స్పష్టమైంది.– పెద్దిశెటి శేఖర్,వైఎస్సార్సీపీ యువజన అధ్యక్షుడు, పరవాడ, విశాఖపట్నం మైనార్టీలకు వరం మైనార్టీలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ వరంగా మేమంతా భావిస్తున్నాం. ప్రజాసంకల్ప యాత్రలో మైనార్టీలకు సబ్ప్లాన్, బడుగు, బలహీన వర్గాల ముస్లింలకు ఆయన ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. జగన్మోహన్రెడ్డితో మా బతుకులు బాగుపడతాయన్నది ముమ్మాటికీ నిజం. ముస్లిం సోదరులంతా వైఎస్సార్ సీపీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. – షేక్ మహబూబ్ బాషా,నంద్యాల, కర్నూలు జిల్లా -
ఔరా.. అవినీతి చక్రవర్తి!
కంచిలి/కవిటి: నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతిపై ఆవిష్కరించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం ప్రజా సంకల్ప యాత్రలో హైలెట్గా మారింది. పాదయాత్రకు వచ్చిన ప్రజలు ఈ పుస్తకాలను ఎవరికివారుగా వచ్చి తీసుకుని.. ఆద్యంతం ఆసక్తిగా చదవడం కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన ప్రజలు.. నిర్వాహకుల నుంచి ఈ పుస్తకాలు తీసుకునేందుకు పోటీపడ్డారు. కేవలం రెండు గంటల్లోనే వేలాది కాపీలను దక్కించుకున్నారు. ఈ పుస్తకంలో వివరించిన అవినీతి బాగోతాలపై ఫేస్బుక్లు, వాట్సాప్ తదితర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టడంతో క్షణాల్లోనే అవి ప్రపంచం నలుమూలలకు చేరాయి. పుస్తకాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ వాటిలో ప్రచురించిన 143 అంశాలను ఆసక్తి చదవడం కనిపించింది. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో జరిగిన అవినీతి, లక్షల కోట్ల దోపిడీ, అమరావతి ఒక అంతర్జాతీయ కుంభకోణం, తన స్వార్థం కోసం అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన వైనం.. తదితర అంశాలను ఈ పుస్తకం సాక్ష్యాధారాలతో సహా వివరించిందని పలువురు పేర్కొన్నారు. సరైన సమయంలో పుస్తకాన్ని విడుదల చేశారని పలువురు కితాబిచ్చారు. దోపిడీ, అవినీతి పాలనను కళ్లకుకట్టింది నాలుగున్నరేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, దోపిడీ పాలనను ఈ పుస్తకం కళ్లకుకట్టింది. ఏ ఏ రంగంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో.. శాఖాపరమైన జీవోలను ఉటంకిస్తూ ఆధారాలతో సహా తెలియజేసింది. ఈ పుస్తకాన్ని చదువుతుంటే ఈ పాలనపై అసహ్యం వేస్తోంది. – బట్టి మాధవరావు, మత్స్యకార ఐక్యవేదిక నాయకుడు, శ్రీకాకుళం ఆధారాలతో వివరించిన తీరు అద్భుతం వరి ఉత్పత్తిలో అత్యంత కీలకమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పచ్చని పంటపొలాలను రైతుల నుంచి లాక్కున్న తీరు దారుణం. నిబంధనలు తోసి రాజని భూదందా నిర్వహించిన విధానం చాలామంది ప్రజలకు పూర్తిగా తెలియని విషయం. ఆయా అంశాలను ‘అవినీతి చక్రవర్తి’లో ఆధారాలతో సహా వివరించిన తీరు అద్భుతం. – మర్రెడి సాంబిరెడ్డి, నిడమర్రు, గుంటూరు జిల్లా. తవ్వేకొద్ది అవినీతి.. చంద్రబాబుది చంద్రబాబు చేసిన అవినీతి తవ్వేకొద్ది మరింత బయటపడుతోంది. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతిన్నారు. ఆయన అవినీతి బాగోతాన్ని అట్టడుగు వర్గాలకు సైతం ఈ పుస్తకం ద్వారా తెలియజేసే అవకాశం దక్కినట్టయింది. – శెట్టి రవీంద్రబాబు, అరకు, విశాఖపట్నం జిల్లా -
వీడలేమంటూ.. వీడుకోలంటూ..
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇంటికొచ్చిన చుట్టాన్ని వీడ్కోలు పలికే సమయంలో హృదయం బరువెక్కుతుంది.. కళ్ల వెంట నీళ్లు వస్తాయి.. అలాంటిది పద్నాలుగు నెలల బంధం విడిపోతుంటే ఆ హృదయ వేదనకు కొలమానం ఉంటుందా..? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కచ్చితంగా ఇలాంటి సన్నివేశాలే బుధవారం ఆవిష్కృతమయ్యాయి. ఏడాదికిపైగా జననేత వెంట ఉండి.. ప్రతీరోజూ ఆయన అడుగులో అడుగులేస్తూ, ప్రజా సంకల్పయాత్రలో ఏదో ఒక బాధ్యతను భుజానికెత్తుకున్న వాళ్లు అనేకమంది ఉన్నారు. ఏ బాధ్యత లేకపోయినా అభిమాన నేతకు మద్దతుగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురానికి పాదయాత్ర చేసిన వాళ్లూ అనేకులున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి విశ్రమించే వరకూ వాళ్లకు వాళ్లే ఆత్మీయ బంధువులు. ఈ మహాయజ్ఞంలో తాము భాగస్వాములు కావాలన్నదే వారందరి ఏకైక ఆశయం. 14 నెలలుగా వైఎస్ జగన్ బస వద్దే వీళ్లంతా ఉన్నారు. నిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా కన్పించే వీరిలో పాదయాత్ర ముగింపుతో ఎంతో మార్పు కనిపించింది. హావభావాల్లో తేడా.. మాటల్లో భావోద్వేగం.. స్వరం జీరబోవడం.. ఏదో కోల్పోతున్నామనే భావన వీరిలో స్పష్టంగా ప్రతిబింబించింది. మళ్లీ ఎప్పుడు కలుస్తామో! వైఎస్ జగన్ బసచేసే శిబిరం వద్ద బుధవారం ఉదయం నుంచే వీడ్కోలు కార్యక్రమం మొదలైంది. ‘ఇవ్వాళే ఆఖరు.. మళ్లీ మనం ఎప్పుడు కలుస్తామో’.. అంటూ ఒకరికొకరు ఆత్మీయంగా హత్తుకుని వీడ్కోలు చెప్పుకున్నారు. ఆఖరిసారిగా కలిసి అల్పాహారం చేయాలని ఒకరినొకరు స్వాగతించుకోవడంతో శిబిరం వద్ద ఉద్విగ్న సన్నివేశాన్ని తలపించింది. టెంట్ వేసే వారు కొందరు.. వాహనాలు తిప్పేవారు మరికొందరు.. పాదయాత్ర ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే బాధ్యత మరికొందరిది.. ఎవరే పనిలో ఉన్నా రాత్రి అన్నదమ్ముల్లా ఒకేచోట కలిసి భోజనం చేయడం అలవాటుగా మారింది. ఊరికి సమీపంలో ఉండే టెంట్ వద్దే ఉదయం స్నానాలు చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. ఒక్కోసారి చిన్నచిన్న అభిప్రాయభేదాలు వచ్చినా అంతలోనే సర్దుకుపోయే వాళ్లమని తెలిపారు. బహుమతులు.. కలిసి ఫొటోలు జననేత రోప్ పార్టీలో ఉన్నవాళ్లు రోజంతా బిజీగానే ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాయకుడిని అంటిపెట్టుకుని ఉండాల్సిందే. వీరిలో ఏడాదిగా ఊరెళ్లని వారూ ఉన్నారు. చాలామంది అక్కడి వాతావరణానికే అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర ముగియడంతో ఇప్పటివరకూ కలిసి మెలిసి ఉన్న వారు దూరమవడాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ‘అన్నా.. ఒక్క ఫొటో దిగుదాం. చూసుకున్నప్పుడల్లా గుర్తుండిపోవాలి’.. రోప్ పార్టీలోని ఓ వ్యక్తి తన సహచరులతో కన్నీటిపర్యంతమవుతూ అన్న మాటలివి. గుండె పగిలే ఏడుపొస్తోందన్నా.. పాదయాత్రలో ఏడాదికి పైగా పనిచేశా. ఈ కాలంలో ఎంతోమంది పరిచయమయ్యారు. కష్టాలు పంచుకున్నాం. ఇష్టాలు చెప్పుకున్నాం. యాత్రలో కలిసి పనిచేసిన మేం ఓ పెద్ద కుటుంబంలా ఉన్నాం. ఇలా వీడ్కోలు చెప్పుకునే రోజు వచ్చిందని తెలిసి కన్నీరు పెట్టనివారు లేరు. ఉదయం నుంచి నాకు ఎన్నిసార్లు బాధేసిందో. నాలో నేనే కన్నీళ్లు పెట్టుకున్నా. – వై. లక్ష్మారెడ్డి (ఓఎస్డీ డ్రైవర్) ఇంటికెళ్లాలంటే బాధేస్తోంది ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ అన్నతో కలిసి పాదయాత్ర చేశా. వందల మంది నాకు ఆత్మీయులయ్యారు. సెలవుకు ఇంటికెళ్లినా మళ్లీ ఎప్పుడు టెంట్ దగ్గరకొస్తాననే నా ప్రాణం లాగేది. ఎన్ని కష్టాలున్నా అందరం పంచుకునే వాళ్లం. ఒకేచోట తినడం, ఒకేచోట పడుకోవడం. ఇంతకన్నా సమైక్యత ఎక్కడుంటుంది? – ప్రశాంత్ నిద్రలోనూ పాదయాత్ర ఆలోచనే ఆరంభం నుంచి చివరివరకూ పాదయాత్ర వాహనాల నిర్వహణ బాధ్యత నాదే. రోజంతా చాలా బిజీగా ఉండేవాడ్ని. అంతా నా వాళ్లే.. నా ఇల్లే అన్న ఫీలింగ్ ఉండేది. నిద్రపోతున్నా పాదయాత్రలో వాహనాలెక్కడున్నాయి? ఏ డ్రైవర్ ఏం చేస్తున్నాడనే కలవరింతే ఉండేది. జగన్ అధికారంలోకి వస్తాడని జనం చెప్పుకుంటుంటే చాలా ఆనందం అనిపించేది. – జనార్థన్ బాసటగా బాటసారులు! జగన్తో కలసి ఏడాదికిపైగా యాత్రలో పాల్గొంటున్న సైనికులు’ వారంతా అలుపెరగని యాత్రికుడితో కలసి సాగుతున్న సైన్యం.. ప్రజల కష్టాలను కళ్లారా చూస్తూ.. వేల కిలోమీటర్లు అధిగమిస్తూ.. శారీరక బాధను దిగమింగుకుంటూ జనం మోములో చిరునవ్వు కోసం పరితపిస్తున్న ప్రజాసంకల్ప సారథి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన యజ్ఞంలో తోడుగా నిలిచారు. ఎండా వానలకు వెరవకుండా ప్రకృతి పెట్టిన పరీక్షలో నెగ్గారు. పట్టుసడలని ఉక్కు సంకల్పంతో ప్రజల వద్దకు వచ్చిన జగన్కు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు అండగా ఉన్నారు. నూనూగు మీసాల యువకుల నుంచి ఏడు పదులు దాటిన పెద్దలు, దివ్యాంగుల నుంచి కళాకారుల వరకు ఎందరో ప్రతిపక్ష నేత అడుగుల్లో అడుగులు వేస్తూ చరిత్రలో భాగస్వాములయ్యారు. వైఎస్ జగన్ తమను పేరుపేరునా ప్రేమగా పిలిచి పలకరిస్తుంటే అది చాలని తృప్తిగా చెబుతారు. జగన్ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను డైరీలో నోట్ చేశామని, దీన్ని ఆయనకు కానుకగా అందచేయనున్నట్లు శ్రీకాకుళానికి చెందిన ఎన్ని శంకరరావు చెప్పారు. జగన్ను సీఎం చేసిన తర్వాతే ఇంటికి రావాలని తన భార్య చెప్పి పంపినట్లు కాంట్రాక్టు ఉద్యోగాన్ని సైతం వదులుకుని పాదయాత్రలో పాల్గొంటున్న అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన వి.శంకర్ తెలిపారు. తన తల్లి చనిపోతే జగన్ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారని గుంటూరుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త పురుషోత్తమ్ గుర్తు చేసుకున్నారు. దాహార్తిని తీర్చిన మంచినీటి వ్యాన్ ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్నవారి దాహార్తిని తీర్చిన ఘనత ఈ వ్యాన్ది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నిరంతరాయంగా నీటిని సరఫరా చేసింది. ప్రకాశం జిల్లాకు చెందిన బుల్లెట్ కృష్ణారెడ్డి ఈ మినీవాటర్ ట్యాంకర్ ఉన్న వ్యాన్ను సమకూర్చి మండు వేసవిలో సైతం చల్లటి నీటిని అందించారు. -
సమష్టి కృషితో..
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మనం ఏదైనా చిన్న కార్యక్రమం తలపెడితే ఎన్నో ప్రణాళికలు, మరెన్నో ఉప ప్రణాళికలు, ఇంకెన్నో సర్దుబాట్లు.. మార్పులు, చేర్పులు చేస్తూ అవసరమైన వారందరినీ కలుపుకుంటూ అనుకున్న లక్ష్యం సాధిస్తాం. అటువంటిది ఓ మహాయజ్ఞం విజయవంతం వెనుక ఎంతమంది శ్రమ, మరెంతమంది సహాయ సహకారాలు ఉంటాయో ఊహించలేం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 341 రోజులపాటు నిర్విఘ్నంగా, నిరాటకంగా అప్రతిహతంగా కొనసాగడం వెనుక పట్టుదల, అకుంఠిత దీక్ష, సమిష్టి కృషి, సమయస్ఫూర్తి కనిపిస్తుంది. మహాభారతంలో కౌరవుల దుష్టపాలనను అంతంచేసేందుకు బయల్దేరిన పాండవులకు ప్రతిఒక్కరూ ఒక్కో అస్త్రమై ఏ విధంగా సహకరించారో చంద్రబాబు అవినీతి పాలనపై దండెత్తిన జగన్కు ఆ విధంగా పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు అంతగా సహకరించారు. రూట్ మ్యాప్ ఖరారు మొదలు జగన్ బస, సభ నిర్వహణ వరకు ప్రతి ఒక్కటీ పక్కా ప్రణాళికతో విజయవంతమయ్యాయి. చలి గజగజ వణికిస్తున్నా.. జడి వాన కురుస్తున్నా.. మాడు పగిలిపోయేలా ఎండలు కాస్తున్నా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న తమ నేత జగన్కు అండదండలు అందించారు. జగన్ ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు నడవాలో, ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్లాలో రూట్ మ్యాప్ ఖరారు చేసిన వారు ఒకరైతే ఆయన బస ఏర్పాటుచూసే వారు మరొకరు. అన్నపానీయాలు, ఆరోగ్య సూచనలు, సలహాలు, వ్యాయామం, శిబిరంలో సమీక్షలు, మర్నాటి ప్రణాళికలు, బహిరంగ సభా వేదికల ఖరారు, ప్రసంగాలు.. ఇలా ఎన్నెన్నో వ్యవహారాలను చక్కబెట్టడంలో పార్టీ నేతలు కృతకృత్యులయ్యారు. వీరిలో పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వ్యక్తిగత సహాయకులు కే నాగేశ్వర్రెడ్డి, రవి, పార్టీ ఇతర నేతలు అర్జున్, డాక్టర్ హరికృష్ణ, రఘునాథరెడ్డి, వైద్య సహాయకులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గురుమూర్తి, ట్రాన్స్పోర్టు బాధ్యుడు జనార్ధన్.. ఇలా ఎందరెందరో ఉన్నారు. తమ నాయకుడు ఎక్కడుంటే ఆయనతో పాటు అడుగులో అడుగువేస్తూ ఉండే శ్రేణులు సైతం జగన్ శిబిరం పక్కనే ఉండేవారు. వీరికీ ఎలాంటి లోటు రాకుండా చూశారు. ప్రతీరోజూ రెండు టెంట్లు.. రూట్ మ్యాప్ ఖరారు చేసిన తర్వాత వైఎస్ జగన్ మధ్యాహ్నం, రాత్రి విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లు వేసే బాధ్యతను ఒకరు చేపడితే.. సభా వేదికల ఖరారును రఘునాథరెడ్డి బృందం చేపట్టేది. నిత్యం రెండు గుడారాలను వేయవలసి ఉండేది. మొత్తం మూడు టెంట్లు ఉంటే రెండు ప్రతిరోజూ వేసి ఉంటాయి. మరొకటి రవాణాలో ఉండేది. పాదయాత్ర సాగే మార్గంలోనే జనప్రవాహాన్ని దాటుకుంటూ వీటిని ఒకచోటి నుంచి మరోచోటికి తరలించడం తలకు మించిన పని అయినా ఆ బాధ్యత చేపట్టిన వారు ఎంతో చాకచక్యంతో సమయస్ఫూర్తితో తరలించేవారు. బస కోసం ఎంపిక చేసిన స్థలాన్ని చదును చేయడం మొదలు టెంట్ వేసే వరకు అన్ని పనులను దగ్గరుండి పార్టీ శ్రేణులు చూసుకునే వారు. మధ్యాహ్నం వేసిన టెంట్ను మరుసటి రోజు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునే ప్రాంతానికి చేర్చేవారు. రాత్రి వేసిన టెంట్ను పొద్దున జగన్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత తీసివేసి ఆ మరుసటి రోజు రాత్రి ఎక్కడ బసచేస్తారో అక్కడికి తరలించే వారు. పక్కా ప్రణాళిక.. ఎక్కడ, ఏమిటీ అనేది ఒకసారి ఖరారైన తర్వాత ఎవరు, ఎలా అనేది ముందురోజే ఖరారయ్యేది. ఇందుకోసం ఆయా బాధ్యతలు చేపట్టిన వారు ఆయా ప్రాంతాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ఇతర నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ముందుకు సాగుతుండేవారు. దీంతోపాటు పాదయాత్రలో పాల్గొనే ప్రజలకు సైతం మధ్యాహ్న భోజన సదుపాయం ఉండేది. పాదయాత్రలో వచ్చే వినతులను, ఆరోగ్య సంబంధిత సమస్యలను డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షించేవారు. ప్రతి ఫిర్యాదును కే నాగేశ్వరరెడ్డి, డాక్టర్ హరికృష్ణల ద్వారా కృష్ణమోహన్కు అందితే ఆయన కంప్యూటర్లలో నిక్షిప్తం చేయించే వారు. డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గురుమూర్తి వంటి వారు జగన్ ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టేవారు. ఎందరో సారథులు.. రూట్మ్యాప్ ఖరారు మొదలు బహిరంగ సభల ఏర్పాటు వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బృందం చూసేవారు. రూట్ పరిశీలన వంటి వాటిని అర్జున్ పర్యవేక్షించే వారు. జగన్ వ్యక్తిగత భద్రత, రవాణా, గుడారాల ఏర్పాటు వంటి పనులను రఘునాథరెడ్డి, జనార్ధన్ పర్యవేక్షించే వారు. పార్టీ నేతలను సమన్వయం చేసుకునే వారు కె.నాగేశ్వర్రెడ్డి. జగన్కు అవసరమైన సమాచారాన్నీ, వ్యక్తిగత వ్యవహారాలను, ముఖ్య విషయాల్లో అధ్యక్షుడికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంవంటి అంశాలను ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి నిర్వర్తించేవారు. పాదయాత్రలో జగన్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యక్తిగత సహాయకునిగా రవి వ్యవహరించే వారు. జాతీయ మీడియాతో.. -
‘విజయ సంకల్పం’ ఆవిష్కృతం
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఓ వైపు 16వ నంబర్ జాతీయ రహదారి.. మరోవైపు ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా నిలిచిన విజయ సంకల్ప స్థూపం. జన జాతర.. గాల్లోకి ఎగసిన బెలూన్లు.. బాణసంచా పేలుళ్లు.. జై జగన్.. జై జై జగన్.. కాబోయే సీఎం అంటూ మిన్నంటిన నినాదాల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ప్రజల హర్షధ్వానాలు, కరతాళ ధ్వనుల మధ్య విజయ సంకల్ప స్థూపాన్ని ఆవిష్కరించారు. 2017, నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా దీనిని ఆవిష్కరించారు. వేలాది మందితో పాదయాత్రగా వచ్చిన జగన్ స్థూపం ప్రాంగణంలోకి వెళ్లి ఆసాంతం పరిశీలించారు. వివిధ మతాలకు చెందిన పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడున్న పార్టీ సీనియర్ నేతలు, ఇతర ప్రముఖులను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయనకు విజయ సంకల్ప స్థూపం నమూనాను అందజేశారు. మూడు అంతస్తులతో నిర్మించిన ఈ స్థూపం చరిత్రాత్మకమైనదిగా నిలిచిపోతుందని పార్టీ నేతలు వివరించారు. జనం గుండె చప్పుళ్లకు ప్రతీక.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ 3,648 కిలోమీటర్ల దూరం నడిచి నూతన అధ్యాయాన్ని లిఖించారు. ఆత్మ విశ్వాసానికి, విజయ సంకల్పానికి సూచికగా 91 అడుగుల ఎత్తులో ఈ స్థూపాన్ని నిర్మించారు. లక్షలాది ప్రజల గుండె చప్పుళ్లకు ఇది చిహ్నంలా నిలిచింది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు తమ పాదయాత్రల ముగింపు సందర్భంగా స్థూపాలు నిర్మితమైన ఏకైక ప్రాంతంగా ఇచ్ఛాపురం నిలిచింది. వైఎస్సార్, ఆయన కుమార్తె షర్మిల పాదయాత్ర ముగింపులకు కూడా ఇచ్ఛాపురమే వేదికైంది. ఈ సందర్భంగా స్థూపాలు నిర్మించారు. జాతరను తలపించిన స్థూప ప్రాంగణం ఈ స్థూపం ప్రాంతమంతా జన జాతరను తలపించింది. అక్కడికి చేరుకున్న జనమంతా ఆ స్థూపాన్ని ఆసక్తిగా తిలకించారు. ఫొటోలు దిగారు. జగన్ వచ్చి ఆవిష్కరించేంత వరకు అదరూ స్థూపం గురించే చర్చించుకున్నారు. స్థూపాన్ని ఆవిష్కరించాక వేలాది మంది జనం మధ్య వైఎస్ జగన్ బహుదా నది మీదుగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఇచ్ఛాపురం పట్టణంలోకి ప్రవేశించారు. కృష్ణా జిల్లా ప్రజలు నాతో ఓ మాటన్నారు. మా అల్లుడుగారు (చంద్రబాబు) ఇక్కడికి ఇల్లరికం వచ్చారన్నా. ఎన్టీఆర్ ఇల్లునే కాదు.. పార్టీనే కాదు.. చివరకు రాష్ట్రాన్నే దోచుకుతిన్నారని చెబుతున్నారు. ఇలాంటి మోసాలు చేసే, అబద్ధాలు చెప్పే వ్యక్తిని పొరపాటున క్షమిస్తే.. తానేమీ చెయ్యకపోయినా అన్నీ చేసినట్టు బుకాయిస్తాడు. అన్నీ ఇచ్చానని, ప్రజలు కేరింతలు కొడుతున్నారని ఎల్లో మీడియాలో రాయిస్తాడు. – ఉయ్యూరు సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చంద్రబాబు మాత్రం ఆయన, ఆయన బినామీలతో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి, రైతుల్ని మోసగిస్తూ అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ రహస్యాలు కాపాడతానని, అవినీతికి తావు లేకుండా చేస్తాం అని ప్రమాణం చేసిన ఈ పెద్దమనిషి.. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన బినామీలకు చెప్పి దగ్గరుండి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినందుకు, రైతుల్ని మోసం చేసినందుకు బొక్కలో వేయాల్సిన పని లేదా? – విజయవాడ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రతి సభలోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రసంగం ఉత్తేజభరితంగా సాగింది. మాటలు తూటాల్లా పేలాయి. వాటిలో మచ్చుకు కొన్ని... ‘జన్మభూమి కమిటీలుండవు, ఎవరికీ ఒక్క రూపాయి లంచమిచ్చే పరిస్థితి ఉండదు. అప్పులను చూసి ఎవరూ భయపడొద్దు. ఎన్నికల నాటికి మీ అప్పులు ఎంతైతే ఉన్నాయో.. ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల చేతికే అందేలా చేస్తానని హామీ ఇస్తున్నా.’ ‘చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మళ్లీ ఇపుడు నాలుగేళ్లుగా ఆయనే సీఎం కుర్చీలో కూర్చున్నారు. దీంతో మద్య నిషేధం గోవిందా.. అందాక ఉన్న 2 రూపాయలకు కిలో బియ్యం సబ్సిడీ గోవిందా.. అందాక ధైర్యంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా గోవిందా.. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గోవిందా.. వ్యవసాయం గోవిందా.. వర్షాలు గోవిందా.. ఇళ్ల నిర్మాణం గోవిందా.. పెన్షన్లన్నీ గోవిందా.. అన్నీ గోవిందానే..’ రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలతో రేషన్ షాపుల స్థానంలో బడా మాల్స్ పెట్టిస్తారట. వీటిల్లో ప్రజలకు సరుకులు 20 శాతం తక్కువ ధరకు లభిస్తాయని చెబుతున్నారు. ఇంతకు ముందు రేషన్ షాపుల్లో 20 శాతం కాదయ్యా.. 60 శాతం తక్కువ ధరకు దొరికేవయ్యా.. చంద్రబాబు గారూ.. – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చంద్రబాబూ.. నేను సూటిగా అడుగుతున్నా.. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యకు టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చింది నువ్వు కాదా? నీ బావమరిది బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీస్తున్నాడు. ఆ షూటింగ్ సెట్స్లో వెంకయ్యనాయుడు కన్పించడం లేదా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనేందుకు అడ్డగోలుగా నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన నువ్వు.. బీజేపీతో కక్కుర్తి పడ్డావు కాబట్టే ఇవాల్టి వరకూ అరెస్టు కాకుండా తిరగగలుగుతున్నావనేది నిజం కాదా? రాష్ట్రంలో చంద్రబాబు, ఈయన కొడుకు చెయ్యని అవినీతి లేదు. ఇసుక నుంచి మొదలు పెడితే మట్టిదాకా.. బొగ్గు, కరెంట్ కొనుగోళ్లు, రాజధాని భూములు, విశాఖ అసైన్డ్ భూములు.. చివరకు గుడి భూములు కూడా వదలకుండా దోచేస్తున్న పరిస్థితి వాస్తవం కాదా? ఈ నాలుగేళ్ల కాలంలో అక్షరాల నాలుగు లక్షల కోట్ల రూపాయలు సంపాదించావ్. అయినా నీ మీద సీబీఐ విచారణ జరగకుండా కాలం వెళ్లబుచ్చుతున్నావంటే నీకు, బీజేపీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టే కదా చంద్రబాబూ? సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టులో మీకు నచ్చిన కాంట్రాక్టర్లను బినామీలుగా తీసుకొచ్చి, నామినేషన్ పద్ధతిలో మీ ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచి అక్షరాల రూ.1,853 కోట్లు లూటీ చేశారని కాగ్ నివేదిక చెప్పినా, నీ మీద సీబీఐ విచారణ జరగడం లేదంటే.. నీకు, బీజేపీకి సంబంధాలు ఉన్నట్లే కదా చంద్రబాబూ? నువ్వీమధ్య నీతి ఆయోగ్ సమావేశం జరిగినప్పుడు ఢిల్లీకెళ్లావు. అక్కడ మోదీ కన్పిస్తే నువ్వు చేసిందేంటి? ఆయనకు వంగి వంగి నమస్కారం పెట్టడం నిజం కాదా? చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మా మిత్రుడని నిండు లోక్సభలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనడం నిజం కాదా? – విజయనగరం సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 2014 ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్కు వేసినట్లే అని చంద్రబాబు అన్నాడు. బీజేపీతో జత కట్టాడు. ఇప్పుడు జగన్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనంటాడు. కాంగ్రెస్తో జత కడతాడు. ఆయనకు మంచిదన్నది ఈనాడుకు మంచిదవుతుంది.. అదే రాస్తుంది. టీవీలలో చూపిస్తారు. ఈయన తానా అంటే ఎల్లోమీడియా తందానా అంటుంది. – సబ్బవరం సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చెరువులను బాగు పరచాలంటే మూడడుగులు తవ్వితే ఫర్వాలేదు.. సిల్ట్ తీస్తున్నారులే అనుకోవచ్చు. కానీ పూడిక తీత అని నామకరణం చేసి, దానికి నీరు–చెట్టు అని పేరుపెట్టి ఏకంగా 50 అడుగుల వరకూ తవ్వేస్తే నీళ్లందక రైతులు అగచాట్లు పడుతున్నారు. ముఖ్యమంత్రే దగ్గరుండి ఇలా దోచుకోవడం సబబేనా? – గన్నవరం సభలో వైఎస్ జగన్ ఇక్కడి ఇసుక విశాఖ వెళ్తోందని, లారీ రూ.30 వేలకు అమ్మకుంటున్నారని ప్రజలు చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం ఇసుక ఉచితంగా ఇస్తున్నామని చెబుతున్నాడు. మీకు ఇసుక ఉచితంగా ఇస్తున్నారా? ఎవరికిస్తున్నారో తెలుసా? చంద్రబాబు బినామీలకు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారు. అవి చినబాబు దగ్గరకు పోతున్నాయి. అక్కడి నుంచి పెదబాబు దగ్గరకెళ్తున్నాయి. వ్యవస్థ ఇంతగా దిగజారింది. ఇవాళ ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. జేఎన్టీయూ లెక్చరర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బంది. ఏఎన్ఎమ్లు, సెకెండ్ ఏఎన్ఎమ్లు, విద్యుత్ రంగంలోని కార్మికులు, మోడల్స్ స్కూళ్ల సిబ్బంది, ఆదర్శ రైతులు, గోపాలమిత్రలు, ఆయుష్ ఉద్యోగులు, వీఏవోలు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, అంగన్వాడీలు.. ఇలా అందరిలోనూ అభద్రత నెలకొంది. ఆసుపత్రులసర్వీసులనూ ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే అంతో ఇంతో ఉద్యోగాలొస్తాయి. దాన్ని చంద్రబాబు దగ్గరుండి నీరుగార్చాడు. వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని లెక్క తెల్చారు. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చారా? డీఎస్సీ పరీక్షలు పెట్టడు. కానీ ఆ డీఎస్సీ పరీక్షల కోసం పిల్లలు ప్రిపేర్ కావడానికి టెట్–1, టెట్–2, టెట్–3 అంటాడు. ఈ పెద్దమనిషి వ్యవసాయం దండగన్నాడు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలారేసుకోవాలన్నాడు. ప్రాజెక్టులు కడితే ఖర్చు తప్ప రాబడి ఉండదన్నదీ ఈయనే. సబ్సిడీలు పులిమీద సవారీలాంటివని ఆయన అనడమే కాకుండా..ఏకంగా తన పుస్తకంలో రాసుకున్నాడు.రైతుకు సంబంధించిన అవార్డు ఇలాంటి వ్యక్తికివ్వడం ఆ అవార్డును అవహేళన చేసినట్టు కాదా? చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో వచ్చేదేంటో తెలుసా? కరవు. అందుకే ఆయనకు ఉత్తమ కరవు రత్నఅనే అవార్డు ఇవ్వొచ్చు. కరవొచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆదుకోవాలి. కానీ ఈయన మాత్రం ఆదుకోకుండా వెనకడుగు వేస్తాడు. కుంభకర్ణుడిలా నిద్రపోతాడు. అందుకే ఈయనకు కలియుగ కుంభకర్ణ అనే అవార్డుకచ్చితంగా ఇవ్వొచ్చు. ఆయన సీఎం అవుతూనే సహకార డెయిరీలు, చక్కెర ఫ్యాక్టరీలను దగ్గరుండి మూసేయిస్తాడు. అందుకే ఉత్తమ సహకార రంగ ద్రోహి అనేఅవార్డు కూడా ఇవ్వొచ్చని సిఫార్సు చేస్తున్నా. – గజపతినగరం సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ -
ఆఖరిరోజూ అదే ఆప్యాయత
(ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : తూరుపు దిక్కున మబ్బులు ఎర్రబారుతున్నాయి.. అప్పుడప్పుడే మంచు తెరలు విచ్చుకుంటున్నాయి.. చలిపులి నెమ్మదిగా నిష్క్రమిస్తోంది.. సూర్య కిరణాలు ఎగబాకుతున్నాయి.. అప్పటికే దూర ప్రాంతాల నుంచి జనం రాక మొదలైంది.. చురుక్కుమంటున్న వేడిమితో పాటే జన సందోహం అంతకంతకూ పెరుగుతోంది.. పోలీసులు సమాయత్తమవుతున్నారు.. భద్రతా సిబ్బంది బారులు తీరుతున్నారు.. కాన్వాయి సిద్ధమవుతోంది.. జనం కేరింతలు కొడుతున్నారు.. ఎటుచూసినా కిక్కిరిసిన వాహనాలే.. యువతీ యువకుల కోలాహలం.. జై జగన్ జైజై జగన్ అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి.. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం అగ్రహారం వద్ద ఏర్పాటుచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి శిబిరం వద్ద బుధవారం ఉ.8 గంటల ప్రాంతంలోని దృశ్యమిదీ. తెల్లవారుజాము నుంచే వచ్చీపోయే వాహనాలతో రద్దీగా ఏర్పడిన ఆ ప్రాంతం నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రజా సంకల్పయాత్రలో చిట్టచివరిరోజు పాదయాత్రను ప్రారంభించనుండడమే ఆ ప్రాంతంలో ఇంత సందడికి ప్రధాన కారణం. ఆఖరి ఘట్టంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు అసంఖ్యాకంగా తరలివచ్చిన అశేష జనసందోహం మధ్య ఉదయం సరిగ్గా 8.22 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ తన శిబిరం నుంచి బయటకు వచ్చారు. అదే స్ఫూర్తి, అదే ఆహార్యం.. తెల్లచొక్కా, క్రీమ్ కలర్ పాంటుతో కాళ్లకు బూట్లు ధరించి ముకుళిత హస్తాలతో బయటకు వచ్చిన జగన్కు అప్పటికే గుమికూడిన నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలతో ఎదురేగి అభినందనలు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 2017 నవంబరు 6వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ఏ స్ఫూర్తితోనైతే ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారో సరిగ్గా 341 రోజుల తర్వాత కూడా అదే స్ఫూర్తి, అదే పట్టుదల ఉట్టిపడింది. ప్రసన్న వదనం, చిరునవ్వు, తొణికిసలాడిన ఆత్మవిశ్వాసంతో అందరికీ అభివాదం చేస్తూ ఆయన తన సుదీర్ఘ పాదయాత్రలో తుది ఘట్టాన్ని ముగించారు. మొత్తం 13 జిల్లాల మీదుగా ఇచ్ఛాపురం వరకు ప్రజాసంకల్ప యాత్ర సాగింది. పట్టుదల, విలువలు, విశ్వసనీయత, భరోసా వారసత్వంగా పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ వజ్ర సంకల్పానికి ఇచ్ఛాపురం సాక్షిభూతంగా నిలిచింది. విసుగూ, విరామం ఎరుగక.. విసుగూ, విరామం లేకుండా అందర్నీ అప్యాయతతో పలకరిస్తూ ఆయన తన యాత్రను కొనసాగించడం విశేషం. మధ్యమధ్యలో పార్టీ ప్రముఖులను, ప్రజా ప్రతినిధులను, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన బాధ్యులను, కార్యకర్తలను చిరునవ్వుతో ముచ్చటిస్తూనే తనను కలిసేందుకు వచ్చిన అక్కచెల్లెమ్మలను ఆప్యాయతతో పలకరిస్తూ ముందుకు సాగారు. నడిచింది తానే అయినా నడిపించింది మీరేనని ఆయన ప్రజలకు చెప్పిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. జగన్ పలకరింపుతో పులకరించిన ప్రజలు తమ ఊళ్లకు ముందుగానే సంక్రాంతి వచ్చిందంటూ సంబరపడ్డారు. భోజనాలు చేశారా? మధ్యాహ్నం విశ్రాంతి శిబిరం వద్ద తనను కలిసేందుకు వచ్చిన జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ మీడియా ప్రతినిధులను ఆత్మీయతతో పేరుపేరునా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. భోజనాలు చేశారా? అని ఆరా తీశారు. ప్రజలు తన కోసం వేచి ఉన్నందున నడుస్తూ దారి మధ్యలోనే మాట్లాడుకుందామంటూ వారితో మాటామంతి కలిపారు. జనం తాకిడి ఎక్కువగా ఉన్నా తాను ఏమి చెప్పదలచుకున్నారో దాన్ని సూటిగా చెప్పారు. భవిష్యత్ కార్యాచరణ గురించి మీడియా పదేపదే అడిగినా జనమే నా ఊపిరి, ప్రజలే నా నమ్మకం, విశ్వాసం అని విస్పష్టంగా చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయబోనన్నారు. ప్రజల పదఘట్టనలతో ఓ పక్క దుమ్మూ, ధూళి ఎగిసిపడుతున్నా, మరోపక్క జనం తనను కలిసేందుకు బారులు తీరి ఉన్నా ఎవరినీ నిరాశపరచలేదు. జగన్ యుగపురుషుడని, తమ ఆత్మబంధువని కొందరు చేసిన ప్రశంసలకు సైతం ఆయన చిరునవ్వు, నమస్కారమే సమాధానమైంది. నిద్ర లేచింది మొదలు నడుం వాల్చే వరకు ప్రజలే శ్వాస, ధ్యాసగా ఆయన తన ప్రజాసంకల్ప యాత్రను ముగించారు. చరిత్ర పునరావృతమైంది.. అంతకుముందు.. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఇచ్ఛాపురం పట్టణ సమీపంలోని బహుదా నది వంతెనను దాటినప్పుడు వచ్చిన ప్రజల్ని చూసి చాలామంది చరిత్ర పునరావృతమైందంటూ బెజవాడలో కనకదుర్గమ్మ వారథి ఊగిపోయిన తీరును గుర్తుచేసుకున్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం.. ఇలా అక్కడకు ఏ డిపో నుంచి వచ్చే బస్సు అయినా కిటకిటలాడుతూ కనిపించింది. బస్సుల్లోని ప్రయాణీకులు చేతులు ఊపుతూ జగన్కు అభినందలు తెలిపితే దానికి ప్రతిగా జగన్ రెండు చేతులు జోడించి నమస్కరించారు. ఆటోలు, ద్విచక్ర వాహనాల మీద వచ్చిన వాళ్ల సంఖ్యకు లెక్కేలేదు. ఆఖరి ఘట్టం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ వారిలో స్పష్టంగా కనిపించింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కుమార్తె, జగన్ సోదరి షర్మిలమ్మ కూడా తమ పాదయాత్రలను ఇక్కడే ముగించారు. అక్కున చేర్చుకున్న ఇచ్ఛాపురం.. పాదయాత్రతో పట్టణంలోకి అడుగిడిన జగన్ను ఇచ్ఛాపురం అక్కున చేర్చుకుంది. ఆయన్ను చూసేందుకు ఆబాలగోపాలం పెద్దఎత్తున ఉత్సుకత చూపారు. మేడలు, మిద్దెలు జనసంద్రంతో నిండిపోయాయి. అడుగో జగన్, అడుగడుగో జగన్ అంటూ కేరింతలు కొడుతూ జేజేలు పలికారు. అవ్వా తాతలైతే.. అమ్మ బిడ్డడు ఎట్టయిపోయిండో చూడు అంటూ దూరం నుంచే ఆశీర్వదించారు. చివరి రోజు యాత్ర అంతా ఆయన హావభావాలు, ఆహార్యం, నిరాడంబరత్వం గురించే చర్చ జరిగింది. ఇంత దూరం నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రజలు ముచ్చటించుకోవడం కనిపించింది. ఆరోగ్యం ఎలా ఉంది బాబూ.. ఉదయం ఇచ్ఛాఫురం నియోజకవర్గంలోని అగ్రహాం వద్ద పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం బహిరంగ సభ జరిగేంత వరకూ అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. కొజ్జిరియా గ్రామం చేరే సమయానికే వేలాది మంది ఆయనతో కలిసి అడుగులో అడుగేశారు. కొజ్జిరియా కూడలి ప్రజా సమూహంతో కిటకిటలాడింది. పాత కొజ్జిరియా, ఎ.బలరాంపురం, అయ్యవారిపేట మీదుగా లొద్దపుట్టి వద్ద మధ్యాహ్నం విశ్రాంతి సమయానికి ఆ ప్రాంతమంతా జనప్రభంజనమైంది. ఆయనతో కలిసి నడిచిన వారు కొందరైతే.. సెల్ఫీలు దిగిన వారు మరికొందరు. యాత్ర పొడవునా జగన్ను కలిసేందుకు పెద్దఎత్తున మహిళలు తరలిరావడం విశేషం. ఆయన్ను కలిసిన ప్రతి మహిళా జగన్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. నువ్వు చల్లంగా ఉండాలయ్యా అంటూ ఆశీర్వదించారు. యాత్ర ముగింపు రోజు సైతం ఆయనకు వినతులు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు సాగిన యాత్రలోలాగే తనకు అందిన ఫిర్యాదులను, వినతులను వినమ్రంగా స్వీకరించారు. అక్కడికక్కడ పరిష్కరించదగిన వాటిని అక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని పరిశీలించి ఏమి చేయవచ్చో సూచించమని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. -
సమర శంఖం పూరించిన జగన్
ఇచ్ఛాపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రతిష్టాత్మకమైన రీతిలో సుదీర్ఘమైన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసి చరిత్ర సష్టించిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇచ్ఛాపురం వేదికగా ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. ఉత్తరాన ఉవ్వెత్తున ఎగసి పడిన జనసంద్రం సాక్షిగా భారీ బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఊపును, ఉత్సాహాన్ని నింపింది. సుమారు రెండు గంటల పాటు ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగిన ఆయన ప్రసంగం బాగా ఆకట్టుకుంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో జిత్తుల మారి, మాయావి అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాతో జరిగేది ఇక యుద్ధమేనని ప్రకటించి దిశానిర్దేశనం చేశారు. తన పాదయాత్ర ముగిసిందని, అయితే నారాసురుడితో ఇకపై అలుపెరుగని రీతిలో పోరాటం చేయబోతున్నామని పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. జగన్ తన ప్రసంగంలో ఆత్మవిశ్వాసం తొణికిస లాడింది. ప్రజలు తనకు తోడుగా నిలిస్తే ప్రభుత్వం మోసాలు, అన్యాయాలపై విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేసి పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. జగన్ పాదయాత్ర ముగింపు ఓ మరపురాని ఘట్టం కనుక 13 జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు ఇచ్ఛాపురానికి తరలి వచ్చారు. స్తూపం వద్దకు చేరుకున్నపుడే కార్యకర్తల్లో విజయ సంకల్ప స్థూపం వద్ద ఉత్తేజభరిత వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జగన్ చేసిన ప్రసంగం వారిలో ఇంకా పోరాట పటిమను రేకెత్తించింది. జగన్ అనుకున్నది సాధిస్తాడు పేద ప్రజల పట్ల జగన్కు ఆవేదన ఉందనే విషయం ఆది నుంచీ తెలిసిందేనని, అలుపెరుగకుండా సుమారు దశాబ్ద కాలంగా ఆయన చేసిన పోరాటం వృథాగా పోదని, అనుకున్నది సాధించేదాకా ఆయన నిద్రపోడని తాను విశ్వసిస్తున్నానని వైఎస్సార్ హయాం నుంచీ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న పార్టీ సీఈసీ సభ్యుడు అందారపు సూరిబాబు వ్యాఖ్యానించారు. రాయలసీమ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ వి.గోపాల్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమరం హోరా హోరీగా ఉండబోతోందని జగన్ తన ప్రసంగం ద్వారా స్పష్టమైన సంకేతాలిచ్చారని, దానిని అందిపుచ్చుకుని వీరోచితంగా పోరాడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. -
ఆకాశమంత అభిమానం..
రాష్ట్రంలోని ప్రతి సమస్య మీదా ఇవాళ నేను పూర్తి అవగాహనతో ఉన్నానని మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. అందుకే ప్రతి పేదవాడికీ మంచి చేయాలనే తపన, ఆలోచన నాలో ఉంది. అందుకే నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నాను.ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మారుద్దామని మీ అందరికీ పిలుపు నిస్తున్నాను. తోడుగా కలిసి రమ్మని, మీ బిడ్డను ఆశీర్వదించాలని మిమ్మల్ని అడుగుతున్నాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అందరినీ కోరుకుంటూ నా ఈ ప్రజా సంకల్ప యాత్రను ఇంతటితో ముగిస్తున్నా. ఈ దుర్మార్గపు ప్రభుత్వంపై పోరాటం ఇంతటితో ఆగదు. ఇంకా కొనసాగుతుంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మనందరం కలిసి సాగనంపుదాం. – ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇచ్ఛాపురం జనసంద్రమైంది. వేలాది మంది ప్రజల అభిమానంతో బహుదా నది ఉప్పొంగింది. అశేష జనప్రవాహంతో రహదారులు కిక్కిరిసిపోయి జాతరను తలపించాయి. యువత కేరింతలు.. అక్కాచెల్లెమ్మల ఆనంద నృత్యాలు.. వైఎస్సార్సీపీ జెండా రెపరెపలు.. జై జగన్ నినాదాలతో ఇచ్ఛాపురం యావత్తూ హోరెత్తింది. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు రోజైన బుధవారం భావోద్వేగాల మధ్య ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెంట అడుగులో అడుగేశారు. ఇరుకు రోడ్లపైనా పరుగులు పెట్టారు. ఇసుకేస్తే రాలనంత మంది ఉన్నా.. వెనుకాడకుండా జగన్ బాటలో నడిచి తమ అభిమానం చాటుకున్నారు. ‘ప్రజా సంకల్పం’ముగింపు సభ నుంచి ‘విజయ సంకల్పానికి’ప్రతినబూనారు. యుద్ధానికి పోతున్న సైన్యంలా.. ప్రజా సంకల్పయాత్ర ఆఖరి ఘట్టాన్ని చూసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా.. వివిధ రాష్ట్రాల నుంచి సైతం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి కదలివచ్చారు. దీంతో దారులన్నీ వేలాది వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా జనం.. జనమే. బుధవారం ఉదయం పాదయాత్ర శిబిరం నుంచి బయటకు వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కొద్దిక్షణాల్లోనే అశేష జనసంద్రంలో కలిసిపోయారు. అంతమందిలో ఆయనెక్కడున్నారో గుర్తించడం చాలా మందికి కష్టమైపోయింది. పాదయాత్ర మొదలైన ఐదు నిమిషాల్లోనే కిలోమీటర్ల కొద్దీ జనం ఆయన వెన్నంటే ముందుకు సాగారు. ‘ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తే ఓ సైన్యం యుద్ధానికి పోతున్నట్టుగా ఉంది’అని ఓ వ్యక్తి వ్యాఖ్యానించగా.. ‘అవును ఇది చంద్రబాబు మీదకు సాగే యుద్ధమే. అవినీతిని అంతం చేసే సైన్యమే’అంటూ ఇచ్ఛాపురానికి చెందిన మారం రాజులు అనే వ్యక్తి ఉద్వేగంతో చెప్పాడు. ఇచ్ఛాపురం సభ ఓ చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని పలువురు పేర్కొన్నారు. జగన్ ప్రసంగం సాగుతున్నంత సేపూ ప్రజలు జగన్ నినాదాలు చేస్తూ, చప్పట్లతో ప్రతిస్పందించారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనను లక్ష్యంగా చేసుకుని జగన్ నిప్పులుచెరుగుతున్నప్పుడు.. ప్రజలు సైతం ఆవేశంతో ఊగిపోయారు. ‘కాబోయే సీఎం..’అంటూ జేజేలు పలికారు. పండుగ ముందే వచ్చింది.. ఇచ్ఛాపురం వీధుల్లో ఎక్కడ చూసినా సందడే. ఏ గడపకెళ్లినా ఆనందమే. పాదయాత్ర ముగింపు సన్నివేశాన్ని చూడ్డానికి ఆ ఊరివాళ్లు తమ బంధువులను, స్నేహితులను ఇళ్లకు పిలుచుకున్నారు. ‘వైఎస్ కుటుంబంలో మూడో వ్యక్తి పాదయాత్ర మా ఊరిలో ముగుస్తోంది. మాకిప్పుడే సంక్రాంతి వచ్చినట్టు ఉంది’అని ఏరాసుల రామారావు ఆనందం వ్యక్తం చేశాడు. ‘వైఎస్ను, ఆయన కూతురు షర్మిలమ్మను, ఇప్పుడు జగన్ను.. ముగ్గుర్నీ కలిశాను. చాలా సంతోషంగా ఉంది’అని పద్మజ తెలిపింది. మరికొందరు పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయ సంకేతాలతో ఇళ్ల ముందు రంగవల్లులు దిద్దారు. ‘పండగకు తెచ్చుకున్న దుస్తులు ఇప్పుడే వేసుకున్నాం’అని ఈశ్వరి, కల్పన తెలిపారు. ఈ బాబును సీఎంగా చూడాలనుందయ్యా.. పాదయాత్ర ముగింపు రోజున కొందరు ఉద్వేగానికి గురయ్యారు. ‘ముగింపు సన్నివేశం చూడ్డానికి వచ్చారా?’అని రామశౌరమ్మ అనే మహిళను అడగ్గా.. ‘కేవలం చూడ్డానికే రాలేదయ్యా... ఈ బాబును సీఎంగా చూడాలనుంది. ఏడాదిగా నడిచాడు బిడ్డ. ఎలా ఉన్నాడో చూద్దామనొచ్చాం. ఈయనొస్తే మాలాంటోళ్లకు మంచి జరుగుతుందయ్యా..’అంటూ ఉద్వేగానికి గురైంది. ‘తెలుగుదేశపోళ్లు ఎన్ని కష్టాలు పెట్టారు ఆ బిడ్డను? కష్టం ఊరికే పోదయ్యా’అని కాల ముత్యాలు, మద్ది ఈశ్వరమ్మ పేర్కొన్నారు. ఈ ఇద్దరూ స్థూపం దగ్గర ఇతర మహిళలతో కలిసి ఆనందంగా నృత్యాలు చేశారు. మరోవైపు ప్రజా సంకల్ప యాత్ర ముగింపు రోజును చిత్రీకరించేందుకు పలు జాతీయ, ప్రాంతీయ చానెళ్లు పోటీపడ్డాయి. ఎవర్ని కదిపినా జగన్ పాదయాత్ర ఓ ప్రభంజనమంటూ వర్ణిస్తుండటంతో జనాభిప్రాయమేంటో అర్థమైందంటూ పలువురు విలేకరులు వ్యాఖ్యానించారు. మరోవైపు వైఎస్ జగన్ కూడా అంత జన ఒత్తిడిలోనూ ప్రతి ఒక్క మీడియా ప్రతినిధితోనూ మాట్లాడి తన మనోగతాన్ని వివరించారు. వైఎస్సార్సీపీలోకి ప్రముఖ సినీనటుడు భానుచందర్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు రోజైన బుధవారం పార్టీ లో పలువురు చేరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కొత్త అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన పాదయాత్ర శిబిరంలో ప్రముఖ సినీనటుడు భాను చందర్ వైఎస్ జగన్ను కలిసి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకురాలు, ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కుమారుడు బొడ్డేపల్లి రమేశ్ పార్టీలో చేరారు. ఆయనకు వైఎస్ జగన్ పార్టీ కండువా వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ‘విజయ సంకల్పం’ ఆవిష్కృతం జై జగన్.. జై జై జగన్.. కాబోయే సీఎం అంటూ మిన్నంటిన నినాదాల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ప్రజల హర్షధ్వానాలు, కరతాళ ధ్వనుల మధ్య విజయ సంకల్ప స్తూపాన్ని ఆవిష్కరించారు. 2017, నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా దీనిని ఆవిష్కరించారు. వివిధ మతాలకు చెందిన పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. -
అధర్మంపై యుద్ధమిది
‘మీ అందరికీ నేనొక్కటే చెబుతున్నా.. నేను 3,600 కిలోమీటర్లకు పైగా నడిచా.. దారిపొడవునా ప్రతి పేదవాడి కష్టం చూశా.. ప్రతి పేదవాడి పరిస్థితిని ఎలా మెరుగు పరచాలనే ఆలోచనతోనే ఈ 14 నెలల సమయం గడిచి పోయింది. మామూలుగా ఒక సామెత ఎపుడూ చెబుతూ ఉంటారు. ఆరు నెలలు ఎవరితోనైనా కలిసి ఉంటే వాళ్లు వీళ్లవుతారు.. వీళ్లు వాళ్లవుతారు అని. 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా పేదవారి కష్టాలు వింటూనే, వారితో నడుస్తూనే, వారికి తోడుగా ఉంటూనే వారికి భరోసా ఇస్తూనే నడిచాను. గ్రామస్థాయిలో నవరత్నాలను ప్రతి పేదవాడి ఇంటికి చేరుస్తాం. నవరత్నాల్లో ప్రకటించిన పథకాలే కాకుండా రేషన్ బియ్యం కూడా నేరుగా లబ్ధిదారుడి ఇంటికి డోర్ డెలివరీ చేస్తాం. నవరత్నాల్లో పథకాల కోసం లబ్ధిదారులు ఎవరి చుట్టూ తిరగనవసరం లేకుండా, ఎవరికీ లంచం ఇవ్వకుండా నేరుగా ఆ లబ్ధిదారుడి ఇంటికి పథకాలు వచ్చేలా చేస్తామని హామీ ఇస్తున్నా. చంద్రబాబు ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, ఏదైనా పని గానీ చేసేటప్పుడు ఆయన ఆలోచించేది కమీషన్లు ఎంతవస్తాయి, డబ్బులు ఎంత దోచుకుందామా అని చూస్తారు.మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. నాకు డబ్బంటే వ్యామోహం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా నా ఆలోచనలు ఉండవు. నా ఆలోచన ఒక్కటే. అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలు ప్రజలకు మంచి చేయాలని.. 30 ఏళ్ల పాటు పాలించాలని నాకున్న ఆశ. జరిగిన మంచిని చూసి నేను చనిపోయిన తర్వాత నా ఫొటో ప్రజల ఇంట్లో నాన్న ఫొటోతో పాటు ఉండాలన్నది నా ఆశ. మన పార్టీ కో ఆర్డినేటర్లకు చెబుతా ఉన్నా. నవరత్నాలను ప్రతి ఇంటికి చేర్చండి. అప్పుడే చంద్రబాబు లంచాలతో సంపాదించిన సొత్తు ఓట్లను కొనుగోలు చేసేందుకు ఎంత వెచ్చించినా కూడా ప్రజలు ఆ జరగబోయే మేలును చూసి చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకుంటారు కానీ ఓట్లు మాత్రం వేయరు. నవరత్నాలు అందరికి కన్పించేలా ప్రతి గ్రామంలోనూ ఫ్లెక్సీలు పెట్టండి. రైతు తరఫున ప్రభుత్వమే బీమా ప్రీమియం కడుతుంది రైతుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతా ఉన్నా. ఇప్పటి వరకు ఏ సభలో చెప్పలేదు. మొట్టమొదటిసారిగా ఇక్కడ చెబుతున్నా. ప్రస్తుతం రైతుల బీమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. తుపానులు, కరువు వచ్చినా ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు ఆ సొమ్ము వస్తుందో.. రాదో తెలియదు. ఎందుకు ప్రీమియం తీసుకుంటున్నారో తెలియదు. రైతన్నల తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని చెబుతున్నా. ఇన్సూరెన్స్ కోసం రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. ఆ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఇన్సూరెన్స్ సొమ్ము పేదవాడికి ఇచ్చేందుకు ప్రభుత్వమే కృషి చేస్తుందని ఈరోజు ఇక్కడ కొత్తగా చెబుతున్నా. ఆక్వా రంగానికి రూ. 1.50లకే విద్యుత్ ఇస్తామని ఇదివరకే చెప్పా. వీటన్నింటి వల్ల పెట్టుబడి ఖర్చు రైతన్నలకు తగ్గుతుంది. ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మరో మూడు నెలల్లో జరుగనున్న ఎన్నికల్లో నారాసురుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో, ఎల్లో మీడియాతో జరిగే యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ తనకు తోడుగా నిలవాలని, తనను ఆశీర్వదించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు నిచ్చారు. మనం చేయబోయే యుద్ధం ఒక్క నారాసురుడితోనే కాదని, ఆయనకు మద్దతిస్తున్న రెండు పత్రికలు, పలు టీవీ చానెళ్లపై కూడా అని జగన్ ప్రజలను అప్రమత్తం చేశారు. చంద్రబాబు మాదిరిగా తనకు డబ్బుపై వ్యామోహం లేదని, అయితే ఒక్కసారి అధికారంలోకి వచ్చాక 30 ఏళ్లపాటు రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి మంచి చేయాలని, 30 ఏళ్ల పాటు పరిపాలించాలనే తపన ఉందన్నారు. జిత్తులమారి, మాయావి అయిన చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటారని, ఎన్నికల్లో ఆయన చేయని అన్యాయం అంటూ ఏమీ ఉండదని ఆయన ప్రజలకు వివరించారు. ప్రజలంతా ఈ యుద్ధంలో తనకు తోడుగా నిలిస్తే ఈ ఎన్నికల్లో జరిగే అన్యాయాలను, మోసాలన్నింటినీ జయిస్తానని జగన్ ధృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో మంచి రోజులు వస్తాయని, ఖాయంగా ప్రజావ్యతిరేక చంద్రబాబు పాలనను సాగనంపే సమయం ఆసన్నం అయిందని ధీమా వ్యక్తం చేశారు. 341 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసిన అనంతరం చివరి ఘట్టమైన ఇచ్ఛాపురంలో బుధవారం పాత బస్టాండు వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఉత్తేజ పూరితంగా ప్రజలను, పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే.. యుద్ధం బాబుతోనే కాదు.. ఎల్లో మీడియాతో కూడా ‘‘ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉంది. ఈ మూడు నెలల కాలంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, తోడుగా రమ్మని కోరుతున్నాను. కారణం ఏమిటంటే.. ఎన్నికల్లో జరుగబోయే ఈ యుద్ధం ఒక్క చంద్రబాబునాయుడు వంటి నారా రాక్షసుడితో మాత్రమే కాదు. ఇతనికి తోడుగా ఎల్లో మీడియా ఉంది. వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. రెండు పత్రికలు, ఈ పెద్దమనిషికి తోడుగా ఉన్న అనేక చానెళ్లు.. వీటన్నింటితో కూడా యుద్ధం చేస్తున్నాం. ఇవన్నీ కాక ఈ జిత్తుల మారి మాయావి చంద్రబాబు ఎలాంటి పొత్తులైనా పెట్టుకుంటాడు. ఈ పెద్దమనిషి చేయని అన్యాయం, మోసం అంటూ లేదు. మీరు తోడుగా ఉంటే ఈ అన్యాయాలు, మోసాలన్నింటినీ జయిస్తాను. అందుకే నాడు తోడుగా ఉండి, ఆశీర్వదించమని ప్రతి అక్కా చెల్లెమ్మ, ప్రతి అవ్వా తాత, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడికి పేరు పేరునా విన్నవించుకుంటున్నా. మూడు నెలల్లో మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెబుతున్నాను. ఎంత మందికి భరోసా కల్పించామన్నదే ముఖ్యం.. హైదరాబాద్ నుంచి దుబాయ్ ఎంత దూరం ఉందో మీకు తెలుసా? అని ఇవాళ ఎవరో నాన్ను అడిగారు. ఎంత అని అడిగాను. 3 వేల కిలోమీటర్లు అని చెబుతూ.. మీరు 3,648 కి.మీ నడిచారన్నా అని చెప్పారు. అదే మాదిరిగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎంత దూరం ఉందో మీకు తెలుసా అన్నా? అని కూడా అడిగారు. ఎంత? అని అడిగా.. అక్షరాలా 3,440 కి.మీ అని చెప్పారు. రికార్డులు దాటేసి ఏకంగా అంతకన్నా ఎక్కువ స్థాయిలో నడవగలిగాం అంటే నిజంగా ఇది కేవలం మీ ఆప్యాయతలు, ఆత్మీయతలు, పైనుంచి ఆ దేవుడి ఆశీస్సుల వల్లే జరిగాయని చెప్పటానికి ఏమాత్రం కూడా సంకోచించను. ఇవాళ ఎంతదూరం నడిచామన్నది ముఖ్యం కాదు.. ఎంతమందిని ప్రత్యక్షంగా కలిశాం? ఎంతమందికి మనం భరోసా ఇచ్చామన్నదే నిజంగా ముఖ్యమైన అంశం. మోసాల్లో చంద్రబాబు పీహెచ్డీ.. చంద్రబాబు నాయుడిగారి నాలుగున్నరేళ్ల పాలనలో ఎలాంటి పనులు చేశాడో చూశామన్నా. ఆయన చేసిన పరిపాలన గురించి ప్రజలు చెబుతూ ఉంటే, జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆందోళన కలుగుతోంది. ఒక వంక రాష్ట్రంలో కరువు ఇంకో వంక తుపాన్లు.. ఒక వంక రాష్ట్ర విభజన నష్టం.. ఇంకో వంక చంద్రబాబు నాయుడి గారి దోపిడీతో నష్టపోయిన రాష్ట్రం.. మరోవంక వ్యవసాయం దెబ్బతిని గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్న పరిస్థితులు. మరోవంక రుణమాఫీ అంటూ చంద్రబాబు చేసిన మోసం.. ఒక వంక నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం మరోవంక నిరుద్యోగ భృతి రెండు వేలు ఇస్తా ప్రతి నెలా అని చెబుతూ మోసగించిన చంద్రబాబు నైజం. ఒకవంక 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి చేసిన వాగ్దానాలు.. మరోవంక 650 వాగ్దానాలు తన మ్యానిఫెస్టోలో పెట్టి, ప్రతి పేజీ ఒక కులానికి కేటాయించి.. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి? అని పీహెచ్డీ చేసిన వ్యక్తి మరోవంక. ఆయన చేసిన హామీలు, మోసాలు మరోవంక.. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా గుండె మండుతూ ఉంటుంది. పిల్లల్ని అవిటివారిగా మార్చి అడుక్కునే వారికి, రాష్ట్రం కష్టాల్లో ఉందని పదేపదే చెబుతూ విచ్చలవిడిగా దోచుకుంటున్న ఈ చంద్రబాబు గారికి ఏమైనా తేడా ఉందా? అని మీ అందరి తరపున అడుగుతున్నా. ఐదెకరాల్లో అర బస్తా పండింది.. ఇదీ రెయిన్ గన్ నిర్వాకం బాబు పాలన మీద 14 నెలల నా పాదయాత్రలో అనుభవాలను కొన్నిటిని ఈరోజు మీతో పంచుకుంటా... అనంతపురం జిల్లాలో నాకు శివన్న అనే రైతు కలిశాడు. తన పొలంలో రెయిన్గన్ల నుంచి గురించి కథలు కథలుగా చెప్పాడు. చంద్రబాబు రెయిన్ గన్ అని చెప్పి చూపించిన సినిమా ఎలా ఉందో కంటికి కట్టినట్లుగా వివరించాడు. అన్నపూర్ణ లాంటి ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఎలా కుదేలైపోయిందో, రైతులు ఎలా కూలీలుగా మారిపోయారో, లక్షల మంది ఎలా వలసలు వెళ్తున్నారో కళ్లారా చూశానని చెప్పాడు. శివన్న అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ వద్ద పాదయాత్ర చేస్తున్నప్పుడు నా వద్దకు వచ్చాడు. ‘‘అన్నా రూ.90 వేలు అప్పు చేసి వేరుశనగ పంట వేశా’’ అని చెప్పాడు. మరి పరిస్థితి ఎలా ఉందని అడిగితే.. ‘‘అన్నా బాబు గారు వచ్చారు. బాబుగారితోపాటే ఇంకొకటి కూడా కలిసే వస్తుందన్నా ఎప్పుడు వచ్చినా చంద్రబాబుగారితోపాటు. అది.. బాబు వస్తే కరువు కూడా వస్తుందన్నా..’’ అని చెప్పాడు. ‘‘అన్నా.. యథాప్రకారం కరవు వచ్చిందన్నా. రైతులు విలవిలలాడుతున్నారన్నా. చంద్రబాబు గారు అనంతపురం జిల్లా పర్యటన పెట్టుకున్నప్పుడు కరువుతో చచ్చిపోతున్నామయ్యా... పంటలు ఎండిపోతున్నాయయ్యా.. సాయం చేయండయ్యా..’’ అని శివన్న చంద్రబాబు గారిని గట్టిగా అడిగితే ఆయన ఏమన్నారో తెలుసా?.. ‘‘అయ్యో కరువు వచ్చిందా? నాకు ఇంతవరకు తెలియదే? నాకు ఎప్పడూ చెప్పలేదే’’ అని అధికారులను తిట్టారట రైతన్నల ఎదుట. ఈ పెద్ద మనిషి చంద్రబాబు డ్రామా అంతటితో ఆగిపోలేదు. రెయిన్గన్లు అని మొదలు పెట్టాడు. పొలంలో రెయిన్గన్ ఏర్పాటు చేయడం కోసం అధికారులు యాధృచ్ఛికంగా శివన్నను ఎన్నుకున్నారు. ‘‘అన్నా అధికారులు నా దగ్గరకొచ్చారు. పంటలను కాపాడతామని పొలంలో రెయిన్గన్ సిద్ధం చేశారు. ఒక పంట కుంట తవ్వి టార్పాలిన్ వేశారు. ఒక ట్యాంకుతో నీళ్లు నింపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి రెయిన్ గన్ ప్రారంభించి అలా.. అలా.. నాలుగు నీళ్లు చల్లారు. ఫొటోలకు పోజులు కొట్టాడన్నా. చంద్రబాబు వెళ్లిపోయిన తరువాత భోజనం చేద్దామని మధ్యాహ్నం ఇంటికి వెళ్లానన్నా. అంతే.. అధికారులు టార్పాలిన్ మడత పెట్టేశారు. రెయిన్గన్ చంకన పెట్టుకుని వెళ్లిపోయారన్నా..’’ అని శివన్న చెప్పాడు. శివన్న సాయంత్రం పొలం వద్దకు వెళ్లేసరికి పంటకుంట ఏదీ లేదు. పంటకుంటలో నీళ్లు కూడా లేవు. ఇదీ శివన్న పరిస్థితి. శివన్న ఐదు ఎకరాల్లో వేరు శనగ వేస్తే ఎంత పంట పండిందో తెలుసా? కేవలం అర బస్తా. ‘‘అన్నా ఇదీ పరిస్థితి. అప్పులు తీర్చడం కోసం, బతకడం కోసం ఇవాళ వడియాలు, బొరుగులు (ఉత్తరాంధ్రలో మూరీలు) అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉన్నానన్నా’’ అని శివన్న నా వద్దకు వచ్చి చెప్పాడు. శివన్న నా వద్దకు వచ్చినప్పుడు మైక్ ఇస్తే ఏం చెప్పాడో తెలుసా?.. ‘క్రితంసారి సెంద్రబాబుకు ఓటేశా. చివరకు ఇలా అయ్యా. ఇక మనకు సెంద్రబాబుతో సావాసం వద్దబ్బా...’ అన్నాడు. అందుకే గ్రామస్థాయిలో రైతులు ఇవాళ చంద్రబాబును ఏమంటున్నారో తెలుసా? ‘‘నిన్ను నమ్మం బాబూ..’’ అని పిలుపునిస్తున్నారు. రైతులు ఆల్లాడుతుంటే జాతీయ రాజకీయాలంటూ డ్రామాలు.. చంద్రబాబు హయాంలో ఐదుకు ఐదేళ్లు ఒకవంక కరువు మరోవంక తుపాన్లు. కానీ రైతులకు మాత్రం ఇన్పుట్ సబ్సిడీలు రావు. రైతులు అల్లాడుతున్నా క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన చెయ్యరు. 2018 జూన్ 1వ తేదీ నుంచి ఈనెల 2వతేదీ వరకు అంటే వారం క్రితం వరకు వర్షపాతం చూస్తే కోస్తాలో – 23.1 శాతం లోటు ఉంది. రాయలసీమలో –50.3 శాతం లోటు ఉంది. ఇంత దారుణంగా రైతన్నల పరిస్థితి ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టాడు. ఓ రోజు బెంగళూరు వెళ్లి కుమారస్వామితో కాఫీ తాగుతాడు. పక్కనే అనంతపురం ఉంటుంది. కానీ అక్కడకు వెళ్లి కరువు బారిన పడిన రైతులకు అండగా ఉందామనే ఆలోచన చంద్రబాబుకు రాదు. మరుసటి రోజు మళ్లీ విమానమెక్కుతాడు. జాతీయ రాజకీయాలంటూ చెన్నై వెళ్లి స్టాలిన్తో కలసి ఇడ్లీ, సాంబార్ తింటాడు. చెన్నై పక్కనే తన సొంత జిల్లా చిత్తూరు ఉంది. అక్కడ రైతులు అల్లాడుతున్నారనే ధ్యాస చంద్రబాబుకు ఏమాత్రం పట్టదు. అంతటితో ఆగడు. ఎలాగూ ప్రభుత్వమే కదా విమానం ఖర్చులు భరించేది అనుకుని కోల్కతా వెళతాడు. మమతా బెనర్జీతో కలసి చికెన్ తింటాడు ఈ పెద్దమనిషి. అందుకే నమ్మం బాబూ.. నమ్మం అంటున్నారు.. ఆయన (చంద్రబాబు) వచ్చాక పంటల విస్తీర్ణం, దిగుబడి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. 2008–09 పంటల విస్తీర్ణం లెక్కలు చూస్తే వైఎస్ హయాంలో 42.70 లక్షల హెక్టార్లలో పంటలు పండిస్తే.. 2017–18లో చంద్రబాబు పాలనలో అది 40 లక్షల హెక్టార్లకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ హయాంలో 166 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండితే చంద్రబాబు పాలనలో 157 లక్షల టన్నులకు పడిపోయింది. కానీ ఈ పెద్దమనిషి చంద్రబాబు నదుల అనుసంధానం అంటాడు. పట్టిసీమ నీళ్లను రాయలసీమకు అందించానని బొంకుతాడు. బొంకడంలో ఇంకా నాలుగడుగులు ముందుకేసి రెయిన్గన్లతో కరువును జయించానంటాడు. దేశంలోనే వ్యవసాయంలో అత్యధిక వృద్ధి రేటు మన రాష్ట్రంలోనే ఉందని బొంకుతాడు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పే వ్యక్తిని చూసినప్పుడు రైతన్నలు (ఏమంటారు? అని సభికులను జగన్ ప్రశ్నించగా నమ్మం బాబూ అంటామని ముక్తకంఠంతో చెప్పారు) నమ్మమంటే నమ్మమంటారు. రైతుల నెత్తిన అప్పుల కుంపటి ఇవాళ రైతుల బతుకులు ఎలా ఉన్నాయో ఇటీవలే నాబార్డు ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం రైతుల నెత్తిన అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. నాబార్డు నివేదిక ప్రకారం వ్యవసాయదారుల సగటు ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున 28వ స్థానంలో ఉంది. రుణమాఫీ పేరుతో చంద్రబాబు చేసిన ఘరానా మోసంతో రైతులు కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నారు. అప్పులపై వడ్డీలు కట్టలేక, కొత్తగా అప్పులు పుట్టక అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ.87,612 కోట్లుగా ఉన్న రైతుల అప్పులు ఇవాళ తడిసిమోపెడై, వడ్డీల మీద వడ్డీలు పడి అక్షరాలా రూ.1,30,000 కోట్లకు ఎగబాకిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. రుణమాఫీ చేస్తానని చెప్పి మోసాన్ని మిగిల్చాడు. రైతులకు చేస్తానన్న రుణమాఫీ పథకం కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. చంద్రబాబు చేసిన మరో అన్యాయం.. రైతుల తరపున కట్టాల్సిన వడ్డీ డబ్బులను పూర్తిగా కట్టకుండా మానేయడం. అందుకే ఇవాళ ఎక్కడ చూసినా రైతులు చంద్రబాబును (ఏమంటున్నారు? అని జగన్ సభికులను ప్రశ్నించారు) ‘‘నిన్ము నమ్మంగాక నమ్మం..’ అని అంటున్నారు. నాలుగున్నరేళ్లలో రైతన్నలకు ఏం పంటకైనా గిట్టుబాటు ధర లభించిందా? పంట వేసే ప్రతి రైతును అడుగుతున్నా (రాలేదు.. రాలేదు అంటూ అందరూ రెండు చేతులు పైకి ఎత్తి చెప్పారు) ధాన్యం సహా ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదు. దళారీలకు కెప్టెన్లా చంద్రబాబు ఓ ముఖ్యమంత్రి అంటే రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేందుకు తపించాలి. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఆరాటపడాలి. కానీ తన హెరిటేజ్ షాపుల కోసం ఈ పెద్దమనిషి చంద్రబాబు దళారీలకు కెప్టెన్ అయ్యారు. హెరిటేజ్ లాభాల కోసం రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటినే పొట్లాల్లో పెట్టి రెండింతలు, మూడింతలు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్న పరిస్థితి సాక్షాత్తూ ముఖ్యమంత్రే చేస్తున్నారు. రైతుల పరిస్థితి ఇవాళ ఎలా ఉందో చిన్న ఉదాహరణ చెప్పాలంటే.. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.750. అయితే ఖరీప్ పంట చేతికొచ్చినా కూడా అమ్ముకోలేని దయనీయ స్థితిలో రైతులున్నారు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. ఉద్దానం.. ఇక్కడ జీడిపప్పు ఫేమస్.. పలాస జీడిపప్పు గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. కిలో రూ.600కి కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఉద్దానం రైతన్నలు ఉన్నారు. కానీ ఇదే పలాస జీడిపప్పును చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కిలో రూ.1,110 చొప్పున అమ్ముతున్నారు. ఇంత దారుణమైన మోసాలు రైతులకు చేస్తున్నాడు కాబట్టే ‘‘నిన్ను నమ్మం బాబూ..’’ అని అంటున్నారు. అక్క చెల్లెమ్మలను మోసగించారు.. దారి పొడవునా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు తమ బాధలను చెప్పారు. చంద్రబాబు మోసాల కారణంగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా రుణాలు కట్టలేదని అక్క చెల్లెమ్మల్లను కోర్టు మెట్లు ఎక్కించిన పరిస్థితి చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో బ్యాంకు సిబ్బంది నేరుగా అక్క చెల్లెమ్మల ఇళ్లపై దాడులు చేసి తాళాలు వేసిన ఘటనల గురించి అక్కడ పాదయాత్ర సమయంలో చెబితే బాధనిపించింది. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రాలేదు కానీ వడ్డీలు కట్టడానికి తాళిబొట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి డ్వాక్రా రుణాలు రూ.14,204 కోట్లు ఉంటే ఇప్పుడవి తడిసి మోపెడై వడ్డీలపై వడ్డీలు పడి రూ.22,174 కోట్లకు ఎగబాకిన పరిస్థితి. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాననే హామీ గాలికి ఎగిరిపోయింది. డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు హయాంలో 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ డబ్బులను కట్టకుండా ఎగ్గొట్టారు. ఇటువంటి ఎగనామం పెడుతున్న చంద్రబాబును చూసినప్పుడు ఆ అక్క చెల్లెమ్మలు ‘‘నిన్ను నమ్మం బాబూ నమ్మం..’’ అంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఊడగొడుతున్నారు.. చంద్రబాబు హయాంలో ఇవాళ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయదు. నిరాశతో ఉన్న యువత.. అన్నా బాబు వచ్చాడు కానీ జాబు రాలేదన్నా అంటున్నారు. బాబు వచ్చాడు.. ఉన్న జాబులను ఊడగొడుతున్నాడన్నా అంటున్నారు. రాష్ట్రంలో 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా.. గృహ నిర్మాణశాఖలో 3,500 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాలు కూడా గోవిందా.. వేల సంఖ్యలో గోపాలమిత్రల ఉద్యోగాలూ గోవిందా. ఆయుష్లో పని చేస్తున్న అక్క చెల్లెమ్మల ఉద్యోగాలు కూడా గోవిందా.. సాక్షర భారత్లో పనిచేస్తున్న 30 వేల మంది అక్కాచెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా.. దశాబ్దాలుగా పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టిన 85 వేల మంది మహిళల ఉద్యోగాలు సైతం గోవిందా.. రాష్ట్ర విభజన జరిగే నాటికి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్కలు తేల్చారు. ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు 95 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో 2.40 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ చంద్రబాబు హయాంలో కనీసం ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపానపోలేదు. చంద్రబాబు పాలన చూసి యువతలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. చంద్రబాబు పాలనలో ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించడం లేదు. మొక్కుబడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చేశామని ఊదరగొడుతున్నాడు. జాబు రావాలంటే.. బాబు రావాలని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబు ఉద్యోగం ఇస్తాడని, ఉపాధి కల్పిస్తాడని.. ఈ రెండూ ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తాడని టీడీపీ నేతలతో చెప్పించాడు. చంద్రబాబు సంతకంతో ఉన్న లేఖలను ఇంటింటికీ పంచి పెట్టారు. ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు మోసం చేశాడు. రాష్ట్రంలో 1.72 కోట్ల ఇళ్లు ఉండగా, తీరా ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు ఆ ఇళ్ల సంఖ్యను 3 లక్షలకు కుదించాడు. నిరుద్యోగ భృతి నెలకు రూ.2 వేలు ఇస్తానని చెప్పి, దాన్ని రూ.వెయ్యికి తగ్గించాడు. మూత పడుతున్న పరిశ్రమలు చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు వచ్చిన దాఖలాలే లేవు. కరెంటు బిల్లులు, రాయల్టీలు పెంచడం వల్ల, ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటిదాకా ఉన్న పరిశ్రమలే మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సహకార డెయిరీలు, సహకార చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి. గతంలోనే చంద్రబాబు చాలా పరిశ్రమలకు తాళాలు వేసి, అమ్మేశారు. ఇప్పుడు అరకొరగా మిగిలి ఉన్న పరిశ్రమలను సైతం అమ్మేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నాడు. కర్నూలులో నాపరాళ్ల పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు మూతపడ్డాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి. ఉత్తరాంధ్రలో జ్యూట్ మిల్లులు, ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడడాన్ని ఈ పాదయాత్రలో చూశా. వాళ్ల దీనగాథలను విన్నా. ఇంతకంటే సిగ్గుమాలిన సీఎం ఉండరేమో! రాష్ట్రంలో చదువుల పరిస్థితి దారుణంగా మారింది. శ్రీకాకుళం జిల్లా కవిటిలో పాదయాత్ర చేస్తుండగా విద్యార్థులు నన్ను కలిశారు. అక్కడ జూనియర్ కాలేజీలో 400 మందికిపైగా పిల్లలు చదుకుంటున్నారు. అందులో దాదాపు 240 మంది ఆడపిల్లలే ఉన్నారు. ఆ కాలేజీలో కనీసం బాత్రూమ్లు కూడా లేవని అక్కడి విద్యార్థినులు చెప్పారు. కానీ, మన రాష్ట్రంలో అందరికీ బాత్రూమ్లు అందుబాటులో ఉన్నాయని, ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ కార్యక్రమంలో మన రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు నాయుడు టీవీల్లో ఊదరగొడుతున్నాడు. పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు నిజంగా సిగ్గుపడాలి. జూనియర్ కాలేజీలో ఆడపిల్లల కోసం కనీసం బాత్రూమ్లు కూడా లేవంటే ఇంతకంటే సిగ్గుమాలిన ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరూ ఉండరేమో! బాబు బినామీ స్కూళ్లకు మేలు చంద్రబాబు తన బినామీల ప్రయోజనాల కోసం విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 6 వేల స్కూళ్లను మూసివేయించారు. ఎస్సీ, బీసీ హాస్టళ్లను సైతం ఎత్తివేశారు. స్కూళ్లలో చాలా పుస్తకాలు ఇవ్వలేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నాసిరకం యూనిఫామ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలామందికి యూనిఫామ్లే పంపిణీ చేయలేదు. ప్రభుత్వ స్కూళ్లలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా, చంద్రబాబు వాటిని భర్తీ చేయకుండా పాఠశాలలను నాశనం చేసే కార్యక్రమానికి పూనుకున్నాడు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకుల బిల్లులను ఆరు నెలలుగా ఇవ్వడం లేదు. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లకుండా ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లేలా కుతంత్రాలు పన్నుతున్నాడు. తద్వారా తన బినామీలైన నారాయణ, చైతన్య స్కూళ్లు వేలకు వేలు దోచుకునేలా దోహదపడుతున్నాడు. ‘నిన్ను నమ్మం బాబూ’ అంటున్నారు పాదయాత్రలో చాలామంది విద్యార్థులు నన్ను కలిశారు. వారి బాధలు చెప్పుకున్నారు. మరిచిపోలేని ఓ సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా కృష్ణారెడ్డిపాలెం వద్ద రోడ్డు పక్కనే ఓ చిన్న గుడిసె. ఆ గుడిసె ఎదురుగా ఓ ఫ్లెక్సీ కనిపించింది. అందులో ఓ పిల్లాడు ఉన్నాడు. దానికి పూలదండ కూడా వేసి ఉంది. తల్లిదండ్రులిద్దరూ ఏడుస్తూ నా దగ్గరికొచ్చారు. ఆ తండ్రి పేరు గోపాల్ అన్న. ఫ్లెక్సీపై ఉన్న ఫొటో తన కొడుకుదని ఈ తండ్రి చెప్పాడు. ఏమైందని అడిగా. తన కుమారుడు తెలివైన విద్యార్థి అని, ఇంజనీరింగ్లో సీటు వచ్చిందని, కాలేజీలో చేర్పించే ప్రయత్నం చేశామని, ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైగా ఉన్నాయని అన్నాడు. ప్రభుత్వం మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ కింద కేవలం రూ.30 వేలు మాత్రమే ఇస్తుందట అని చెప్పాడు. రూ.70 వేలు అప్పు చేసి తన కుమారుడిని ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివించానని అన్నాడు. అప్పు తీసుకొచ్చానన్న సంగతి తన కుమారుడికి తెలుసని, బాధపడ్డాడని చెప్పుకొచ్చాడు. రెండో సంవత్సరం తన బిడ్డ ఇంటికొచ్చి నా చదువు కోసం ఈసారి ఏం చేస్తావని అడిగాడని చెప్పాడు. ఏదో ఒకటి చేస్తాలే, నువ్వయితే కాలేజీకి వెళ్లి బాగా చదువుకుని గొప్ప వాడివి కావాలని సూచించానని అన్నాడు. తన చదువుల కోసం తన కుటంబం ప్రతిఏటా అప్పులు చేయడం చూసి తట్టుకోలేక ఆ పిల్లాడు ఇంటి నుంచి నేరుగా హాస్టల్కు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తండ్రి ఆవేదనను ఎప్పటికీ మర్చిపోలేను. ఇవాళ రాష్ట్రంలో చాలామంది తల్లిదండ్రులు గోపాల్ అన్న లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాక, వచ్చినా ఆ సొమ్ము సరిపోక, చదువుల కోసం ఆస్తులు ఆమ్ముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేద రోగుల పరిస్థితి దయనీయం రాష్ట్రంలో పేదవాడికి ఏదైనా పెద్దరోగం వస్తే అప్పులపాలయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు 8 నెలలుగా బకాయిలను చెల్లించడం లేదు. అందువల్ల ఆరోగ్యశ్రీ కింద సేవలను ఆయా ఆసుపత్రులు పూర్తిగా నిలిపివేశాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పరిస్థితులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇక్కడ 4 వేలమందికిపైగా కిడ్నీ వ్యాధుల బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇందులో కేవలం 1,400 మందికి మాత్రమే ఉచితంగా డయాలసిస్ సేవలు అందుతున్నాయి. మిగిలిన వాళ్లంతా సొంత ఖర్చులతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఉద్దానంలో 4 వేల మందికిపైగా కిడ్నీ రోగులు ఉండగా, ప్రభుత్వం కేవలం 370 మంది మాత్రమే పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఆ పెన్షన్ ఎంతో తెలుసా?ముష్టివేసినట్లు రూ.2,500 మాత్రమేనట! అసలు ఆ కిడ్నీ రోగులు చావాలా? బతకాలా? ప్రభుత్వం ఏమనుకుంటోంది? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే పథకం ఉందా? లేదా? అని అడుగుతున్నా. ‘108’కు ఫోన్ చేస్తే కుయ్ కుయ్ కుయ్ అంటూ 20 నిమిషాల్లోనే రావాల్సిన అంబులెన్స్ ఇవాళ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. విజయనగరంలో ఉండగా గరివిడి మండలం కోడూరుకు చెందిన ఓ విద్యార్థిని నా దగ్గరికొచ్చింది. ఆమె పేరు భవాని. తన ఇంటి పక్కనే గౌరి అనే గర్భవతి ఉందని, ఆమెకు పురిటి నొప్పులు వస్తే ‘108’కు ఫోన్ చేశానని, టైర్ పంక్చరైందని రాలేమని నిర్దాక్షిణ్యంగా చెప్పారని భవాని ఆవేదన వ్యక్తం చేసింది. అటువైపు స్కూల్ పిల్లలతో వస్తున్నా ఆటోలో గౌరిని ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పింది. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో 108 అంబులెన్స్ రాకపోవడంతో ఓ గర్భిణి రోడ్డుపైనే ప్రసవించాల్సి వచ్చింది. విశాఖ జిల్లాలో కె.కోటపాడులో సకాలంలో 108 అంబులెన్స్ వెళ్లకపోవడం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆరోగ్యశ్రీ అమలు పరిస్థితి దారుణంగా మారింది. మూగ, చెవుడు పిల్లలకు ఆపరేషన్లు చేస్తారన్న నమ్మకం లేకుండా పోయింది. మంచి వైద్యం కోసం హైదరాబాద్కు వెళితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేస్తారన్న ఆశ లేకుండాపోయింది. ఇంత అన్యాయంగా చంద్రబాబు పాలన సాగుతోంది. బాబు పాలన గురించి పేద రోగులు ఏమంటున్నారో తెలుసా? నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. మాఫియాలా జన్మభూమి కమిటీలు ఇవాళ గ్రామస్వరాజ్యం కనిపించడం లేదు. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాలు కనిపిస్తున్నాయి. రేషన్ కార్డు కావాలన్నా లంచం, పెన్షన్ మంజూరు కావాలన్నా లంచం, ఇల్లు కావాలన్నా లంచం.. చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు పాలనలో గ్రామాల్లో అతి భయానకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరులో అవ్వాతాతలు వచ్చి వారి బాధలు చెప్పుకున్నారు. పెన్షన్లు రాక, జన్మభూమి కమిటీల వేధింపులు భరించలేక చివరకు కోర్టుకు వెళ్లారు. తాము చనిపోయామంటూ పెన్షన్లు ఇవ్వడం లేదని, కానీ, బతికే ఉన్నామని కోర్టు ముందు చెప్పుకున్నారట. అర్హులకు పెన్షన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా.. ఇప్పటికి కూడా చాలామందికి ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడం లేదు. నిన్ను నమ్మం బాబు అని గ్రామాల్లో నిరుపేదలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. రాష్ట్రాన్ని బాబు భోంచేస్తున్నాడు పైన చంద్రబాబు ఉంటాడు, కింద జన్మభూమి కమిటీలు ఉంటాయి. ఈ కమిటీల లంచాల తీరు గురించి ఇప్పటిదాకా చెప్పా. పైన చంద్రబాబు ఉంటాడు. ఆయన ఏదీ వదలడు, ఇసుక వదలడు. మట్టి వదలడు, బొగ్గు వదలడు. కరెంటు కొనుగోళ్లను వదలడు, కాంట్రాక్టర్లను వదలడు. మద్యాన్ని వదలడు, రాజధాని భూములు వదలడు, విశాఖపట్నం భూములు వదలడు. చివరకు గుడి భూములు, దళితుల భూములు కూడా వదలకుండా రాష్ట్రాన్ని భోంచేస్తున్నాడు. తప్పులను మనం నిలదీస్తే చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఎన్నికల సమీస్తున్న కొద్దీ చంద్రబాబుకు టెంపరేచర్ పెరుగుతోంది. ఇప్పుడు పేదలకు కొత్త ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఆదరణ–2 అని పాట పాడుతున్నాడు. మరో స్కీమ్ అంటాడు, ఇంకో స్కీమ్ అంటాడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు డ్రామా అనే కొత్త సినిమా తీస్తున్నాడు. ఎన్ని నాటకాలు అడినా.. నిన్ను నమ్మం బాబు అని ప్రజలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు పాలన మనమంతా చూశాం. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లుగా కొనేశారు. ఒక్కొక్కరికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చారు. అందులో కొందరిని మంత్రులను చేశారు. ఇలా దుర్మార్గమైన పాలన కావాలా? అని అడుగుతున్నా. ఇలాంటి మనిషి కావాలా? అని అడుగుతున్నా. నాలుగున్నరేళ్లుగా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి డ్రామాలు ఆడుతున్నాడు. అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఓట్లు వేయొద్దని చంద్రబాబు ఇటీవల తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చాడు. ఎన్నికలు వచ్చేసరికి ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చేస్తాడు. చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేశాడు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీ ప్రభుత్వాన్ని పొగిడాడు. హోదా కాకుండా ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో ఏకంగా తీర్మానాలు చేశాడు. ప్రత్యేక హోదా కావాలని మనమంతా అడిగితే వెటకారంగా మాట్లాడాడు. హోదా మాటెత్తితే జైల్లో పెట్టిస్తానని బెదిరించాడు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని మనల్నే ప్రశ్నించాడు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేసినంత మేలు ఇతర రాష్ట్రాలకు చేయలేదని కితాబిచ్చాడు. మార్పుల్లో మొదటిది.. 25 జిల్లాలు మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళణ చేయాలి. మనం చెప్పిన పథకాలు, మనం చెప్పే పనులు జరగాలంటే ఒక పటిష్టమైన వ్యవస్థ రావాలి. ఏదైనా పథకం చెబితే ఆ పథకం ప్రతీ పేదవాడి ఇంటికి చేరాలి. ఆ పేదవాడు ఏ పార్టీ, ఏ కులం, ఏం చేస్తున్నాడనేది అడ్డు రాకూడదని చెబుతున్నా. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలి. మారిన వ్యవస్థను పూర్తిగా ప్రతి పేదవాడికి దగ్గరకు తీసుకుపోవాలి. ప్రతి పథకం ప్రతి పేదవాడికి అందించాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చే మొట్ట మొదటి మార్పు జిల్లా స్థాయిలో చేస్తాం. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తాం. ప్రతి పార్లమెంటు నియజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని మీఅందరికి చెబుతున్నా. ఈ మార్పు ఎందుకంటే.. ప్రతి కలెక్టర్ ఏడు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే జవాబుదారీతనంగా ఉండాలి. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉండటంతో కలెక్టర్లకు జవాబుదారీతనం లేకుండా ఉంది. కలెక్టర్.. ప్రజలకు దగ్గరగా ఉండాలి. కలెక్టర్ చేతినిండా పని ఉండేలా చేసేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. గ్రామ సెక్రటేరియెట్లు తీసుకొస్తాం ప్రతీ పథకం పేదవారి ఇళ్లకు చేర్చాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియెట్ తీసుకొస్తాం. గ్రామంలో చదువుకున్న 10 మంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలిస్తాం. ప్రస్తుతం పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, బియ్యం కావాలన్నా, మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదు. గ్రామ సెక్రటేరియెట్లతో ఈ పరిస్థితిని మార్చేస్తాం. ఏ పేదవాడికి ఏ అవసరం ఉన్నా, పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్మెంట్, నవరత్నాల్లో మనం చెప్పే ప్రతీ పథకం వారి ఇంటి వద్దే నేరుగా ఇచ్చేలా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం. పథకాలు అమలు చేసేటప్పుడు లబ్ధిదారుల అర్హత మాత్రమే చూస్తాం. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడబోమని మీకు హామీ ఇస్తున్నా. ప్రతీ పథకం లబ్ధిదారుడి ఇంటికి తీసుకెళ్లాలంటే ఎలా సాధ్యం అంటే.. ప్రతీ గ్రామంలో 50 ఇళ్లకు ఒకర్ని గ్రామ వలంటీర్గా సేవా దృక్పథం ఉన్న యువతను తీసుకొని ఉద్యోగమిస్తాం. వారు జవాబుదారీగా ఉంటారు. వారికి రూ. 5 వేలు జీతం ఇస్తాం. ఆ వలంటీర్లు గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానంగా ఉంటూ పనిచేస్తారు. ఇది చిట్టి చివరి సభ కాబట్టి నవరత్నాల కోసం మీ అందరికి చెబుతా. ప్రతి పేదవాడిమోములో చిరునవ్వు చూడాలని, ప్రతి రైతుకళ్లలో ఆనందం నింపాలని నవరత్నాలను తీసుకొచ్చాం. నవరత్నాల్లో కొన్ని మార్పులు కూడా చేసుకుంటా వచ్చాం. నవరత్నాల్లోని ప్రతీ అంశాలను ప్రతిసభలోనూ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టీ ఒక్కో అంశాన్ని చెప్పుకుంటా వచ్చా. ఇక్కడ అన్ని అంశాలు మీకు వివరిస్తా. పెట్టుబడి తగ్గిస్తే రైతన్నకు ఆదాయం పెరుగుతుంది ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉందో.. రైతుల బతుకులు ఎలా ఉన్నాయో చూడమని మీకు చెబుతున్నా. రైతులకు ప్రధానంగా గిట్టుబాటు ధర లేదు. బ్యాంకుల్లో అప్పులు పుట్టడం లేదు. వడ్డీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్టుబడి వ్యయం పెరిగిపోతోంది. చివరకు పంట చేతికొస్తుందనుకుంటే కరువులు, తుపానులు వచ్చి రైతన్నలు నష్టపోతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. అసలు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. వీటన్నింటికి చరమగీతం పాడుతున్నా. రైతులు ప్రధానంగా ఐదు సమస్యలు ఎదుర్కొంటారు. మొట్టమొదటి సమస్య పెట్టుబడి. జూన్ మాసంలో పంట వేసేందుకు పెట్టుబడి కోసం సమస్య వస్తుంది. పెట్టుబడి తగ్గించగలిగితే రైతన్నకు ఆదాయం పెరుగుతుంది. ఈ పెట్టుబడులు తగ్గించేందుకు రైతులకు ఎలా మేలు చేస్తానో చెబుతున్నా. రైతు తరఫున ప్రభుత్వమే బీమా సొమ్ము (ప్రీమియం) కడుతుంది రైతుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతా ఉన్నా. ఇప్పటి వరకు ఏ సభలో చెప్పలేదు. మొట్టమొదటిసారిగా ఇక్కడ చెబుతున్నా. ప్రస్తుతం రైతుల బీమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. తుపానులు, కరువు వచ్చినా ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు ఆ సొమ్ము వస్తుందో.. రాదో తెలియదు. ఎందుకు ప్రీమియం తీసుకుంటున్నారో తెలియదు. రైతన్నల తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని చెబుతున్నా. ఇన్సూరెన్స్ కోసం రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. ఆ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఇన్సూరెన్స్ సొమ్ము పేదవాడికి ఇచ్చేందుకు ప్రభుత్వమే కృషి చేస్తుందని ఈరోజు ఇక్కడ కొత్తగా చెబుతున్నా. ఆక్వా రంగానికి రూ. 1.50లకే విద్యుత్ ఇస్తామని ఇదివరకే చెప్పా. వీటన్నింటి వల్ల పెట్టుబడి ఖర్చు రైతన్నలకు తగ్గుతుంది. ఇక రైతు ఎదుర్కొనే మరో సమస్య.. పంట పండించిన తర్వాత ఆ పంట అమ్ముకోలేని పరిస్థితి. గిట్టుబాటు ధర రాక రైతన్నలు అవస్థలు పడుతున్నారు. సహకార డెయిరీలను ప్రోత్సహిస్తాం గిట్టుబాటు ధర కోసం, మంచి రేట్లు రైతులకు వచ్చేందుకు సహకార రంగంలో డెయిరీలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తాం. సహకార డెయిరీలు మంచిరేట్లు ఇస్తే ప్రైవేటు డెయిరీలు కూడా పోటీ పడి ఎక్కువ ధర ఇస్తారు. సహకార రంగానికి చెందిన డెయిరీలకు పాలు పోస్తే లీటర్కు రూ. 4 బోనస్ ఇస్తాం. అప్పుడు ప్రైవేటు డెయిరీలు కూడా పోటీపడక తప్పదు. పంటతో పాటు పాడి ఉంటేనే రైతుకు ఆదాయం ఉంటుంది. ఒక సామెత కూడా ఉంది ‘పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట. కవ్వమాడు ఇంట కరువే ఉండదట’. పాడిని ప్రోత్సహిస్తేనే రైతన్న బతకగలుగుతాడు. ఒక లీటర్ పాలు ఒక బాటిల్లో ఒకాయన తీసుకొచ్చి నాకు చూపించాడు. ఆ పాల రేటు రూ. రూ.26. అదే బాటిల్లో మినరల్ వాటర్ లీటర్ నీళ్లు రూ. 23 అని ఆ అన్న చెప్పుకొచ్చాడు. నీళ్లకు సమాన రేటులో పాలు అమ్ముకునే అధ్వాన పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. ఈ పెద్దమనిషి చంద్రబాబు తన సొంత కంపెనీ హెరిటేజ్ పాల కోసం.. దాని లాభాల కోసం రైతన్నలను గాలికొదిలేశారు. తానే దళారీలకు కెప్టెన్ అయ్యి, తానే పాలు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు తన హెరిటేజ్లో అమ్ముకునే పరిస్థితి ఉంది. హెరిటేజ్ షాపులో మీగడ తీసేసిన పాలు అధిక ధరలకు అమ్ముతున్నారు. సహకార రంగంలో డెయిరీలను ప్రోత్సహిస్తేనే పాడి రైతులు బాగుపడతారు. ఇక ఈ అంశంలోనే చివరిది.. వ్యవసాయరంగంలో వాడే ట్రాక్టర్లకు రోడ్డు టాక్స్ పూర్తిగా రద్దు చేస్తాం. జీడి తోటలకు రూ. 50 వేల పరిహారం అనుకోకుండా కరువు వచ్చినా, తుపాను వచ్చినా రైతన్నకు దిక్కుతోచని పరిస్థితి. తిత్లీ తుపాను వచ్చింది. చెట్లు ఒరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టింది. అక్షరాలా రూ. 3,435 కోట్లు నష్టమని లెక్క గట్టింది. కానీ 15 శాతం.. కేవలం రూ. 500 కోట్లు ఇచ్చి చంద్రబాబు చేతులు దులుపుకొన్నాడు. పబ్లిసిటీ మాత్రం ఏ స్థాయిలో చేస్తాడంటే.. ఏ ఆర్టీసీ బస్సునూ వదిలిపెట్టడు. విజయవాడ, విశాఖపట్నంలో ఫ్లెక్సీలు పెట్టిస్తాడు. ఈ శ్రీకాకుళం జిల్లా వరకు తిత్లీ తుపాను బాధితులకు, కిడ్నీ బాధితులకు ఏం చేయబోతున్నామో çగతంలో చెప్పాను. రూ.4వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్ రాష్ట్రవ్యాప్తంగా తుపాను, కరువు రూపాల్లో కష్టమొస్తే రైతుకు తోడుగా ఉండేందుకు ప్రకృతి వైపరీత్యాల ఫండ్ కింద రూ. 4 వేల కోట్లతో నిధి పెడతాం. రూ. 2 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెడితే మరో రూ. 2 వేల కోట్లు కేంద్రం నుంచి సహకారం అందుతుంది. ఎక్కడ కరువు వచ్చినా, తుపాను వచ్చినా ఆ 4 వేల కోట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏ రైతుకు నష్టం రాకుండా చేస్తాం. ప్రతి రైతుమోములో చిరునవ్వు కన్పిస్తుంది. తిత్లీ తుపానుకు కొబ్బరిచెట్లన్నీ పోయాయి. చెట్టుకు రూ. 1500లు అని చెప్పారు. జీడి పంటకు ఎకరాకు రూ. 30 వేలు ఇచ్చారు. సరిపోదయ్యా అని రైతులు నెత్తినోరూ మొత్తుకున్నారు. కనీసం పట్టించుకోలేదు. కానీ మీకు హామీ ఇస్తున్నా. కొబ్బరిచెట్టు పరిహారం రూ. 3 వేలు, జీడితోటలకు పరిహారం రూ. 50 వేలు చేస్తామని హామీ ఇస్తున్నా. ఈ విధంగా రైతన్నకు తోడుగా ఉండే పరిస్థితి ప్రకృతి వైపరీత్యాల నిధి ద్వారా వస్తుంది. మనందరి ప్రభుత్వం రాగానే రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తా. ఏ రేటుకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో ఆ రేటును రైతులు పంట వేసే ముందే ప్రకటిస్తాం. దీంతో దళారీలు ప్రభుత్వం ప్రకటించిన ధరతో పోటీపడాల్సి ఉంటుంది. ప్రభుత్వ రేటు కంటే ఎక్కువకు వారు కొనుగోలుచేసే పరిస్థితి వస్తుంది. దీంతో రైతన్నకు గిట్టుబాటు ధర వస్తుంది. ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తాం. అవసరమైన చోట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతన్నలకు అన్నిరకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ఇక చివరగా జలయజ్ఞం. నాలుగున్నరేళ్లు చంద్రబాబు పాలన చూసాం. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏ ప్రాజెక్టు చూసినా ఎస్టిమేషన్స్ పెంచేశారు. కాంట్రాక్టర్ల కింద తన బినామీలు తెచ్చారు. ఇష్టమొచ్చినట్లుగా రేట్లు పెంచి డబ్బులు దోచేస్తున్న పరిస్థితి. పోలవరం మొదలుకొని గాలేరు, నగరి, హంద్రీనీవా.. అన్నీ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రైతులకు 9 గంటలు పగటి పూటే కరెంట్ ఇస్తాం. మే నెలలోనే ప్రతి రైతు చేతికి రూ.12,500 ఆ తర్వాత రైతన్న కోసం చేయబోయే మూడో పని ఏంటంటే.. రైతన్నకు మే మాసంలో పెట్టుబడి ఖర్చు అవసరం. దానికోసం బ్యాంకుల నుంచో.. ప్రైవేట్ వ్యక్తుల వద్దనుంచి రెండు, మూడు రూపాయల వడ్డీకో రైతులు అప్పులు చేíస్తారు. రైతులు అప్పుల్లో కూరుకుపోకుండా ఉండేందుకు మే మాసంలోనే ప్రతి రైతుకు రూ. 12,500 నేరుగా వారి చేతిలో పెడతాం. ఇది ఎందుకంటే.. రాష్ట్రంలో దాదాపు 85 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 70 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం భూమి ఉన్నవారే. ఇలాంటి రైతులకు అప్పులు పుట్టడం కష్టం. దీంతో పెట్టుబడి కష్టమవుతుంది. అష్టకష్టాలు పడుతున్న రైతన్నలకు తోడుగా ఉండేందుకు ఏడాదికి రూ. 12,500 వారి చేతుల్లోనే పెడతాం. ఈ డబ్బు గతంలో వాళ్లు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులతో సంబంధం లేకుండా ఇస్తాం. డబ్బు చేతికిచ్చి.. వాళ్లు పంటలను వేసుకుంటారో వాళ్లకే వదిలి పెడతాం. ఎకరా విస్తీర్ణంలో పంటలు పెట్టడానికి చాలా పంటలకు 80–90 శాతం పెట్టుబడిగా ఈ 12,500 సరిపోయే పరిస్థితి కన్పిస్తుంది. దీని వల్ల పెట్టుబడి ఖర్చుబాగా తగ్గే అవకాశం ఉంటుంది. పెద్దరైతులకు కూడా ఉపయోగపడుతుంది. పెట్టుబడి తగ్గించే విషయంలో ప్రతి రైతన్నకు చేయబోయే నాల్గో పని ఏమిటంటే.. ఉచితంగా బోర్లు వేయిస్తాం. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వారి కుటుంబం దీనగాథలు విన్నప్పుడు.. పలుమార్లు బోర్లు వేసి అప్పుల పాలవతున్నాం అని చెబుతున్నారు. బోర్లు వేసినపుడు పడ్డ నీళ్లు సంవత్సరానికల్లా ఆగిపోతున్నాయి. ప్రతి రైతుకు తోడుగా ఉండేందుకు బోర్లు ఉచితంగా వేయిస్తానని చెబుతున్నా. -
341వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,648 కిలోమీటర్లు 341వ రోజు నడిచిన దూరం: 9.1 కిలోమీటర్లు 09–01–2019, బుధవారం, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం జిల్లా రాజన్న రాజ్యాన్ని తేవాలన్న ప్రజా సంకల్పం.. నాలో వజ్ర సంకల్పంగా మారింది మన సంకల్పం మంచిదైతే దేవుని దయ కూడా తోడవుతుంది. 14 నెలల కిందట ఇడుపులపాయలో నాన్నగారి పాదాల చెంత ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర.. ఇచ్ఛాపురంలో విజయ సంకల్ప స్తూపాన్ని చేరింది. 341 రోజులుగా 13 జిల్లాల్లో.. 3,648 కి.మీ సాగిన యాత్ర.. నేటితో ముగిసింది. నాన్నగారు, సోదరి షర్మిల, నేను.. మా ముగ్గురి పాదయాత్రలు ఇచ్ఛాపురంలోనే ముగియడం చరిత్రాత్మకం. దానికి గుర్తుగా 3 స్తూపాలుండటం ఓ మధుర జ్ఞాపకం. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు వేలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేయడం.. కోట్లాది మంది ప్రజలను ప్రత్యక్షంగా కలవడం.. ప్రపంచ చరిత్రలో ఎవరికీ దొరకని అదృష్టం. ఇది దైవ నిర్ణయం.. ఇది ప్రజల ఆశీర్వాదం. కోట్లాదిమంది గుండె చప్పుళ్లు వినగలగడం.. నా జీవితానికే గొప్ప అనుభవం. నా ఈ పాదయాత్ర ప్రజల కష్టాలను, కడగండ్లను దగ్గరగా చూడగలిగిన అవకాశం. పరిష్కరించదగిన చిన్న చిన్న సమస్యలూ తీరకపోవడంతో ఏళ్ల తరబడి వారు చేస్తున్న జీవన పోరాటం.. గుండెను బరువెక్కించింది. అత్యధికశాతం సమస్యలకు పాలకులే కారణమవడం ఆశ్చర్యమేసింది. గుండె ను పిండే దయనీయ గాథలెన్నో ఎదురయ్యాయి. ఉదయగిరిలో అంకమ్మరావు అనే బలహీనవర్గాలకు చెందిన ఇంజినీరింగ్ చదువుతున్న ఓ సోదరుడు.. ఫీజురీయింబర్స్కాక, బకాయిలు కట్టడానికి కూలి చేసే తండ్రి పడుతున్న కష్టాన్ని చూడ లేక ఆత్మహత్య చేసుకోవడం మనసును కలచివేసింది. అప్పులు తీర్చడానికి కిడ్నీ అమ్ముకున్న ఓ అన్నదాత.. బతుకుదెరువుకు గుంటూరు జిల్లా లోని ఓ చిన్న హోటల్లో పనిచేస్తుండటం అత్యంత దయనీయం. కొండకెంగువలో 108 రాక.. దండసి మేరీ అనే ఓ సోదరి ఆటోలో కుదుపులకు రక్తస్రావమై పురిటిలోనే బిడ్డను కోల్పోయిన ఘటన చలింపజేసింది. విజయవాడలో నిండా 30 ఏళ్లు నిండని ఓ ముస్లిం సోదరి.. ఆరోగ్యశ్రీ అందక, సీఎం సహాయ నిధి రాక, కిడ్నీ చికిత్స కోసం భర్త నడుపుకుంటున్న ఆటోనూ అమ్మేసుకుని.. ఆదుకునేవారి కోసం ఎదురుచూస్తుండటం గుండెను పిండేసింది. రుణమాఫీ మాటలు నమ్మి మోసపోయి.. చేయని పాపానికి లాయర్ను పెట్టుకుని కోర్టు మెట్లెక్కిన వెంకటాపురం దళితవాడ డ్వాక్రా అక్కచెల్లెమ్మల కష్టాలు కళ్లారా చూశాను. 90 ఏళ్లు పైబడ్డ పండు ముసలివాళ్లు.. భర్తలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతువులు మొదలుకుని.. వందశాతం వైకల్యంతో మంచానికే పరిమితమైన దివ్యాంగుల వరకు.. దాదాపు 900 మంది కి నిర్దాక్షిణ్యంగా పింఛన్లు తొలగించిన పాలక నేతల రాక్షసత్వం పొందూరులో నా దృష్టికొచ్చింది. అమ్మణ్ణమ్మ అనే అవ్వ చనిపోయిందని పింఛన్ ఆపితే.. ‘నేను బతికే ఉన్నా’నని కోర్టులో చెప్పుకోవాల్సిరావడం.. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖం లఉన్న మెట్ట లక్ష్మి అనే సోదరి వితంతువు కాదం టూ పింఛన్ ఆపితే.. ‘నాకు పింఛన్ అవసరం లేదు.. నా భర్తను చూపండిచాలు’ అంటూ న్యాయమూర్తికి మొరపెట్టుకోవడం.. ప్రభుత్వ దాష్టీకాలకు పరాకాష్ట. భర్తలుండగనే పిఠాపురంలో తప్పుడు డెత్ సర్టిఫికెట్లు సృష్టించి.. సుమంగళిలను వితంతువులుగా చూపించి.. పింఛన్లు మింగేసిన వైనం.. అధికార నేతల దిగజారుడుతనానికో నిదర్శనం. అన్నపూర్ణగా పేరుగాంచిన గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు మండలంలోనే.. ఈ పాలనలో ఏకంగా ఏడుగురు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వ్యవసాయ దుస్థితికి అద్దం పట్టింది. ప్రభుత్వ సాయం కరువై.. జీవచ్ఛవాల్లా బతుకుతున్న ప్రకాశం ఫ్లోరైడ్ కథలు.. ఉద్దానం కిడ్నీవెతలు.. కంటతడి పెట్టించాయి. ముఖ్య మంత్రిగారిచ్చిన తుపాను పరిహారపు చెల్లని చెక్కు ల మోసాలు.. వనరులన్నింటినీ దోచేసిన వైనాలు.. జన్మభూమి కమిటీల దుర్మార్గాలు.. వంచిపబడ్డ అన్ని కులాల, వర్గాల, సంఘాల ఆక్రోశాలు.. జీవితాలను ఛిద్రంచేసిన మద్యం కథలు.. వలసల వెతలు.. అభివృద్ధిలేక, సంక్షేమం అందక సంక్షోభంలో కూరుకుపోయిన జనజీవితాలు.. ఒక్కటేమి టి, సమస్తం పాదయాత్రలో సాక్షాత్కరించాయి. చెప్పుకునే దారిలేక.. మనసు విప్పే మార్గం కనిపించక.. తల్లడిల్లుతున్న కోట్లాది జనం నా అడుగులో అడుగులేశారు. వారి ప్రేమ, ఆప్యాయతలే నన్ను నడిపించాయి. ఆ ప్రజా సంకల్పమే దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికింది. అధికార పార్టీ అవకాశవాద ముసుగు తొలగించింది. కన్ను కుట్టిన పాలక నేతల కుట్రల నుంచి పుట్టుకొచ్చిన హత్యాయత్నం నుంచి.. ప్రజాశీర్వాదమే నన్ను కాపాడింది. ఆ ప్రజల నమ్మకం.. నా బాధ్యతను మరింత పెంచింది. ‘ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎంతమంది హృదయాల్లో జీవించామన్నది ముఖ్యం’ అన్న నాన్నగారి మాటలు నా మదిలో మెదలుతున్నాయి. రాజన్న రాజ్యాన్ని తేవాలన్న ప్రజా సంకల్పం.. నాలో వజ్ర సంకల్పంగా మారింది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాన్నగారి పాదయాత్ర నుంచి ఆరోగ్యశ్రీ, 108, ఫీజురీయింబర్స్వంటి అనేక అద్భుత పథకాలు పుట్టుకొచ్చాయి. మీ పాదయాత్ర నుంచి వచ్చిన ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా? మీ పాదయాత్ర హామీలు నెరవేరకపోగా.. ఆ నాటి సమస్యలు మరింత జటిలమయ్యాయని.. మీ వల్లే మరిన్ని సమస్యలు పుట్టుకొచ్చాయని.. జీవితాలు దుర్భర మయ్యాయని.. ప్రజలు ఆక్రోశిస్తున్నారు.. వారికేం సమాధానం చెబుతారు? -వైఎస్ జగన్ -
పోటెత్తిన జన జాతర... జగన్ యాత్ర
ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల గుండా 350 రోజులపాటు దాదాపు 3650 కిలోమీటర్ల దూరం వరకూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగించిన జనసంకల్ప యాత్ర మండువేసవిని, కుంభవృష్టిని, తుపానులను, చలిగాలులను ధిక్కరిస్తూ తనకు తానుగా ఒక చరిత్రను సృష్టించుకుంది. ఈ పాదయాత్రకు బలమైన నేపథ్యం ఉంది. విభజనానంతరం ఏపీ అసెం బ్లీలోనూ, బయటా టీడీపీ ప్రభుత్వ దాష్టీకాన్ని, ప్రశ్నించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు వ్యవహరించిన తీరును నిశితంగా గమనించిన జగన్ ఇక అధికార పక్షంతో అసెంబ్లీలో పోరాడటం వ్యర్థమని గ్రహించి ప్రజలకు దగ్గరవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, సాధ్యమైనంతవరకు వాటికి పరిష్కారాలు వెదకటానికి ప్రయత్నించారు. నవరత్నాలను ప్రకటించిన గుంటూరు ప్లీనరీ అనంతరం టీడీపీపై బహుముఖరీతిలో ఒత్తిడి పెంచాలని జగన్ నిర్ణయించారు. తనకు తాను స్వయంగా పాదయాత్రను చేపట్టారు. ప్రతిరోజూ అసెంబ్లీని బహిరంగ సెషన్గా మార్చి ప్రజల ముందుకు ప్రభుత్వాన్ని లాగి నేరుగా ప్రశ్నించే ప్రక్రియే పాదయాత్ర. ఇటీవలికాలంలో ఏ జాతీయ, ప్రాంతీయ రాజ కీయ నేతకూ సాధ్యంకాని రీతిలో జనసమీకరణకు పాదయాత్ర పట్టం కట్టింది. ప్రతిరోజూ పాదయాత్ర ఓ కొత్త ప్రారంభమే. కొత్త సమస్యలను పరిష్కరించడమే. ప్రజలనుంచి నిత్యం నేర్చుకుంటూ వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడమే. ప్రజలనుంచి తెలుసుకున్న అంశాలను వారి బాధలను నేరుగా తన ప్రచార కార్యక్రమంగా మార్చుకున్నారు జగన్. ప్రజాసంకల్ప యాత్ర అంతిమ ఘట్టంలోకి వచ్చేసరికి భవి ష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ పథకాన్ని రూపొందించుకుంటూ ప్రజల మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నారు. గ్రామ సచి వాలయం, గ్రామ స్వరాజ్కి సంబంధించిన వినూత్న భావనలు కూడా ఈ పాదయాత్రలోనే జగన్ భావి కార్యాచరణ అమలుకు సన్నద్ధంగా తోడై నిలిచాయి. ఇడుపులపాయలో ప్రారంభించి గుంటూరు జిల్లాకు చేరుకున్న జగన్కి జనం ప్రభంజనంలా స్వాగతమిచ్చింది. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా నదిపై, గోదావరి నదిపై నిర్మించిన అతి భారీ వంతెనలు సైతం తలవంచి నమస్కరించడమే కాకుండా ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రజల భాగస్వామ్యంలో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ప్రాణహాని తలపెట్టినా చిరునవ్వే సమాధానం: వైఎస్ జగన్కు పెరుగుతున్న ప్రజాదరణను జీర్ణించుకోలేని విచ్ఛిన్నకర శక్తులు ఆయనపై భౌతికంగా దాడి చేసి తుదముట్టించాలని పథకం రచించాయి. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై కత్తితో దాడిచేసిన శ్రీనివాస్ అధికారం చలాయిస్తున్న కీలక సూత్రధారుల చేతిలో పావు మాత్రమే. కోట్లాది ప్రజలు, దేవుడు, వైఎస్సార్ ఆత్మ ఆశీస్సులతో జగన్ కనీస గాయాలతో ఈ కుట్ర నుంచి తప్పించుకున్నారు. తనపై దాడిని పురస్కరించుకుని టీడీపీపై ప్రతీకారం తీర్చుకోవాలని జగన్ భావించి ఉంటే ఏపీ మొత్తం మంటల్లో మండిపోయేది. అలాంటి పరి స్థితి రాకూడదనే ప్రథమ చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్ వెళ్లి అక్కడే చికిత్స చేయించుకున్నారు. అటు సీఎం, ఇటు డీజీపీ కలిసి జగన్ అభిమానే దాడిచేశారని వక్రభాష్యాలు చెప్పడం నుంచి.. హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి జాతీయ దర్యాప్తు సంస్థకు సహకరించవద్దంటూ రాష్ట్ర పోలీసు శాఖను ప్రేరేపించడం దాకా బాబు ప్రజల హృదయాల్లో జగన్పై దాడి కేసులో ప్రథమ ముద్దాయిగానే నిలిచిపోయారు. అదే సమయంలో తనపై ప్రభుత్వం, సీఎం, టీడీపీ నేతలూ ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా కిమ్మనకుండా, తనకు న్యాయస్థానమే న్యాయం చేయాలని కోరిన జగన్ ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. పాదయాత్ర ముగింపునకు సమీపిస్తున్న సందర్భంగా గత కొద్ది రోజులుగా సీనియర్ జర్నలిస్టులకు టీవీ ఇంటర్వూ్యలు ఇస్తూ వస్తున్న వైఎస్ జగన్ ప్రజా సంక్షేమానికి సంబంధించినంతవరకు తన దృష్టినీ, విజన్నూ ఏ శక్తీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. గంట కుపైగా సాగిన ఆ ఇంటర్వూ్యలలో ఎంతో ఆత్మవిశ్వా సంతో, భావ స్పష్టతతో మాట్లాడిన వైఎస్ జగన్ అదే సమయంలో చంద్రబాబుపై ఒక్క తేలికపాటి వ్యాఖ్య కూడా చేయలేదు. ప్రజల సంక్షేమంపైనే తనకు నిబ ద్ధత ఉందని ఆయన చాటుకున్నారు. రాజీలేని దీక్షతో ప్రజలకు సేవ చేయడం, తన తండ్రిలాగే ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సాధించుకోవడమే తన ఏకైక వాంఛ అని వైఎస్ జగన్ స్పష్టంగా పేర్కొన్నారు. సమకాలీన ప్రపంచం కనీ వినీ ఎరుగని జన ప్రభంజనాన్ని పాదయాత్ర ద్వారా ఆకర్షించిన జగన్ వచ్చే ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించనున్నారని జనవాక్యం. - గౌరవ్ -
జనహితం జగన్ ‘లాంగ్మార్చ్’
రెండో మాట వర్తమాన కాల పరిస్థితులను గమనిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీలో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా తలపెట్టిన అపూర్వమైన ప్రజాçసంకల్ప యాత్ర సరికొత్త చైతన్యాన్ని రగుల్కొల్పింది. సంకల్పయాత్రలో భాగంగా నింగి లోతులు చూశారు, సేద్య ధారలందించే జలనిధుల్ని కొలిచారు. ప్రయాణించిన ప్రతిచోటా మట్టిబెడ్డను కలుసుకున్నారు. రాతిముక్కను కలుసుకున్నప్పుడల్లా దానిలోని రత్న తత్వాన్ని తెలుసుకున్నారు. వేలు, లక్షలాదిమంది సామాన్య ప్రజల గుండెచప్పుళ్లను దగ్గరగా విన్నారు. తన తపస్సు ఫలించి తన సందేశం తెలుగుజాతి గుండెల్లో ఘూర్ణిల్లి, అది కాస్తా జనత పాడుకునే మంత్రంగా మోగాలని ఆశిస్తున్నారు జగన్. ‘‘నాగరికత సృష్టికర్త భూమండలం కాదు, మనిషి మాత్రమే’’నని చాటినవారు ప్రపంచ ప్రసిద్ధ చరిత్రకారులు, ప్రపంచ నాగరికతా చరి త్రను సుమారు పదకొండు సంపుటాలలో క్రోడీకరించి దించిన సాధికార చరిత్రకారులు విల్ డూరాంట్, ఏరియల్ డూరాంట్ దంపతులు. ఆ నాగ రికతలో అంతర్భాగంగానే సామాజిక పురోగతిలోని ఎగుడుదిగుళ్ల ఫలి తంగా తలెత్తిన మానవకల్పిత అసమానతలకు, పరస్పర దోపిడీకి గురైన కారణంగా దగాపడిన దళిత బహుజన బడుగు వర్గాల సమున్నతికి కంకణం కట్టుకున్నవారు లేకపోలేదు. కానీ, ఈ అసహజ సామాజిక పునాదికి మూలాలు కనుగొన్న స్ఫూర్తి ప్రదాతలు అన్ని కాలాలలోనూ ఉన్నారు. ఒడ్డున నిలబడి సము ద్రాన్ని పొగడొచ్చుగానీ దాని లోతు పాతులు తెలుసుకోవడం కష్టం. ఈ పరిస్థితిని ఎక్కువ దూరదృష్టితో అంచనా కట్టినవాడు కవి సినారె. ఆయన మాటల్లోనే: ‘‘ఎన్ని మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలు నింగి లోతును చూడగోరితే నీటి చుక్కను కలుసుకో! మనిషి మూలం తెలియగోరితే మట్టిపెడ్డను కలుసుకో! రత్న తత్వం చూడగోరితే రాతిముక్కను కలుసుకో! రత్నమై ప్రకాశించాలంటే ముందుగా రాతి తత్వం తెలుసుకో! కాలగతిలో ఎంత చరిత్ర దాగెనో మౌన వీణను మీటి తెలుసుకో!’’ ఆ తవ్వోడలో భాగంగా ఆ తూరుపుకొండల్లోనే ఉదయించిన సూర్యు లెందరో, అరచేతిని అడ్డుపెట్టినా ఆ సూర్యకాంతిని ఎవరూ ఆపలేరన్న సందేశమూ ప్రకాశమానంగా, నేటికీ జాలువారు తున్నదీ ఆ సంప్ర దాయం నుంచే. అదే స్ఫూర్తితో నేడు జనహితమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ నాయకుడు, యువనేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడూ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమా రుడు జగన్మోహన్రెడ్డి యుక్త వయసులోనే తన చుట్టూ పాలకులల్లిన ముళ్ల కంచె నుంచి బయటపడి తెలుగు జన మహా సంద్రంలోకి దిగి తన అనుభవ పాఠం నుంచి ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సంకల్ప యాత్ర ద్వారా కొత్త పాఠాలు నేర్చుకోసాగారు. పాలకపక్షాల కుట్రలను, కుహ కాలను ఛేదించడం కోసమే జగన్ ఒక్క అడుగుతో ప్రారంభించిన జన హిత యాత్రను ప్రజా సంకల్పయాత్రగా మార్చడంలో భాగంగా నింగి లోతులు చూశారు, సేద్య ధారలందించే జలనిధుల్ని కొలిచారు, మనిషి మూలాలను తెలుసుకునేందుకు ప్రయాణించిన ప్రతిచోటా మట్టిబెడ్డను కలుసుకున్నారు. రాతిముక్కను కలుసుకున్నప్పుడల్లా దానిలోని రత్న తత్వాన్ని తెలుసుకున్నారు, తద్వారా కాలగతిలో దాగిన పేదజీవులు, కష్ట జీవులు చిందించి నిర్మించిన చరిత్రనూ ఈ ప్రజా సంకల్ప యాత్రలో తన మౌనవీణను మీటి మరీ తెలుసుకున్నారు. రత్న తత్వాన్ని గ్రహిం చిన జగన్ ప్రజల కనీస అవసరాలను తీర్చగల ‘నవరత్న’ పథకాన్ని రూపొందించారు. పాలకులు ఉద్దేశిత లక్ష్యాలను నెరవేర్చనప్పుడు రాజీ నామా ఇచ్చి పోవాలన్న నీతిని ప్రజల మనస్సుల్లో నాటగలిగారు. అంతేగాదు, కేంద్ర, రాష్ట్రాలలోని పాలకాధములు తనను, తన భవి ష్యత్తును రాచి రంపాన పెట్టడానికి ఏ నీచానికైనా పాల్పడటానికి సిద్ధ మైనప్పుడు అనితర సాధ్యమైన ఆత్మస్థయిర్యంతో హుందాగా ఎదు ర్కొంటూ తొట్రుపాటు లేకుండా, నిమిషంపాటు అసహనాన్ని కూడా ప్రదర్శించకుండా అనునిత్యం దుష్టపాలనా శక్తులను ఒక్కుమ్మడిగా ఎదు ర్కోగల ధైర్యాన్ని, దిటవునూ తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలలో పాదుకొల్పుతూ జగన్ చేసిన మహా సాహస శాంతి క్రతువు ప్రపంచ చరిత్రలో మరొక ‘లాంగ్మార్చ్’గా చెప్పుకోవచ్చు. ఛైర్మన్ మావో సే టుంగ్ నాయకత్వంలో చైనీస్ రెడ్ ఆర్మీ నిర్వహించిన ‘లాంగ్ మార్చ్’కి, జగన్ సారథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు సాగించిన ప్రజా సంకల్పయాత్రకు మధ్య కొన్ని అంశాలలో పోలికలు లేకపోలేదు: 370 రోజులలో చైనీస్ ‘లాంగ్ మార్చ్’ 9,000 కిలోమీటర్ల (5,600) మైళ్ల పర్యంతం సాగగా, జగన్ ప్రజా సంకల్పయాత్ర 341 రోజుల్లో 3,600 కిలోమీటర్లు (2,237 మైళ్లు) పూర్తి చేసుకుంది. ప్రపంచ చరిత్రలో ఈ రెండూ చరిత్ర సృష్టించిన ‘పాదయాత్ర’లే. చైనీస్ రెడ్ ఆర్మీ దేశ విమోచన కోసం గ్రామాలను, పట్టణాలను ప్రజా సహకారంతో విముక్తి గావించుకుంటూ సాగిన విప్లవ ప్రభంజనం కాగా, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సుదీర్ఘ సంకల్పయాత్ర.. పాలకుల అంధ పరిపాలన నుంచి బయటపడి వెలుగు చూడగోరుతున్న గ్రామీణ, పట్టణ, పేద, మధ్యతరగతి వృత్తి జీవులు, రైతాంగ విద్యాధిక యువతతో కూడిన లక్షలు, కోట్లాది తెలుగు ప్రజలలో నవ చైతన్యాన్ని రగుల్కొల్పగలిగిన మహా సంఘటన. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పాదయాత్రలకు తొలిరూపం 1935– 1936లో నాటి మద్రాసు శాసనసభకు, ముఖ్యమంత్రి రాజగోపాలాచారి మంత్రివర్గానికి రైతాంగ సమస్యలపై బృహత్ మెమొరాండాన్ని సమ ర్పించడానికి కొమ్మారెడ్డి సత్యనారాయణ, కమ్యూనిస్టు నాయకులు చల సాని వాసుదేవరావు నాయకత్వంలో ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకు 1,500 కిలోమీటర్లు సాగిన రైతాంగ పాదయాత్ర. ఆ తరువాతి ఖ్యాతి– ఏపీలో కునారిల్లి పోతున్న కాంగ్రెస్ను పునఃప్రతిష్టించేందుకు కాంగ్రెస్ నాయకుడు, జనప్రియుడైన రాజశేఖరరెడ్డి తలపెట్టి జయప్ర దంగా నిర్వహించిన రాష్ట్రవ్యాపిత పాదయాత్రకు దక్కుతుంది. వైఎ స్సార్ పూర్వీకులు కాలానికి ఎదురీతగా నిలిచిన త్యాగధనులు. ఆ వార సత్వాన్ని, స్ఫూర్తినీ నేటితరంలో కొనసాగించిన వారు విజయమ్మ, కూతురు షర్మిల, జగన్మోహన్రెడ్డి. ఈ ముగ్గురి పాదయాత్రలకు వైఎస్ భారతి అందించిన ప్రోత్సాహం విస్మరించదగినది కాదు. మన దేశ చరిత్రలో ఆధ్యాత్మిక యాత్రలు, భజన సమాజాల యాత్రలే ఎక్కువ కానీ, నిజ జీవనానికి, ప్రజా సౌభాగ్య రక్షణకు, సమ సమాజ స్పృహతో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలు తక్కువ. దేశ చరిత్రలో రాజకీయ పాదయాత్రలూ లేకపోలేదు. గతంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో 1917లోనే బిహార్లోని చంపారన్లో ఉద్యమిం చిన దేశ తొలి రైతాంగ పోరాటం. ప్రజా సమస్యలు, వాటికిగల కారణా లను ఏకరువు పెడుతూ సాగిన మహోద్యమమది. ఆ తర్వాత స్వతంత్ర భారతంలో ప్రజాతంత్ర రిపబ్లిక్ రాజ్యాంగాన్ని పాలకులు భ్రష్టుపట్టించి, నిరంకుశ పాలనా శకాన్ని ప్రారంభించడంతో జయప్రకాష్ నారాయణ్, చంద్రశేఖర్ వంటి సర్వోదయ నాయకులు ప్రజలలో చైతన్యం రగిలిం చడానికి ఎన్నో ఉద్యమాలు, పాదయాత్రలూ నిర్వహించాల్సి వచ్చింది. సరిగ్గా ఈ స్ఫూర్తినుంచే, వర్తమాన కాల పరిస్థితులను గమనిస్తున్న వైఎస్ జగన్ ఏపీలో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా తలపెట్టిన అనుపమానమైన జనహిత, ప్రజాçసంకల్ప యాత్ర సరికొత్త చైతన్యాన్ని రగుల్కొల్పింది. అది ఆయనలో తాను గుర్తెరిగిన ప్రజా సమస్యల పరి ష్కారం వైపుగా యజ్ఞదీక్షకు బీజాలు నాటింది. నేటి పాలనాధికారపు మంత్రనగరిలో గణతంత్ర రిపబ్లిక్ అవతరణకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు వీలు కల్పించిన రాజ్యాంగమూ, అది నెలకొల్పిన వ్యవస్థలనూ దఫదఫా లుగా నిరంకుశ పాలకులు ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో జగన్కు తెలిసిపో యింది. చివరికి రాష్ట్ర పాలకులు కూడా కత్తిపోటు రాజకీయాన్ని ఆశ్ర యించి న్యాయవ్యవస్థలనూ, నేర విచారణ సంస్థలనూ శాసించే నిరం కుశులుగా మారడమూ, సత్వర న్యాయ విచారణకు, శిక్షా నిర్వహణకు వీలు లేనంతగా పాలకులు అన్య మార్గాలను అనుసరించి ‘రూల్ ఆఫ్ లా’ నుంచి, తప్పుకోవడానికి ద్వారాలు వెదకడమూ జరుగుతోంది. ఈ దారుణ పరిస్థితి– గత పదిహేనేళ్లలో న్యాయ వ్యవస్థలో పరోక్ష జోక్యా నికి స్థానిక పాలకులు పాల్పడిన పరిణామాలను జగన్తోపాటు ప్రజలూ, బాధ్యతగల పాత్రికేయులూ నిశితంగానే పరిశీలిస్తున్నారు. తన ప్రజా సంకల్పయాత్రలో జగన్ వేలు, లక్షలాదిమంది సామాన్య ప్రజల గుండెచప్పుళ్లను దగ్గరగా విన్నారు. ఒక్క ముసలి, ముతకలతోనే కాకుండా, అసంఖ్యాకంగా యువతీ యువకులతో ఎలా ఇంటరాక్ట్ అయ్యాడో, అంతే అసంఖ్యాకంగా వయోజన స్త్రీ పురుషులతో ఆప్యాయంగా మెలిగి వారి మనస్సులను గెలుచుకున్నారు. కుల, మత, వర్గ విచక్షణ లేకుండా చిన్నారులు, చంటిబిడ్డలను సహితం గోముగా, ఆప్యాయంగా ముద్దాడి, దీవించారు. అంతటి యాత్రలకూ అలసట గానీ, విసుగూ, విరామాలుగానీ లేకుండా నిరంతర చైతన్య జ్వాల మధ్య చిరునవ్వుతోనే– జన సమూహాల నుంచి వస్తున్న పలు అర్జీలను, మహ జర్లను, జరగాల్సిన పనులపై మెమోరాండాలు, వినతి పత్రాలు అందు కున్నారు. కమ్మరి కొలిమినీ తట్టారు, కుమ్మరి చక్రాన్నీ తిప్పారు. రైతు గుండెకు భరోసా ఇచ్చారు. సహస్ర వృత్తుల సమస్త చిహ్నా లకూ పరిచయమయ్యారు. తన మెడకు పాలక వర్గాలు ఎక్కు పెట్టిన ‘కోడికత్తి’ వ్యూహాన్ని త్వరలోనే ఛేదించబోతున్నారు జగన్. ఈ దుర్మార్గాన్ని గుర్తు చేసుకోబట్టే ‘ఆః’ అనే ఆశ్చర్యార్థక కవితలో మహాకవి శ్రీశ్రీ అంతరా ర్థాన్ని జగన్ బాధతో ఇలా మననం చేసుకోగలిగారు: ‘‘నిప్పులు చిమ్ము కుంటూ/నింగికి నేనెగిరిపోతే/ నిబిడాశ్చర్యంతో వీరు’’ నోరెళ్లబెడతారు, కుళ్లిపోతారు, కాగా ‘‘నెత్తురు కక్కుకుంటూ/నేలకు నే రాలిపోతే/ నిర్దాక్షి ణ్యంగా వీరె’’ లోలోపల సంతోషిస్తారు అని గుండె భారంతో అనగలి గారు జగన్. అందుకే అతను చిరంజీవి, అతడు జన నేత. తన తపస్సు ఫలించి తన సందేశం తెలుగుజాతి గుండెల్లో ఘూర్ణిల్లి, అది కాస్తా జనత పాడుకునే మంత్రంగా మోగాలని ఆశిస్తున్నారు జగన్. ఆప్తవాక్యంగా చివరికొక్కమాట– జగన్ ప్రవర్తనకు, ఒద్దికకు అచ్చెరువొందిన వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నట్టుగా ‘‘నన్ను నడిపించేవాడు నాకన్నా ఉన్నతుడై ఉండాలి’’ తథాస్తు!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను
-
ఇడుపులపాయ టూ ఇచ్ఛాపురం @ 3648 కీ.మీ
-
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జనసందోహం
-
మీ బాధలు నన్ను కదిలించాయి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఏదోఒక సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారం కోసం వేచిచూస్తున్న రాష్ట్ర ప్రజ లు తనపై పెట్టుకున్న ఆశలు తనను మరింత బలవంతుడిని చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సంద ర్భం గా తన మనస్సులో నెలకొని ఉన్న భావోద్వేగాలను ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ‘‘పాదయాత్ర సమయంలో మీరు చూపిన ప్రేమానురాగాలు నన్ను వినమ్రుడిని చేస్తున్నాయి. మీ బాధలు, వేదనలు నన్ను కదిలించాయి. మీరు నాపై పెట్టుకున్న ఆశలు నాలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. మీకు ఎల్లప్పుడూ సేవ చేయాలన్న నా కృతనిశ్చయం నన్ను కార్యదక్షత దిశగా మరింత బలవంతుడిని చేస్తోంది’’అని పేర్కొన్నారు. -
కీడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్
-
నవరత్నాలతో ప్రతి పేదవాడిని ఆదుకుంటా: వైఎస్ జగన్
సాక్షి, ఇచ్చాపురం : అధికారంలోకి వస్తే నవరత్నాలతో ప్రతి పేదవాడిని ఆదుకుంటామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 3,648 కిలోమీటర్లు సాగిన చారిత్రాత్మక పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పాదయాత్ర అనుభవాలను ప్రజలతో పంచుకున్న వైఎస్ జగన్.. అధికారంలోకి వస్తే చేసే పనులను వివరించారు. గ్రామానికో సెక్రటేరియేట్.. ‘ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియేట్ను తీసుకొస్తాం. స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి పథకం పేదవాడి ఇంటి ముందుకే వచ్చే విధంగా చేస్తాం. ప్రతి 50 ఇళ్ళకు ఒకరికి గ్రామ వాలంటీయర్గా తీసుకొని ఉద్యోగం ఇస్తాం. వీరికి రూ. 5 వేలు జీతం ఇస్తాం. వాలంటీయర్ ఆ 50 ఇళ్ళకు జవాబుదారీగా ఉంటూ.. గ్రామ సెక్రటేరియేట్తో అనుసంధానమై పనిచేస్తూ.. నవరత్నాలు నుంచి రేషన్ బియ్యం వరకూ.. నేరుగా ఇంటికే చేరేలా చేస్తాం. పగటిపూటే 9 గంటల ఉచిత కరెంట్.. రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పగటి పూటే 9 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం.. బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం ఏడాదికి రూ. 12,500 ఇస్తాం. రైతులందరికీ బోర్లు ఉచితంగా వేయిస్తాం. పంట ఇన్సూరెన్స్ల కోసం రైతులు ఇక ఆలోచించనక్కర్లేదు. అధికారంలోకి రాగానే ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆక్వా రైతుకు రూపాయిన్నరకే కరెంటు ఇస్తాం. గిట్టుబాటు ధరల కోసం రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాం. ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. ఈ రోజు లీటర్ పాలు రూ.26కు అమ్ముకుంటున్నారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు డైరీలను నాశనం చేశాడు. హెరిటేజ్లో మాత్రం అర లీటరు పాలు రూ.45కు అమ్ముతున్నారు. పాడి ప్రోత్సాహం కోసం.. లీటరుకు రూ. 4 బోనస్ ఇస్తాం. సహకార రంగం డైరీలను ప్రతి జిల్లాలో ప్రోత్సహిస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేస్తాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా.. రూ. 4 వేల కోట్లు(రూ. 2వేల కోట్లు రాష్ట్రం ప్లస్ రూ. 2 వేల కోట్లు కేంద్రం ఇస్తుంది) ప్రకృతి వైపరీత్యాల ఫండ్ పెడతాం. కొబ్బెరి చెట్లుకు పరిహారం రూ. 3 వేలు ఇస్తాం. జీడి చెట్లకు ఇప్పుడు ఇస్తున్న రూ. 30 వేలును రూ.50 వేలుకు పెంచుతాం. రైతన్నకు జరగకూడని నష్టం ఏమైనా జరిగితే.. వైయస్ఆర్ బీమా కింద రూ. 5 లక్షలు వెంటనే ఆ కుటుంబానికి ఇస్తాం. ఆ నష్టపరిహారం పూర్తిగా ఆడపడుచులకు ఇచ్చే సొత్తుగా చూసే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. దాంతో అప్పుల వాళ్ళు లాక్కొనే అవకాశం ఉండదు. ప్రతి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తాం.’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. డ్రాక్రా మహిళల కోసం వైఎస్సార్ ఆసరా.. 89 మంది లక్షల మంది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం. డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు ప్రస్తుతం ఎంత రుణం ఉందో దాన్ని నాలుగు విడతలుగా చెల్లింపు. ఫించన్లు: ప్రస్తుతం ఉన్న ఫించన్ల వయస్సు 65 నుంచి 60కు తగ్గింపు. అవ్వతాతకి రూ.2000 ఫించన్, వికలాంగులకు రూ. 3000. అమ్మఒడి : పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడొద్దు. పిల్లలను బడికి పంపితే చాలు ఏడాదికి ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు రూ. 500, ఇద్దరు పిల్లలకు రూ. 1000. ఆరో తరగతి నుంచి పదో తరగతి వారికి ఒక్కోక్కరి రూ.1000 చొప్పున ఇద్దరికి రూ. 2 వేలను నేరుగా తల్లలుకే అందజేత. హౌసింగ్: పేదలకు 25 లక్షల ఇళ్లు, జన్మభూమి కమిటీలతో పనిలేకుండా ఇళ్ల కేటాయింపు ఆరోగ్యశ్రీ : ఆరోగ్య శ్రీకి బడ్జెట్లో అవసరమైన నిధుల కేటాయింపు. సంపాదించే వ్యక్తికి ఆపరేషన్ అయితే విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం. కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్. ఫీజు రీయింబర్స్మెంట్: ప్రతి పేదవాడికి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్, ఖర్చుల కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేల సాయం. జలయజ్ఞం : పోలవరం సహా అన్ని ప్రాజెక్ట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి. మద్య నిషేధం: మూడు దశల్లో మద్య నిషేధం, మొదటి దశలో దుకాణాల సంఖ్య తగ్గింపు. ఊరురా వెలిసిన బెల్ట్షాపులపై ఉక్కుపాదం. షాక్ కొట్టేలా మద్యం ధరల పెంపు. రెండో దశలో పేద మధ్యతరగతికి మద్యం అందుబాటులోలేకుండా నిషేధం. మూడో దశలో ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం. తయారు చేసినా అమ్మినా ఏడేళ్లు జైలు శిక్ష పడేలా చట్ట సవరణ -
గ్రామంలో చదువుకున్న పది మందికి ఉద్యోగాలు
-
ప్రతి పార్లమెంట్ను జిల్లాగా చేస్తాం
-
రైతుల తరపున ఇన్సూరెన్స్ను ప్రభుత్వమే చెల్లిస్తుంది
-
యాత్ర ముగిసినా..పోరాటం కోనసాగుతుంది
-
ముగిసిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
-
ప్రజల గుండె చప్పుడు విన్నాను : వైఎస్ జగన్
సాక్షి, ఇచ్చాపురం : ‘ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను. ఆ గుండె చప్పుడిని నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 3,648 కిలోమీటర్లు సాగిన చారిత్రాత్మక పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నడిచింది తానైనా.. నడిపించింది మాత్రం ప్రజలేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు హయాంలో దగాపడ్డ రైతన్నా.. మోసపోయిన డ్వాక్రా అక్కా చెళ్లెమ్మలు.. ఉద్యోగం రాక నిరాశలో ఉన్న యువతను పాదయాత్రలో కలిసానని, వారి గోడును విన్నానని తెలిపారు. ‘ఇలా ప్రతి ఒక్కరిని కదిలిస్తే.. చంద్రబాబు పాలనపై ఏమంటున్నారో తెలుసా.. చంద్రబాబును నమ్మం అంటున్నారు’ అని వైఎస్ జగన్ తన పాదయాత్ర అనుభవాలను పంచుకున్నారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. ఇంత ఊహించలేదు.. ‘ఇడుపులపాయలో తొలి అడుగువేసినప్పుడు ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుందని, ఇన్ని కోట్ల మంది ప్రజాభిమానం లభిస్తుందని ఊహించలేదు. నడిచింది నేనైనా.. నడిపించింది మీరూ(ప్రజలనుద్దేశించి).. పైనున్న ఆ దేవుడు. నాన్నగారి ఆశీస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. రికార్డు స్థాయిలో పాదయాత్ర విజవంతమైందంటే.. మీ ఆశీస్సులేనని నిస్సంకోచంగా చెబుతాను. ఎంత దూరం నడిచామన్నది ముఖ్యం కాదు.. ఎంత మందిని కలిసి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనలో రాష్ట్ర విభజన నష్టం ఒక వైపు.. చంద్రబాబు దోపిడీ మరోవైపు. రుణమాఫీ అంటూ చంద్రబాబు చేసిన మోసం ఒక వంకా.. నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసగించిన చంద్రబాబు నైజం మరోవంక. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు చేసిన వాగ్ధానాలు. ఆ 600 హామీలు మోసం చేసిన విధానం. ఇవన్నీ చూస్తే గుండె మండుతోంది. పిల్లలను అవిటిగా మార్చి అడుక్కునే వారికి.. ప్రజలు కష్టాల్లో ఉన్నా.. విపరీతంగా దోచుకుంటున్న చంద్రబాబుకు ఏమైనా తేడా ఉందా? అని అడుగుతున్నా? ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగిన పాదయాత్ర విషయాలు చెబుతా.. అనంతపురం రైతు శివన్న.. అనంతపురంలో శివన్న అనే రైతు నన్ను కలిశాడు.. రెయిన్ గన్ల గురించి కంటికి కట్టినట్లు చెప్పాడు. వ్యవసాయం ఎలా కుదేలైందో.. లక్షమంది ఎలా వలుస వెళ్తున్నారో వివరించాడు. 90వేల అప్పు చేసి తన పొలంలో వేరుశనగ పంట వేశానని చెప్పాడు. పంట ఎలా ఉందని అడిగితే.. ఇంకేముందన్నా.. బాబుతో కరువు కలిసొచ్చిందన్నా..అని చెప్పాడు. అనంతపురం పర్యటనకు చంద్రబాబు వచ్చినప్పుడు సాయం అడిగామని, దీనికి ఆయన అయ్యో కరువా? నాకు అధికారులు చెప్పనేలేదని వారిని తిట్టాడని చెప్పాడు. రెయిన్గన్ల ద్వారా పంటను కాపాడుతానన్నారు. ఆ తర్వాత ఏమైందన్నా.. చంద్రబాబు వచ్చి ఆ రైన్ గన్ ప్రారంభి.. అలా అలా నాలుగు నీళ్లు చల్లి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అనంతరం ఆయన వెళ్లిపోయాడన్నా.. ఆ సాయంత్రమే అధికారులు వచ్చి రెయిన్ గన్ పట్టుకుపోయారని .. శివన్నా.. చంద్రబాబుతో దిగిన ఫొటోలు.. పేపర్ కట్టింగ్లు పట్టుకోని నాకు చూపించాడు. ఐదు ఎకరాల్లో వేరుశనగ పంట వేస్తే బస్తా రాలేదన్నా.. ఇప్పుడు ఈ అప్పు తీర్చడానికి వడియాలు అమ్ముకుంటున్నా అని తెలిపాడు. ఇక ఈ విషయంపై బహిరంగ సభలో మాట్లాడుతానని మైక్ అందుకోని.. క్రిందటి సారి చంద్రబాబుకు ఓటేసా.. మనకు చంద్రబాబు సావాసం వద్దబ్బా అని పిలుపునిచ్చాడు. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం జాతీయ రాజకీయాలని కొత్త డ్రామా మొదలుపెడుతాడు. బెంగళూరుకు వెళ్లి కుమార స్వామితో కాఫీ తాగుతాడు. పక్కనే ఉన్న అనంతపురం రైతన్నను మాత్రం పట్టించుకోడు. మరుసటి రోజు చెన్నైకి వెళ్లి స్టాలిన్తో కలిసి ఇడ్లీ సాంబార్ తింటాడు. కానీ పక్కనే ఉన్న సొంత జిల్లా చిత్తూరు రైతులను పట్టించుకోడు. ప్రభుత్వ సొమ్మే కదా అని ప్రైవేట్ విమానంలో కోల్కతాకు వెళ్లి మమతాబెనర్జీతో చికెన్ తింటాడు. కానీ ప్రజల సమస్యలు పట్టించుకోడు. నమ్మం అంటే నమ్మం బాబు.. రాష్ట్రంలో పంటలు దిగుబడి చూస్తే గుండెతరక్కుపోతుంది. దివంగత నేత వైఎస్సార్ హయాంలో సాగు విస్తీర్ణం 42.70 లక్షల హెక్టార్లు ఉంటే.. చంద్రబాబు హయాంలో 40 లక్షల హెక్టార్లకు పడిపోయింది. కానీ ఈ పెద్ద మనషీ నదుల అనుసంధానం అంటాడు. దేశంలోనే వ్యవసాయంలో మనరాష్ట్రమే నెంబర్ వన్ అంటాడు. అందుకే చంద్రబాబు నాయుడి ప్రజలు నమ్మం అంటే నమ్మం బాబు అంటున్నారు. నాబార్డ్ నివేదిక ప్రకారం వ్యవసాయం నెలవారీగా సగటున వస్తున్న ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున 28 స్థానంలో ఉంది. చంద్రబాబు రైతు రుణమాఫీ మోసం వల్లే రైతులు దారుణంగా నష్టపోయారు. రైతు రుణమాఫీ కనీసం వారి వడ్డీలకు కూడా సరిపోలేదు. వడ్డీ లేకుండా బ్యాంకులు రైతులకు రుణాలిచ్చేవి. ఆ వడ్డీని ప్రభుత్వాలు కట్టేవి. కానీ చంద్రబాబు దీన్ని పూర్తిగా మరిచిపోయారు. దీంతో రైతులంతా చంద్రబాబును నమ్మం అంటున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అడుగుతున్నా? (రాలేదు ప్రజల నుంచి సమాధానం.) దళారీ వ్యవస్థకు కెప్టెన్.. హెరిటేజ్ కోసం చంద్రబాబు దళారీ వ్యవస్థకు కెప్టెన్ అయ్యాడు. హెరిటేజ్ లాభాల కోసం రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ప్యాక్ చేసి రెండింతల రేట్లకు అమ్ముతున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర లేదు. ఉద్దానం, పలాసలో జీడిపప్పు చాలా ఫేమస్. ఈ జీడిపప్పును ఇక్కడి రైతులు కేజీ రూ.600కు అమ్ముకోలేని పరిస్థితి. కానీ చంద్రబాబు హెరిటేజ్లో కేజీ రూ.1100లకు అమ్ముతున్నారు. ఇలా రైతులను మోసం చేస్తున్నాడు కాబట్టి వారంతా చంద్రబాబు నమ్మం అంటున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా రుణాలు చెల్లించలేదని మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు. డ్వాక్రా సంఘాల మహిళలపై బ్యాంకు సిబ్బందులు దాడులు చేస్తున్నారు. వడ్డీలు కట్టేందుకు తాళిబొట్లు తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడింది. 2016 నుంచి డ్వాక్రా సంఘాల వడ్డీలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు.. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు. నిరాశలో నిరుద్యోగ యువత ఉన్నారు. బాబు వచ్చాడు కానీ జాబు రాలేదని, నిరుద్యోగులు నన్ను కలిశారు. బాబు వచ్చాడు.. 30 వేల ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా..? గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా.. ఆయుష్ పనిచేస్తున్న అక్కా చెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా.. సాక్షర భారత్లో పనిచేస్తున్న 30వేల మంది ఉద్యోగాలు గోవిందా.. మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న 85 వేల మంది ఉద్యోగాలు గోవిందా.. విభజన సమయానికి లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో మెర 90వేలు ఖాలీ అయ్యాయి. మొత్తం సుమారు 2 లక్షల 20వేల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. చంద్రబాబు మాత్రం 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఫీజులు కట్టలేక ఆత్మహత్య.. చంద్రబాబు తన బినామీల కోసం విద్యారంగాన్ని నాశనం చేశారు. 6వేల పాఠశాలలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను మూసించేశారు. మధ్యాహ్న భోజన పథకానికి 6 నెలలుగా బిల్లులు చెల్లించని దుస్థితి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో గోపాల్ అనే వ్యక్తి కలిశాడు. తన కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడని, కట్టాల్సిన ఫీజు లక్ష ఉండగా.. రీయింబర్స్ మెంట్ 30 వేలు ఇచ్చాడన్నా అని ఆవేదన చెందాడు. తొలి ఏడాది అప్పు చేసి రూ. 70వేలు ఫీజు కట్టానన్నాడు. ఫీజులు కట్టలేకపోతున్నానని తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. చంద్రబాబు హయాంలో ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. పేదవాడికి వైద్యం అందడం లేదు.. చంద్రబాబు పాలనలో పేదవాడికి వైద్యం అందడం లేదు. ఉద్దానంలో 4 వేల మంది కిడ్నీ బాధితులుంటే.. కేవలం 1400 మందికి మాత్రమే సాయం చేస్తున్నారు. 370 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. డయాలసిస్ పేషెంట్లకు ముష్టి వేసినట్లు రూ. 2500 మాత్రమే ఇస్తున్నారు. విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ఓ ఘటన నాకు ఎదురైంది. గర్భిణీ పురిటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేస్తే.. టైర్ పంక్షర్ అయిందని 108 సిబ్బంది చెప్పారు. అంబులెన్స్లు లేక మెంటాడలో బస్సులో ప్రసవించింది. ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. గ్రామాల్లో మాఫియా.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా ఏర్పాటు చేశారు. రేషన్ కార్డు, ఇల్లు సహా చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. ఏదైనా మంజూరు చేయాలంటే మీరు ఏ పార్టీ వారని అడుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో పెన్షన్ కోసం వృద్ధులు కోర్టుకెళ్లిన పరిస్థితి. గ్రామ స్వరాజ్యం లేని జన్మభూమి కమిటీలను నడుపుతున్నారు. ఇసుక నుంచి మట్టి వరకు అన్నింటిలోను దోపిడియే ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబులోభయం పట్టుకుంది. ఆదరణ-2 అంటూ కొత్తనాటాకాలకు తెరలేపుతున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. మీ బిడ్డకు తోడుగా ఉండండి.. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలన్నది నాకున్న సంకల్పం. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ . నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చండి. నవరత్నాల మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే.. చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. ఓటు వేయరు. ఆరు నెలలు కలిసి ఉంటే. వారు వీరు.. వీరు వారవుతారు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే.. వారికి భరోసా ఇస్తూనే నడిచాను. ప్రతి పేద వాడికి మంచి చేయాలనే తపన ఉంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రజా సంకల్ప యాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. జరిగే యుద్ధం ఒక్క నారాసురుడితో మాత్రమే కాదు. ఈ నారాసురుడికి ఎల్లో మీడియా ఉంది. జిత్తులు మారి ఈ మాయావి చంద్రబాబు పొత్తులు, ఎత్తులను, అన్యాయాలను జయించేందుకు మీరంతా తోడుగా ఉండాలి.’ అని వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతిఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఈ చారిత్రక ఘట్టానికి సాక్షిగా ఇచ్చాపురంలో వైఎస్ జగన్ విజయసంకల్పస్థూపం (పైలాన్)ను ఆవిష్కరించారు. -
ఇచ్ఛాపురంలో విజయసంకల్ప స్థూపం ఆవిష్కరణ
-
విజయసంకల్ప స్థూపంను ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
విజయసంకల్ప స్థూపంను ఆవిష్కరించిన వైఎస్ జగన్
సాక్షి, ఇచ్ఛాపురం: చరిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో ఇచ్ఛాపురంలోని బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.. వైఎస్ జగన్ పైలాన్ను ఆవిష్కరించే దృశ్యాన్ని అపురూపంగా తిలకించారు. పైలాన్ ఆవిష్కరించడానికి ముందు ఆయన సర్వమత పెద్దల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్ జగన్ కాలినడకన పాత బస్టాండ్ వద్దకు బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అంతకు ముందు వైఎస్ జగన్ పాదయాత్రగా బయలుదేరి లొద్దపట్టి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. వైఎస్సార్ సీపీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జననేతతో కలిసి నడవటానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనసంద్రంగా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇలాంటి పాదయాత్ర దేశంలో ఎవరు చేయలేదు
-
ఇడుపులపాయలో అంకురార్పణ.. అలుపెరుగని బాటసారిగా..
ఓ వైపు తరలివచ్చిన లక్షలాది జనం.. మరో వైపుఅడుగడుగునా అభిమాన నేతకు ఆశీర్వచనం..ఎటు చూసినా ఉప్పొంగిన అభిమాన తరంగం.. ఇది2017 నవంబర్ 6వతేదీ నాటి దృశ్యానికి అక్షర రూపం. మహానేత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిఆంధ్రరాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సంకల్పధీరుడై..పాదయాత్రికుడై పుట్టిన గడ్డ నుంచి బయదేరిన సందర్భం.అలా మొదలైన తొలి అడుగు ఎండా.. వాన.. చలిని సైతంలెక్క చేయక నమ్మిన సిద్ధాంతం .. జన హితం కోసంఅలుపెరగకుండా కదిలింది. ఎన్నో సభలు.. మరెన్నోఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. సమస్యలు ఆలకిస్తూ..కష్టాలు తెలుసుకుంటూ.. కన్నీళ్లు తుడుస్తూ.. భరోసాకల్పిస్తూ జైత్ర యాత్రలా సాగిన ప్రజాసంకల్ప యాత్రమరుపురాని చరిత్రగా నిలిచి పోనుంది. ఆ అవిశ్రాంతయోధుడు జన దీవెనలతో రాజన్న రాజ్యం స్థాపిస్తాడని..సువర్ణయుగానికి నాంది పలుకుతాడని.. నవరత్నాల్లాంటిపథకాలతో తమ బతుకుల్లో వెలుగులు నింపుతాడనే ఆశ..ఆకాంక్ష.. ఆత్మవిశ్వాసం అందరిలో కనిపిస్తోంది. సాక్షి ప్రతినిధి కడప: ఇడుపులపాయలో 2017 నవంబర్ 6న ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర 2019 జనవరి 9న దిగ్విజయంగా ముగింపు పలకనుంది. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా ఉంటూ.. ఆత్మబంధువుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారని విశ్లేషకులు కొనియాడుతున్నారు. సర్వం కోల్పోయి జీవితంలో ఏమీ లేదని నిరాశ చెందుతున్న బాధితులకు ప్రభుత్వం ఆసరాగా నిలివాల్సి ఉంది. ప్రభుత్వ చర్యలు నామమాత్రమే కావడంతో అలాంటి వారికి కొండంత ధైర్యం నింపుతూ.. బడుగు, బలహీన వర్గాల్లో.. నేనున్నానని.. మీకేం కాదని భరోసా కల్పిస్తూ ఎక్కడికక్కడ ముందుకు కదిలారు. కలిసిన ప్రతి ఒక్కరినీ కూడా అదే ఆప్యాయంగా పలుకరిస్తూ.. కష్టసుఖాలు తెలుసుకుంటూ అందరిలో ఒకడిలా ముందుకు కదిలారు. ఇంటి బిడ్డలా.. కష్టంలో ఇంటికి పెద్దన్నలా ఉంటానంటూ హామీ ఇçస్తూనే.. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను దూరం చేసి రాజన్న రాజ్యంతో స్వర్ణయుగం అందిస్తానని నమ్మకం కల్పించారు. అడుగడుగునా బ్రహ్మరథం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ నుంచి ప్రారంభించారు. చలికాలం, ఎండకాలం, వానకాలంలో కొనసాగి మరుపురాని చరిత్రకు సజీవ సాక్ష్యమైంది. పాదయాత్ర ప్రారంభం నుంచి అపురూప ప్రజాదరణ లభించింది. ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనంతో దిగ్విజయంగా సాగింది. అడుగడుగునా ప్రతిపక్ష నేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పల్లె, పట్టణం తేడా లేకుండా.. చిన్నా పెద్ద తారమత్యం లేకుండా.. అడుగడుగునా జననేతను కలుస్తూ తమ కష్టసుఖాలు చెప్పుకుంటున్నారు. అంతే ఓపికగా వారి సమస్యలు వింటూ తన పరిధిలో అవకాశం మేరకు చేయూతనిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజా విన్నపాలు.. ప్రభుత్వం తత్తరపాటు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల విన్నపాలు అధికమయ్యాయి. ప్రభుత్వ డొల్లతనాన్ని ఎక్కడికక్కడ ప్రజలు ప్రతిపక్షనేత దృష్టికి తీసుకువస్తున్నారు. సమస్యలపై జననేత స్పందిస్తూ తక్షణమే హామీలు గుప్పించారు. ఈ క్రమంలోనే వేంపల్లెలోని దేవి కల్యాణ మండపంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఎస్సీ కాలనీలకు ఉచిత విద్యుత్ హామీ లభించింది. అత్యధిక బిల్లులొస్తున్నాయి.. కూలీకి వెళ్తేనే పొట్ట నింపుకొనే మాబాటోళ్లు.. ఎలా బతకాలి సార్... అంటూ ఎస్సీలు విన్నవించడంతో వెంటనే స్పందించిన జననేత ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ♦ వేంపల్లెలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైస్కూల్ సమీపంలో టీచర్లు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. కాంట్రీబ్యూటరీ ఫెన్షన్ స్కీమ్ (సీపీఎస్) వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోనున్నట్లు వివరించారు. జిల్లాలో 12 వేల మంది ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలోకి వస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ఉన్నారని వివరించారు. సర్వీసు అంతా ప్రజలతో మిళితమైన తమకు అన్యాయం చోటు చేసుకుంటోందని వారు విన్నవించడంతో.. అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ♦ గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా వీరపునాయునిపల్లె మండలంలోని సర్వరాయసాగర్ ప్రాజెక్టు పూర్తి కాలేదని రైతులు వివరించారు. అందుకు స్పందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని, పెండింగ్లో ఉన్న సర్వరాయసాగర్ ప్రాజెక్టుతోపాటు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు. ♦ జమ్మలమడుగు నియోజకవర్గంలోని బ్రహ్మణి ఉక్కు పరిశ్రమను ప్రభుత్వం రద్దు చేసింది. ఉపాధి కల్పన నిమిత్తం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని ఎర్రగుంట్లలో స్థానికులు కోరడంతో అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుడుతామని ప్రకటించారు. ♦ ఫిజియో థెరఫిస్టులకు ఉద్యోగ అవకాశాలు లేవని, కోర్సు పూర్తి చేసినా ఆశించిన ప్రయోజనం దక్కడం లేదని వివరించడంతో.. ఆరోగ్యశ్రీలో కీళ్లు మార్పిడి శస్త్ర చికిత్సను చేర్చి ఫిజియో «థెరపిస్టులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురానికి తరలివెళ్లిన నేతలు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముగింపు కార్యక్రమం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి జిల్లా నేతలు తరలి వెళ్లారు. రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్య, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్రెడ్డి, మండిపల్లె రాంప్రసాద్రెడ్డితోపాటు జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు తరలివెళ్లారు. -
ప్రజా సంకల్పానికి జేజేలు
అసమర్థ పాలనను ఎండగడుతూ.. అభ్యాగులకు భరోసానిస్తూ ప్రజా సంకల్పయాత్రికుడు జిల్లాలో అడుగు పెట్టింది మొదలు.. ఊరూరా జనంనీరాజనం పలికారు. పేదల బతుకుల్లో చీకటి తెరలు తొలగించే వెలుగు రేఖలా కనిపించిన జననేతలో రాజన్నను చూసుకున్నారు. వేలాది అడుగులు వెంట నడిచాయి. పల్లెలు కదిలి వచ్చాయి. అలుపెరగని నేతకు గ్రామ గ్రామాన ఆత్మీయ స్వాగతం పలికి.. గుండెల నిండా అభిమానంతో జనహారతి పట్టారు. ప్రజా సంకల్పానికి జేజేలు పలికారు. బుధవారం ప్రజా సంకల్పయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలో సాగిన యాత్ర విశేషాలు గుర్తు చేసుకుంటూ.. కోవెలకుంట్ల :జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి పాదయాత్ర ప్రారంభమై 14 మండలాల మీదుగా 263 కి.మీ. మేర సాగింది. 18 రోజుల పాటు జిల్లాలో కొనసాగి తుగ్గలి మండలం ఎర్రగుడి వద్ద అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. బహిరంగ సభలు, ఆత్మీయ సదస్సులు, ముఖాముఖి కార్యక్రమాలతో అన్ని వర్గాలకు భరోసా కలిగించారు. బడుగులకుఆత్మ బంధువులా.. 2017 నవంబర్ 27న కోడుమూరు మండలం గోరంట్ల వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలతో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బీసీ ప్రతినిధులు తెలుగుదేశం పాలనలో చంద్రబాబునాయుడు చేస్తున్న మోసాలను ఏకరువు పెట్టారు. బీసీల ఆవేదన, అన్యాయాలను విన్న జగన్ బలహీన వర్గాలకు అన్ని విధాలా అండగా ఉండి బాసటగా నిలుస్తామని భరోసా కల్పించారు. బీసీలను అన్ని విధాలా ఆదుకునేందుకు బీసీ గర్జన నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించి వచ్చే ఎన్నికల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఏదో ఒక చోట ఎంపీ టికెట్ బోయలకు కేటాయిస్తామని చెప్పడం ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 108, 104 తరహాలో 102 అందుబాటులోకి తెస్తామని, ఈ అంబులెన్స్ ద్వారా గొర్రెలు, ఆవులను రక్షించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీతొలి అభ్యర్థి ప్రకటన ఇక్కడే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో కర్నూలు జిల్లాకు చెందిన కంగాటి శ్రీదేవి (పత్తికొండ)ని వైఎస్ఆర్సీపీ తొలి అభ్యర్థిగా ప్రకటించారు. జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా 2014 ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలతో పాటు పదకొండు అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, కోడుమూరు, కర్నూలు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వైఎస్ఆర్సీపీకి వస్తున్న ఆదరణ చూడలేక టీడీపీ హత్యా రాజకీయాలకు పాల్పడింది. ఈ క్రమంలో జిల్లాలోని పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డిని హతమార్చారు. 2017వ సంవత్సరంలో వైఎస్ జగన్ పాదయాత్ర జిల్లాలో పార్టీ ఫిరాంపు ఎమ్మెల్యే నియోజకవర్గం ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది. ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఎమ్మెల్యేలు మారినా ప్రజలంతా వైఎస్ఆర్సీపీకి అండగా ఉండటంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. జిల్లాలో పాదయాత్ర ముగిసేవరకు జగన్ అడుగుల్లో వేలసంఖ్యలో అడుగులు పడ్డాయి. రైతులు, కూలీలు, యువకులు, మహిళలు, వృద్ధులు సైతం జననేత వెంట నడిచేందుకు ముందుకు రావడంతో పాదయాత్ర సాగని ప్రయాణమైంది. అన్ని వర్గాల ప్రజల భవిష్యత్కు భరోసానిస్తూ పాదయాత్ర సాగగా జననేతకు ఊరూరా అçపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ఆర్సీపీ మొదటి అభ్యర్థిగా శ్రీదేవిని పార్టీ అధినేత ప్రకటించడంతో జిల్లాకు అరుదైన అవకాశం పాదయాత్రకు జనాభి‘వంద’నం వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జిల్లాలో మూడు మైలురాళ్లను దాటింది. 2017 నవంబర్ 14న వైఎస్ఆర్ జిల్లా నుంచి చాగలమర్రి సమీపంలో కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలో 18 రోజులపాటు పాదయాత్ర కొనసాగగా చాగలమర్రి మండలం గొడిగనూరు సమీపంలో వంద కి.మీ. మైలురాయిని చేరుకుంది. డోన్ నియోజకవర్గంలోని ముద్దవరం వద్ద 200 కి.మీ., ఆలూరు నియోజకవర్గంలోని కారుమంచి వద్ద 300 కి.మీ. మైలురాయిని చేరింది. అన్నదాతకు అండగా.. తెలుగుదేశం పాలనలో రైతులు కన్నీరు పెడుతున్నారని, మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో తిరిగి రామరాజ్యం తీసుకొస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు భరోసా కల్పించారు. 2017 నవంబర్ 27వ తేదీన కోడుమూరులో జరిగిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో అన్నదాతకు అండగా నిలిచారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు దిగుబడులను గోదాముల్లో ఉచితంగా నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక కోల్డ్స్టోరేజి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కింద నాలుగేళ్ల పాటు ఏటా మే నెలలోనే పెట్టుబడుల కోసం రూ. 12,500 అందజేసి అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు. డిసెంబర్ 4వ తేదీన తుగ్గలి మండలం ఎర్రగుడి వద్ద జరిగిన రైతు సదస్సులో రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం చిన్నాభిన్నం కాకుండా వైఎస్ఆర్ బీమా ద్వారా ఆ కుటుంబానికి తక్షణమే రూ. 5 లక్షల ఆర్థిసాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పెద్దకొడుకులా.. ♦ 2017 నవంబర్ 20వ తేదీన బనగానపల్లె మండలం హుసేనాపురం వద్ద నిర్వహించిన మహిళా సదస్సులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు మహిళలకు కొండంత ధైర్యాన్ని నింపాయి. ♦ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పిల్లల చదువుకు ఏడాదికి రూ. 15వేలు, పెద్ద చదువులకు అయ్యే ఫీజులను చెల్లిస్తామని, హాస్టల్ ఖర్చులకు ఏడాదికి రూ. 20వేలు ఇస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ♦ పేద కుటుంబాలకు చార్జీల మోత నుంచి ఉపశమనం కల్పించేలా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందజేస్తామని, పొదుపు మహిళలకు ఎన్నికల నాటికి ఎంత అప్పులున్నాయో నాలుగు దఫాల్లో చెల్లిస్తామన్నారు. ♦ జన్మభూమి కమిటీలు ఉండవని, ఎవరికీ రూపాయి లంచం ఇవ్వాల్సిన పనిలేదని వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు మహిళలకు కొండంత అండగా నిలిచాయి. ♦ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని అధికారంలోకి రాగానే దశల వారీగా నిషే«ధిస్తామని హామీ ఇచ్చారు. ♦ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 72 గంటల్లోనే రేషన్కార్డు, ఆరోగ్యశ్రీ, పింఛన్ అందజేస్తామన్న జననేత హామీ పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మేము సైతం చరిత పుటల్లో భాగమై..
అదిగో నవశకం.. ఈడ్చికొట్టే జడివానను చీల్చుకుంటూ.. ఎముకలు విరిచే చలిలో ఎదురీదుకుంటూ.. భగభగ మండే నిప్పుల కణికలపై సవారీ చేసిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగని పయనం ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగి నవశకానికి నాంది పలికింది. తాను నడిచిన దారుల్లో బీద గుడిసె గుండెల్లో కన్నీటి తడిని ఆత్మీయంగా తుడిచేసి అభయ హస్తమిచ్చింది. అప్పుల అగాధంలో ఆత్మహత్యల ఉరికొయ్యకు వేలాడుతున్న రైతన్నను చూసి కరిగిపోయి.. పచ్చని పంటల్లో అన్నదాత నవ్వుల సిరిని పండిస్తానని భరోసా కల్పించింది. వేల కిలోమీటర్లు సాగిన ప్రజా సంకల్పం నేడు సరి కొత్త చరితను ఆవిష్కరించబోతోంది. దీనికి మేము సైతమంటూ విప్లవాల మల్లెలు విరబూసిన శ్రీకాకుళం గడ్డపై వజ్ర సంకల్పధీరునికి అభిమాన స్వర్ణ కంకణం అలంకరించేందుకు ఊరూవాడా జనవాహినై కదిలింది. సంకల్పధీరుడికి సలామంటూ తలొంచిన దారులు.. అభిమాన దండుకు అఖండ స్వాగతం పలకగా, జై జగన్ అనే నినాదం ఢమరుక నాదమై మార్మోగగా.. ఇచ్ఛాపురం గడ్డపై నేడు సంకల్ప మహోజ్వల దీప్తి దేదీప్యమానమై ప్రకాశించబోతోంది. గుంటూరు(పట్నంబజారు): ప్రజా సంకల్పయాత్రికుడై బయలుదేరిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి పాదయాత్ర నేడు ఇఛ్చాపురంలో నేడు ముగియనుంది. అభిమాన నేత వైఎస్ జగన్ బహిరంగ సభకు జిల్లా నుంచి ఆశేష జనవాహిని పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా బస్సులు, కార్లలో పాదయాత్ర ముగింపు సభకు తరలివెళ్లి జయప్రదం చేయనున్నారు. వైఎస్సార్ సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ నేతలతో కలిసి మాచర్ల నియోజకవర్గం నుంచి ఇఛ్చాపురం చేరుకున్నారు. నర్సరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట మండలం, రొంపిచర్ల మండలం నుంచి పార్టీ నేతలతో కలిసి సభకు తరలివెళ్లారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, నగర అనుబంధ విభాగాల నేతలు, డివిజన్ అధ్యక్షులతో కలిసి వెళ్ళారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గ నేతలతో కలిసి పాదయాత్రకు చేరుకున్నారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రఘుపతి నియోజకవర్గం, ఆయా మండలాల నేతలతో కలిసి కార్లతో పాదయాత్ర తరలివెళ్లారు. అభిమాన తరంగం గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, మోపిదేవి వెంకటరమణ ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి సభకు వెళ్లారు. పార్టీ గుంటూరు, సత్తెనపల్లి, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తలు కిలారి రోశయ్య, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్లు పాదయాత్రకు పార్టీ నేతలు, కార్యకర్తలతోతో ఇచ్ఛాపురం చేరుకున్నారు. పట్టాభిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నేడు జరిగే బహిరంగ సభకు తరలివెళుతున్న బస్సును కిలారి రోశయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు కలిసి జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం పాదయాత్ర వెళ్లగా, లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయం నుంచి బస్సును ఏర్పాటు చేసుకుని సభకు తరలివెళ్లారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడె మేరుగ నాగార్జున వేమూరు నియోజకవర్గం, ఎస్సీ విభాగం నేతలను వెంట తీసుకుని బయలుదేరారు. పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ పార్టీ నేతలతో కలిసి వెళ్లారు.. గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, తాడికొండ, పెదకూరపాడు, పొన్నూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు కాసు మహేష్రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, నంబూరు శంకరరావు, రావి వెంకటరమణలు వారి నియోజకవర్గ నేతలు, శ్రేణులు, కార్యకర్తలతో కలిసి ప్రజా సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమానికి పయనమయ్యారు. న్యాయవాదుల సంఘీభావం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకు మద్దతుగా గుంటూరు నగరంలో న్యాయవాదులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు నుంచి ప్రారంభమైన ప్రదర్శన నగరంపాలెంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం ఆయన విగ్రహానికి, గుర్రం జాషువా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు, లీగల్ విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యన్నారాయణ, లీగల్ విభాగం నగర అధ్యక్షులు వాసం సూరిబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలెదేవరాజులు పాల్గొన్నారు. -
సువర్ణాక్షరాలతో..
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవటానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా జిల్లాలో విశేష ఆదరణ లభించింది. 25 రోజులపాటు జరిగిన ఈ యాత్ర జిల్లాలోని 12 నియోజకవర్గాల గుండా 5 మున్సిపాలిటీలు, 18 మండలాల్లో, 130 గ్రామాల మీదుగా 239 కి.మీ. మేర సాగింది. గతేడాది ఏప్రిల్ 14న గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి కనకదుర్గమ్మ వారథి మీదుగా జిల్లాలో ప్రవేశించింది. ఆయన అడుగులో అడుగేసేందుకు వేలాదిమంది కదం తొక్కారు. అదే రోజు విజయవాడ చిట్టినగర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభతో జిల్లా ప్రజలకు జననేత పట్ల ఉన్న ఆదరాభిమానాలను తెలియజేసింది. ఆ తర్వాత మైలవరం, నూజివీడు, గన్నవరం, ఉయ్యూరు, పామర్రు, మచిలీపట్నం, పెడన, గుడివాడ, కైకలూరులలో కూడా ఇసుకేస్తే రాలనంత జనం, కనుచూపుమేర అభిమానసంద్రం పోటెత్తింది. చరిత్రలో చరగని ముద్ర వేసిన ప్రజాసంకల్పయాత్ర గతేడాది మే 13న కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం మణుగునూరు లంక వద్దదిగ్విజయంగా ముగిసింది. నాలుగు ఆత్మీయ సభలు.. జిల్లాలో పాదయాత్రలో వివిధ సామాజిక వర్గాలతో జరిగే ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా జిల్లాలో నాలుగు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గ కౌతారం వద్ద ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులతో, కైకలూరు నియోజకవర్గం పెరిగెగూడెంలో దళితులతో, గుడివాడ నియోజకవర్గం అగ్రహారం వద్ద నాయీ బ్రాహ్మణులతో, మచిలీపట్నం నియోజకవర్గం పొట్లపాలెం వద్ద విశ్వబ్రాహ్మణులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయా వర్గాలపట్ల జననేత జగన్కు ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని చాటాయి. ఈ సభల్లో భాగంగా దళితులకు వైఎస్సార్ పెళ్లి కానుక, సబ్సిడీతో రుణాలు వంటి హామీలను ప్రకటించారు. న్యాయవాదులకు 100 కోట్ల రూపాయలతో సంక్షేమనిధి, విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కీలక నిర్ణయాలు.. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెడతామన్న హామీ పెనుప్రకంపనలను సృష్టించింది. కొల్లేరు ప్రజల కష్టాలను చట్టసభల్లో ప్రశ్నించటానికి ఆ ప్రాంత వాసికి ఎమ్మెల్సీని చేస్తామన్నారు. కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)ను ప్రకటించారు. తరలిన వైఎస్సార్ సీపీ దండు సాక్షి, అమరావతిబ్యూరో : చరిత్రపుటల్లో నిలిచిపోయే అపూర్వ ఘట్టంలో పాలుపంచుకునేందుకు కృష్ణా జిల్లా నుంచి జన జాతర ఉప్పెనలా కదలివెళ్లింది. 14 నెలల కిందట జననేత వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటితో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. పల్లెపల్లెను పలుకరిస్తూ.. ప్రజలతో మమేకమవుతూ.. ప్రతిపక్ష నేత జగన్ సాగించిన పాదయాత్ర ముగింపు సభకు కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు కదలివెళ్లి ఆయనకు సంఘీభావం తెలిపారు. తరలివెళ్లిన జనప్రవాహం ప్రజాసంకల్ప యాత్రికుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజయవాడ ప్రజలు ఆత్మీయ తివాచీతో స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న కనకదుర్గ వారధిపై నుంచి జిల్లాలోకి ప్రవేశించిన జగన్కు అభిమాన జనసందోహం ఎదురేగి జిల్లాలోకి సాదరంగా తోడ్కొని వచ్చింది. జననేతను అనుసరిస్తూ వేలాదిమంది అభిమానులు వారథిపై కదం తొక్కారు. అప్పుటి నుంచి జిల్లాలో యాత్ర ముగిసే వరకు వైఎస్ జగన్ను వెంట అడుగులో అడుగు వేసిన వేలాది మంది ఇప్పుడు ముగింపు యాత్రలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివెళ్లడం గమనార్హం. పార్టీ నేతల సంఘీభావం.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి యాత్ర ముగింపు అపూర్వ ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. సోమవారం రాత్రి నుంచి కొనసాగించి మంగళవారం రాత్రిలోగా వేలాది మంది ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు తరలివెళ్లారు. విజయవాడ పార్టీ కార్యాలయం నుంచి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి పలువురితో కలిసి సోమవారం ఇచ్ఛాపురం బయలుదేరి వెళ్లారు. పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త యలమంచిలి రవితో పాటు, విజయవాడ పార్లమెంటరీ జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు పలువురు సోమవారం రాత్రికే ఇచ్ఛాపురం చేరుకున్నారు. కాగా పార్టీ అభిమానలు ఇతర నాయకులు రెండు బస్సుల్లో మంగళవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లారు. ♦ అలాగే మైలవరం నియోజకవర్గం నుంచి పార్టీ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్, పలువురు పార్టీ నాయకులు సోమవారం రాత్రి ఇచ్ఛాపురం తరలి వెళ్లారు. ♦ నూజివీడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మేకా వంకాప్రతాప్ అప్పారావుతోపాటు మరో 50 మంది నాయకులు, కార్యకర్తలు ఇచ్ఛాపురం తరలి వెళ్లారు. ♦ నందిగామ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్ జగన్మోహనరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్కుమార్లతో పాటు కొందరు ముఖ్య నాయకులు కలిసి తమ వాహనాల్లో 100 మందితో మంగళవారం సాయంత్రం కాన్వాయ్గా బయలుదేరారు. ♦ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, ఆయన కుమారులు వినయ్, శ్యామ్లతోపాటు పార్టీ రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి పోసిన పాపారావుగౌడ్, ప్రచార కమిటీ రాష్ట్ర్ర కార్యదర్శి వాసిపల్లి యోనా, రాష్ట్ర యువజన సంఘం నాయకుడు దాసరి అబ్రహం లింకన్, జోగి సురేష్లు తరలివెళ్లారు. ♦ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల సమన్వకర్తలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు కలిసి వెళ్లారు. ♦ పెడన నియోజకవర్గం నుంచి పార్టీ సమన్వయకర్త జోగిరమేష్, మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ ఇచ్ఛాపురం వెళ్లారు. ♦ గన్నవరం నియోజకవర్గం నుంచి పార్టీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో పది వాహనాల్లో ముఖ్యనాయకులు, పార్టీ శ్రేణులు ఇచ్ఛాపురం బయలుదేరి వెళ్లారు. మరో 100 మందికిపైగా సోమవారం రాత్రే తరలివెళ్లడం జరిగింది. ♦ తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి ఆధ్వర్యంలో సోమవారం 100 మందికిపైగా కార్యకర్తలు తరలివెళ్లారు. ♦ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో సోమవారం పలువురు కార్యకర్తలు ఇచ్ఛాపురం పయనమయ్యారు. ♦ మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పేర్ని వెంకటరామయ్య(నాని) తన అనుచరులతో కలిసి వెళ్లారు. ♦ పామర్రు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కైలే అనిల్కుమార్ ఆధ్వర్యంలో పలు వాహనాల్లో సోమవారం ఇచ్ఛాపురం బయలుదేరి వెళ్లారు. అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ సమన్యయకర్త సింహాద్రి రమేష్బాబు ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావుతో పాటు పలువురు నేతలు సభకు పయనమయ్యారు. పార్టీ జిల్లా అనుబంధ సంఘాలు.. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు సోమవారమే ఇచ్ఛాపురానికి పలు వాహనాల్లో తరలి వెళ్లారు. తరలి వెళ్లినవారిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అ«ధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, విజయవాడ పార్లమెంట్ జిల్లా డాక్టర్స్ సెల్ అ«ధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, బీసీ సెల్ కొసగాని దుర్గారావు గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోకల శ్యామ్కుమార్, లీగల్సెల్ అధ్యక్షుడు కోటంరాజు వెంకటేష్శర్మ, రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్, 15వ డివిజన్ విద్యార్థి విభాగం అ«ధ్యక్షుడ శివ, మైలవరం నియోజకవర్గం విద్యార్ధి విభాగం అ«ధ్యక్షుడు నాగిరెడ్డి, మైనార్టీ విభాగం కార్యదర్శి గౌసాని, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, కర్నాటి రాంబాబు ఉన్నారు. జననేతతో నడవటం గొప్ప అనుభూతి కంకిపాడు(పెనమలూరు): కృష్ణాజిల్లాలోకి ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశించినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటే నడుస్తున్నాను. 11 నెలల పాటు ఆయనతో కలిసి ప్రయాణం చేయటం మరచిపోలేని అనుభూతి. అనేకవర్గాల ప్రజలు ఎదురేగి ఆయనకు సమస్యలు విన్నవించటం, ఎంతో ఓపికగా జగన్ సమస్యను వినడం.. వారికి భరోసా కల్పించడం చూస్తున్నా.. జగన్ అధికారంలోకి వస్తే బతుకులు బాగుపడతాయనే ధీమా ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. పుట్టిన రోజు, పండుగలు, కొత్త సంవత్సర వేడుకలు కూడా ఆయనతో పాటే జరుపుకున్నాం. రోజూ ఆయన రమమ్మ తల్లి అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రానున్న రోజుల్లో పార్టీ కోసం మరింతగా పనిచేస్తా. -
మహా సంకల్పం
ప్రతి అడుగూ ప్రజల కోసమే.. వారి కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటూ నేనున్నాంటూ భరోసా ఇస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్కు వారధి నిర్మాణానికి మహా సంకల్పయాత్ర చేపట్టారు ప్రతిపక్షనేత వైఎస్ జగన. జననేత జనం కోసం అడుగులు వేస్తుంటే నీ వెంటే మేముంటాం అంటూ అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 3,645 కిలోమీటర్ల యాత్ర మరో చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ప్రజలతో మమేకమవుతూ సాగిన ఈ యాత్ర నేడు ముగింపు ఘట్టానికి చేరుకుంది. ముఖ్యంగా జిల్లాలో కూడా నెల్లూరు నగరం మినహా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఆ సమయంలో అశేష జనవాహిని జగన్ వెంట నడిచింది. పల్లెల్లో అపూర్వ స్వాగతం లభిం చింది. తమ సమస్యలను చెప్పుకున్నారు. టీడీపీ చేసిన మోసాన్ని ఏకరువు పెట్టారు. ముగింపు ఘట్టంలోనూభాగస్వాములు అయ్యేందుకు ఇచ్ఛాపురానికి తరలి వెళ్లారు. జిల్లాలో పార్టీ మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యుడు,ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలతోపాటు మండల, గ్రామస్థాయి నాయకులు మంగళవారంబయలుదేరారు. జననేత పాదయాత్ర జిల్లాలోహాట్ టాపిక్గా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి పార్టీ క్యాడర్ దూరాభారాన్ని లెక్కచేయకుండా అపూర్వ ఘట్టంలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో మంగళవారం పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాకు తరలివెళ్లారు. ముఖ్యంగా పార్టీ మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వి.వరప్రసాద్రావు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు పి.అనిల్కుమార్యాదవ్, మేకపాటి గౌతమ్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ సమస్వయకర్తలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మేరిగ మురళీధర్, పార్టీ తిరుపతి, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి తదితరులు శ్రీకాకుళం పయనమయ్యారు. వీరిలో కొందరు మంగళవారం ఉదయానికే ఇచ్ఛాపురం చేరుకున్నారు. అలాగే నెల్లూరు సిటీ, రూరల్, గూడూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, వెంకటగిరి, సర్వేపల్లి, కోవూరు, సూళ్లూరుపేట తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తరలివెళ్లారు. జిల్లాలో ప్రజాసంకల్ప హోరు ఆంధ్రా, తమిళనాడు సంప్రదాయ రీతుల్లో స్వాగతాల నుడుమ చిత్తూరు జిల్లా నుంచి కోస్తా జిల్లాలకు సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో వైఎస్ జగన్ పాదయాత్ర గతేడాది జనవరి 23న ప్రవేశించింది. యాత్ర ప్రారంభం మొదలు జిల్లాలో ముగింపు వరకు ఆశేష జనవాహిని జననేత వెంటే అడుగులు వేశారు. పాదయాత్రకు తన కోసం తరలివచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జననేత జగన్ ముందుకుసాగారు. పూర్తిస్థాయిలో వ్యక్తిగత సమస్యలు మొదలుకొని జిల్లా సమస్యల వరకు అన్నింటినీ తెలుసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఒక్కరి కష్టాలను విని తానున్నానంటూ భరోసా ఇచ్చారు. జనవరి 23న పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలో జిల్లాలో మొదటి అడుగుపడి ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం నేకునాంపేటలో మలి అడుగుతో యాత్ర జిల్లాలో ముగిసి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. తొమ్మిది నియోజకవర్గాల్లో పాదయాత్ర జిల్లాలో సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, నెల్లూరురూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో ఉన్న 142 గ్రామాల మీదుగా 266.5 కిలోమీటర్లు పాదయాత్ర సాగించారు. అలాగే సూళ్లూరుపేటలో పెళ్లకూరు(చెంబేడు), నాయుడుపేట గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి(పొదలకూరు), నెల్లూరురూరల్(సౌత్ మోపూరు), కోవూరు(బుచ్చిరెడ్డిపాలెం), ఆత్మకూరు(సంగం), కావలి(దగదర్తి), ఉదయగిరి(కలిగిరి)లలో బహిరంగ సభలు నిర్వహించి అన్ని అంశాలతోపాటు నియోజకవర్గ ప్రధాన సమస్యలపైనా మాట్లాడారు అలాగే జిల్లాలో చేనేత, యాదవ, ఆర్యవైశ్య, ముస్లిం, మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. ఉదయగిరి నియోజకవర్గం ప్రత్యేక హోదా కీలక ప్రకటనలకు వేదికగా నిలిచింది. ప్రత్యేక హోదా భవిష్యత్తు కార్యచరణ ఇక్కడే రూపొందించి ప్రకటించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద 1000 కిలోమీటర్ల మైలురాయి దాటి విజయ సంకల్ప స్థూపం ఆవిష్కరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం వద్ద 1100 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా 72 అడుగుల ఎత్తులో భారీపార్టీ జెండా ఆవిష్కరించారు. ఇలా జిల్లాలో జరిగిన పాదయాత్ర పలు ముఖ్య ఘట్టాలకు వేదికగా నిలిచింది. -
మాటలు రానివాడంటే లోకేశ్..
సాక్షి, ఇచ్ఛాపురం: చంద్రబాబు దోపిడీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు సిండికేట్లా తయారయి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని భూముల నుంచి ఇసుక వరకు ప్రతిదాంట్లోనూ దోపిడీ పర్వం కొనసాగుతోందని విమర్శించారు. అందుకే చంద్రబాబుకు ‘అవినీతి చక్రవర్తి’ బిరుదు ఇవ్వడం జరిగిందన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం ఇచ్ఛాపురం వచ్చిన ఆమె ‘సాక్షి’టీవీతో మాట్లాడారు. ఇచ్ఛాపురం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నలుమూలల జనం నుంచి తరలిరావడంతో ఇసుక వేసినా రాలనంతగా జనం కనబడుతున్నారని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిని ఆమె ఎద్దేవా చేశారు. ‘మాటలు రానివాడంటే లోకేశ్, మాటలు చెప్తే అర్థంకాకపోతే ఆయన పవన్ కళ్యాణ్. మాట తప్పితే అది చంద్రబాబు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకుంటారు కనుక తామంతా జగన్ వెంట ఉన్నామ’ని డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు. -
ప్రజా సంకల్పం.. ప్రకాశం పరవశం
కిక్కిరిసిన రహదారులు..కార్యకర్తల జగన్నినాదాలు..హారతులు పట్టే ఆడపడుచులు..అభిమానులు పరిచిన పూల బాటలుకరచాలనం కోసం పోటీపడే యువకులుఅడుగో.. అన్నొచ్చాడంటూ కేరింతలు ప్రతీ ముఖంలో కాంతిరేఖలుజన సంద్రాలైన బహిరంగ సభలు..జననేతకు ఆద్యతం జనం నీరాజనం పలికారు.జిల్లాలోని పల్లెలు, పట్టణాలు పండుగ కళను సంతరించుకున్నాయి.గత ఏడాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో22 రోజులపాటు నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా.. జనానికి భరోసా ఇచ్చింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రతో ప్రకాశం జిల్లా పరవశించింది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో 22 రోజులపాటు కందుకూరు, కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, పర్చూరు, చీరాల 9 నియోజకకవర్గాల పరిధిలో 19 మండలాలు, 124 గ్రామాలలో పాదయాత్ర సాగింది. 8 నియోజకవర్గాల లోని కందుకూరు, కనిగిరి, పొదిలి, అద్దంకి, చీమకుర్తి, తాళ్లూరు, ఇంకొల్లు, చీరాల లో బహిరంగ సభలు నిర్వహించారు. కొండపి నియోజకవర్గంలోని తిమ్మపాలెం వద్ద రైతు సదస్సు జరిగింది. మొత్తం 278.1 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. పిబ్రవరి 16 నుండి మార్చి 12 వరకూ యాత్ర సాగగా ఆద్యంతం జనం జగన్కు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమంత్రి కావాలంటూ దీవించారు. రైతులు, కార్మికులు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు యువత ఆయనతో కలసి అడుగులు వేశారు. వారికష్టాలు చెప్పుకున్నారు. చంద్రబాబు మోసాలను జగన్కు వివరించారు. వైఎస్ పాలనలో జరిగిన మేలును గుర్తు చేసుక్నునారు. ప్రజలు తమ వినతులను తెలియచేశారు. చిన్నారులకు పేర్లుపెట్టించుకుని తల్లితండ్రులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. హామీల వరాలు... ఈ జిల్లా ప్రజలకు జగన్ వరాల జల్లులు కురిపించారు. బహిరంగ సభల్లో వాటిని ప్రకటించారు.అధికారంలోకి రాగానే రామాయపట్నం పట్నం పోర్టును నిర్మిస్తామని, రాళ్లపాడు ప్రాజెక్టును సైతం పూర్తి చేసి ఈ ప్రాంతవాసులకు నీళ్లిస్తామని జగన్ కందుకూరు సభలో ప్రకటించారు. ♦ ఒంగోలు డెయిరీని అభివృద్ధి చేస్తానని, రైతులకు లీటరుకు 4 రూపాయలు సబ్సీడీ ఇచ్చి ఆదుకుంటామని కొండపిలో జరిగిన రైతుసదస్సులో జగన్ హామీ ఇచ్చారు. పొగాకు రైతులను ఆదుకుంటామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. పంటలు నష్టపోయినవారిని ఆదుకొనేందుకు ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ♦ సురక్షిత తాగునీరు అందించి కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ బాధితులను ఆదుకుంటామని కనిగిరి సభలో చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడంతో పాటు పింఛన్లు అందజేస్తామన్నారు. ♦ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని పొదిలి సభలో జగన్ హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. ♦ గ్రానైట్ క్వారీలతో పాటు ఫ్యాక్టరీలకు రాయల్టీలో, విద్యుత్ చార్జీల్లో సైతం సబ్సీడీ ఇస్తామని చీమకుర్తి సభలో జగన్ హామీ ఇచ్చారు. ♦ అధికారంలోకి వచ్చిన వెంటనే దొనకొండలో పరిశ్రమలు నెలకొల్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ♦ భవనాశి రిజర్వాయర్ పూర్తిచేసి అద్దంకి ప్రాంతానికి సాగు నీరందిస్తామని జగన్ అద్దంకి సభలో హామీ ఇచ్చారు. ♦ రైతులకు అన్ని పంటలకు గిట్టు బాటుధరలు కల్పిస్తామని ఈ ప్రాంతంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని జగన్ ఇంకొల్లు సభలో చెప్పారు. ♦ చేనేతలను ఆదుకుంటామని చీరాల సభలో జగన్ హామీ ఇచ్చారు. వీటితో పాటు.. ప్రభుత్వం రాగానే వారం రోజులో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. మాల మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఆశ వర్కర్లుకు మిగిలిన రాష్ట్రాలలో కన్నా అదనంగా వెయ్యి రూపాయలు జీతం లా అందిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాలని కందుకూరు సభలో నిర్ణయించారు. హోదాపై పోరు కోసం ఢిల్లీ యాత్రను ప్రారంభించారు. మార్చి 12 చివరి రోజున చీరాల రూరల్ మండలం ఈపురుపాలెం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో ప్రకాశం జిల్లాలో యాత్ర ముగిసింది. -
అడుగడుగునా జన నీరాజనం
-
ప్రజాసంకల్పయాత్ర చివరి రోజు
-
అనంత అడుగులన్నీ ఇచ్చాపురం వైపే
అనంతపురం సప్తగిరి సర్కిల్: 341 రోజులు..3648 కి.మీ సాగిన చారిత్రాత్మక పాదయాత్ర. ప్రజాభిమానమే దన్నుగా ఓ పథకుడు సాగించిన ‘ప్రజాసంకల్పయాత్ర’ ఈ మహోన్నత యాత్ర నేడు తుది ఘట్టానికి చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్వహిస్తోన్న ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు..తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకునేందుకు అనంత వాసులంతా భారీగా తరలివెళ్లారు. ఇప్పటికే కొందరు ఇచ్చాపురం చేరుకున్నారు. ♦ అనంతపురం అర్బన్ సమన్వయకర్త అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, నాయకులు చవ్వా గోపాల్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మీ శ్రీనివాస్, పెన్నోబిలేసు, మీసాల రంగన్నలతో పాటు పలువురు నాయకులు, అభిమానులు బయలుదేరారు. ♦ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వేలూరి రామాంజినేయులు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి సూర్యప్రకాష్బాబు బయలుదేరి వెళ్లిన వారిలో ఉన్నారు. ♦ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంగేగౌడ్, మాజీ మంత్రి నర్సేగౌడ్ తదితరులు బయలుదేరి వెళ్లారు. ♦ హిందూపురం నియోజకవర్గం నుంచి సమన్వయకర్త అబ్దుల్ఘని, హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త నదీం అహమ్మద్, నాయకులు ప్రభాకర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు ఇచ్చాపురం వెళ్లారు. ♦ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, జక్కల ఆదిశేషులు తదితరులు ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లారు. ♦ కళ్యాణదుర్గం నియోజకవర్గ నుంచి సమన్వయకర్త ఉషాశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, నాయకులు శెట్టూరు మధుసుధన్రెడ్డి, రామచంద్రారెడ్డి, సుధాకర్, అశోక్, రామ్మోహన్రెడ్డి, కుందుర్పి నుంచి దివాకర్రెడ్డి, రాయుడు, బ్రహ్మసముద్రం నుంచి నరేష్, బాలయ్య, మంజునాథ్చౌదరి తదితరులు ఇచ్చాపురం వెళ్లారు. ♦ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి కడపల శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ధూపంపల్లి నరసింహరెడ్డి, కృష్ణారెడ్డి, కత్తి జయచంద్రారెడ్డి ఇప్పటికే ఇచ్చాపురం చేరుకున్నారు. ♦ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, కణేకల్లు మాజీ ఎంపీపీ రాజగోపాల్రెడ్డి, బొమ్మనహళ్ మాజీ ఎంపీపీ లాలుసాబ్, కణేకల్లు మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగిరెడ్డి, కాంట్రాక్టర్లు కాంతారెడ్డి, నాగభూషణం, ఇల్లూరు శ్రీనివాసులు తదితరులు పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రీకాకుళం బయలుదేరారు. ♦ గుంతకల్లు నుంచి నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి, మంజునాథరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నబాబు, వైఎస్సార్సీపీ టౌన్ కన్వీనర్ ఎద్దుల శంకర్, పామిడి చుక్కలూరు దిలిప్రెడ్డి, సీఎం బాషాలు బయలుదేరారు. ♦ శింగనమల నుంచి పార్టీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి, శ్రీకాంత్, రఘునాథరెడ్డి, నాగేశ్వరరెడ్డి, పుట్లూరు రాఘవరెడ్డి, నరేష్, రామచంద్రారెడ్డి, నగేష్, సూర్యనారాయణ, నరసయ్య, పెద్దన్న వెళ్లారు. ♦ రాప్తాడు నుంచి నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, రాప్తాడు జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మహానందరెడ్డి, గంగుల భానుమతి, రామాంజినేయులు, గోపాల్రెడ్డి, నాగముని, గంగుల సుధీర్రెడ్డి తదితరులు వెళ్లారు. ♦ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు రమేష్రెడ్డి, పైలా నరసింహయ్య, వీఆర్ రామిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, యువజన విభాగం జిల్లా కార్యదర్శి జబ్బార్బాషాలు శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు. ♦ పెనుకొండ నియోజకవర్గ నుంచి సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు సుధాకర్రెడ్డి తదితరులు తరలివెళ్లారు. ♦ ఉరవకొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. అధినేతతో ‘అనంత’ నేతలు అనంతపురం సప్తగిరి సర్కిల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో ముగుస్తున్న నేపథ్యంలో ఆ మహావేడుకలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన పలువురు నేతలు మంగళవారమే శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి కడపల శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, కదిరి సమన్వయకర్త సిద్దారెడ్డి, పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, పెనుకొండ సమన్వయకర్త, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్నారాయణ పాదయాత్రలో జగన్ కలిసి ఆయన వెంట నడిచారు. -
ప్రతి అడుగూ పండగే
ఏడాది క్రితం..ఇవే రోజులు..జిల్లా అంతటా పండుగ వాతావరణం..సంక్రాంతి ముందుగానే వచ్చినంత కోలాహలం.. రోడ్ల మీద కూడా రంగవల్లులు..ప్రతి గుండెలో సందడి..ఆత్మీయ నేతను కలుస్తున్నామన్న ఆనందం..టీడీపీ పాలనలో అనుభవిస్తున్న కష్టాలను వినే నాయకుడొస్తున్నాడనే కొండంత సంబరం.. బిడ్డ నుంచి అవ్వాతాతల వరకూ అందరిలోనూ అనిర్వచనీయ అనుభూతి..రాజన్న బిడ్డ..జగన్మోహన్రెడ్డి తమ మధ్య ఉంటే పండుగ కాక మరేంటి.. గతేడాది ఇదే రోజుల్లో సంకల్పయాత్ర జిల్లా మీదుగా సాగినప్పుడు ప్రజా గుండెల్లో సంక్రాంతులు వెల్లివిరిశాయి. ఆయన ప్రతి అడుగూ మాకు పండగేనని జనం సంబరపడ్డారు. తమ కష్టాలను వైఎస్సార్సీపీ అధినేత ముందు వివరించారు. అందరి ఇంటా సంక్షేమం గూడు కట్టుకునే రోజు తొందర్లోనే రానుం దంటూ జగనన్న ఇచ్చిన భరోసాతో వారంతా మురిసిపోయారు. కాగా నేడు పాదయాత్ర ముగుస్తున్న తరుణంలో నాటి స్మృతులను గుర్తుచేసుకుంటున్నారు. రావాలి..జగన్..కావాలి జగన్ అంటూ ఆకాంక్షిస్తున్నారు. చిత్తూరు, సాక్షి: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రతో కరువు జిల్లా పులకించింది. అలుపెరుగని అడుగులను ఆత్మీయంగా ముద్దాడింది. పట్టణం, పల్లె తేడాలేకుండా హారతులిస్తూ నీరాజనాలు పలికింది. అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోకి 2017 డిసెంబర్ 28న ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించింది. 23 రోజుల పాటు 18 మండలాల్లో 291.1 కి.మీ మేర పాదయాత్ర సాగింది. మనోధైర్యం చంద్రబాబు పాలనలో పేదల బతుకులు మరింత దిగజారాయి. దగాపడ్డాయి. సంక్షేమం అమలు మొత్తం జన్మభూమి కమిటీల చేతుల్లోకి వెళ్లిపోయింది. అణగారిన బతుకులు నిలువు దోపిడీకి గురయ్యాయి. ఇలాంటి దశలో జగన్మోహన్రెడ్డి పాదయాత్ర జిల్లాలో ప్రవేశించింది. బడుగు, బలహీన వర్గాలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. దళితుల జీవితాల్లో ఆశాకాంతులు నింపింది. కన్నీటి పర్యంతమవుతున్న రైతన్నను వెన్నుతట్టి ప్రోత్సహించింది. పులకించిన కరువు నేల ప్రజాసంకల్పయాత్రతో కరువునేల పులకించింది. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి రైతులు అడుగడుగునా వెనుదన్నుగా నిలిచారు. ఎద్దులవారి కోట దగ్గర టమాట రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో వారు ఉప్పొంగిపోయారు. జిల్లాలోని పది లక్షల మంది పాడి రైతులకు రూ.4 రాయితీతో లబ్ధిచేకూర్చుతామని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో జరిగిన రచ్చబండలో సీఎంపై విమర్శలు ఎక్కుపెట్టారు. సొంత ఊరికి కూడా ఏమీ చేయలేని చంద్రబాబు ప్రజలకేం చేస్తారని మండిపడ్డారు. దళితుల నుంచే భూపంపిణీ సత్యవేడులో ఎస్సీ, ఎస్టీలతో ఆత్మీయ సదస్సు నిర్వహించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. భూ పంపిణీ కూడా దళితుల నుంచే మొదలు పెడతామని హామీ ఇచ్చారు. 10 వేల మంది ఉద్యోగులకు లబ్ధి ఆర్టీసీ విలీన ప్రకటన జిల్లాలోనే వెలువడింది. సదుంలో జరిగిన బహిరంగ సభలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జననేత హామీ ఇచ్చారు. ఈ హామీ జిల్లాలోని పది వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. అమ్మలో నమ్మకం..అవ్వాతాతల్లో ధైర్యం ‘కొడుకులు సరిగా చూసుకోలేదు నాయనా.. పింఛన్ మందులుమాకులకే సరిపోవడం లేదు’ అని ఓ అవ్వ రెడ్డిగుంట వద్ద జగన్ను కలిసి కన్నీటి పర్యంతమైంది. అవ్వ ఆవేదన జగన్ను కదిలించింది. మన ప్రభుత్వం వస్తూనే పెన్షన్ రూ.2 వేలు చేస్తానని హామీ ఇచ్చారు. కొడుకులు కూతుళ్లు చూసుకోలేకపోతే.. ప్రభుత్వమే ఆదుకునే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పడంతో కొండంత ఊరటనిచ్చింది. చిత్తూరు, చంద్రగిరి: వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభంకావడంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గంలో సుమారు 52 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో అడుగడుగునా వినూత్నరీతిలో స్వాగతాలు పలుకుతూ, రాష్ట్రంలోనే ఎవరూ చేయలేని రీతిలో ఏర్పాట్లను చేశారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నిపుణులతో భారీ స్వాగత ఆర్చ్లను ఏర్పాటు చేశారు. వందలాది మంది మహిళలు రోడ్డుకిరువైపులా నిల్చొని అపూర్వ రీతిలో గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీశారు. పాదయాత్రకు మద్దతుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా వచ్చాడా..? అన్న రీతిలో ఒకేసారి 99 మంది వైఎస్సార్ విగ్రహాలను మాస్క్లుగా ధరించి జననేతతో పాటు పాదయాత్రలో నడిచారు. రామచంద్రాపురం మండలంలో నిర్వహించిన రైతు సదస్సుకు వందలాది ట్రాక్టర్లలో రైతులు వచ్చి ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. విరిసిన సంక్రాంతులు చంద్రగిరి: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గత ఏడాది చంద్రగిరి నియోజకవర్గంలో వారం రోజుల పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను కొనసాగించారు. సంక్రాంతి పండుగను సైతం ఆయన నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం రావిళ్లవారిపల్లిలో అట్టహాసంగా జరుపుకున్నారు. ఆయన బస చేసిన పల్లె పరవశించింది. రంగవల్లులు, గొబ్బెమలు, డూడూ బసవన్నలతో ఆ ప్రాం తమంతా కోలాహలంగా మారింది. కుటుంబ సభ్యులతో కలసి మూడు రోజుల పాటు ఆయన ఇక్కడే సంక్రాంతి వేడుకలను జరుçపుకున్నారు. పల్లె పండుగ పరవశించింది పెద్ద పండుగ జరుపుకోవడానికి అనుకోని అతిథిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఆయన బసచేసే ప్రదేశానికి చేరుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆ ప్రాంతమంతా సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా భారీ ఏర్పాట్లను చేశారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన జగనన్నకు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్కు నివాళులు అర్పించారు. పుంగనూరు గోవు బçహూకరణ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తన అభిమాన నాయకుడికి పుంగునూరు గోవును బహూకరించారు. గోవును చూసి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మురిసిపోయారు. ఆప్యాయంగా అరటిపండు తినిపించారు. మనసున్న మారాజు వడమాలపేట: వడమాలపేట మండల పరిధిలోని పచ్చికాల్వ పంచాయతీకి చెందిన షేక్ ముజీబ్ బాషాది రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. ఇతని రెండేళ్ల కుమారుడు షేక్ రిహానాకు పుట్టినప్పటి నుంచి వినికిడి సమస్య. ఆపరేషన్కయ్యే ఖర్చును భరించే స్థోమత లేదు. గతేడాది జనవరి 16న సంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డికి బాషా దంపతులు తమ గోడు వినిపించారు. రిహానాకు ఆపరేషన్ చేయిస్తానని జననేత మాట ఇచ్చారు. గత ఏడాది ఏప్రిల్ 23న హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం రిహానా వినగలుగుతున్నాడు. ఆపరేషన్ ఖర్చును జగన్ భరించారు. ఆయన పెద్ద మనసుకు తామెప్పుడూ రుణపడి ఉంటామని బాషా దంపతులు చెబుతున్నారు. మా జీవితాల్లో వెలుగులొస్తాయ్ చిత్తూరు కార్పొరేషన్: వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే.. తమ జీవి తాల్లో వెలుగులొస్తాయని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఆశాభావం వ్యక్తం చేశా రు. గత ఏడాది పూతలపట్టు నియోజకవర్గం తలుపులపల్లె వద్ద డిమాండ్ల సాధన కు ఉద్యోగులు దీక్ష చేశారు. అటువైపు పాదయాత్రగా వెళ్తున్న జగన్మోహన్రెడ్డి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడికి వినతిపత్రం ఇచ్చి.. తమకు న్యాయం చేయాలని కోరినట్లు కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ జిల్లా నాయకుడు సుధాకర్ తెలిపారు. సంస్థ ద్వారా నేరుగా వేతనాలు చెల్లించి, దశలవారీగా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఈ సందర్భంగా జగనన్న హామీ ఇచ్చారన్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో ఉద్యోగుల జీతాలు పెంచి 7,000 మందిని ఒకేసారి క్రమబద్ధీకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. -
బ్రహ్మరథం పలికిన ప్రజలు
-
జననేతకు జేజేలు
-
ద లీడర్
-
341వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
సిక్కోలు మదిలో చెరగని గురుతులు
పది నియోజకవర్గాల్లో పల్లె వేదికగా పాదయాత్ర వేడుక కొనసాగింది. ప్రజా సంకల్ప యాత్ర సిక్కోలు మదిలో చెరగని గురుతులు నిలిపింది. సర్కారు నిర్లక్ష్యానికి బలైపోయిన ప్రజలకు తమ బాధలు చెప్పుకోగలిగే అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ నిరంకుశత్వానికి శిథిలమైపోయిన కుటుంబాలకు కన్నీరు తుడిచే నాయకుడిని చూపించింది. పన్నెండు జిల్లాల్లో దిగ్విజయంగా పాదయాత్ర నిర్వహించుకుని చివరి జిల్లాలో అడుగుపెట్టిన జగన్మోహనుడి ఆత్మీయ పలకరింపునకు సిక్కోలు ఫిదా అయిపోయింది. అడుగు అడుగునా అండగా నిలుస్తూ జనం రాజన్న బిడ్డకు నీరాజనం పలికారు. ప్రతి పలుకునకూ ప్రతిస్పందిస్తూ, పిలుపులను నినాదాలుగా మారుస్తూ పాదయాత్రను విజయవంతం చేశారు. ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది నవంబర్ 25న పాలకొండ నియోజకవర్గంలోని వీరఘట్టం మండలం కడకెల్ల వద్ధ జిల్లాలో తొలి అడుగు వేశారు. పాలకొండ నియోజకవర్గం నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగిన ఈ పాదయాత్రలో తన వద్దకు వచ్చిన అన్ని వర్గాల వారినీ ఆప్యాయంగా పలకరించారు. వివిధ సామాజిక వర్గాలతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి సమస్యలు వినిపించగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. గిరిజనుల అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర, ఆమదాలవలస సుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, తిత్లీ తుఫాన్ బాధితులకు పరిహారం పెంపు, ఉద్దాన కిడ్నీ బాధితులకు పింఛన్.. ఇలా బాధితులందరికీ న్యాయం చేస్తానంటూ ఇచ్ఛాపురం వరకు ప్రజా సంకల్పయాత్రను కొనసాగించారు. పాలకొండ పాదయాత్ర జరిగిన తేదీలు: నవంబర్ 25 నుంచి 29 వరకు నడిచిన దూరం: 34 కిలోమీటర్లు వీరఘట్టం/పాలకొండ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామంలో నవంబర్ 25న తొలి అడుగు వేశారు. ఐదు రోజుల పాటు జరిగిన పాదయాత్రలో స్థానిక సమస్యలు వింటూ బాధితులకు భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనోత్పత్తులకు గరిష్ట మద్దతు ధర కల్పించి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. రాజాం పాదయాత్ర జరిగిన తేదీలు:డిసెంబర్ 1 నుంచి 4 వరకు నడిచిన దూరం: 37.5 కిలోమీటర్లు రాజాం : నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు పాదయాత్ర సాగింది. డిసెంబర్ 3న రాజాం పట్టణ కేంద్రంలో జరిగిన సభలో విద్యారంగంలో పెరిగిన ఫీజులపై జననేత ప్రస్తావించారు. హెల్త్ అసిస్టెంట్లు తమకు ఉద్యోగ భద్రత లేదని చెప్పగా వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చెప్పారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు, ఇండీట్రేడ్ బ్రోకర్ బాధితుల కష్టాలు.. ఇలా అన్ని వర్గాల సాధకబాధకాలను విని భరోసా కల్పించారు. టెక్కలి పాదయాత్ర జరిగిన తేదీలు:డిసెంబర్ 18 నుంచి 23 వరకు తిరిగిన దూరం: 46.2 కిలోమీటర్లు టెక్కలి: మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలు చేసిన అరాచకాలు, అవినీతి కార్యకలాపాలను ప్రజలు ధైర్యంగా ప్రతిపక్ష నేత దష్టికి తీసుకువచ్చారు. పింఛన్లు అందక కొంత మంది, రేషన్ అందక మరికొంతమంది, జన్మభూమి కమిటీ సభ్యుల ఆగడాలకు బలైపోయిన బాధితులు జగన్కు కన్నీటి రూపంలో విన్నపాలు చేసుకున్నారు. 22న రావివలస గ్రామం నుంచి బర్మాకాలనీ, గోపినాథపురం, టెక్కలి వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఇదే సందర్భంలో పాదయాత్ర 3500 కిలోమీటర్లు మైలు రాయి చేరుకుంది. రావివలస గ్రామంలో మూతపడిన మెట్కోర్ ఫెర్రోఎల్లాయ్సెస్ పరిశ్రమ వద్ద కార్మికులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎచ్చెర్ల పాదయాత్ర జరిగిన తేదీలు: డిసెంబర్ 4 నుంచి 8 వరకు తిరిగిన దూరం: 17 కిలోమీటర్లు రణస్థలం: జి.సిగడాం మండలం గేదెలపేట వద్ద ప్రజానేతకు ఘనంగా స్వాగతం పలికారు. డిసెంబర్ 6న చిలకపాలెంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కళా వెంకటరావు అవినీతి చరిత్ర, దౌర్జన్యకాండను జగన్ ఎండగట్టారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన తీరు, తోటపల్లి కాలువ పనుల్లో జాప్యం, అంబేడ్కర్ యూనివర్సిటీ సమస్యలు.. ఇలా అన్ని సమస్యలు ప్రస్తావించారు. ఆమదాలవలస పాదయాత్ర జరిగిన తేదీలు:డిసెంబర్ 5 నుంచి 12 వరకు నడిచిన దూరం: 34 కిలోమీటర్లు ఆమదాలవలస: పొందూరు మండలంలో ఖాదీ కార్మికులు జగన్ను కలిసి కష్టాలు వివరించగా, పొందూరులో ఖాదీ పరిశ్రమ నిర్మాణానికి చర్యలు చేపడతామని జగన్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 10, 11 12 తేదీల్లో ఆమదాలవలస పట్టణం, మండలంలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగింది. ఆమదాలవలస పట్టణంలో జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ మూతపడిన సుగర్ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. నరసన్నపేట పాదయాత్ర జరిగిన తేదీలు: డిసెంబర్ 15 నుంచి 18 నడిచిన దూరం: 21 కిలోమీటర్లు నరసన్నపేట: మడపాం వద్ద వంశధార నది సాక్షిగా నరసన్నపేట నియోజకవర్గంలోనికి వచ్చిన జగనన్నకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. 16న నరసన్నపేటలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగట్టారు. నరసన్నపేట చరిత్రలోనే ఇంత భారీగా ప్రజలు పాల్గొన్న సభ ఇదేనని స్థానికులు చెబుతున్నారు. 18న చల్లపేట మీదుగా చిన్న కిట్టాలపాడు వరకూ దిగ్విజయంగా సాగిన ప్రజాసంకల్పయాత్ర టెక్కలి నియోజకవర్గంలోనికి ప్రవేశించింది. 17న పొందరులు, అగ్రికల్చరల్ విద్యార్థులు కలసి తమ సమస్యలను వివరించారు. పాతపట్నం పాదయాత్ర జరిగిన తేదీలు: డిసెంబర్ 23 నుంచి 29 నడిచిన దూరం: 33.6 కిలోమీటర్లు ఎల్.ఎన్.పేట: తమకు అండగా ఉండాలని ఆటో డ్రైవర్లు, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సమస్యలు పరిష్కరించాలని జీడి పరిశ్రమల కార్మికులు.. ఇలా అన్ని వర్గాల వారు ప్రజానేతకు సమస్యలు చెప్పుకున్నారు. 24న మెళియాపుట్టి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో అధికార పార్టీ వైఫల్యాలను, ఫిరాయింపు ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టారు. శ్రీకాకుళం పాదయాత్ర జరిగిన తేదీలు:డిసెంబర్ 8 నుంచి 12 వరకు నడిచిన దూరం: 25.8 కిలోమీటర్లు శ్రీకాకుళం: నియోజకవర్గంలో ఐదు రోజుల పాటు జరిగిన పాదయాత్రలో పలు వర్గాల ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. 8న శ్రీకాకుళం నగరంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రుణంపై ఇళ్లను ఇస్తోందని, తాను మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన వెంటనే రుణం రద్దు చేస్తానని పేదలకు హామీనిచ్చారు. కళింగ కోమట్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని ప్రకటించారు. వెలమ, కాళింగ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నైరలో వ్యవసాయ కళాశాల విద్యార్థులను కలిసి సమస్యలను తీర్చేందుకు హామీనిచ్చారు. పలాస పాదయాత్ర జరిగిన తేదీలు: డిసెంబర్ 29 నుంచి జనవరి 2 నడిచిన దూరం: 44 కిలోమీటర్లు కాశీబుగ్గ: పలాస నియోజకవర్గంలోకి రేగులపాడులో ఆఫ్షోర్ వద్ద ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించింది. 30న జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ జీడి కార్మికులకు పది వేలు పింఛన్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, తిత్లీ బాధితులకు చెట్టుకు రూ.3వేలు, హెకార్టు జీడికి రూ.50వేలు పరిహారం అందిస్తామని ప్రకటించారు. 1న వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానంలో తిత్లీ ప్రభావిత ప్రాంతంలో పాదయాత్ర కొనసాగించారు. దారి పొడవునా బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను పరిశీలించిన ప్రతిపక్ష నేత చలించిపోయారు. దీంతో కిడ్నీ రోగులకు 250 పడకలతో పరిశోధనా కేంద్రం, ఆస్పత్రి, కిడ్నీ రోగులకు రూ.10 వేలు పించన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇచ్ఛాపురం పాదయాత్ర ప్రారంభమైన తేదీ: జనవరి 2 నడిచిన దూరం: 50 కిలోమీటర్లు కంచిలి: రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జనవరి 2న సోంపేట మండల సరిహద్దు రాణిగాం గ్రామకూడలి వద్ద ప్రారంభమైంది. కంచిలి, కవిటి మండలాల మీదుగా సాగింది. తిత్లీ పరిహారంలో జరిగిన అన్యాయాన్ని ప్రజలు వివరించారు. అధికార పార్టీ నేతల అరాచకాలు, సంక్షేమ పథకాల అమలులో వివక్ష చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానంటూ జగన్ భరోసా ఇచ్చారు. 9న కొత్తకొజ్జిరియా నుంచి మొదలై పైలాన్ ఆవిష్కరణ అనంతరం ఇచ్ఛాపురం బస్టాండు కూడలిలో బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది. -
జనంలో ఎదిగిన నాయకుడు జగన్: గట్టు
సాక్షి, హైదరాబాద్: ప్రజల కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ తొలుత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా గుర్తింపు పొందినప్పటికీ ఆయన ప్రజల మధ్యలోనే ఎదిగారని, ప్రజలలోనే పెరిగారని ఆయన అభిప్రాయడ్డారు. ప్రజలను నమ్ముకున్న ఏ నాయకుడు కూడా నష్టపోడని, ప్రజలు లేకపోతే తానులేనుకునే నాయకుడు జగన్ అని ఆయన కొనియాడారు. వైఎస్ జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ‘సాక్షి టీవీ’తో రామచంద్రరావు మాట్లాడారు. సొంత పార్టీ పెట్టుకుని ప్రజల అభిమానాలు, ఆదరణను జగన్ పొందారని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే కేవలం 5 లక్షల 40వేల ఓట్లు మాత్రమే వైఎస్సార్సీపీ కంటే ఎక్కువగా వచ్చాయని, బీజేపీ లేకపోతే అన్ని ఓట్లు కూడా రావని వెల్లడించారు. కేవలం ఒక్క ఎమ్మెల్యేతో సొంత పార్టీని స్థాపించి నేడు 67 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎంపీలు సాధించి ఏపీలో బలమైన నేతగా జగన్ ఎదిగారని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో తనకు బలం సరిపోదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో పొత్తుల కోసం ప్రయత్తిస్తున్నారని, ఏపీలో కూడా టీడీపీకి బలం సరిపోదని చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే వైఎస్ జగన్ ముందు చంద్రబాబు ఓడిపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలు జగన్, ఆయన వ్యతిరేకుల మధ్యనే జరుగుతాయని, భవిష్యత్తులో ఆయనకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. -
గమ్యం వైపు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజాక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పం దిగ్విజయంగా ఫలించాలని, కోట్లాది మంది జనం సంకల్ప మేవ జయతే అంటూ నినదిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించిన పాదయాత్ర అటు రాయలసీమ నుంచి ప్రారంభమై ఇటు ఉద్దాన సీమ వరకు దిగ్విజయంగా సాగింది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం పాదయాత్ర జనసందోహం నడుమ సాగింది. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ఉద్దాన ప్రాంత పల్లె జనం జగన్మోహన్రెడ్డికి జనహారతులిచ్చి స్వాగతాలు పలికారు. ముఖ్యంగా కవిటి, రాజపురం తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో ఈ ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. ఈ క్రమంలో అడుగడుగునా జనం తమ సమస్యలు విన్నవిస్తుంటే వారి బాధలను ఓపిగ్గా వింటూ తనదైన శైలిలో జగన్ వారికి భరోసా ఇచ్చి, భవిష్యత్పై ఆశలు చిగురించారు. పాదయాత్ర నేటితో (బుధవారం) ముగింపునకు చేరుకున్నందున మంగళవారం యాత్రకు ప్రత్యేకత సంతరించుకుంది. ఎలాగైనా జగనన్నను కలవాలని, ఆయనతో కరచాలనం చేయాలని, సెల్ఫీ తీయించుకోవాలని యువకులు, మహిళలతో పాటు వైఎస్సార్సీపీలో వివిధ విభాగాల శ్రేణులు కూడా పోటీపడ్డారు. యాత్ర తుది లక్ష్య స్థలమైన ఇచ్ఛాపురం భారీ ఏర్పాట్లతో ముస్తాబైంది. బ్రహ్మరథం పలికిన ఉద్దానం ప్రజలు పేద, సామాన్య జనాల సంక్షేమం కోసం, అలాగే రాష్ట్రంలో ‘నారా’సుర పాలనకు అంతమొందించాలని జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ఉద్దాన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తిత్లీ తుపానుతో సర్వం కోల్పోయిన వేలాది మంది బాధితులు తమకు అండగా జగనన్న ఉంటాడన్న విశ్వాసంతో యాత్రలో జగన్ వెంట అడుగులు వేశారు. దీంతో ఉద్దాన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో ఉద్దాన ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో జగన్కు స్వాగతాలు పలికారు. కవిటి మండల కేంద్రంతో పాటు రాజపురం, అగ్రహారం తదితర ప్రాంతాల్లో కూడా జనం స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో తరలిరావడంతో అధికార పక్ష నేతలకు చెమట్లు పట్టాయి. ప్రజాసంకల్పయాత్రలో నేతల హోరు.. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం పలువురు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలు జగన్తో కలిసి కొంతదూరం అడుగులు వేశారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ విషయాలను చర్చిస్తూనే, బుధవారం ముగింపు సందర్భంగా ఏర్పాట్లపై జగన్తో ముఖ్య నేతలు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 80 నియోజకవర్గాలకు చెందిన ప్రముఖ నేతలు, కీలక నియోజకవర్గాల సమన్వయకర్తలు జగన్ను కలవడంతో ఉద్దాన ప్రాం తంలో నేతల జోరు, హోరు కనిపించింది. పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్ర స్వామి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎంపి మిధున్రెడ్డి, గంగుల ప్రభాకరరెడ్డి, జి.అమర్నా«ధ్రెడ్డి తదితరులు జగన్తో కాసేపు నడిచారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర పార్టీల ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, రెడ్డి శాంతి, పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, పలాస, టెక్కలి నియోజకవర్గాల సమన్వయకర్తలు సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాలా (లల్లూ), పార్టీ రాష్ట్ర సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నర్తు రామారావు, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజేశ్వరి, ఇచ్ఛాపురం నియోజకవర్గ మహిళా విభాగ కన్వీనర్ పిరియా విజయ, పలాస పిఎసిఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ (బాబా), రాష్ట్ర పార్టీ వివిధ విభాగాల నేతలు తమ్మినేని చిరంజీవినాగ్, ధర్మాన కృష్ణ చైతన్య, ఎన్ని ధనుంజయ, కామేశ్వరి, మామిడి శ్రీకాంత్ తదితరులు మంగళవారం నాటి యాత్రలో పాల్గొని జగన్కు సంఘీభావం ప్రకటించారు. సురక్షిత నీరు అందిస్తా.. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, వీరి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని జగన్ హామీ ఇచ్చారు. భూగర్భ జలాలే ఇక్కడ కిడ్నీ రోగాలకు ఓ ప్రధాన కారణంగా చెబుతున్న నేపథ్యంలో సమీపంలో ఉన్న పలు నదుల ఉపరితల నీటిని ఉద్దాన ప్రాంతాలకు రప్పించి, సురక్షిత నీటిని సరఫరా చేస్తామని జగన్ ప్రకటించడంతో ఉద్దాన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం జగన్ పాదయాత్రను కవిటి మండలం కవిటి కొత్తూరు క్రాస్ నుంచి ప్రారంభించగా, కవిటి పట్టణం మీదుగా, తొత్తిడి పుట్టుగ, బొర్రపుట్టుగ, చెండి పుట్టుగ, రాజపురం మీదుగా అగ్రహారం వరకు యాత్ర సాగింది. ఈ ప్రతి తోవ జనవెల్లువగా మారింది. యాత్రలో భాగంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెద్ద సంఖ్యలో జగన్ను కలిసి తమ గోడును వివరించారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ.. కిడ్నీ వ్యాధులతో వేలాది మంది చనిపోతున్నా, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలాస కేంద్రంగా 200 పడకల ఆస్పత్రిలో కేవలం కిడ్నీ రోగులకు చికిత్సలు చేయిస్తామని, అలాగే కిడ్నీ రోగులకు ప్రతి నెల వైద్య ఖర్చుల కోసం రూ.10 వేలను పింఛనుగా అందజేస్తామని ప్రకటించారు. అలాగే మూడో దశలో ఉన్న వ్యాధి గ్రస్తులకు పూర్తిగా పోషకాహారాన్ని అందించేలా చర్యలు చేపడతామని కూడా వివరించారు. అలాగే ఈయాత్రలో తిత్లీ తుపాను బాధితులు, కొబ్బరి, జీడి రైతులు, సామంతులు, కండ్ర, బ్రాహ్మణ, కాపు తదితర కులాల ప్రతినిధులు కూడా జగన్ను కలిసి తమ సమస్యలను వివరించారు. అలాగే జగనన్న చేసిన సహాయంతో తన కుమారుడు లోకేష్కు బ్రెయిన్ట్యూమర్ వ్యాధికి ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తయ్యిందని, రూ.6 లక్షల విలువైన ఈ ఆపరేషన్ను ఉచితంగా చేయించి, నా కొడుక్కి మరో జన్మనిచ్చారని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొత్తగూడెంకు చెందిన వెంకట రాంబాబు తన ఆనందాన్ని జగనన్న వద్ద వ్యక్తం చేశారు. -
మత్స్యకారులపై కక్ష
శ్రీకాకుళం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో 5వ వార్డులో మత్స్యకారులంతా వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నారని పాలకులు కక్ష సాధిస్తున్నారు. స్వదేశీ మత్స్యకారుల కో ఆపరేటివ్ సొసైటీ చెరువుల్లో రొయ్యలు, చేపలు పెంచుతూ జీవనం సాగిస్తున్నాం. మొత్తం 333 మంది ఈ సొసైటీలో సభ్యులుగా ఉండేవారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులను తొలగించి, కేవలం 46 మంది టీడీపీ మద్దతుదారులతోనే ప్రస్తుతం ఈ సొసైటీ నిర్వహిస్తున్నారు. దీనిపై నిలదీస్తే కక్ష సాధిస్తున్నారు. అక్రమంగా పోలీస్ కేసులు పెడుతున్నారు.– మేఘనాథ్ బెహరా, ఇచ్ఛాపురం -
సహాయం కావాలి
శ్రీకాకుళం: ఉద్దానం కిడ్నీ బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలి. పూర్తిస్థాయి రోగులకు అవసరమైన డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆర్థికంగానూ ఆదుకోవాలి. కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టాలి.– కమల పోడియా, తొత్తిడిపుట్టుగ, కవిటి మండలం. -
బిడ్డను ఆదుకోండి
శ్రీకాకుళం:నా బిడ్డ దీపక్ గత ఆరేళ్లుగా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. వయసు పెరుగుతున్నా మానసిక ఎదుగుదల లేదు. మాటరాదు, నడవలేడు. ఎన్నో ఆస్పత్రుల కు తీసుకువెళ్లాం. ఫలితం లేదు. నా భర్త దేవేంద్ర ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మందుల ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నాం. జగన్పై నమ్మకంతో వచ్చాం.– అనంత పార్వతి, కవిటి గ్రామం, సోంపేట మండలం. -
బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలి
శ్రీకాకుళం: బెంతు ఒరియా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. 2005 వరకు బెంతు ఒరియాలకు రెవెన్యూ శాఖ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసింది. ఇప్పుడు 1951 జనాభా లెక్కలు తెస్తే పరిశీలిస్తామని ప్రభుత్వం చెబుతోంది. సుప్రీంకోర్టు కూడా ఎస్టీల్లో చేర్చాలని తీర్పునిచ్చింది. జీవో నంబర్ 371 అమలు చేస్తే బెంతు ఒరియాలకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతాయి.– డాక్టర్ దామోదర్ ప్రధాన్, మెళియాపుట్టి. -
సామంత కులాన్ని ఆదుకోండి
శ్రీకాకుళం: జిల్లాలో 40వేలు జనాభా కలిగిన సామంత కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్పించాలి. ఓసీ కేటగిరిలో ఉన్న మా కులాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లో బీసీ–ఏ కేటగిరిలో చేర్చారు. మేమంతా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఉండడం లేదు. మా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్పించి ఆదుకోవాలి.– కె.కొత్తూరు వాసులు, కవిటి మండలం -
నా బిడ్డను రక్షించండి
శ్రీకాకుళం: ఐదేళ్ల నా బిడ్డ దవళ సాగర్ బెహరా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్లం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. నెలనెలా రూ.10 వేలు అప్పుగా వా డుకొని విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకువెళుతున్నాం. మూడేళ్లుగా వ్యాధి తో బాధపడుతున్న నా కొడుకును ఆదుకోవాలి.– సాగర్బెహరాతో తల్లిదండ్రులు దుర్యోధన, లక్ష్మి, కవిటి -
టీడీపీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి
శ్రీకాకుళం: మేము చేపల వేట చేసుకుని బతుకుతున్నాం. మేము నివసిస్తున్న వీధిలో టీడీపీ వారు ఇబ్బం ది పెడుతున్నారు. పంచాయతీ స్థలం ఉన్నా మా ఇంటికి ఎదురుగా ట్యాంకు నిర్మించి దారిలేకుండా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అందనీయడం లేదు.– కండ్ర వీధి కండ్ర కులస్తులు,కవిటి ఆపరేషన్ అవసరం శ్రీకాకుళం: నా బిడ్డ రుషికేశవ బెహరాకు గుండె ఆపరేషన్ చేయించి ఆదుకోవాలి. తొలుత కిడ్నీ సంబంధి త వ్యాధి వచ్చింది. గత కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధి కూడా వచ్చిందని వైద్యులు చెబు తున్నారు. నా బిడ్డకు ఆపరేషన్ చేయించి ఆదుకోవాలి– రుషికేశవ్ బెహరాతో తండ్రి నర్సుతం బెహరా, కవిటి. గొడౌన్ తరలింపు తగదు కవిటి సివిల్ సప్లయ్ గొడౌన్ తరలింపు నిలిపివేయించాలి. టీడీపీ ప్రభుత్వం సివిల్సప్లయ్ గొడౌన్ను తరలిస్తోంది. ఇది తరలిస్తే ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్న హమాలీలు ఉపాధి కోల్పోతారు. – బొర్ర బాలకష్ణ, హమాలీ, కవిటి -
పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: వైఎస్ జగన్
చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.. ఆయన ఏమన్నారంటే.. యుద్ధం నారాసురుడు ఒక్కడితోనే కాదు.. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలనేది నాకున్న సంకల్పం. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ . నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చి.. వాటి మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే.. చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. ప్రజలు ఓటు వేయరు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే.. వారికి భరోసా ఇస్తూనే నడిచాను. ప్రతి పేద వాడికి మంచి చేయాలనే తపన ఉంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రజాసంకల్పయాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. మనం యుద్దం చేసేది నారాసురుడి ఒక్కడితోనే కాదు ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేయాలి. జిత్తులు మారిన చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటాడు. ప్రజల దీవెనలతో చంద్రబాబు మోసాలను, అన్యాయాలను జయిస్తా. చిలుకా గోరింకలు తలదించుకునేలా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 ఎమ్మెల్యేలను చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసి నలుగురిని మంత్రులుగా చేశారు. ప్రత్యేక హోదాను ఖూనీ చేసి.. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేశాడు. టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా కొనసాగారు. నాలుగేళ్లు హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు బీజేపీని పొగిడారు. ప్రత్యేక హోదాను వెటాకారం చేస్తూ అసెంబ్లీలో మాట్లాడారు. హోదా కోసం పోరాడితే జైల్లో పెట్టిస్తానని అంటారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని హోదా కోసం మాట్లాడేవారిని ప్రశ్నించారు. చిలుక, గోరింకలు తలదించుకునేలా టీడీపీ, బీజేపీ ప్రేమ కొనసాగింది. ఎన్నికలు వచ్చేటప్పటికీ రంగులు మారుస్తున్నారు. ఎన్నికలకు మూడు నెలలు ముందే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారు. ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికి రాష్ట్ర సమస్యలను వదిలేసి మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నారు. ప్రజలకు ఏం చెయ్యకపోయినా.. చేసినట్లు ఎల్లో మీడియా గ్లోబెల్ ప్రచారం చేస్తుంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థని మార్చాలంటే.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థని మార్చాలంటే జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తాం. కలెక్టర్లు ఏడు నియోజకవర్గాలకే బాధ్యుడిగా ఉంటే.. ప్రజలకు అందుబాటులో ఉంటారు. కలెక్టర్ల వ్యవస్థను పూర్తిగా ప్రజల వద్ద తెచ్చేందుకు ఏపీలో 13 జిల్లాల స్థానంలో 25 జిల్లాలను ఏర్పాటుచేస్తాం. సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటుచేస్తాం. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామానికి చెందిన పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించేటప్పుడు.. పార్టీలను చూడం. అర్హత ఆధారంగానే లబ్ధిదారులను గుర్తిస్తాం. ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటరీగా నియమిస్తాం. గ్రామ వాలంటీర్లకు రూ. 5వేల చొప్పున జీతాలు ఇస్తాం. ప్రతి ప్రభుత్వ పథకం మీ ఇంటికి వచ్చేవిధంగా చూస్తాం. రేషన్ బియ్యం సైతం డోర్ డెలివరీ చేస్తాం. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా రాజ్యం నడుస్తుంది. రేషన్కార్డు, ఇల్లు సహా.. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా మంజూరు చేయాలంటే మీరు ఏ పార్టీ వారని అడుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో పెన్షన్కోసం వృద్ధులు కోర్టుకు వెళ్లే దారుణమైన పరిస్థితి నెలకొంది. గ్రామ స్వరాజ్యం లేని జన్మభూమి కమిటీలను నడుపుతున్నారు. అంబులెన్స్ లేక.. గర్భిణీ బస్సులోనే ప్రసవించారు విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ఓ ఘటన నాకు ఎదురైంది. గర్భిణీ పురిటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేస్తే.. టైర్ పంక్చర్ అయిందని 108 సిబ్బంది చెప్పారు. అంబులెన్స్ లేకపోవడంతో ఆ గర్భిణీ బస్సులోనే ప్రసవించారు. రాష్ట్రంలో పేదవాడికి వైద్యం అందడం లేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ఉద్దానంలో 4వేల మంది కిడ్నీ బాధితులుంటే.. ప్రభుత్వం 1400 మందికి మాత్రమే సాయం చేస్తుంది. 370 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. డయాలసిస్ పేషెంట్లకు ముష్టి వేసినట్లు 2500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. బినామీలో కోసం విద్యారంగాన్ని బాబు నాశనం చేశాడు కవిటి మండలంలో అమ్మాయిలు చదివే జూనియర్ కాలేజీల్లో బాత్రూమ్లు లేకపోవడం దారుణం. చంద్రబాబు తన బినామీల కోసం విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు ముక్యమంత్రి అయ్యాక ఆరువేల ప్రభుత్వ పాఠశాలలు మూయించివేశారు. ఎస్సీ, బీసీ, ఎస్టీల హాస్టళ్లను మూసివేయించారు. మధ్యాహ్న భోజన పథకానికి ఆరు నెలలుగా బిల్లులు చెల్లించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలానికి చెందిన గోపాలన్న నన్ను కలిశారు. అక్కడ ఫ్లెక్సీలో ఉన్న వ్యక్తి తన కొడుకు అని, తాను ఫీజులు కట్టలేకపోవడంతో ఇంజినీరింగ్ చదువుతున్న తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. డ్వాక్రా మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు. డ్వాక్రా సంఘాల మహిళలపై బ్యాంకు సిబ్బంది దాడులు చేస్తున్నారు. వడ్డీలు కట్టేందుకు అక్కాచెల్లమ్మలు తాళిబోట్లు తాకట్టు పెట్టే దుస్థితి నెలకొంది. 2016 నుంచి డ్వాక్రా సంఘాల వడ్డీలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగాలు లేవు.. ఉన్న ఉద్యోగాలు గోవిందా.. చంద్రబాబు హయంలో ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ యువత నిరాశలో ఉన్నారు. బాబు వచ్చాడు కానీ.. జాబు రాలేదని నిరుద్యోగులు నన్ను కలిశారు. విభజన సమయానికి లక్షా 42వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో 90వేల మేర ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం దాదాపు 2లక్షల 20వేల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కుడా భర్తీ చేయలేదు. 30వేల ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా.. గృహ నిర్మాణ శాఖలో 3500మంది ఉద్యోగాలు గోవిందా.. గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా.. ఆయూష్లో పనిచేస్తున్న 30వేల మంది ఉద్యోగాలు గోవిందా.. మధ్యాహ్నం భోజనం పథకంలో పనిచేస్తున్న 85వేల మంది ఉద్యోగాలు గోవిందా.. బెంగళూరులో కాఫీ.. చెన్నైలో ఇడ్లీ సాంబార్..! రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం రాజకీయాలే ముఖ్యమనుకుంటున్నారు. జాతీయ రాజకీయాలంటూ చంద్రబాబు బెంగళూరుకు వెళ్లి.. కుమారస్వామితో కాఫీ తాగారు. కానీ కర్ణాటక పక్కనే ఉన్న అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి ఆయనకు గుర్తుకురాలేదు. మరోవైపు చంద్రబాబు చెన్నై వెళ్లి స్టాలిన్తో ఇడ్లీ సాంబార్ తిన్నారు. కానీ పక్కనే ఉన్న తన సొంత జిల్లా చిత్తూరు రైతుల గురించి ఆయన పట్టించుకోరు. విమాన చార్జీలు ప్రభుత్వమే భరిస్తోంది కదా అని ఆయన పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతను కలుస్తారు. కానీ, ఆయనకు రాష్ట్రంలోని రైతుల దుస్థితి కనిపించడం లేదు. వైఎస్సార్ హయాంలో ఏపీలో 42.70 లక్షల హెక్టార్ల పంటసాగు ఉంటే..చంద్రబాబు హయాంలో 40 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అందుకే ఏపీలో పర్జలు చంద్రబాబును ‘నిన్ను నమ్మం బాబు’ అంటున్నారు. నాబార్డ్ నివేదిక ప్రకారం దేశంలోనే రైతు అప్పుల విషయంలో ఏపీ రెండో స్థానంలో ఉంది. రుణమాఫీ పేరుతో చద్రబాబు చేసిన దగాకు వడ్డీలు పెరిగిపోయి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వడ్డీలేని రుణాలు కూడా రైతులకు అందడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. తన హెరిటేజ్ కోసం చంద్రబాబు దళారీలకు కెప్టెన్ అయ్యారు. రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి.. మూడింతలు ధరలు పెంచి తన హెరిటేజ్లో చంద్రబాబు అమ్ముతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు తెరవలేదు. పలాస జీడిపప్పు రైతులు కేజీ 650 రూపాయలకు కూడా అమ్ముకోలేకపోతున్నారు. చంద్రబాబు మాత్రం హెరిటేజ్లో జీడిపప్పు కిలో 1100 రూపాయలకు అమ్ముతున్నారు. రైతు శివన్న గురించి.. అనంతపురంలో శివన్న అనే రైతు కలిశారు. శివన్న పొలంలో వేరుశనగ వేశానని చెప్పాడు. పంట ఎలా ఉందని అడిగితే.. బాబు రాగానే కరువు వచ్చిందన్నారు. అనంత పర్యటనకు చంద్రబాబు వచ్చినప్పుడు సాయం అడిగామన్నారు. కరువుతో ఎండిపోతున్నాం సాయం చేయమంటే.. చంద్రబాబు అయ్యో నాకు కరువు గురించి తెలియదు అని అధికారులపై మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం కుదేలైన పరిస్థితిని కళ్లకు కట్టేలా శివన్న చెప్పారు. రెయిన్ గన్లతో ప్రభుత్వం రైతులను మభ్యపెట్టిన తీరును శివన్న నాకు వివరించారు. అందుకే రైతులు నిన్న నమ్మం బాబు అంటున్నారు. ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నా పాదయాత్రలో ఎంతమందిని కలిశాం.. ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం నాలుగున్నరేళ్లలో బాబు పాలన ఎంత ఘోరంగా ఉందో ప్రజలు చెప్పారు. కరువు, నిరుద్యోగం వీటికి తోడు చంద్రబాబు మోసం ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను. ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను. 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నేను నడిచినా.. నడిపించింది ప్రజలు.. పైనున్న దేవుడు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చాపురం పాత బస్టాండ్ బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6వ తేదీన జననేత చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర.. 134 నియోజకవరాగలు, 231 మండలాలు, 2,516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల గుండా సాగింది. జననేత 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు 123 సభల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. పాదయాత్రలో అఖరి బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయసంకల్ప స్తూపాన్ని అవిష్కరించారు. అక్కడి ఆయన ఇచ్ఛాపురం పాత బస్టాండ్ వద్ద జరిగే సభాస్థలికి బయలుదేరారు. ఇప్పటికే లక్షలాది మందితో సభాస్థలి కిక్కిరిసింది. జై జగన్ నినాదాలతో ఆ ప్రాతమంతా మారుమోగుతోంది. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయసంకల్ప స్తూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సర్వమత ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఇచ్ఛాపురం చేరుకున్న అశేష ప్రజానీకం అడుగడుగునా వైఎస్ జగన్కు నీరాజనం పలుకుతున్నారు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్ఛాపురంలోని విజయసంకల్ప స్తూపాన్ని అవిష్కరించే క్షణం కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇచ్ఛాపురంతోపాటు పరిసర ప్రాంతాల్లో జనసందోహం నెలకొంది. 16వ నెంబర్ జాతీయరహదారి కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. పైలాన్ వద్దకు వైఎస్ జగన్ రాకకోసం లక్షలాది మంది జనం ఎదురు చూస్తున్నారు. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాలు జగన్ నినాదాలతో మారుమోగుతున్నాయి. ఇచ్ఛాపురం: బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్)ను ఇచ్ఛాపురంలో కాసేపట్లో వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పైలాన్ను వైఎస్ జగన్ ఆవిష్కరించే అపురూప క్షణాల కోసం తామంతా వేచిచూస్తున్నామని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. స్థూపాన్ని ఆవిష్కరించిన తర్వాత కాలినడకన పాత బస్టాండ్ వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. తిరుపతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా యువజన విభాగం నేత భూమన అభినయ రెడ్డి నేతృత్వంలో తిరుపతిలోని అలిపిరి వద్ద పార్టీ శ్రేణులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమ కుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు ఇమామ్, రాజేంద్ర, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు నేపధ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. వైఎస్ సర్కిల్లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాజా విష్ణు వర్దన్ రెడ్డి, నరసింహులు యాదవ్, తెర్నకల్ సురేందర్ రెడ్డి, రెహమాన్, మద్దయ్య, మున్నా తదితరులు పాల్గొన్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా పాణ్యం నియోజకవర్గంలోని షరీన్ నగర్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు విశ్వేశ్వర్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, ఫిరోజ్, బెల్లం మహేశ్వర రెడ్డి, సులోచన, శ్రీనివాసులు, విక్రమ్, డేవిడ్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలతో అభిషేకం, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ శ్రేణులు రాయదుర్గం మండలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ఉడేగొళం మధ్యనేశ్వర స్వామి దేవాలయం వరకు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు కాపు ప్రవిణ్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూడేరు మండలం పి. నాగిరెడ్డిపల్లిలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. విడపనకల్లు మండలం డోనేకల్లులో వైస్సార్సీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చిత్తూరు: ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్, రాహుల్ రెడ్డి,లీనారెడ్డిలు, ఇతర కార్యకర్తలు గాంధీ సర్కిల్లో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా, వైఎస్ జగన్కు సంఘీభావం తెలియచేస్తూ పీలేరు, కలికిరి, కలకడ, వైవి పాలెం,గుర్రంకొండ, వాల్మీకి పురం మండలాలలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్: జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా సుండుపల్లి జెడ్పీటీసీ హకీం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా రాయచోటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా ఎస్ కే యూనివర్సిటీ సమీపంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు, ఆకుతోటపల్లి గ్రామస్థుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 టెంకాయలు కొట్టి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. నెల్లూరు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా రూరల్ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు పిండి సురేష్, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కాకి వెంకటేశ్వర్లు భారీ కేక్ను కట్ చేశారు. మూడు నెలల్లో రాజన్న రాజ్యం రాబోతోందని, జిల్లాలో కచ్చితంగా 10 సీట్లు గెలుస్తామని బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్ధి విభాగం నాయకులు విష్ణు వర్దన్ రెడ్డి, మేర్లపాక వెంకటేష్, సందీప్, రాజేష్, యశ్వంత్, బన్నీ,నాగరాజులు నాయుడుపేటలోని శ్రీ పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 101టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విజయనగరం: ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు విజయనగరం నుంచి భారీగా జనం తరలి వస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు నెల్లిమర్ల వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బడుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో నెల్లిమర్ల నియెజకవర్గం నుంచి భారీగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా బయలుదేరి లొద్దపట్టి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. వైఎస్సార్ సీపీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జననేతతో కలిసి నడవటానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనసంద్రంగా మారాయి. వైఎస్సార్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా కడప జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ బాషా, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్లు పాల్గొన్నారు. గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం అయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 3648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైన రోజు పాదయాత్ర విజయవంతం కావాలని స్వామివారికి మొక్కుకున్నారు. పాదయాత్ర విజయవంతం కావడంతో కార్యకర్తలు స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కు చెల్లించుకున్నారు. చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇచ్ఛాపురం : విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు పాడేరు సమన్వయ కర్త విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో గిరిజనులు భారీగా ఇచ్ఛాపురానికి తరలి వచ్చారు.పాడేరు, జీకే వీధి, జీ మాడుగుల, కొయ్యురు మండలాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు భూసరి క్రిష్ణా రావు, లకే రత్నభాయ్,కోడా సురేష్, గాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం : పెందుర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త అదీప్ రాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు కారు ర్యాలీ ద్వారా ఇచ్ఛాపురానికి బయలుదేరారు. జననేతకు జేజేలు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన రాజన్న తనయుడికి జనం జేజేలు పలికారు. సాక్షి టీవీ కేఎస్సార్ లైవ్ షోలో పలువురు మాట్లాడుతూ... జననేతకు అభినందనలు తెలిపారు. పాదయాత్రతో వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని హైదరాబాద్కు చెందిన రాజ్యలక్ష్మి అనే మహిళ పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, కత్తితో దాడి చేసినా ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేయడం మామూలు విషయం కాదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర తర్వాత జనసమ్మోహనరెడ్డిగా మారిపోయారని విస్సన్నపేటకు చెందిన జయకర్ ప్రసంశించారు. ప్రజాసంకల్పయాత్ర విజయసంకల్పయాత్రగా మారడంలో ఎటువంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని కడపకు చెందిన డాక్టర్ రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చివరిరోజూ అదే ఉత్సాహం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి చివరిరోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. జననేత వెంట నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిందరినీ చిరునవ్వుతో పలకరించి ముందుకు సాగారు. చివరిరోజు పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు వైఎస్ జగన్ వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. జననేత పాదయాత్ర సాగుతున్న దారిలో యువత కోలాహలం కన్పిస్తోంది. దారులన్నీ జనసంద్రం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6న వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 341 రోజుల తర్వాత బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. జన నాయకుడి జైత్రయాత్రకు సంఘీభావంగా తరలివెళుతున్న జనంతో దారులన్నీ జనసంద్రంగా మారాయి. -
మెగా డీఎస్సీ కావాలి
శ్రీకాకుళం: ‘అన్నా.. మీరు సీఎం అయిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించాలి. టీడీపీ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులను మోసం చేసింది. 23వేల పోస్టులుంటే 7వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసి నిరుద్యోగులకు అన్యాయం చేసింది’ అని కవిటి మండలం కె.కొత్తూరుకు చెందిన బి.శ్రావణి జగన్కు తెలిపారు. వైఎస్ హయాంలో యాభై వేల పోస్టులు ఒకేసారి మంజూరు చేశారని, మీరు సీఎం అయ్యాక మెగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. -
విజయ ‘సంకల్పం’
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా... సమస్యల పరిష్కారమే లక్ష్యంగా... సంకల్పమే ఆయుధంగా... అలుపెరుగకుండా సాగిన విపక్ష నేత ప్రజాసంకల్ప యాత్ర తుదిదశకు చేరుకుంది. జిల్లాలో దాదాపు రెండు నెలల్లో 36రోజులపాటు అకుంఠిత దీక్షతో సాగిన పాదయాత్రలో ఆయన వేలాదిమంది సమస్యలు తెలుసుకున్నారు. 214 గ్రామాలను సందర్శించారు. ఎక్కడ చూసినా ఆయనకోసం ఆత్రంగా ఎదురుచూసిన జనం కనిపించారు. తమ గోడు వినిపించుకోవాలనీ... సాంత్వన పొందుదామనీ ఆకాంక్షించారు. వారి అందరి ఆశలను తీరుస్తూ ఆయన శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. ఇప్పుడు ఆ జిల్లాలో బుధవారంతో ఆయన యాత్ర పూర్తవుతోంది. ఆ చివరి ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయన పర్యటన వివరాలు. సాక్షిప్రతినిధి విజయనగరం: 2017 నవంబర్ ఆరో తేదీ. వైఎస్సార్కడప జిల్లా ఇడుపులపాయ ఓ చారిత్రాత్మక నిర్ణయానికి సాక్షీభూతమైంది. ప్రజల కష్టాలు క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తమ ప్రభుత్వం వస్తే వారికి న్యాయం చేసుకునేలా ప్రణాళిక రూపకల్పనకు ఓ మహోన్నత లక్ష్యంతో విపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర మొదలైంది. 269 రోజుల యాత్ర అనంతరం 12వ జిల్లాగా విజయనగరంలో గతేడాది సెప్టెంబర్ 24న ఎస్కోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలంలోప్రవేశించింది. జిల్లాలో జగన్మోహన్రెడ్డి మొత్తం 36 రోజుల పాటు యాత్రసాగించి 311.5 కిలోమీటర్ల నడిచారు. 9 నియోజకవర్గాలు.. 18 మండలాలు, 214 గ్రామాలు, నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో పర్యటించారు. 9 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించగా... రెండు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని 305వ రోజు నవంబర్ 25న విజయవంతంగా శ్రీకాకుళం జిల్లాకు పయనమయ్యారు. స్వర్ణకారులతో ఆత్మీయ సమ్మేళనం కార్పొరేట్ జ్యూయలరీ షాపులతో కుదేలవుతున్న విశ్వబ్రహ్మణులకు (స్వర్ణకారులకు) చేయూతనిస్తూ.. వీరు మాత్రమే మంగళసూత్రాలను తయారు చేసేలా పేటెంట్ హక్కు కల్పిస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి హమీ ఇచ్చారు. విజయనగరం నియోజకవర్గంలో స్వర్ణకారులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ మేరకు ప్రకటించారు. దీనిపై తొలి చట్ట సభలో తీర్మానించనున్నట్టు హామీ ఇచ్చారు. పోలీసుల వేధింపులు లేకుండా ఇప్పుడున్న చట్టానికి సవరణలు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ సీటు ఇచ్చి విశ్వబ్రహ్మణలకు చట్ట సభల్లో స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. శెట్టి బలిజలతో మరో సమ్మేళనం శెట్టిబలిజ కులస్తుల అభ్యున్నతికి రూ.2వేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సామాజిక వర్గ నేతలు జగన్ను కోరారు. జియ్యమ్మవలస మండలం శిఖబడి క్రాస్ వద్ద వారితో జగన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారి కోరికను మన్నించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి చోటా జన ఉప్పెన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్మోహన్రెడ్డి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా నిర్వహించిన తొమ్మిది భారీ బహిరంగ సభలకు జన సునామీ ఎగసిపడింది. ఎస్కోట నియోజకవర్గం కొత్తవలస, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల, గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభలు జన ఉప్పెనను తలపించాయి. పాదయాత్రలోనూ ఆయన వెంట వేలాదిగా జనం అనుసరించారు. రక్తం చిందినా సడలని సంకల్పం:అపూర్వ జనాదరణ నడుమ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఎయిర్పోర్టు ఘటన జిల్లా ప్రజలను కలచివేసింది. జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన జగన్పై విశాఖ ఎయిర్పోర్టులో అక్టోబర్ 25న జరిగిన హత్యాయత్నంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అప్పటి వరకు తమ మధ్యనే పాదయాత్ర చేపట్టిన అభిమాన నేత కత్తిపోటుతో గాయపడ్డారని తెలిసి జిల్లావాసులంతా తల్లడిల్లారు. ఈ దుర్ఘటన నుంచి 17 రోజుల్లోనే వజ్ర సంకల్పంతో కోలుకున్న జగన్ నవంబర్ 12న జిల్లాలో యాత్రను పునఃప్రారంభించారు. ప్రతి అడుగూ ఓ చరిత్రః ఈ యాత్రలో జననేత వేసిన ప్రతి అడుగు చారిత్రాత్మకంగానే నిలిచింది. గతేడాది సెప్టెంబర్ 24న విశాఖ జిల్లా నుంచి విజయనగరం జిల్లాలో అడుగిడిన అభిమాననేత అదే రోజున కొత్తవలసలో 3000 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. దానికి గుర్తుగా ప్రత్యేక పైలాన్ను జగన్ ఆవిష్కరించారు. గుర్ల మండలం ఆనందపురం క్రాస్ వద్ద 3100 కిలోమీటర్లు, సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్లు మైలురాయిని అధిగమించారు. నవంబర్ 17వ తేదీనాటికి 300 రోజుల యాత్ర పూర్తి చేసుకోవటం ద్వారా మరో నూతన రికార్డు సష్టిŠంచారు. జియ్యమ్మవలస మండలంలోని తురకనాయుడు వలసలో 3300 కిలోమీటర్ల మైలు రాయిని జగన్ దాటారు. సంకల్పంలో జిల్లా గుర్తులు సెప్టెంబర్ 24: జిల్లాలో పాదయాత్ర ప్రవేశం. దేశపాత్రుని పాలెంలో 3 వేల కిలోమీటర్లను అధిగమించిన ప్రస్థానం. సెప్టెంబర్ 30: విజయనగరం నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణులతో ఆత్మీయసమ్మేళనం. అక్టోబర్1: విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల సెంటర్లో బహిరంగసభ. అక్టోబర్ 3: నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రం మొయిద జంక్షన్లో బహిరంగసభ. అక్టోబర్ 7: చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో బహిరంగసభ. అక్టోబర్ 8: గుర్ల మండలం ఆనందపురం క్రాస్ వద్ద 3100 కిలోమీటర్లు దాటిన యాత్ర అక్టోబర్ 10: గజపతినగరంలో బహిరంగ సభ. అక్టోబర్ 17: బొబ్బిలిలో బహిరంగ సభ. అక్టోబర్ 22: సాలూరులో బహిరంగ సభ అక్టోబర్ 24: సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్ల మైలురా యిని దాటిన ప్రతిపక్షనేత అక్టోబర్ 25: మక్కువ నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్లి వీఐపీ లాంజ్లో ఉన్న జగన్పై హత్యాయత్నం నవంబర్ 12: పదిహేడు రోజుల విరామం తర్వాత తిరిగి సాలూరు నియోజకవర్గం పాయకపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం నవంబర్ 17: పార్వతీపురంలో బహిరంగ సభ. తనపై హత్యాయత్నం తర్వాత తొలిసారి సభలో మాట్లాడిన జగన్. నవంబర్ 18: 300 రోజుకు చేరిన ప్రజాసంకల్పయాత్ర. నవంబర్ 20: కురుపాంలో బహిరంగ సభ. నవంబర్ 24: జియ్యమ్మవలస మండలం తురకనాయుడు వలస శివారులో 3300 కి.మీల మైలురాయి అధిగమించిన జగన్ నవంబర్ 25: విజయనగరం జిల్లాలో పూర్తయిన పాదయాత్ర. -
341వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 341వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గం.. కవిటి మండలంలోని కొత్త కొజ్జీరియా నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ఇచ్ఛాపురం మండలం అయ్యవారి పేట, లొద్దపుట్టి మీదుగా, పేటూరు, ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు. మధ్యాహ్నం ఇచ్ఛాపురం వద్ద జననేత ప్రజాసంకల్పయాత్ర పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఇచ్ఛాపురం పాతబస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. -
మనసున్న నాయకుడు
విజయనగరం: ఎండ మండిపోతున్నా..కాళ్లు కాయలు కాస్తున్నా..అనారోగ్యాన్ని అస్సలు లెక్కచేయక అడుగులు వడివడిగా వేస్తూ ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా సమస్యలతో నిండిన జనమే ఎదురయ్యారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి వ్యధాభరిత గాధలను విన్న జగన్ సాధ్యమైనంత వరకూ ప్రతీ సమస్యకు అప్పటికప్పుడే పరిష్కారం చూపించారు. కొన్నింటిని ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఆయన మాటిచ్చిన అభాగ్యులకు పాదయాత్ర సమయంలోనే సాయం అందగా, కొందరికి జిల్లాలో పాదయాత్ర పూర్తయిన తర్వాత కూడా సాయం అందించి జగన్ తానిచ్చిన మాటను నిలబెట్టుకుని, తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. చిన్నారి బాధను జగనన్నకు చెప్పుకున్నాం.. నా పేరు బడుగంటి సత్యనారాయణ, మాది మణ్యపురిపేట గ్రామం, గుర్ల మండలం. మా కుమారుడు బడుగంటి రోహిత్ పుట్టిన అప్పటినుంచి అంగవైకల్యంతో బాధపడుతున్నాడు, రోహిత్కు ట్రై సైకిల్ మంజూరు చేయాలని అధికారులకు ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్న మంజూరు చేయలేదు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో భాగంగా మణ్యపురిపేట వద్దకు చేరుకున్నప్పుడు జగన్ను కలిసి రోహిత్ సమస్య గురుంచి తెలియజేశాం. ట్రై సైకిల్ అందిస్తామని హమీ ఇచ్చారు. హమీ మేరకు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు ట్రై సైకిల్ అందించారు. ఆర్థిక సాయం చేశారు.. నా పేరు దమరశింగి సుజాత, మాది కెల్ల గ్రామం. గుర్ల మండలం. నేను ఐదేళ్లుగా కాలేయం, కిడ్ని, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాను. రెండు నెలలుకు ఒకసారి ఆస్పత్రికి తీసుకువెళ్లి కాలేయంలో ఉన్న నీటిని తొలగించాలని వైద్యులు సూచించారు. లేకపోతే ప్రాణానికే ప్రమాదమని తెలిపారు. ఇప్పటి వరకు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం సుమారుగా రూ.10లక్షలు ఖర్చు చేశాం. ఆర్థిక భారమైనా అప్పులు చేసి చికిత్స చేస్తున్నాం. నా భర్త రాము తాపీమేస్త్రీగా పని చేస్తున్నాడు. ఒక్కరి కూలీతోనే కుటుంబ పోషణ జరగాలి. నా వైద్యం సాగాలి. వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కెల్ల గ్రామంలో ఆయన్ని కలిసి కష్టాలు చెప్పి, వినతిపత్రం అందించాం. జగన్ మా సమస్యను గుర్తించి జిల్లా వైఎస్సార్సీపీ నాయకులుతో మాకు ఆర్థిక సాయం చేశారు. చాలా సంతోషంగా ఉంది. పెద్ద మనుసుతో ఆదుకున్నారు.. నా పేరు అంబల్ల రామకష్ణ, మాది కెల్ల గ్రామం. గుర్ల మండలం. నేను తాపీమేస్త్రీగా పనిచేస్తున్న సమయంలో అదుపు తప్పి భవనం మీద నుంచి జారీ పడ్డాను. ఆ ప్రమాదంలో నా వెన్నెపూసకు బలమైన గాయమై రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి నేను మంచంపైనే పడి ఉన్నా. నా తల్లిదండ్రులు సీతమ్మ, పైడినాయుడు వృద్ధులు కావడంతో కుటుంబ పోషణ కష్టం అవుతుంది. తండ్రి కూడా మంచం పట్టడంతో ఇద్దరికి చికత్స కోసం రూ.8 లక్షలపైనే ఖర్చు అవుతుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్.జగన్మోహన్రెడ్డిని కెల్ల గ్రామంలో కలిసి ఆదుకోవాలని, ఎలక్ట్రికల్ వీల్ చైర్ అందించాల్సిందిగా కోరా. జగన్ స్పందించి అదుకుంటామని హమీ ఇచ్చారు. జిల్లాలో పాదయాత్ర ముగిసిన తర్వాత జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు ఆర్థిక సాయం అందించారు. ఎలక్ట్రికల్ వీల్చైర్ను కూడ పంపిస్తామని నాయకులు చెప్పారు. జగన్ను కలిసిన కోలగట్ల విజయనగరం రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని అగ్రహారం ప్రాంతంలో మంగళవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా పాదయాత్ర రాత్రి విడిది వద్ద జగన్ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు కోలగట్ల తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, బూత్ కమిటీల క్రియాశీలక పాత్ర, రావాలి జగన్– కావాలి జగన్ కార్యక్రమాలను కోలగట్ల జగన్కు వివరించినట్లు పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రతో ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ప్రజలకు భరోసా ఇచ్చి దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారని, కోలగట్ల జగన్ను అభినందించినట్లు వివరించారు. -
ఆ యాత్రే ఓ ప్రభంజనం
ఆ అడుగు ఓ ప్రభంజనం..ఆ చిరునవ్వు కొండంత ధైర్యం..ఆ ఓదార్పు కష్టాల్లో ఉన్న వారికి మనోస్థైర్యం.. ఆ పలకరింపు నిజంగా ఊరడింపు..ఆ చేతి స్పర్శగొప్ప సాంత్వన..అలుపు..అలసట.. విసుగు.. విరామం లేకుండా సాగిన ప్రజాసంకల్పయాత్ర మరికొద్ది గంటల్లో ముగియనుంది(శ్రీకాకుళం జిల్లాఇచ్ఛాపురంలో..). దాదాపు 14 నెలల పాటు సాగినఈ సుదీర్ఘపాదయాత్ర ముగింపు మహోజ్వల ఘట్టాన్ని తలపించనుంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మరే ఇతర రాజకీయ నాయకుడు తలపెట్టనిమహాయజ్ఞం ముగింపు దశకు చేరుకుంటున్న వేళఆ వజ్రసంకల్ప ధీరుడు అడుగుజాడలు జిల్లావాసులను ఉద్వేగానికి గురిచేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: నడిచొచ్చిన నిలువెత్తు నమ్మకాన్ని చూసి జిల్లా ఉప్పొంగింది. నవ్య చైతన్య దీప్తిని వెలిగిస్తూ దూసుకొచ్చిన రాజన్న బిడ్డకు ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ జిల్లా అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. రాష్ట్రంలో నాలు గున్నరేళ్లుగా సాగుతున్న నారావారి నరకాసురపాలనను తుదముట్టించే సంకల్పంతో ఏపీ ప్రతి పక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర విశాఖ జిల్లాలో అడుగుపెట్టింది మొదలు జిల్లా దాటే వరకు ప్రజలు జననీరాజనాలు పలికారు. దాదాపు 32 రోజుల పాటు జిల్లాలో పాదయాత్ర చేసిన ఈ బహుదూరపు బాటసారిని చూసేందుకు పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా పోటెత్తాయి. గన్నవరం మెట్ట నుంచి.. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద గతేడాది ఆగష్టు 14న విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది మొదలు పెందుర్తి మండలం చింతలపాలెం వద్ద విజయనగరం జిల్లాలో అడుగుపెట్టే వరకు జనప్రభంజనంలా సాగింది. తొలి అడుగులో అడుగేసేందుకు వేలాది మంది ఎదురేగి గన్నవరం మెట్ట వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజక వర్గాలు, విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఐదు నియోజకవర్గాల మీదుగా సాగింది. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర గ్రామీణ జిల్లాలో పాయకరావుపేట, యలమంచలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి నియోజక వర్గాల మీదగా సాగింది. ఇక సిటీలో విశాఖ పశ్చిమలో అడుగు పెట్టిన పాదయాత్ర విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ తూర్పు, భీమిలి నియోజక వర్గాల మీదుగా సాగింది. గ్రామీణ ప్రాంతంలో శారద, వరహా, సర్పా నదులతో పాటు పోలవరం, ఏలేరు కాలువల చెంతన దుర్భేద్యమైన కొండలు..గుట్టల మధ్య అసలు సిసలైన పల్లె వాతావరణంలో పాదయాత్ర సాగింది. ఇక మహా విశాఖలో అడుగు పెట్టింది మొదలు చింతలపాలెం వరకు వేలాది అడుగులు కదంతొక్కాయి. పచ్చతివాచీ..పూలదారులు.. పొలిమేరల్లోనే కాదు..ప్రతి గ్రామం, పట్టణాల పొలిమేరల్లోనూ ఇదే రీతిలో భారీ ముఖ ద్వారాలు.. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. పాదయాత్రలో ఆధ్యాంతం అడుగుడగునా పూల వర్షం కురిపిస్తూ పచ్చ తివాచీ(గ్రీన్ కార్పేట్స్)లపై నడిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నుదటపై తిలకం దిద్ది మంగళ హారతులిచ్చి మహిళలు దిష్టి తీస్తే.. లేవలేని, నడవలేని వృద్ధులు సైతం జననేతను చూసేందుకు గంటలతరబడి నిరీక్షించడం కన్పించింది. మహిళలు, యువత, పేదలు, రైతులు, చిరుద్యోగులు, వ్యాపారులు, వివిధ కుల వృత్తులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు జన హృదయ నేతకు తమ కష్టాలు చెప్పుకుని ఊరడింపు పొందారు. ఇళ్లు, పింఛన్లు ఇవ్వడం లేదని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్ వర్తించడం లేదని, ఉద్యోగాలు రావడం లేదని, ఉన్న కొలువులు ఊడదీశారని, తాగు, సాగునీరు అందడం లేదని, అధికార టీడీపీ నేతల భూకబ్జాలు, దందాలు, అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఇలా ఒకటేమిటి వేల వినతులు వెల్లువెత్తాయి. తన వద్దకు వచ్చిన ప్రతిఒక్కరినీ చిరునవ్వుతో పలకరించి వారి కష్టాలు తెలుసుకుని కన్నీళ్లు తుడుస్తూ ..నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. జిల్లాలో 277.1 కిలోమీటర్లు ప్రజాసంకల్పయాత్ర 237వ రోజు 2721.4 కిలో మీటర్ల వద్ద నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద జిల్లాలో అడుగిడిగిన పాదయాత్ర జిల్లా లో 32 రోజులపాటు సాగింది. 264వ రోజు 2998.5 కిలోమీటర్ల వద్ద చింతల పాలెం వద్ద విజ యనగరం జిల్లాలోకి ప్రవేశించింది. గ్రామీణ జిల్లా లో 206.4 కిలోమీటర్లు, జీవీఎంసీ పరిధిలో 70.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. జిల్లాలో 277.1 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర గ్రామీణ జిల్లాలో అత్యధికంగా భీమిలిలో తొమ్మిదిరోజులపాటు, ఆ తర్వాత వారంరోజుల పాటు యలమంచలి నియోజక వర్గంలో పాదయాత్ర సాగింది. ఇలా మొత్తమ్మీద గతేడాది ఆగష్టు 14వ జిల్లాలో అడుగుపెట్టిన ప్రజాసంకల్పయాత్ర సెప్టెంబర్ 24వ తేదీతో ముగిసింది. పాదయాత్రకు వరుణుడు సైతం.. పాదయాత్రలో అడపాదడపా సూరీడు కాస్త చిటపట లాడించినా.. జననేత వెంటే నేనున్నానంటూ వరుణుడు మేఘచత్రం పడుతూ వచ్చాడు. నియోజకవర్గంలో అడుగు పెట్టకానే జడివానతో పలుకరిస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల కుండపోతగా వర్షం కురిసినా లెక్కచేయకుండా తన కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది చూపించే అభిమానం ముందు ఈ వర్షం ఏపాటిదంటూ జననేత ముందుకు సాగారు. నర్సీపట్నం సభకు ఓ మోస్తరుగా వర్షం కురవగా, యలమంచలి సభలో కుండపోతగా కురిసింది. భీమిలిలో అడుగు పెట్టన తర్వాత దాదాపు మూడురోజులు ప్రతిరోజు కనీసం పాదయాత్ర సమయంలో అరగంటకు పైగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. జోరు వానలో సైతం తడిసి ముద్దవుతూనే జననేత ముందుకు సాగారు. మంత్రులపై ఎటాక్ నర్సీపట్నం, భీమిలి నియోజకవర్గాల్లో మంత్రులనే లక్ష్యంగా జగన్ పేల్చిన మాటల తూటాలు టీడీపీలో ప్రకంపనలు సృష్టించాయి. నర్సీపట్నం సభలో మంత్రి అయ్యన్నను లక్ష్యంగా చేసుకుని జగన్ చేసిన విమర్శలు అలజడని రేపాయి. బినా మీలకు కాంట్రాక్టులు, ఖనిజ దోపిడీలో కమీ షన్లు దండుకుంటున్నారంటూ నేరుగా అయ్యన్నపై వాగ్భాణాలు ఎక్కు పెట్టా రు. నాతవరం మండలం సరుగుడు దగ్గర బినా మీల పేరుతో లైసెన్సులు తీసుకొని పరిమితికి మించి భారీ ఎత్తున లేటరైట్ తవ్వకాలు చేస్తున్నారని ధ్వజ మెత్తారు. అవినీతిలో చంద్రబాబు కు బ్రాండ్ అంబాసిడర్ గంటా అని ఘాటుగా విమర్శించారు. దొంగల ముఠా స్థావరాలు మార్చినట్టు ఎన్నికలొచ్చేసరికి గంటా నియోజకవర్గాన్ని మార్చేస్తాడంటూ ఘాటుగా విమర్శించారు. తొమ్మిది సభలు..రెండు ఆత్మీయ సదస్సులురికార్డు తిరగరాసిన కేరాఫ్ కంచరపాలెం విశాఖ జిల్లాలో తొమ్మిది బహిరంగ సభల్లో జననేత ప్రసంగించారు. నర్సీపట్నం మొదలు కొని ఆనందపురం వరకు 9 సభల్లో పాల్గొన్నారు. గ్రామీణ సభలు రికార్డులు తిరగరాస్తే..కేరాఫ్ కంచరపాలెంగా జరిగిన విశాఖ బహిరంగసభ కొత్త రికార్డును సృష్టించింది. పూరిజగన్నాథ రథయాత్రను తలపించేలా లక్షలాది మంది జనం ఈ సభకు తరలిరావడంతో కంచరపాలెం మెట్ట నుంచి ఎన్ఏడీ వరకు జనసంద్రమైంది. ఇక విశాఖలో బ్రాహ్మణులు, ముస్లిం మైనార్టీలతో ఆత్మీయ సదస్సుల్లో పాల్గొన్నారు. విశాఖ వేదికగా జరిగిన పార్టీ కో ఆర్డినేటర్ల రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. -
అన్ని దారులు ఇచ్ఛాపురం వైపే..
సాక్షి, విశాఖపట్నం: అందరి చూపులు అక్కడే... అన్ని దారులు అటువైపే.. వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్ అన్నట్టుగా వేలు.. లక్షలు.. కోట్ల అడుగులు అటువైపు కదులుతున్నాయి. వజ్రసంకల్పంతో దాదాపు 14 నెలల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు పండగలో భాగస్వాములవ్వాలని ప్రతి ఒక్కరూ ఉత్తుంగ తరంగాల్లో ఉరకలెత్తు తున్నారు. ఈ మహోజ్వల ఘట్టానికి వేదికవుతున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వెళ్లేందుకు పార్టీలకతీతంతా జనసైన్యం కదులుతోంది. కదం తొక్కుతోంది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది నవంబర్ 6వ తేదీన చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో ముగియనుంది. నిప్పులు చెరిగే ఎండను, కుండపోతవర్షాన్ని, వణికించే చలిని సైతం లెక్క చేయ కుండా మొక్కవోని సంకల్పంతో నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడాలేకుండా అలుపెరగకుండా సాగిన పాదయాత్ర నేటి మధ్యాహ్నంతో ముగియనుంది. ప్రజాసంకల్ప యాత్ర ముగింపును పురస్కరించుకుని ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన 88 అడుగుల భారీ ఫైలాన్ ఆవిష్కరించి అనంతరం జరిగే భారీబహిరంగసభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ మహోజ్వల ఘట్టంలో భాగస్వాములవ్వాలని విశాఖ వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ చరిత్రాత్మక పాదయాత్ర ముగింపు పండుగలో పాల్గొనేందుకు జిల్లా వాసులు వేలాదిగా తరలి వెళ్తున్నారు. ఇచ్ఛాపురం, బరంపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, రైళ్లన్నీ మంగళవారం సాయంత్రం నుంచే కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు కో ఆర్డినేటర్ వరుదు కళ్యాణితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, శ్రేణులు ఇచ్చాపురానికి తరలి వెళ్లారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, విశాఖ, అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్నాథ్, విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు కో ఆర్డినేటర్లు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవిలతోపాటు అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, పార్టీ, అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గ నేతలు బుధవారం తెల్లవారుజామున బయల్దేరి తరలి వెళ్తున్నారు. బస్సులు, కారులు, ప్రత్యేక వాహనాల్లో పార్టీ శ్రేణులతో పాటు పార్టీలకతీతంగా వివిధ వర్గాల ప్రజలు కూడా ఇచ్ఛాపురం తరలివెళ్తున్నారు. -
ఆప్తబంధువు అడుగుజాడలు
జీవధారలు పొంగే ‘తూరుపు’ సీమల్లో ఆవేదనల చీకట్లు అలముకున్నవేళ.. వెలుగులు పంచే సూర్యుడిలా ఆయన అడుగు పెట్టారు. మంచిని పెంచి.. గట్టిమేలు తలపెట్టే మహత్తర సంకల్పంతో అలుపెరుగని పయనం సాగించారు. ముసిముసి నవ్వుల మాటున మరుగుతున్న విషం నింపుకొన్న పాలకులు.. నీతి లేని రీతిలో సాగిస్తున్న పాలనపై రణశంఖం పూరించారు. గోబెల్స్ను తలదన్నేలా సాగుతున్న అబద్ధపు ప్రచారపు నివురుగప్పిన జనచైతన్యాన్ని రగుల్కొలిపి, అణగారిన బతుకుల్లో ఆశల అరుణకిరణమై భాసించారు.వ్యథార్థ జీవితాల్లో ‘పండగలా దిగివచ్చిన’ ఆ జనహితుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ‘తూర్పు’ ప్రజలు జేజేలు పలికారు. ఆయన ప్రజాసంకల్ప యాత్ర సాగిన ప్రతిచోటా వరద గోదారిలా ఉప్పొంగారు. గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చిన అభిమానాన్ని కురిపించారు. తూర్పు గోదావరే.. ‘మార్పు’ గోదావరి అవుతుందని చాటి చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మహోజ్జ్వలంగా సాగిన ఈ పాదయాత్రనేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తున్న సందర్భంగాజిల్లాలో సాగిన ఆ జనసారథి అడుగుజాడలివిగో.. సాక్షి ప్రతినిధి, కాకినాడ: అరాచకాలు, అక్రమాలు, అవినీతి వేయితలల రక్కసిలా వికటాట్టహాసం చేస్తున్న వేళ.. పీడిత ప్రజల గుండెల్లో ధైర్యం నింపి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, భరోసా కల్పించే లక్ష్యంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర గత ఏడాది జూన్ 12 నుంచి ఆగస్ట్ 14 వరకూ జిల్లాలో జరిగింది. తమకోసం అలుపెరుగని పాదయాత్ర సాగిస్తున్న ఆ ధీరుడి వెంట జిల్లాలో వేలాదిగా అడుగులు కదిలాయి. పాదయాత్ర పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన నడిచిన ప్రతి దారిలోనూ జనగోదారి పరవళ్లు తొక్కింది. ప్రతి బహిరంగ సభకూ ఇసుక వేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. ఆ జన నాయకుడికి జిల్లావ్యాప్తంగా బ్రహ్మరథం పట్టారు. జిల్లాలో జగన్ సాగించిన ఈ పాదయాత్ర ఓ ప్రభంజనంలా సాగింది. ఓవైపు ఘనస్వాగతం పలికిన జనం.. మరోవైపు తమ సమస్యలు వినే నాయకుడు వచ్చాడంటూ తరలివచ్చిన బాధిత ప్రజలు.. ఇలా ఆయన ఎక్కడ కాలు మోపినా జనకోలాహలమే. సమస్యలతో సతమతమవుతన్న వారందరూ ఆయనకు బాధలు చెప్పుకొని ఉపశమనం పొందారు. అధికారం అండతో పేట్రేగిపోతున్న పాలకుల దుర్మార్గాలను, అవినీతిని, నిర్లక్ష్య పాలనను నడిరోడ్డుపై జగన్ నిగ్గదీసినప్పుడు జనం పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పలికారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతల వరకూ ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో పూర్తి ఆధారాలతో ఆయన చెప్పినప్పుడు అక్రమార్కుల పాలనకు చరమగీతం పాడతామంటూ ప్రతినబూనారు. ఇన్నాళ్లూ తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోయిన బాధితులు అన్నొచ్చాడు.. అండగా ఉంటానని హామీ ఇచ్చాడని ఊరట చెందారు. జూన్ 12న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్డు కం రైల్ వంతెన మీదుగా రాజమహేంద్రవరం నగరంలోకి ప్రజాసంకల్ప యాత్ర ప్రవేశించింది. అఖండ గోదావరిపై చారిత్రాత్మకంగా నిలిచిపోయేవిధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం లభించింది. లక్షలాదిగా జనాలు తరలివచ్చి ‘తూర్పు’లోకి తమ ప్రియనేతను తోడ్కొని వచ్చారు. కోనసీమలోని పచ్చని పల్లెలు, తూర్పు డెల్టా, మెట్ట ప్రాంతాల మీదుగా ఆయన తన పాదయాత్ర సాగించారు. ఏజెన్సీకి సమీపాన ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్భేద్యమైన కొండల మధ్య కూడా పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో ఎన్నో ప్రధాన మజిలీలను అధిగమించారు. 2,400, 2,500, 2,600, 2,700 కిలోమీటర్ల మజిలీలను ఈ జిల్లాలోనే దాటి చరిత్ర సృష్టించారు. జిల్లా చరిత్రలో ఈ పాదయాత్ర అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది. ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా జిల్లాలో 15 చోట్ల బహిరంగ సభలు జరిగాయి. ప్రతిచోటా జగన్ ప్రసంగాన్ని వినేందుకు జనం పోటెత్తారు. బహిరంగ సభలు జరిగిన ప్రాంతాలన్నీ మునుపెన్నడూ లేనివిధంగా జనంతో కిక్కిరిసిపోయాయి. ఇది జిల్లా రాజకీయాల్లో పెను సంచలనమే అయ్యింది. వెల్లువలా తరలివచ్చిన జనాలను చూసి ప్రభుత్వ నిఘావర్గాలు సహితం ఆశ్చర్యపోయాయంటే ప్రజాసంకల్ప యాత్రలో జనగోదారి ఏవిధంగా ఉప్పొంగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన మజిలీలివీ.. ⇔ జూన్ 12 : పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశం. ⇔ జూన్ 22 : రాజోలు నియోజకవర్గంలో2,400 కిలోమీటర్లు పూర్తి. ⇔ జూన్ 27 : అమలాపురం నియోజకవర్గంలో 200 రోజుల పాదయాత్ర పూర్తి. ⇔ జూలై 9 : మండపేట నియోజకవర్గంలో 2,500 కిలోమీటర్లు పూర్తి. ⇔ జూలై 22 : కాకినాడ రూరల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మత్స్యకారులకు జగన్ ప్రత్యేక హామీలు ఇచ్చారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, డీజిల్పై సబ్సిడీ పెంచుతానని, కొత్త బోట్లకూ రిజిస్ట్రేషన్ చేయిస్తామని, ఫిషింగ్ హాలిడే సమయంలో ఇస్తున్న రూ.4 వేలను రూ.10 వేలకు పెంచుతామని, ప్రమాదవశాత్తూ మరణించే మత్స్యకారుని కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, మత్స్యకార మహిళలకు 45 ఏళ్లకే పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. ⇔ జూలై 28 : జగ్గంపేట నియోజకవర్గంలో 2,600 కిలోమీటర్లు పూర్తి. ⇔ ఆగస్ట్ 7 : చేనేత కార్మిక దినోత్సవం రోజున శంఖవరంలో చేనేత కార్మికులతో మమేకమయ్యారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ⇔ ఆగస్ట్ 11 : తునిలో 2,700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి. -
అందరి బంధువై.. అభిమాన సింధువై..
తూర్పుగోదావరి, కపిలేశ్వరపురం (మండపేట): తమ అభిమాన నేతను చూడాలి. కనులారా ఆయనను వీక్షించాలి. తమ ఆవేదనను ఆయనతో చెప్పుకోవాలి. ఆయనతో కలసి అడుగులు వేయాలి. కరచాలనం చేయాలి. వీలుంటే సెల్ఫీ దిగాలి. ఆయన ఆశీర్వాదం పొందాలి.. ఇలా ప్రతి ఒక్కరూ పాదయాత్రలో అనుకున్న వారే. ఆయన వస్తున్నారని తెలిస్తే చాలు.. దారులన్నీ జనగోదారులయ్యాయి. ఆయన పలకరింపే.. ఓ పులకరింపుగా భావించిన అభిమాన జనం ఆయన వెన్నంటే నడిచారు. ఏపీ ప్రతిపక్షనేత్ర, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ‘తూర్పు’లో చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చాలా మందికి మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. ఎప్పటికీ మరచిపోలేని అనుభూతిని కలిగించింది. అపురూప చిత్రం.. యూఎస్లో ఎనిమిదో తరగతి చదువుతున్న పెద్దింటి కీర్తి తన కుటుంబ సభ్యులతో వచ్చి జగన్తో సెల్ఫీ దిగి సంబరపడింది. తన కవల చిన్నారులతో కలిసి జగనన్నతో సెల్ఫీ తీసుకున్నానంటూ వాడ్రేవుపల్లికి చెందిన గోగు సుష్మ సంతోషం వ్యక్తం చేసింది. ఆయన ఆప్యాయంగా పలకరించడంతో పులకరించిపోయింది. తమ అన్నదమ్ముల పిల్లలందరితో కలిసి సెల్ఫీ దిగామంటూ సంబరపడ్డారు కడలికి చెందిన భార్యాభర్తలు బత్తుల దుర్గాభవాని, నవీన్కుమార్. బంధువుల పిల్లలందరితో జగన్తో లంకల గన్నవరం వద్ద సెల్ఫీ దిగామని ఆయన ఎంతో ఓపికగా అందరితో సెల్ఫీదిగడం తనకెంతో ఆశ్చర్యమేసిందని లంకల గన్నవరానికి చెందిన ఎన్నాబత్తుల శాంతకుమారి సంతోషం వ్యక్తం చేశారు. గంటి పెద్దపూడికి చెందిన బీటెక్ చదువుతున్న అక్కచెల్లెల్లయిన వి.భవాని, అనూషలు సెల్ఫీ దిగి తమ కుటుంబ సభ్యులకు చూపిస్తూ సంబరపడ్డారు. వైఎస్ కుటుంబంపై ప్రేమతో.. పేదలను అక్కున చేర్చుకున్న వైఎస్సార్ కుటుంబ సభ్యులపై కోనసీమ ప్రజలు అభిమానం చాటుకున్నారు. పాదయాత్ర దారైన జొన్నలంకలో వైఎస్ కుటుంబ సభ్యులతో ముద్రించిన ప్లెక్సీని అమర్చి స్వాగతం పలికారు. జగన్ తాతయ్య రాజారెడ్డి, దివంగత నేత రాజశేఖర్రెడ్డి, విజయమ్మల బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో పాటు జగన్ చిన్ననాటి ఫోటోలు, ఇతర కుటుంబ సభ్యులు ఫ్లెక్సీలో ఉన్నాయి. పాదయాత్రికులను ఆ ఫ్లెక్సీ ఎంతగానో ఆకర్షించింది. నాన్న నేమ్తో నా బిడ్డ వర్ధిల్లాలంటూ... అభిమాన అన్నతో తమ పిల్లలకు నామకరణం చేయించుకున్నారు. కాకినాడకు చెందిన వనుం శ్రీదే వి, మురళీకృష్ణల బిడ్డకు పర్నిక అని జగన్ నామకరణం చేశారు. పలువురు చిన్నారులకు విజయలక్ష్మి, అని రాజశేఖర్ అని పేర్లు పెట్టారు. రాజోలుకు చెందిన కేఎన్ ప్రసాద్, జ్యోతి దంపతులకు వైఎస్సార్ కుటుంబమంటే వల్లమాలిన ప్రేమ. పాదయాత్రగా వచ్చిన జగన్ పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో కలిసి తమ కుమారుడు జయన్స్ రెడ్డిగా నామకరణం చేయించుకున్నారు. ప్రసాద్ బ్యాంకు ఉద్యోగి కాగా జ్యోతి పీహెచ్సీలో సెకండ్ ఏఎన్ఎంగా విధులను నిర్వహిస్తున్నారు. తన కుమారుడికి రాజశేఖర్రెడ్డి అని పేరు పెట్టించుకోవడం సంతోషంగా ఉందని ముంగండకు చెందిన దొమ్మేటి దుర్గారావు, దుర్గలు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో స్థిరపడిన ఉచ్చులవారి పేటకు చెందిన నేతల రమేష్, జయశ్రీల కోరిక మేరకు తమ కుమారుడికి జగన్ అని పెట్టారు. ప్రేమను తాకించు అన్నా.. సంప్రదాయబద్ధంగా జరుపుకొనే అన్న ప్రాసనను అమితంగా అభినందించే జగనన్నతో చేయించుకున్నారు పలువురు. కరకుదురులో ప్రణవ్కు జగనన్న అన్నప్రాసన చేయడంతో తల్లి చంద్రకళ సంతోషం వ్యక్తం చేసింది. ఆరు నెలల చిన్నారి చన్విక్రెడ్డికి జగన్ అన్నం ముట్టించడంతో తల్లి చిర్ల సత్యకుమారి పట్టలేనంత ఆనందాన్ని పొందారు. దుష్ట శక్తుల దిష్టి తగలకూడదంటూ.. పాదయాత్రికుడికి దిష్టి తగలకూడదని, అంతా మంచే జరగాలని కోరుకుంటూ విరవాడలో అక్క చెల్లెమ్మలు అడబాల వరలక్ష్మి కుటుంబ సభ్యులు, ఊలపల్లిలో పంపన చంద్రకాంతం కుటుంబ సభ్యులు హారతి పట్టి జగన్నుఆశీర్వదించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. పాదయాత్రలో పలువురికి జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ముందుకు సాగారు. నాన్న పుట్టిన రోజునే పుట్టాడయ్యా అంటూ తన మనుమడు శ్రీరాజశేఖర్రెడ్డిని తీసుకొచ్చి జగన్కు చూపించారు దివిలికి చెందిన కేఎన్ సత్యనారాయణ. రాజశేఖర్రెడ్డి పేరు పెట్టుకున్నామంటూ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఊలపల్లిలో చిన్నారి అక్షయకు అక్షింతలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. పెద్దాడలో జగన్ను కలిసిన కె.దేవికి బర్త్డే విషెస్ చెప్పారు. అన్న చేతులతో లాలన.. జగన్ను చూసేందుకు వచ్చిన అక్క చెల్లెమ్మలు తమ చిన్నారులను జగన్కు చూపించేవారు. వారిని ఎంతో ప్రేమగా జగన్ ఎత్తుకుని లాలించే వారు. పిఠాపురం అగ్రహారంలో ముప్పిడి బిందు కుటుంబ సభ్యులతో జగన్ను చూసేందుకు రాగా తన బిడ్డను జగన్ ఎత్తుకుని లాలించారు. నెల్లిపూడికి చెందిన వై.స్వాతి తన బిడ్డను ఆశీర్వదించమని జగన్ను కోరగా ఆ బిడ్డను ఎత్తుకుని జగన్ లాలించడంతో స్వామి అమితానందాన్ని పొందింది. తన బిడ్డను జగన్ ఎత్తుకుని లాలించారంటూ సంబరపడ్డారు ఊడిమూడికి చెందిన కప్పలరోజా సంబరపడింది. అన్నచే అ, ఆలు దిద్దించారు.. పల్లిపాలేనికి చెందిన అక్షయ్కుమార్తో జగన్ అక్షరాలు దిద్దించారు. దీంతో తల్లి విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. కడలి గవళ్లపాలెం వద్ద తమ చిన్నారి నిమీషాకు అక్షరాభ్యాసం చేయించారు. బిసావరానికి చెందిన చెలులబోయిన శ్రీను సువర్ణ దంపతుల కోరిక సాకారమైందంటూ సంబరపడ్డారు. తన ఇద్దరి కుమార్తెలకు జగన్తో అక్షరాభ్యాసం చేయించడం సంతోషంగా ఉందంటూ గంటి పెదపూడికి చెందిన చిల్లి విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. తన కుమారుడు హర్షకు జగన్ చేతులమీదుగా అక్షరాబ్యాసం చేయించడం సంతోషంగా ఉందంటూ పశ్చిమగోదావరి జిల్లా దొంగరావిపాలేనికి చెందిన పమ్మి ప్రియాంక సంబరపడింది. అన్నకు రక్షణగా రాఖీ.. అన్నకు రాఖీ కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు అక్క చెల్లెమ్మలు. పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ చదువుతున్న దేవీ వరలక్ష్మి, ప్రత్తిపాడు నియోజకవర్గంలో శివాని, స్నేహ, సంధ్య, రత్న, మహిత తదితరులు జగన్తో సెల్ఫీ తీసుకుని రాఖీ కట్టారు. ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీ.. పాదయాత్రలో జనం జగనన్నతో ఆటోగ్రాఫ్ తీసుకుని సంబరపడ్డారు. బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తాను ఐదేళ్ల తర్వాత ఆటూగ్రాఫ్ తీసుకున్నాంటూ అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మేకా బయ్యపురెడ్డి సంబరపడ్డారు. కందులపాలేనికి చెందిన దిరిసాల రాజకుమార్ జగన్చే తన చొక్కాపై ఆటోగ్రాఫ్ పెట్టించుకుని సంబరపడ్డాడు. నగరంలో జగనన్నను కలిసి ఆటోగ్రాఫ్ అడగ్గానే ఇచ్చారని చిన్నారులు ముంగండ ఎలీష్కుమార్, లక్ష్మీ ప్రవల్లిక మురిసిపోయారు. విరవాడలో కోలా శివనాగబాల కుటుంబ సభ్యులతో వచ్చి జగన్ ఆటోగ్రాఫ్ తీసుకుంది. నెల్లిపూడికి చెందిన ఏనుగు స్వాతికి జగన్ ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో అమితానందాన్ని పొందింది. నిండు గర్భిణులకు అన్న ఆశీర్వాదాలు.. పాదయాత్రగా వస్తున్న జగనన్న ఆశీర్వాదం కోసం ఎంతో మంది గర్భిణులు పాదయాత్రకు ఓపిక తీసుకుని వచ్చేవారు. ఎనిమిదినెలల గర్భవతిగా ఉన్న తనను జగనన్న ఆశీర్వదించారం టూ పెదపట్నంలంకకు చెందిన చెల్లుబోయిన రేవతి సంతోషం వ్యక్తం చేశారు. భర్తతో కలిసి 13 కిలోమీటట్లు బైక్పై ప్రయాణించి మొండెపులంకలో జగన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రేమానురాగాలు పంచిన వేళ... జగనన్నను కట్టమూరు క్రాస్ వద్ద కలిసి సెల్ఫీ తీసుకున్నాక తన భర్తకు మీరంటే ఎంతో అభిమానమని ఒక్కసారి ఆయనతో ఫోన్లో మాట్లాడన్నా అని అడగడంతో వెంటనే ఫోన్ చేసి తన భర్తతో మాట్లాడారంటూ సంబరపడింది తునికి చెందిన యండమూరి సత్యప్రయదర్శిని. ఓదార్పు యాత్రకు వచ్చిన సమయంలో అన్నతో తీయించుకున్న ఫోటోను పాదయాత్రలో జగన్కు చూపింది వేగివారిపాలేనికి చెందిన విప్పర్తి హర్షిత. ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు తాను రెండో తరగతి చదువుతున్నాననీ, మళ్లీ అన్నను కలసి సెల్ఫీ తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. జగనన్న అంటే తనకు ఎంతో ఇష్టమంటూ కడలికి చెందిన చిన్నారులు రేణి సుభాష్, కేవిన్ సుభాష్ రితీష్ చంద్ర, దీప్తిరాయులు స్వయంగా తాము తయారు చేసిన జగన్ ఫొటో ఆల్బమ్ను చూపించారు. అచ్చంపేటలో చేతి రుమాలుపై జై జగన్, జై వైఎస్సార్ అని రంగు రంగుల దారాలతో తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి పెరుమళ్ల అనిత జగన్కు అందజేశారు. పిఠాపురంలో తల్లిదండ్రులతో వచ్చిన సాత్విక్ అనే చిన్నారి సైనిక దుస్తుల్లో విశేషంగా ఆకర్షించారు. -
జగదానంద కారక.. జన జాతర సాగెరో..!
ఆ అడుగుజాడలు.. ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని నింపాయి. ఎందరికో స్వాంతన చేకూర్చాయి.అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు చిందించాయి. చిన్నారులకు పునర్జన్మనిచ్చాయి. పేద కుటుంబాల్లో వెలుగులు నింపాయి. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలకు తక్షణం పరిష్కారం చూపారు. ఆరోగ్య సమస్యలతో వచ్చేవారిని చూసి చలించారు. తక్షణ సాయం అందించారు. దీంతో జిల్లా ప్రజలు ఫిదా అయ్యారు. నీ మేలు మరువలేము.. జగదానంద కారకా.. అంటూ జగనన్నకు జై కొడుతున్నారు. ఈ చిత్రంలోని తల్లి శ్రావణిసంధ్య చేతుల్లో నెలల చిన్నారికి రెండునెలల వయస్సు ఉన్నప్పుడు తలలో రక్తం గడ్డ కట్టుకుపోయింది. వైద్యులకు చూపిస్తే రూ.13లక్షలు ఖర్చవుతాయన్నారు. ఏం చేయాలో పాలుపోక పేద దంపతులు శ్రావణిసంధ్య, దుర్గాప్రసాద్ ప్రజాసంకల్పయాత్రగా జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. పరిస్థితిని వివరించారు. దీంతో వెంటనే స్పందించిన జగన్ వైద్యానికి అయ్యే ఖర్చును భరించి తిరుపతి వైద్యశాలలో ఆపరేషన్ చేయించారు. చిన్నారికి పునర్జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబం జగన్ను ఆరాధ్యదైవంగా కొలుస్తున్నారు.ఇలాంటి ఘట్టాలు ప్రజాసంకల్పయాత్రపొడవునా.. ఎన్నో.. ఎన్నెన్నో.. సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైత్రయాత్ర.. ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6న చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’ 341 రోజుల తర్వాత బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు జిల్లా నుంచి నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలి వెళ్లారు. జిల్లాలో పాదయాత్ర సూపర్ సక్సెస్ ప్రజాసంకల్ప పాదయాత్ర జిల్లాలో సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర జరిగితే మన జిల్లాలోనే నెలరోజులపాటు 316 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో జిల్లాలో జరిగిన బహిరంగ సభలు విజయవంతమయ్యాయి. వీటితోపాటు పలుచోట్ల జరిగిన ఆత్మీయ సమ్మేళనాలకు వేలసంఖ్యలో ఆయావర్గాల ప్రజలు హాజరయ్యారు. పాదయాత్ర ఆద్యం తం జనజాతర మధ్య సాగింది. టీడీపీ సర్కారుపై నిప్పులు చెరుగుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ జిల్లాలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీలు తీసుకునేం దుకు, కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. పాదయాత్రకే హైలెట్ ఘట్టం : జిల్లాలో పాదయాత్ర ముగించుకుని కొవ్వూరు నుంచి రైలు కమ్ రోడ్డు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి వైఎస్ జగన్ అడుగుపెట్టే సమయంలో వంతెన వైఎస్సార్ సీపీ జెండాలతో రెపరెపలాడింది. భారీ జనసందోహంతో వారధి కిక్కిరిసింది. పాదయాత్రకే ఈ ఘట్టం హైలెట్గా నిలిచింది. ప్రజలకు భరోసా : పాదయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రజలకు భరోసా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తామని ధైర్యం చెప్పారు. కష్టాలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాల గురించి వివరించారు. ఇవే కాకుండా ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.పది వేలు, అక్వా రైతులకు విద్యుత్ చార్జీల తగ్గింపు, వశిష్టవారధిపై వంతెన నిర్మాణంతోపాటు కొల్లేరు వాసులకు, మత్స్యకారులకు, ఇతర వృత్తుల వారికి పలు హామీలు ఇచ్చారు. చలో ఇచ్ఛాపురం ఈ చారిత్రక పాదయాత్ర ముగింపు ఘట్టానికి చేరుకుంది. ఇచ్ఛాపురంలో బుధవారం ముగియనుంది. ముగింపు సభలో పాల్గొనేందుకు ఇప్పటికే జిల్లా నుంచి ఇచ్ఛాపురం చేరుకున్న పలువురు నేతలు మంగళవారం జగన్తో కలిసి ముందుకు అడుగులు వేశారు. సోమవారం రాత్రి ఇచ్చాపురం బయలుదేరి వెళ్లిన నరసాపురం, రాజమండ్రి పార్లమెంట్, పాలకొల్లు, తణుకు, ఉండి నియోజకవర్గాల కన్వీనర్లు ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్, గుణ్ణం నాగబాబు, కారుమూరి నాగేశ్వరరావు, పీవీఎల్ నరసింహరాజు, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, ఘంటా మురళీ రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చిలువూరి కుమారదత్తాత్రేయ వర్మ, కమ్మ శివరామకృష్ణ తదితరులు మంగళవారం జగన్మోహన్రెడ్డిని కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. మంగళవారం ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గ్రంధి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, సమన్వయకర్తలు జి.శ్రీనివాస్ నాయుడు, ఉన్నమట్ల ఎలీజా, గుణ్ణం నాగబాబు, కొఠారు అబ్బయ్యచౌదరి, తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు తదితరులు కార్యకర్తలతో బయలుదేరి వెళ్లారు. జగన్ వల్లే ఖతార్ నుంచి స్వదేశానికి ఈ చిత్రంలోని మహిళ పేరు పల్లి రత్నం. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన పల్లి నిషికుమార్ భార్య. 2017లో ఉపాధి కోసం ఖతార్ వెళ్లారు. ఏజెంట్ ద్వారా అక్కడ ఓ ఇంటిలో పనికి కుదిరిన రత్నంను ఇంటి యజమానులు పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. 5 నెలల జీతం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ గడిపారు. యజమానులను జీతం కోసం పట్టుపట్టడంతో రత్నంపై చేయని నేరానికి యజమానులు పోలీసు కేసు పెట్టారు. ఐదు నెలలపాటు పోలీస్స్టేషన్ చుట్టూ తిప్పారు. దీంతో ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె భర్త ఆందోళన చెందారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్ను పిల్లలతో సహా కలిసి విషయం వివరించారు. దీంతో జగన్ ఎంపీ విజయసాయిరెడ్డికి ద్వారా ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ హర్షవర్ధన్రెడ్డికి సమాచారం అందించారు. ఆయన ఇండియన్ అంబసీ అధికారులతో మాట్లాడి రత్నంను స్వదేశానికి రప్పించారు. గత అక్టోబర్లో రత్నం ఇక్కడికి తిరిగి వచ్చారు. ఎప్పటికైనా జగన్ను కలుసుకుని ధన్యవాదాలు చెబుతానని రత్నం చెబుతున్నారు. బాధితులకూ ఆపన్న హస్తం అలాగే కాళ్ల గ్రామంలో కిడ్నీ బాధితుడు తోట వంశీ కృష్ణతోపాటు, అనారోగ్యంతో బాధపడుతున్న కూలా రాజేష్, బొండా హరేష్కు కూడా జగన్ ఆర్థిక సాయం చేశారు. ఆ కుటుంబాల్లో ఆనందాలు నింపారు. -
341వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
-
340వ రోజు పాదయాత్ర డైరీ
-
91 అడుగుల ఎత్తు, ఈఫిల్ టవర్ ఆకృతి
-
పాదయాత్రలో ఆఖరి ఘట్టం..
-
నేడు ముగియనున్న వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
-
అద్భుతం.. ఆకర్షణీయం
ఇచ్ఛాపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశ రాజకీయాల్లోనే సరికొత్త చరిత్ర సృష్టించబోతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తవుతున్న సందర్భంగా నిర్మించ తలపెట్టిన విజయసంకల్ప స్థూపం (పైలాన్) అత్యద్భుతంగా, ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. ఇచ్ఛాపురం బైపాస్ వద్ద బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన ఈ స్థూపం ఎప్పటికీ దర్శనీయ స్థలంగా ఉండేలా తీర్చిదిద్దారు. బుధవారం 341 రోజుల పాదయాత్ర పూర్తి చేయనున్న వైఎస్ జగన్ మధ్యాహ్నం 91 అడుగుల ఎత్తైన ఈ స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ను తలపిస్తూ నాలుగు ఉక్కు స్తంభాలు కింది నుంచి విడిగా పైకి వెళ్లి పైన నాలుగూ కలిసేలా ఏర్పాటు చేసిన పైలాన్ కనులకు విందు చేస్తోంది. స్థూపం పై భాగాన పార్లమెంటు తరహాలో వృత్తాకారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులతో కూడిన ఒక టూంబ్ను ఏర్పాటు చేశారు. దానిపైన పది అడుగుల ఎత్తులో పార్టీ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. టూంబ్కు దిగువున నాలుగు దిక్కుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వివిధ భంగిమల్లో ఉన్న ఫోటోలను ఏర్పాటు చేశారు. ఆ దిగువన పాదయాత్రికుడు వైఎస్ జగన్ నడిచి వస్తున్న నిలువెత్తు చిత్రాలను ఉంచారు. పైలాన్ లోపలి భాగంలో చుట్టూ జగన్ తన పాదయాత్రలో ప్రజలను కలుసుకుంటూ వచ్చిన ఫొటోలను ఏర్పాటు చేశారు. స్థూపం బేస్మెంట్ పైకి ఎక్కేందుకు 13 మెట్లను ఏర్పాటు చేశారు. పాదయాత్రగా జగన్ నడచి వచ్చిన 13 జిల్లాల పేర్లను కింది నుంచి పైకి మెట్లపైన ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దాకా జగన్ నడిచిన రూట్ మ్యాపును కూడా నిక్షిప్తం చేశారు. దిగువున చుట్టూ ఒక చిన్నపాటి లాన్ (పచ్చికబయలు) ఏర్పాటు చేశారు. ఇందులోనే ఓ స్తంభం పక్కనే స్థూపం ఆవిష్కరణకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇక బయట చుట్టూ ప్రహరీ గోడపై ఓ వైపు ప్రజాసంకల్ప పాదయాత్ర 2017–2019 అని, మరోవైపు విజయసంకల్ప స్థూపం అని రాశారు. జాతీయ రహదారికి, రైల్వే లైనుకు మధ్యలో... ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందు, శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో... ఏర్పాటైన ఈ పైలాన్ అందరి దష్టినీ ఆకర్షిస్తోంది. 16వ నంబరు జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న పటిష్టమైన ఈ నిర్మాణానికి మరోవైపు హౌరా–చెన్నై రైల్వే లైను ఉంది. దీంతో అటు బస్సుల్లో , ఇటు రైళ్లలో ప్రయాణించే వారికి స్థూపం కనువిందు చేయనుంది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి ఇప్పటికే దర్శనీయ స్థలంగా మారింది. ఇప్పుడు వైఎస్ జగన్ విజయసంకల్ప స్థూపం కూడా అదే స్థాయిలో చరిత్రలో నిలుస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. తన సుదీర్ఘ పాదయాత్ర పొడవునా ప్రజలను కలుసుకున్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా విజయం చేకూరాలనే సంకల్పంతో వైఎస్ జగన్ ముందుకెళుతున్నారు కనుక, ఈ స్థూపానికి ‘విజయసంకల్పం’ అని పేరు పెట్టినట్లు రఘురామ్ వివరించారు. తిరునాళ్ల వాతావరణం ఈ పైలాన్.. సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పాదయాత్ర పూర్తయ్యే రోజు దగ్గరపడిన కొద్దీ స్థూపం పనులు వేగంగా జరుగుతుండటం, ఆకర్షణీయంగా ఉండటంతో చూడ్డానికొచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వారం రోజుల నుంచైతే చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వస్తున్న వారు కొద్దిసేపు ఆగి స్థూపం చూసి వెళుతున్నారు. ఇక పార్టీ శ్రేణుల హడావుడి చెప్పనలవి కాని విధంగా ఉంది. ఉదయం నుంచీ రాత్రి పొద్దు పోయే దాకా తిరునాళ్ల వాతావరణమే కనిపిస్తోంది. -
ఘన చరితం 3648 కి.మీ.
జనం మధ్యే నివాసం.. జనంతోనే సహవాసం.. జనం కష్టాలు తెలుసుకోవడమే లక్ష్యం.. జనం కన్నీళ్లు తుడవడమే కర్తవ్యం.. ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏడాదికిపైగా ప్రజలతో మమేకమైన చారిత్రక ఘట్టమిది. ఏకంగా 3,648 కిలోమీటర్లు సాగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పమిది. మండుటెండైతేనేం..జోరువానైతేనేం.. ఎముకలు కొరికే చలైతేనేం.. లెక్క చేయలేదు.. తాడిత, పీడిత, బడుగు,బలహీన వర్గాల జనావళి గుండె గొంతుక వినాలన్న ఆయన కోరికను పరిపుష్టం చేసుకున్నారు..జన హృదయాల్లోంచి వెల్లువలా వచ్చిన కష్టాల ప్రవాహాన్ని ఒడిసి పట్టుకుని నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.. నాలుగున్నరేళ్లుగా అనునిత్యం కష్ట నష్టాలతో అలసిన గుండెల్లో ధైర్యం నింపారు.. కొద్ది రోజుల్లో మంచి జరగనుందనే నమ్మకాన్ని కలిగించారు. అన్ని సమస్యలకూ పరిష్కార మార్గాన్ని అన్వేషించడమే ఆయన ఆశయం. ఈ ఆశయం మహోన్నతం. ప్రజాసేవలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటా.. గుండె నిబ్బరాన్ని కోల్పోవడం రాజనీతిజ్ఞత కాదు.. నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా తొణుకుబెణుకు లేకుండా ముందుకు సాగడమే నేర్చుకున్నా. – డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సాక్షి, అమరావతి: ఐదేళ్లకు పైగా రాష్ట్రాన్ని జన రంజకంగా శాసించిన ఓ పెను సంచలనం (డాక్టర్ వైఎస్సార్) అనూహ్యంగా ఆగిపోయింది. ప్రజల మనోభావాల పేరిట రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైంది. అవశేష ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టిన పాలకులు జన జీవితంతో చెలగాటం ఆడడం మొదలుపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వేళ.. ‘మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం’.. అంటూ ఓ యువకెరటం జయకేతనాన్ని చేపట్టి ప్రజా సంకల్పయాత్రను చేపట్టింది. పేదవాడి కడుపునింపి.. తిండి, బట్ట, గూడు కల్పించాలన్న ఉదాత్తమైన ఆశయంతో.. చుట్టూ శేషాచలం కొండలు, మధ్యలో లోయ, ఆహ్లాదకరమైన వాతావరణంలో.. డాక్టర్ వైఎస్సార్కు అత్యంత ఇష్టమైన ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి కదిలిన యాత్రికుడు ఈనెల 9న ఇచ్ఛాపురంలో తన పాదముద్రలకు విరామం ఇవ్వనున్నాడు. ఆ యాత్రికుడే వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. తొలి అడుగుతో ప్రారంభమైన యాత్ర మహాయాత్రగా ఎలా మారిందో అదేస్థాయిలో సభలు, సమావేశాలు జరిగాయి. ఇడుపులపాయ వద్ద ఏ స్థాయిలో జరిగిందో అంతకుమించి ప్రతిచోటా సభలు జరిగాయి. అక్కున చేర్చుకున్న జనం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా జగన్కు ఉన్న పేరు ప్రతిష్టలు వేరు.. ప్రజాసంకల్ప యాత్ర ద్వారా జగన్ ఎదిగిన తీరు వేరు. ప్రజలలో విశ్వాసాన్ని ప్రోదిచేసిన ఆయన ప్రతిభ అనన్యం. గతానికి భిన్నంగా ఆయన పొందిన గుర్తింపు అద్భుతం. ఎదురులేని నేతగా జనం మదిలో నిలిచిపోయారు. తండ్రిని మించిన తనయుడయ్యారు. ప్రజలు ఆయన్ను ప్రేమించి అక్కున చేర్చుకున్నారు. ప్రేమాభిమానాలు చూపారు. అనురాగ ఆత్మీయతలను పంచారు. తాను ప్రసంగించిన సభల్లో చెప్పిన అంశాలు ప్రత్యేకించి నవరత్నాలు ప్రజల్ని ఆలోచింపజేశాయి. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, అవ్వాతాతల పింఛన్లు, వైఎస్సార్ చేయూత వంటి అంశాలను ఆయన జనంలోకి చొచ్చుకుపోయేలా చేయగలిగారు. జనం కోసం జనం మధ్య జనంతోనే అనే వాటికి సాక్షర రూపంగా నిలవగలిగారు. ఫలితంగా మహానేత వైఎస్సార్ను చూసిన కళ్లు జగన్ను చూడడం అలవర్చుకున్నాయి. సుదీర్ఘ యాత్రతో ఆయన అందరి వాడయ్యారు. జనవారధుల్లా కృష్ణా, గోదావరి వంతెనలు ప్రజా సంకల్పయాత్ర గుంటూరు జిల్లా దాటి కృష్ణమ్మ అంచులకు చేరినప్పుడు నదీతీరాన జన కెరటం ఎగిసిపడింది. కనకదుర్గమ్మ వారధి ప్రజల పదఘట్టనలతో ఊగిపోయిన తీరు, ఆ తర్వాత ఇంద్రకీలాద్రి దిగువన సభ జరిగిన వైనం బెజవాడ చరిత్రలో మరువలేనిది. ఇదేననుకుంటే దానికి మించి ఉభయ గోదావరి జిల్లాల వారధి అయిన గోదావరి వంతెన జనప్రభంజనమైంది. ఉభయ గోదావరి జిల్లాలలో జరిగిన ప్రతీ సభా దేనికదే సాటి అయింది. ఈ సభలకు కులాలు, మతాలు అడ్డుకాలేదు. చిన్నాపెద్దా తేడా లేకుండాపోయాయి. ప్రతి గుండే జగన్నినాదంతో ప్రతిధ్వనించింది. రొటీన్కు భిన్నంగా ప్రసంగం రాష్ట్ర రాజకీయ యవనికపై వైఎస్ జగన్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆప్యాయతకు, అనురాగానికి, స్నేహానికీ, రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచారు. జరిగిన ప్రతి సభలో తనదైన ముద్ర వేసుకున్నారు. అందరిలా మైకు పట్టుకోగానే సోదరీ సోదరులారా అనే దానికి బదులు ఒక చేత్తో మైకు పట్టుకుని మరో చేత్తో టక్ టక్ టక్మని మైక్తో శబ్ధం చేస్తూ.. ఏ ఊరులో సభ జరుగుతుందో ఆ ఊరి పేరు చెప్పడం జగన్ శైలి. ఆ ఊరితో సామీప్యతను, అనుబంధాన్ని తెలియజేసేందుకు ఇది ఉపయోగపడుతుందని గట్టిగా విశ్వసించే జగన్ ఆ పని చేసేవారు. సభ ముగింపులో ఆయన చేసే వినతి ప్రజల్ని ఆకట్టుకునేది. మీ బిడ్డగా వస్తున్న జగన్కు అండగా నిలవండి, ఆశీర్వదించండి, తోడుగా ఉండండని ఆయన చేసే వినతి ఎంతో వినయ వినమ్రతలను వ్యక్తం చేసేలా ఉండేది. మరోవైపు.. జగన్ మైకు పట్టుకున్నది మొదలు ముగించే వరకూ సభా ప్రాంగణాలు జగన్నినాదంతో మార్మోగేవి. కాబోయే సీఎం అంటూ యువత కేరింతలు కొట్టేది. అడుగడుగో మా పెద్దకొడుకు అని అవ్వాతాతలు మురిసిపోయేవారు. అన్నా, జగనన్నా, మేమంతా నీ వెంటే అంటూ అక్కచెల్లెమ్మలు జేజేలు పలికేవారు. ఇడుపులపాయ నుంచి మొదలై.. నవంబర్ 6, 2017.. చరిత్రాత్మక ప్రజాసంకల్ప యాత్రకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన రోజది. ప్రకృతి ఆశీర్వదిస్తున్నట్టు ఓ పక్క చిరుజల్లులు, మరోపక్క మాతృమూర్తి విజయమ్మ ఆశీస్సులు, అక్కచెల్లెమ్మల ఆత్మీయానురాగాలు, అశేష జనవాహిని మధ్య డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి ప్రజా సంకల్పయాత్ర మొదలు పెట్టింది మొదలు ఈనాటి వరకు వెనుదిరిగి చూడలేదు. వడలో, కడు జడిలో, పెను చలిలో, చివరకు విచ్చుకత్తులు కుత్తుకను తెగనరికేందుకు ప్రయత్నించినా అలుపు, సొలుపు లేకుండా అప్రతిహతంగా సాగిన యాత్ర ముగింపు దశకు వచ్చింది. నాడు ప్రారంభ సభ ఇడుపులపాయలో జరిగితే నేడు ముగింపు సభ ఇచ్ఛాపురంలో జరగనుంది. ప్రజల మనిషిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతటి కీర్తి గడించారో.. ఆయన కుమారునిగా జగన్ అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. తనను నమ్ముకున్న వారికి, తాను నమ్మిన వారికి జగన్ అభయ ప్రదాతగా నిలిచారు. అందువల్లే ఆయన సభలకు అడుగడుగునా జనం పోటెత్తారు. నీరాజనాలు పలికారు. మాట తప్పడం మడమ తిప్పడం తన రక్తంలోనే లేదని గర్వంగా చెప్పుకోవడమే కాకుండా అఖిలాంధ్ర ప్రజానీకానికి ఆయన అన్నగా నిలిచారు. అక్కచెల్లెమ్మలకు తోబుట్టువయ్యారు. అన్నదమ్ములకు ఆత్మబంధువయ్యారు. ఏ సభకు ఆ సభే సాటి జగన్మోహన్రెడ్డి 134 నియోజకవర్గాలలో పర్యటిస్తే 124 బహిరంగ సభలలో ప్రసంగించారు. ఒక సభ బాగా జరిగింది మరొకటి బాగా జరగలేదనడానికి వీల్లేదు. దేనికదే సాటి. ప్రతీ సభా ఒక ప్రత్యేకతను చాటింది. సభకు గంట ముందు పెద్దగా అలికిడి లేని సభా ప్రాంతాలు జగన్ రాకకు సరిగ్గా అరగంటకు ముందు ఇసుకవేస్తే రాలనట్టుగా తయారయ్యేవి. కట్టలు తెగిన నదీ ప్రవాహం మాదిరి జనం పోటెత్తేవారు. మేడలు, మిద్దెలు, చెట్టు చేమలు జనంతో నిండిపోయేవి. సభ జరిగిన తర్వాత ఆయా ప్రాంగణాలన్నీ తెగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన చొక్కాలు, చిందరవందరగా కాగితాలు, బెలూన్లతో నిండిపోయేవి. కాలాలతో నిమిత్తం లేకుండా సభలు జరిగిన తీరు ప్రముఖుల ప్రశంసలు, మన్ననలు పొందాయి. జడివాన కురుస్తున్నా తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలలో పర్యటన, బహిరంగ సభలు ఆగలేదు. కుండపోతగా వర్షం పడుతున్నా యలమంచిలి, నర్సీపట్నంలో ప్రజలు జగన్ మాట్లాడేవరకు పోబోమని భీష్మించిన తీరు ఇప్పటికీ ఆ ప్రాంతాలలో చెప్పుకుంటుంటారు. ఎండలు మాడ్చేస్తున్నా, తుపాన్లతో ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేస్తున్నా తాను మాత్రం తన సంకల్పాన్ని మరువక రేపటి గురించి ఆలోచించారే తప్ప తనకు ఏమవుతుందోనని భయపడలేదు. ఆకట్టుకున్న పిట్టకథలు ఏదైనా ప్రసంగం ఆకట్టుకోవాలంటే స్థానిక సామెతలు, పిట్టకథలు, పోలికలు అత్యంత అవశ్యం. వేయి పదాల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటోతో చెప్పినట్లే ఒక్క సామెతతో వంద విషయాలను చెప్పవచ్చు. రెయిన్గన్లతో కరువును జయించాను అని చంద్రబాబు పదేపదే చెప్పే విషయాన్ని పిట్టలదొర కథతో పోల్చి చెప్పిన తీరు సభికుల్ని విశేషంగా ఆకట్టుకుంది. కట్టె తుపాకీ పేలుతుందా? అనే అర్థం వచ్చేలా ప్రత్యక్ష సాక్షులతో విషయం చెప్పించారు. జగన్ చెప్పిన కొండచిలువ, రైతు కథ.. చంద్రబాబు చెప్పే అబద్ధాలకు, మోసాలకు అద్దంపట్టాయి. తిత్లీ తుపానుపై గోరంత సాయంచేసి కొండంత ప్రచారం చేసుకున్న వైనాన్ని శవాలపై చిల్లర ఏరుకునే సామెతతో పోల్చిన తీరు కూడా సభికుల ప్రశంసలందుకుంది. బీజేపీ, చంద్రబాబు కలిసి నాలుగేళ్లు చిలకా గోరింకల్లా కాపురం చేయడంపై జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల హర్షామోదాలు పొందాయి. పురాణాలు, ఇతిహాసాల నుంచి తీసుకున్న అనేక అంశాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ చెప్పిన కథలు, సామెతలు జగన్ సభల్లో హైలెట్గా చెప్పవచ్చు. మరుగున పడిన అంశాలెన్నో కావాలిప్పుడు చరిత్ర మరుగున పడి కనిపించని ఎన్నో విషయాలను జగన్ తెరపైకి తెచ్చారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు ఈ సభలను వారి గొంతుకగా చేశారు. చట్టసభల్లో ప్రాతినిధ్యంలేని వివిధ వర్గాలకు చోటు కల్పిస్తానన్నారు. విస్మరించిన శ్రేణులను గుర్తిస్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు నడిబజార్లో ఖూనీ చేస్తున్న తీరుతో మనస్సు నొచ్చుకుని పాదయాత్ర చేపట్టిన జగన్.. ఆ బజార్లనే బహిరంగ వేదికలుగా మలిచారు. ప్రజల ప్రాతినిధ్యం ఉండేలా పీపుల్స్ అసెంబ్లీలను సృష్టించారు. అసెంబ్లీలో మాదిరి అడుగడుగునా ఆటంకాలు, మైక్ కట్లు లేకుండా తాను చెప్పాలనుకున్నది సూటిగా ప్రజలకే చెప్పి ఏది న్యాయమో, మరేది అన్యాయమో తరచి చూడండంటూ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు. జగన్ అనే నేను.. విషయాలపట్ల స్పష్టత, ముక్కుసూటితనంతో ప్రజల మదిని గెలిచారు. హామీలివ్వడం ఎవ్వరైనా చేస్తారు. వాటిని అమలుచేసినప్పుడే ఆ వ్యక్తి జీవితానికి సార్థకత లభిస్తుంది. సమకాలీన రాజకీయ చరిత్రలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ పనిచేశారు. తాను చేసిన హామీలను అమలుచేసి చిరస్మరణీయునిగా నిలిచారు. సరిగ్గా జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండడుగులు వేస్తానని సగర్వంగా చెబుతూ వచ్చారు. ప్రజా జీవనంలో ఉన్నప్పుడు నిజాయితీ, విశ్వసనీయత ఉండాలని పదేపదే ఉద్భోదించారు. తాను అధికారంలోకి వస్తే.. అది ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, పేదలకు ఇళ్ల నిర్మాణమైనా, మరేదైనా సరే అమలుచేస్తానని చెప్పినప్పుడు, ‘జగన్ అనే నేను..’ అనే పదాన్ని ఉపయోగించారు. జగన్ నోటి నుంచి ఆ మాట వచ్చినప్పుడల్లా హర్షధ్వానాలతో సభా ప్రాంగణాలు హోరెత్తేవి. -
ఒకే మాట ఒకే బాట
‘నాకు డబ్బు మీద వ్యామోహం లేదు. చరిత్ర సృష్టించాలన్నదే నా లక్ష్యం. ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలోకొస్తే ప్రజలకు ఎంతో మంచి చేయాలన్న ఆశయం ఉంది. ఆ మంచి ఎలాంటిదంటే.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలన్నదే నా తాపత్రయం’.. ..ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క మాట యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్ని సూటిగా తాకింది. నాయకుడంటే ఇలా ఉండాలన్న జనాభిప్రాయం ఇప్పుడు రాష్ట్రం నలుమూలలా వ్యక్తమవుతోంది. ఏ మూలనో చిన్న అనుమానం ఉన్న వారు కూడా ఈ వ్యాఖ్యతో ఆయనపై నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. అసలు సిసలైన నాయకుడంటే జగనే అని ఘంటాపథంగా చెబుతున్నారు. సాక్షి, అమరావతి : పద్నాలుగు నెలలకు పైగా ప్రజాక్షేత్రంలో ఉన్న వైఎస్ జగన్ అనుక్షణం జనం కష్టసుఖాలే ఆలకించారు. తాడిత పీడిత గుండె గొంతుకై అవినీతి సర్కారును జనబాహుళ్యంలోనే ఎండగట్టారు. ఇందుకూ ఓ నేపథ్యముంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. ప్రజావాణి విన్పించే చట్టసభలను మందబలంతో అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. జనం కష్టాలు వినిపించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్షం గొంతును అసెంబ్లీ సాక్షిగా నొక్కేసింది. గుండె చెదిరిన సామాన్యుడు నిస్సహాయ స్థితికి చేరాడు. దీంతో దగాపడ్డ వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు, సర్కార్ అవినీతిని ఎండగట్టేందుకు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. జనం కన్నీళ్లను దోసిటపట్టిన జననేత ప్రతీ గుండెను హత్తుకున్నారు. కసి.. కదలిక.. పరిష్కారం! వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో 2017 నవంబరు 6న పాదయాత్ర మొదలైనప్పుడు జగన్లో ఓ కసి కనిపించింది. ‘ప్రతీ గడపకూ వెళ్లాలనుంది.. జనం గుండె చప్పుడు వినాలనుంది.. కసిగా ఉన్నాను. ప్రజల కోసమే బతకాలన్న ఆవేశంతో ఉన్నాను’ అని జగన్ చెప్పారు. పద్నాలుగు నెలల సుదీర్ఘ పాదయాత్ర అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరువలోకొచ్చిన జననేతలో స్పష్టమైన, పరిపూర్ణమైన మార్పు కన్పిస్తోంది. సమస్యలు వినేందుకే వస్తున్నానని చెప్పిన నేత.. ఇప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పారు. తరలివచ్చిన ప్రజావెల్లువ సాక్షిగా కన్నీళ్లు తుడిచే పథకాలను ప్రకటించారు. దగాపడ్డ రైతన్నకు ఎక్కడికక్కడే భరోసా ఇస్తూ తానొస్తే ఎలా ఆదుకుంటానో చెప్పారు. పెట్టుబడి సాయం ఎలా ఇస్తానో వివరించారు. అప్పులపాలైన అక్కాచెల్లెమ్మల ఆవేదన విన్న జగన్.. జనం సాక్షిగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. సంక్షేమం అందని పేదవాడి గురించే ఏడాది క్రితం జగన్ మాట్లాడేవారు. ఉపాధిలేక ఊరొదిలే యువత ఆవేదనే విపక్ష నేత వాణిలో చూశాం. పాదయాత్రలో ఆ సమస్యకు ఆయన పరిష్కారం చెప్పారు. అధికారంలోకొస్తే ఏటా పోస్టుల భర్తీచేస్తానని, పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టం తెస్తానన్నారు. ఇల్లులేని పేదల సొంతింటి స్వప్నం జగన్ నోటి వెంట వచ్చింది. అభాగ్యుల ఆర్తి తెలుసుకున్న తర్వాత ఆయనిప్పుడు ఆరోగ్యశ్రీని ఎంత విజయవంతంగా అమలుచేయవచ్చో స్పష్టత ఇస్తున్నారు. ప్రతీ సమస్యపై స్పష్టమైన అవగాహనతో సర్కారును నిలదీసే నైజం ఏడాది క్రితం వైఎస్ జగన్ది. ఇప్పుడు అధికారంలోకొస్తే ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో స్పష్టంగా చెప్పగలిగే వ్యక్తి జగన్. విలువలే ప్రాణం.. విశ్వసనీయతే ఆయుధం ‘జగన్ ఎన్నో హామీలిచ్చారు. అవన్నీ సాధ్యమా? ఈ మాట అధికారపక్షం కూడా అనలేకపోతోంది’.. పాదయాత్రను నిశితంగా గమనించిన రిటైర్డ్ సీనియర్ అధికారి అనంతరామారావు అన్న మాటలివి. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ అనేకమంది దగ్గర ఇదే ప్రస్తావన తెస్తే వాళ్లు చెప్పిందొకటే.. ‘వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకున్నాడు. హామీ ఇవ్వకుండానే ఎన్నో చేశాడు. ఆ రక్తం పంచుకు పుట్టిన బిడ్డపై ఆ మాత్రం నమ్మకముంది’.. అన్న జవాబే వచ్చింది. ఆరంభం నుంచీ ఒంటరిపోరే చేస్తున్న జగన్.. కష్టాలెన్నొచ్చినా రాజకీయ ప్రస్థానంలో విశ్వసనీయతకే ప్రాధాన్యమిచ్చారు. అవకాశవాద రాజకీయాలకు ఎక్కడా తావివ్వలేదు. ప్రత్యేక హోదా ఇస్తామని రాసిచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తే ఉండదన్నారు. మాటకు కట్టుబడే జగన్ నైజం ప్రజలను బాగా ఆకర్షించిందని రాజకీయ వర్గాలూ విశ్లేషిస్తున్నాయి. చెదరని గుండె.. చలించే మనస్సు విశాఖ విమానాశ్రయంలో హత్యకు కుట్ర జరిగినా జగన్ నిబ్బరంగా ఉండటాన్ని ప్రజలు గమనించారు. దాన్నో అవకాశంగా తీసుకుని హడావిడి చేసే రాజకీయ స్వభావం లేకపోవడాన్ని జనం హర్షించారు. రక్తసిక్తమైన దుస్తుల్లోనూ మొక్కవోని గుండె ధైర్యంతో పార్టీ కేడర్ను ఆవేశానికి గురికాకుండా చేయడం జగన్లో చెప్పుకోదగ్గ లక్షణమనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. నాలుగున్నరేళ్ల ఈ ప్రతిపక్ష నాయకుడికి అధికార పార్టీ నేతల ఈసడింపులు, దుర్భాషలు, రెచ్చగొట్టే చర్యలు అనేకం ఎదురయ్యాయి. కానీ, ఎక్కడా తొణకలేదు. పాదయాత్రలో జనం మరింత దగ్గరవ్వడానికి ఇదీ ఓ కారణమనేది రాజకీయ వర్గాల నిశ్చితాభిప్రాయం. ప్రజలు ఈ లక్షణాలన్నీ పాదయాత్ర ద్వారా దగ్గర్నుంచి చూడగలిగారు. ‘అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయాడేమోగానీ.. జగన్ మాత్రం చంద్రబాబు కుయుక్తులను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లార’ని ఓ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ సహా విపక్ష గొంతు నొక్కిన తీరు.. అప్రజాస్వామ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన అధికార పార్టీ నైజాన్ని ప్రతీ వ్యక్తి చర్చించే రీతిలో జగన్ జనంలోకి తీసుకెళ్లారు. విమర్శలకు ప్రతివిమర్శలే పరిష్కారమనే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో స్థితప్రజ్ఞతతో ఓ నేత జననేతగా గుర్తింపు తెచ్చుకుంటాడని జగన్ నిరూపించారు. గిట్టుబాటు ధరల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు పక్షాన ఆయన జరిపిన పోరాటాన్ని.. ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లో ఆయనను మంచి నేతగా గుర్తింపు తీసుకొచ్చాయని చెబుతున్నారు. వ్యక్తి.. శక్తి.. వ్యవస్థ జగనే తమ నాయకుడని బలంగా చెబుతున్న జనం ఆయన రాజకీయ విస్తరణను.. ప్రజలపట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ‘ఓ వ్యక్తిగా రాజకీయాల్లోకొచ్చాడు.. వ్యక్తిత్వంతోనే పార్టీని శక్తిగా మార్చాడు.. పాదయాత్ర ద్వారా ఓ వ్యవస్థనే ఏర్పాటుచేశాడు. జగన్ అంటేనే జనమన్న నమ్మకం కల్గించాడు. ఏడాదికిపైగా ఎండలో మాడిపోతూనే ప్రజలను నవ్వుతూ పలకరించాడు. వర్షంలో తడిసి ముద్దవుతూనే పేదల బతుకు చిత్రాన్ని దగ్గరుండి పరిశీలించాడు. వణికించే చలిలోనూ ప్రజల గుండె చప్పుడు వినేందుకు వడివడిగా అడుగులేశాడు. జనం లోగిళ్ల ముందే జగన్ సంక్రాంతి చేసుకున్నాడు. ప్రజల ఆనందపు వెలుగుల్లోనే దీపావళి జరుపుకున్నాడు. తెలుగు ప్రజల ఆత్మీయతల మధ్యే తెలుగు సంవత్సర వేడుకల్లో పాల్గొన్నాడు. ఇలా పండగేదైనా అన్నీ ప్రజాక్షేత్రంలోనే. ఇవన్నీ జగన్ తమ నాయకుడనే భావాన్ని ప్రజల్లో మరింతగా ముందుకు తీసుకెళ్లాయి. జగన్ పుట్టినరోజు ప్రజల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. అందుకే జనం.. రావాలి జగన్–కావాలి జగన్ అని అంటున్నారు. అలసటే ఎరుగని నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సార్ దగ్గర పనిచేయడం, వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన వెన్నంటే ఉండడం, నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతమే. ఆయనలో ఉన్నంత సహనం, దయాగుణం నేనెక్కడా చూడలేదు. పాదయాత్రలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎన్ని వేలమంది వచ్చి కలుస్తున్నా.. ఎన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ఏనాడూ అలసట, చిరాకు, కోపం అనేది ఆయనలో ఎప్పుడూ కనిపించలేదు. పైపెచ్చు నేను ఎప్పుడైనా మా స్టాఫ్పట్ల కొంచెం చిరాకుపడితే సార్ ఊరుకునే వారు కాదు. ‘అలా కోపం మంచిది కాదు.. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి. ప్రశాంతంగా ఉంటే అన్నీ చక్కగా, సాఫీగా జరుగుతాయి’.. అని చెబుతుండే వారు. ఇంటిదగ్గర ఉన్నా.. పాదయాత్రలో ఉన్నా రాత్రి పదకొండు గంటలకు పడుకుని ఉదయం నాలుగు.. నాలుగున్నరకల్లా నిద్రలేవడం సార్కు అలవాటు. సమయపాలనలో చాలా ఖచ్చితంగా ఉంటారు. క్రమశిక్షణ పాటిస్తారు. వ్యాయామం.. మిత ఆహారం ఉదయం లేచాక టీ తాగి ఒక గంటపాటు వ్యాయామం చేస్తారు. అనంతరం స్నానంచేసి వచ్చాక అరగంటపాటు ప్రార్థన చేస్తారు. తర్వాత ఒక గ్లాసు పళ్లరసం తీసుకుంటారు. అంతే.. టిఫిన్ వంటివి ఏవీ చేయరు. ఆ వెంటనే పాదయాత్ర ప్రారంభిస్తారు. మధ్యాహ్నం శిబిరం వచ్చేవరకు ఏమీ పుచ్చుకోకుండానే నడుస్తారు. ఆ తర్వాత ఆపిల్ లేదా వేరే ఏదైనా పండు ఒకటి తీసుకుని మజ్జిగ తాగుతారు. అనంతరం అరగంటసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత పార్టీ వారితో మాట్లాడి మళ్లీ పాదయాత్రకు రెడీ అవుతారు. ప్రజా సమస్యల గురించి నిత్యం పార్టీ నాయకులు, ఇతరులతో చర్చిస్తూ ఉంటారు. ఏదైనా ఒక విషయం మీద లోతుగా సమాచారం మొత్తం తెప్పించి చదివేవారు. ఏవైనా సందేహాలుంటే మళ్లీ మాతో ఫోన్లు చేయించి వారితో మాట్లాడేవారు. రాత్రి శిబిరానికి చేరుకునే వరకూ మళ్లీ ఎలాంటి ఆహారమూ తీసుకోరు. ఒక్కోసారి మధ్యాహ్నం పూట కూడా ఆగకుండా ఏకధాటిగా రాత్రి శిబిరం వరకు నడుస్తారు. ఇక రాత్రి ఆహారం కింద కేవలం రెండు రకాల కాయగూరలతో చేసిన కర్రీ, ఒక పుల్కా, తీసుకుంటారు. మాంసాహారం అసలు ముట్టుకోరు. ఆ పాదయాత్ర మిస్సయినా.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సార్ దగ్గర పనిచేస్తూ ఆయన పాదయాత్ర ప్రారంభమయ్యే సమయానికి జగన్ సార్ దగ్గరకు వచ్చేశాను. అప్పుడు పాల్గొనలేకపోయినా ఈ పాదయాత్రలో నేను సార్తో పాటు ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. కానీ, ఈరోజే (మంగళవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాను. ఇప్పుడు యాత్ర ముగింపు సమయంలో నేను లేకపోవడం చాలా బాధగా ఉంది. విశాఖలో సార్పై కత్తితో దాడి జరిగినప్పుడు నేను చాలా భయపడ్డా. – నారాయణ (వైఎస్ జగన్ వ్యక్తిగత సహాయకుడు) సొంత మనిషిలా చూసుకుంటారు గతంలో పోలవరం ప్రాజెక్టు వద్దకు పాదయాత్రగా వెళ్లినప్పుడు నేనూ ఆయనతో పాటు నడిచాను. కానీ, ఈసారి వద్దన్నారు. వయసు మీదపడ్డాక ఇప్పుడెందుకు నడుస్తావ్ అని అన్నారు. పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో రెండుసార్లు నేను అస్వస్థతకు గురైతే వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఇందులో ఒకసారి హైదరాబాద్కు విమానంలో పంపించారు. ‘నారాయణ నాకు కావల్సిన వ్యక్తి.. ఆయనకు ఏ ఇబ్బంది రాకూడదు. అన్నీ దగ్గరుండి చూసుకోండి’ అని ఆస్పత్రి వారికి చెప్పి మరీ వైద్యం చేయించారు. ఇంత జాగ్రత్తగా ఆయన తన సహాయకులను చూసుకుంటారు. దాదాపుగా 36 ఏళ్లుగా ఆ కుటుంబంలోనే నేను పనిచేస్తున్నాను. పదహారేళ్లుగా జగన్ సార్తో ఉంటున్నాను. నన్ను ఏనాడూ ఒక ఉద్యోగిగా చూడలేదు. ఇంటిలోని సొంత మనిషిగా చూసుకుంటున్నారు. పేదోడికి ధీమా.. అందరికీ భరోసా అన్ని వర్గాలకు అనువైన హామీలు ప్రజల కష్టాలను కళ్లారా చూసి ఈ హామీలు ఇచ్చాను. వీటిని నేరవేర్చలేక పోతే తప్పుకుంటాను. – వైఎస్ జగన్ ‘చేయగలిగినవే చేస్తాను.. చేసేవే చెబుతాను’ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సందర్భంలోనూ అనేమాటిది. ఏడాదికిపైగా సాగిన ప్రజాసంకల్ప యాత్రలో ఆయన ప్రజల కష్టాలెన్నో తెలుసుకున్నారు. వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేశారు. జనామోదం పొందిన నవరత్నాలను ప్రతి గడపకు తీసుకెళ్లి ప్రజల్లో భవిష్యత్ పట్ల ఆశను కల్పించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు మారతాయనే భరోసానిచ్చారు. ఆయన అధికారంలోకొస్తే నవరత్నాల రూపంలో ప్రతి ఇంటికీ ఏడాదికి రూ.లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుందనే నమ్మకం వచ్చింది. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో బక్కచిక్కి శల్యమైన రైతుల కన్నీటి కథలు.. నిరుద్యోగుల వెతలు... అక్కచెల్లెమ్మల కన్నీటి గాథలు ప్రతిపక్ష నేతను కదిలించాయి. బతుకు భరోసా లేని అవ్వాతాతలు, ఆరోగ్యశ్రీ వర్తించక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అనేకమంది వైఎస్ జగన్ను కలుసుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు ఒకరేమిటి మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష నేత అడుగులో అడుగులేశారు. అథ:పాతాళంలో అభివృద్ధి రాష్ట్రం ఈ నాలుగున్నరేళ్లలో అభివృద్ధిలో అథ:పాతాళంలో నిలిచింది. ఏ ఒక్క వర్గమూ టీడీపీ పాలనలో సంతోషంగా లేదు. రాజధానికని ఏడాదికి మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడం దగ్గర నుంచి రైతు రుణాల మాఫీ వరకు, విద్యార్థులకు ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం నుంచి నిరుద్యోగులకు భృతి అందివ్వకపోవడం వరకు ఎక్కడా ఆయా వర్గాల అభివృద్ధి జాడే లేదు. రాజధానిలో సింగపూర్ నిర్మాణాలని ఒకసారి, జపాన్ నిర్మాణాలని మరోసారి ప్రజలను మోసం చేయడం, వారికి రోజుకో సినిమా చూపడం తప్ప శాశ్వత భవనాలకు ఒక్క ఇటుకా పడలేదు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా మహిళలను నిండా ముంచారు. అలాగే వాడవాడలా బెల్టుషాపులకు గేట్లు ఎత్తి కుటుంబాలను చిన్నాభిన్నం చేశారు. ఇలా ఎవరికీ సంతోషం లేకుండా, అభివృద్ధి అనేది లేకుండా టీడీపీ పాలన సాగింది. అభివృద్ధికి అసలైన నిర్వచనం ఇచ్చిన ప్రతిపక్ష నేత టీడీపీ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన అన్ని వర్గాలను ఆదుకోవడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్న పథకాలు వారికి భవిష్యత్ పట్ల భరోసాను కల్పించాయి. చిన్నారులను బడికి పంపించే తల్లుల కోసం ప్రకటించిన అమ్మఒడి పథకంతో చిన్నారులంతా బడిబాట పడతారు. అదేవిధంగా చదువుకునేవారికి ఎంత ఫీజైనా చెల్లిస్తామంటూ ప్రకటించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం విద్యార్థుల ఉన్నతవిద్య ఆశలను సాకారం చేస్తుంది. ఉన్నత విద్య పూర్తి చేసుకోగానే ప్రతి ఏటా ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించడంతోపాటు ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులను భర్తీ చేయడం వల్ల నిరుద్యోగ సమస్యను రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించవచ్చు. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల వలసలు తగ్గిపోతాయి. ఇక తాగునీరు అందక, పంటలు పండక, గిట్టుబాటు ధరలు లభించక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం కాంతిరేఖగా నిలుస్తుంది. డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం ప్రకటించిన వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళల అభివృద్ధి సాధ్యమవుతుంది. అధికారంలోకి రావడానికి కాకుండా ప్రజాసంకల్పయాత్రలో ఎంతోమంది బాధితుల సమస్యలు విన్నాక.. వారి బాధలు చూశాక.. ఎంతో అధ్యయనం చేశాక ఆయా వర్గాల అభివృద్ధికి ఈ పథకాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఈ హామీలు నెరవేర్చలేకపోతే ఏకంగా పదవి నుంచే తప్పుకుంటానని వైఎస్ జగన్ చెప్పడం ఈ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి చూపాలనే దృఢసంకల్పానికి నిదర్శనం. నవరత్నాలతో పాటు వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో మరికొన్ని.. - మూతపడ్డ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపిస్తారు. - అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం. - ముస్లిం మైనార్టీలను ఆదుకునేందుకు సబ్ప్లాన్ ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, భూముల పంపిణీ. - దాదాపు అన్ని సామాజికవర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు. - ఏటా మెగా డీఎస్సీ నిర్వహణతోపాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టుల భర్తీ - ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ - ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు. పది మందికి ఉద్యోగాలు. - ప్రైవేటు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం. - దుల్హన్ పథకం కింద ఇచ్చే రూ.50 వేల మొత్తం రూ.లక్షకు పెంపు. - ఇమామ్లకు ప్రతినెలా రూ.10 వేలు, మౌజమ్లకు రూ.5 వేలు గౌరవ వేతనం. - గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేలా విద్యుత్ ఛార్జీలను యూనిట్కు రూ.7.35 నుంచి రూ.3.75కు తగ్గింపు. - నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్. ప్రధాన ఆలయాల్లో కనీస వేతనంపై పనిచేసే అవకాశంతోపాటు ఎమ్మెల్సీ స్థానం. - గిరిజనులకు.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు. - మత్స్యకారులు బోట్లకు వాడే డీజిల్పై 50 శాతం సబ్సిడీ, వేట సమయంలో చనిపోతే మూడు నెలల్లో రూ. 10 లక్షలు అందేలా చర్యలు, ప్రత్యేక కార్పొరేషన్. పాదయాత్రతో మారిన ప్రజా నాడి ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ.. వారిలో ధైర్యం నింపుతూ.. భవిష్యత్పై భరోసా ఇస్తూ వేలాది కిలోమీటర్ల మేర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాగించిన ప్రజా సంకల్ప యాత్రతో జనం నాడి మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ గోడు వినేందుకు వచ్చిన జగన్ వెంట నిరుపేదలు, అణగారిన వర్గాలు, సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు యువత, ఉద్యోగులు ఇలా ఒకరేమిటి.. అన్ని వర్గాలు పాదం కదపడమే ఇందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు. జగన్ అడుగుపెట్టిన ప్రతి ప్రాంతానికి తండోపతండాలుగా తరలివచ్చి తమ అభిమానం చాటుకోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి జగన్తోనే సాధ్యమని వారు భావిస్తుండటం వల్లే ఈ ప్రజాదారణని పేర్కొంటున్నారు. వైఎస్సార్ అస్తమయం, రాష్ట్ర విభజన తర్వాత సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకు జగన్ ఆశాదీపంలా కనిపించారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించి బయటకు వచ్చి వైఎస్సార్సీపీని స్థాపించినప్పుడు.. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి జైలు పాలుచేసినప్పుడు కూడా జనం ఆయన్ని వదల్లేదన్నారు. అయితే అనుభవంతో పాటు రుణమాఫీ వంటి 600 హామీలతో గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని.. లేకపోతే 2014లోనే జగన్ సీఎం అయ్యేవారని గుర్తు చేస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీ సరిగ్గా నెరవేర్చకపోగా.. అవినీతి, అక్రమాలు పెరిగిపోవడం, జన్మభూమి కమిటీల లంచావతారం.. టీడీపీ నేతల అరాచకాలతో ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని వివరించారు. ఈ సమయంలో జగన్ పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ.. వాటిపై సభల్లో ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా అశేష అభిమానాన్ని చూరగొన్నారని వివరించారు. పాదయాత్రలో ఉన్నప్పటికీ తన పార్టీ నాయకులకు, కేడర్కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ పోరాటాలు చేయించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలకు ఒక స్పష్టత వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి చరమ గీతం పాడాలనే నిర్ణయానికి వారు వచ్చారన్నారు. ధన బలం, కండబలం, అధికార బలంతో పాటు పోల్ మేనేజ్మెంట్ ద్వారా తిమ్మిని బమ్మిని చేయొచ్చనుకుంటున్న టీడీపీ నేతల ఆటలు సాగే పరిస్థితి కనపడం లేదని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొంటున్నారు. -
జన ప్రభంజనంతో సర్కారు బెంబేలు
బిందువు బిందువు సింధువు అయినట్లు.. ఇంతింతై.. వటుడింతై అన్నట్లు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రభంజనంగా మారి రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఊళ్లకు ఊళ్లే పాదయాత్ర ప్రాంతానికి తరలి వస్తుండటం, చిన్నారులు మొదలు వయో వృద్ధుల వరకు వైఎస్ జగన్ను కలవాలని, కరచాలనం చేయాలని పోటీపడ్డారు. ఈ ఆదరణ చూసి సర్కారు పెద్దలకు కన్ను కుట్టింది. ఎన్నెన్నో కుయుక్తులు చేశారు. జనం రాకుండా అడ్డుకోవాలని చూశారు. ఏవీ సఫలం కాకపోవడంతో ఏకంగా అంతమొందించడానికి వ్యూహం పన్నారు. ఇదీ బెడిసి కొట్టడంతో నోటì కి పని చెప్పారు. వీటన్నింటినీ అధిగమించిన జగన్ కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సమైక్యాంధ్ర చరిత్రను తిరగరాసిన ఘన చరిత్ర.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర. ఇక 2014 తర్వాత విభజనాంధ్రప్రదేశ్ను అవినీతి, అక్రమాలు, అరాచకాలతో అవశేషాంధ్రగా మార్చేస్తున్న దారుణ పరిస్థితుల్లో తల్లడిల్లిన ప్రజల గుండెచప్పుడై.. రాష్ట్ర దిశ, దశ మార్చాలన్న సంకల్పంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రది మరో చరిత్ర. నాడు మహానేత వైఎస్ పాదయాత్ర కళ్ల ముందు మెదిలి.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ చేపట్టే పాదయాత్ర ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకున్న టీడీపీ పెద్దల కళ్లు బైర్లు కమ్మాయి. అంతే.. అసలు జగన్ను జనంలోకి వెళ్లకుండా చేయాలని కుయుక్తులు పన్నారు.. కుట్రలకు దిగారు. కానీ ఏ క్షణంలోనూ వైఎస్ జగన్ చలించలేదు. అందుకే ఎక్కడికక్కడ పాదయాత్రలో జనం సముద్రంలా పోటెత్తారు. జనతరంగం ప్రతిచోటా ఉవ్వెత్తున ఎగిసింది. సరైన భద్రత కల్పించకుండా.. ఇక పాదయాత్రలో ప్రతిపక్ష నేత స్థాయికి కల్పించాల్సిన సరైన భద్రతను ఇవ్వలేదు. స్వచ్ఛందంగా వెల్లువెత్తుతున్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పాదయాత్ర దృశ్యాలు, వైఎస్ జగన్ ప్రసంగాలు టీవీల్లో కనపడకుండా, వినపడకుండా సరిగ్గా యాత్ర జరిగే ఊళ్లలో అప్రకటిత కరెంటు కోతలు విధించారు. కుట్రలు, కుతంత్రాలు, ఆంక్షలు, అవాంతరాలను తుత్తునియలు చేస్తూ అన్నింటినీ చిరునవ్వుతో అధిగమించి లక్ష్యసాధన దిశగా ముందుకు సాగారు. ఇడుపులపాయలో జనజాతరలా మొదలై.. రాయలసీమ జిల్లాలను దాటి... కోస్తాంధ్ర జిల్లాల్లోకి అడుగుపెట్టేసరికి సంకల్పయాత్ర జన ఉప్పెనలా మారిపోయింది. జిల్లా.. జిల్లా దాటుతూ ఉంటే యాత్ర మహోజ్వల రూపం దాల్చుతూ వచ్చింది. పాదయాత్రతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రమే మారిపోయింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జనంలోనే ఉంటూ రాజకీయం మొత్తం తన చుట్టూ తిరిగేలా చేశారు. అత్యంత ప్రభావవంతమైన, శక్తిమంతమైన నాయకుడిగా ఆవిర్భవించడాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రభుత్వం ఆయనను అంతమొందించే కుట్రకు తెరతీసింది. గుంటూరు జిల్లాలో ముందుగా రెక్కీలు పాదయాత్రతో రోజురోజుకీ తమ కంట్లో నలుసులా మారిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అంతమొందించడానికి కుట్ర చేశారు. ఈ క్రమంలో ముందు గుంటూరు జిల్లాలో.. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో రెక్కీలు కూడా నిర్వహించారు. ఏకంగా కేంద్ర రక్షణశాఖ అధీనంలోని తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న విశాఖ విమానాశ్రయంలో చంపడానికి భారీ కుట్ర పన్నారు. అక్కడేం జరిగినా కేంద్రం మీదకు నెట్టేయాలని ప్లాన్ చేశారు. ఇందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం థానేలంకకు చెందిన జె.శ్రీనివాసరావును పాత్రధారిగా ఎంచుకున్నారు. నేర చరిత్ర ఉన్న అతడికి ఎయిర్పోర్ట్లో టీడీపీ నేత, సీఎం చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన హర్షవర్ధన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ఫుడ్స్ రెస్టారెంట్లో ‘పని’ కల్పించారు. సదరు శ్రీనివాసరావు ఆ రెస్టారెంట్లోనే కత్తులను భద్రపరుచుకుని హత్యాయత్నం చేసిన రోజు ఉదయం వాటికి పదును కూడా పెట్టాడు. ఇక ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్వో)ను కూడా తమ వలలో వేసుకున్నారు. పదేళ్లుగా రెస్టారెంట్ పేరుతో అక్కడే పాతుకుపోయిన హర్షవర్ధన్ చౌదరి.. చంద్రబాబు, లోకేష్ల పేర్లు చెప్పి విశాఖ ఎయిర్పోర్ట్ను, యంత్రాంగాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారిపోయాడు. అందుకే సరిగ్గా వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చే నాటికి ఎయిర్పోర్ట్లోని వీవీఐపీ లాంజ్లో సీసీ కెమెరాలు పనిచేయడం ఆగిపోయాయి. అక్టోబర్ 25న వైఎస్ జగన్కు రెస్టారెంట్ నుంచి కాఫీ తెచ్చే పేరిట శ్రీనివాసరావు చొరబడి కత్తి దూసి హత్యాయత్నానికి తెగబడ్డాడు. అయితే ప్రజల ఆశీస్సులు బలంగా ఉన్న ప్రతిపక్ష నేత తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డీజీపీతో సహా మంత్రులు, టీడీపీ నేతలు తెరపైకి వచ్చి శ్రీనివాసరావు వైఎస్ జగన్ అభిమాని అని, ఏదో ప్రచారం కోసం దాడి చేశాడని చాలా తేలిగ్గా తీసిపారేశారు. కుట్రధారులను తప్పించి కేసును పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ పరిధిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కేసు విచారణ చేపట్టాక విశాఖ పోలీసులు అడుగడుగునా సహాయ నిరాకరణ చేస్తుండటం ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకేనని అర్థం చేసుకోవచ్చు. ఇవేవీ జగన్కు ప్రజాదరణను అడ్డుకోలేకపోయాయి. అతనంటే ఒక నమ్మకం.. సార్.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఏడాదిన్నర దాటింది. ఫీజు కడితే తప్ప పరీక్ష రాయనీయబోమని అంటున్నారు. రీయింబర్స్మెంట్ వస్తుందని నమ్మి కళాశాలల్లో చేరితే ఇప్పుడు మా మెడపై కత్తి పెట్టి డబ్బు కడతారా? చస్తారా? అంటున్నారు. మీరే ఏదైనా చేసి ఆదుకోండి సార్. ఇలా ఒకటా.. రెండా.. లక్షలు.. ఏమిటివీ అనుకుంటున్నారా? ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బాధితులు చెప్పుకున్న సమస్యలు. నాలుగున్నరేళ్లుగా సమస్యలతో అల్లాడుతున్న ప్రజలకు వైఎస్ జగన్ ఒకే ఒక్క ఆశాకిరణంగా కనిపించారు. ఊరవతల నీరింకిన చెరువులు, దారిపక్క చెట్టు కింద తడారిన గొంతుకలు, ఎండిన డొక్కలు, ముగ్గుబుట్ట వంటి తలలు, అన్నార్తులు, అభాగ్యులు, ఎటుచూసినా బతుకు బండి సాగని దైన్యం.. ఆదుకునే నాథుడే లేడు. అయినవాళ్లకు ఆకుల్లో కానివాళ్లకు మూకుళ్లలో.. మీరు మా వాళ్లు కాదంటూ పాలక పార్టీ వాళ్ల తిరస్కరణ.. గుండె లోతుల్లో మెలిపెడుతున్న వ్యథ.. వీటినన్నింటినీ ఎవరికో ఒకరికి చెబితే గానీ ఊరట లభించదు. అదిగో.. అలాంటి తాడిత, పీడితులకు వేగుచుక్క.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి 2017, నవంబర్ 6న ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ రాష్ట్రంలోని 13 జిల్లాలను చుట్టివచ్చారు. కోట్లాది మంది ప్రజలకు భరోసా కల్పించారు. అనేక సమస్యలతో కష్టాల్లో ఉన్న ప్రజలు తమ బాగోగులు తెలుసుకోవడానికి తమ వద్దకే వచ్చిన రాజన్న బిడ్డను చూసి ఉద్వేగభరితులయ్యారు.. ఆయనకు తమ ఈతి బాధలు చెప్పుకున్నారు.. తమ ఇక్కట్లను ఆయన దృష్టికి తెచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో అప్పటికప్పుడు చేయదగిన వాటిని ప్రతిపక్ష నేత అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన వాటిని ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చేలా లేఖలు రాశారు. విధానపరమైన వాటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపేలా ఏర్పాటు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తన సహాయం కోరివచ్చినవారికి కాదనకుండా ఆర్థిక, హార్థిక సహకారం అందించారు. మాటలు రాని పిల్లలకు కాక్లియర్ ఆపరేషన్లు చేయించి మాటలు తెప్పించారు. బ్రెయిన్ సర్జరీ అవసరమైనవారికి మార్గం చూపించారు. ప్రతి ఫిర్యాదు నమోదు ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలు తనకు చెప్పుకున్న ప్రతి సమస్యను, ఫిర్యాదును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన వ్యక్తిగత సహాయకుల ద్వారా కంప్యూటర్లో నిక్షిప్తం చేయించారు. మొత్తం 340 రోజుల పాదయాత్రలో ఆయనకు కొన్ని లక్షల వినతులు, ఫిర్యాదులు, విజ్ఞాపనలు అందాయి. వీటిని ఏ రోజుకా రోజు రికార్డు చేయించారు. అంతేకాకుండా వాటిని సమస్యల వారీగా వర్గీకరించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం పంటలకు గిట్టుబాటు ధరలు, రుణమాఫీ, విద్య, వైద్యం, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఫీజు రీయింబర్స్మెంట్, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, నిరుద్యోగ భృతి, ఉపాధి, ఉద్యోగాల కల్పన, భూ సమస్యలు– వివాదాలు, భూ కబ్జాలు, జన్మభూమి కమిటీల ఆగడాలు తదితరాలు ఉన్నాయి. వీటిల్లో తక్షణమే పరిష్కరించాల్సిన వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని రికార్డు చేసి తమ ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఉలిక్కిపడ్డ ప్రభుత్వం అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అన్యాయం, మోసానికి మారుపేరుగా మారి మొద్దుబారిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఉలిక్కిపడేలా చేసింది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలతో జనం తమపై ఎక్కడ తిరగబడతారోనని భయపడి సరిగ్గా ఎన్నికలకు కొద్ది నెలల ముందు తూతూమంత్రంగా కొన్ని చర్యలు చేపట్టింది. – సాక్షి, అమరావతి -
ముగింపునకు ముందు రోజు పోటెత్తిన జనం
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకున్న తరుణంలో జనాదరణ మరింతగా పెరిగింది. తండోపతండాలుగా ప్రజలు ఆయనకు సంఘీభావం పలకడానికి వస్తున్నారు. పాదయాత్ర 340వ రోజు మంగళవారం జగతి, తుత్తుడిపుట్టుగ క్రాస్, వరపుట్టుగ క్రాస్, రాజపురం మీదుగా.. అగ్రహారం వరకూ సాగింది. చలిని సైతం లెక్క చేయక.. ఆయన వెళ్లే దారి పొడవునా గ్రామాల ప్రజలు, చుట్టు పక్కల నుంచి వచ్చే వారితో రోడ్లన్నీ బారులు తీరాయి. అక్కచెల్లెమ్మలు ఆయన కోసం గంటల తరబడి వేచి ఉండి సెల్ఫీల కోసం ఆరాటపడ్డారు. ఉదయం ఆయన శిబిరం నుంచి రోడ్డుపైకి రావడానికి రెండు గంటల ముందే జనం అక్కడికి చేరుకోవడం మొదలెట్టారు. ఉదయం పూట చలిగా ఉన్నా.. లెక్కచేయకుండా ప్రజలు తరలివచ్చారు. తన కోసం వచ్చిన వారిని వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. పాదయాత్ర ముగింపునకు ఇక ఒక్క రోజే మిగిలి ఉండటంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన్ను కలుసుకోవడానికి వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది. బుధవారం జరగనున్న పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన వారు సైతం ప్రతిపక్ష నేత వద్దకు రావడంతో పాదయాత్ర సాగుతున్న ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. వివిధ వర్గాల ప్రజలు తమ కష్టాలు చెప్పుకొన్నారు. మరికొందరు వినతిపత్రాలిచ్చారు. జన్మభూమి కమిటీల దాష్టీకాలపై ఫిర్యాదులు చేశారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అంతా మంచి జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపునకు ఒక రోజు ముందు మంగళవారం కూడా పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. గూడూరు మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, పలువురు టీడీపీ నేతల చేరిక శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లాలోని గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ పొణకా దేవసేనమ్మ.. టీడీపీకి రాజీనామాచేసి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆమెతో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, మండల స్థాయి నేతలు భారీగా టీడీపీలోంచి వైఎస్సార్సీపీలో చేరారు. పాదయాత్ర మధ్యాహ్న శిబిరం వద్ద వారంతా ప్రతిపక్ష నేతను కలుసుకుని పార్టీలో చేరాలన్న అభీష్టాన్ని వెల్లడించడంతో వారికి జగన్.. కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు గోవిందు మస్తానమ్మ, బైనా భానుప్రకాష్, పోసిన రాజేశ్వరమ్మ, షేక్ షంషీర్, కోడిపర్తి కల్పన, బండి విజయమ్మ, నేరేళ్ల సుబ్బమ్మ, ముప్పాళ్ల లక్ష్మి, బాలిబోయిన రమేష్, మనపాటి రవీంద్రబాబు, గూడూడు మండల ఎంపీపీ పిట్టి రావమ్మ, దివిపాలెం సర్పంచ్ పిట్టి దేవసేన తదితరులున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పాలుబోయిన అనిల్కుమార్యాదవ్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, పార్టీ గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్, శీకిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవసేనమ్మ, ఆమె అనుచరులు వైఎస్సార్సీపీలో చేరడంతో గూడూరు నియోజకవర్గంలో టీడీపీ సగం ఖాళీ అయినట్లేనని చెబుతున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే బడుగు, బలహీనవర్గాలకు మేలు జరుగుతుందని భావించి తామంతా పార్టీలో చేరినట్టు చైర్పర్సన్ దేవసేనమ్మ మీడియాతో చెప్పారు. బుద్దా నాగేశ్వరరావు చేరిక.. వెంకన్నకు షాక్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవిల సంయుక్త ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు మంగళవారం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రతిపక్ష నేత.. ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఆయన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు స్వయానా సోదరుడు. జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలతో బీసీలకు మేలు జరుగుతుందని, బుద్దా వెంకన్న ఏనాడూ బీసీలను పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్ హయాంలో బీసీలకు జరిగిన మేళ్లను ఆయన గుర్తు చేశారు. బీసీలకు ప్రత్యేకంగా సబ్ప్లాన్ను రూపొందిస్తామని జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. వైఎస్సార్ సీపీలోకి మాజీ కార్పొరేటర్ కృష్ణా జిల్లా విజయవాడ వెస్ట్ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ కృష్ణా జిల్లా ఇన్చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు బొత్స అప్పలనర్సయ్య, మల్లాది విష్ణుల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ యలకల చలపతిరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయనను వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చలపతిరావుతో పాటు కర్ణాటి శివశంకర్, మద్ది నాగరాజు, చుక్కా పోలారెడ్డి, తాతా శ్రీను తదితరులున్నారు. నా బిడ్డకు ప్రాణం పోసిన మిమ్మల్ని మరువలేమన్నా.. అన్నా.. నా బిడ్డ లోకేశ్నాగమణికంఠకు ప్రాణం పోసిన మీ మేలును జీవితాంతం మరవలేం.. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నా ఏకైక కుమారుడికి బ్రైన్ట్యూమర్ రావడంతో తీవ్ర ఆవేదన చెందా. ఈ క్రమంలో పాదయాత్రగా వస్తున్న జగనన్నను కలిసి నా బిడ్డ సమస్యను వివరించగానే స్పందించిన రాజన్న బిడ్డ.. రూ.6 లక్షల విలువైన ఆపరేషన్ను తిరుపతి ఆస్పత్రిలో ఉచితంగా చేయించి నా బిడ్డకు పునర్జన్మ ప్రసాదించారు. – వైఎస్ జగన్ను కలిసిన తర్వాత మాట్లాడుతున్న పి.వెంకటరాంబాబు, ఎస్.సీతాపురం, దెందులూరు, పశ్చిమగోదావరి జిల్లా ప్రాణాలు పోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. ఈ ప్రాంతంలో మత్స్య సంపద అధికంగా ఉన్నా తగినన్ని సౌకర్యాల్లేవు. దీంతో ఇతర ప్రాంతాలకు వ్యాపార, జీవనోపాధి కోసం వలసపోతున్నాం. అక్కడ మేం ప్రాణాలు కోల్పోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల సోంపేట మండలం గొల్లగండి గ్రామానికి చెందిన మడ్డు మోహనరావు చెన్నైలో మరణించినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ సమస్యల పరిష్కారానికి మీరు చర్యలు తీసుకోండి. ఈ జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయించి మమ్మల్ని ఆదుకోండి. – ఎం.వెంకటేష్, ఇస్కలపాడు, సోంపేట మండలం కిడ్నీ రోగులకు మేలు చేయండన్నా.. అన్నా.. మా ప్రాంతంలో కిడ్నీ రోగులు అధికం. చిన్నా పెద్దా తేడా లేకుండా కిడ్నీ మహమ్మారికి బలైపోతున్నారు. ఈ రోగం ఎందుకొస్తుందో అర్థం కావడం లేదు. వైద్యానికి డబ్బుల్లేక ఎంతోమంది మరణిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో దాదాపు 5 వేల మంది చనిపోయారు. మీరు అధికారంలోకొచ్చాక ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోండన్నా.. – బొర్ర శ్రావ్యశ్రీ,.. ఎమ్మెస్సీ విద్యార్థిని, బొర్రపుట్టుగ, ఇచ్ఛాపురం నియోజకవర్గం -
అడుగులన్నీ.. ఆవైపే
పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు.. ఏటా వచ్చే జాతర అన్నీ ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది?.. అంతకన్నా రెట్టింపు స్థాయిలో కిక్కిరిసిన జన ప్రవాహాలు ఇప్పుడు ఆ మారుమూల ప్రాంతం వైపు వడివడిగా సాగుతున్నాయి. ఇడుపులపాయలో వేసిన తొలి అడుగు.. కోట్లాది హృదయాలను గెలుచుకుంటూ, రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఇచ్ఛాపురంలో ఆఖరి ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగియనుంది. కీలక నిర్ణయంతో రాజకీయాలను మరో మలుపు తిప్పిన ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర ముగింపు సన్నివేశాన్ని తిలకించేందుకు ఇచ్ఛాపురం వీధుల్లో అంతా వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు. ఉత్సాహం, ఉత్కంఠ, ఆనందం, ఆత్మీయత అందరిలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇచ్చాపురం, ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు: విలువలు, విశ్వసనీయత, భరోసా, పట్టుదలను వారసత్వంగా పుణికిపుచ్చుకున్న జగన్ ధృఢ సంకల్పానికి ఇచ్ఛాపురం సాక్షిగా నిలువనుంది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఇచ్ఛాపురం నిజానికి ఓ చిన్న పట్టణం. అక్కడి జనాభా మహా అయితే వేలల్లోనే ఉంటుంది. కానీ రెండు రోజులుగా అక్కడ సందడే సందడి. ఇసుకేస్తే రాలనంతగా జనం.. ఎటు చూసినా పండుగ వాతావరణం.. వీధి వీధినా అంగళ్లు వెలుస్తున్నాయి. హోటళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అక్కడకు వందల కొద్దీ వాహనాలొస్తున్నాయి. వేలాది మంది వచ్చిపోతున్నారు. ‘పాదయాత్ర ముగింపు ఎక్కడ?.. పైలాన్ ఆవిష్కరణ ఎక్కడ?’ ఇచ్ఛాపురం పొలిమేరల్లో కనిపించే ప్రతి వ్యక్తి నోటి నుంచి వస్తున్న ప్రశ్న ఇదీ. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం.. ఇలా అక్కడకు ఏ డిపో నుంచి వచ్చే బస్సు అయినా కిక్కిరిసిపోతోంది. ఆటోల నిండా జనమే. ద్విచక్ర వాహనాల మీద చేరుకునే వాళ్ల సంఖ్య లెక్కే లేదు. ఆఖరి ఘట్టం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కుమార్తె షర్మిల కూడా తమ పాదయాత్రలను ఇక్కడే ముగించారు. వైఎస్సార్, షర్మిల పాదయాత్ర స్థూపాలను ప్రత్యేకంగా సందర్శిస్తున్నారు. ఆ సన్నివేశాలను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తమ ఊరికి వచ్చేవారికి ఆసక్తిగా చెబుతున్నారు. అపూర్వఘట్టం కోసం నిరీక్షణ ఇచ్ఛాపురంలో గట్టిగా వంద మందికి సరిపడా వసతి దొరకడం కూడా కష్టమే. వెళ్తే ఒడిశాలోని బరంపురం వెళ్లాలి. లేదంటే శ్రీకాకుళంలో బస చేయాలి. కానీ పాదయాత్ర ముగింపు కార్యక్రమా నికి హాజరయ్యే వారు ఇవేమీ పట్టించుకోవడం లేదు. సాయంత్రం ఆరు గంటలకే వణుకు పుట్టించే చలి వాతావరణం ఉన్నా వీధుల్లోనే సంచరిస్తున్నారు. ఒక్క రోజు ఓపిక పడితే ఏమవుతుంది...? విజయనగరం నుంచి వచ్చిన కాంతారావు, మల్లికార్జున మనోగతం ఇదీ. ముగింపు రోజుకు ముందే వారిద్దరూ ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఆఖరు రోజు రద్దీలో రావడం కష్టమని భావించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తిలక్, శ్యామల, సంధ్యారాణి, కృష్ణప్రసాద్కు ఎక్కడా వసతి దొరకలేదు. బరంపురంలో లాడ్జీలన్నీ ముందే బుక్ కావడంతో తాము వచ్చిన వాహనంలోనే ఉంటామని చెప్పారు. పాదయాత్ర ముగింపు సన్నివేశం తమకో మరపురాని తీపి గుర్తు అని పేర్కొన్నారు. ఇక ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు రాత్రి పొద్దుపోయే వరకూ ఇచ్ఛాపురం వీధుల్లోనే గడుపుతున్నారు. కాసేపు పైలాన్ దగ్గర.. ఇంకాసేపు వైఎస్సార్ పాదయాత్ర స్థూపం వద్ద.. ఆ తర్వాత షర్మిల పాదయాత్ర స్థూపం దగ్గర...! ఉత్సాహంగా యువత.. పాదయాత్రతో జగన్ జనహృదయాలను గెలుచుకున్నారనేది అందరి మాట. ఇచ్ఛాపురానికి భారీగా చేరుకుంటున్న యువత రాష్ట్రంలో నవశకం మొదలు కానుందని చెబుతున్నారు. విజయవాడకు చెందిన కల్పన బెంగళూరులో ఎంటెక్ చేస్తోంది. ‘థ్రిల్గా ఉంది.. జగనన్న పాదయాత్ర రాజకీయాలనే మార్చబోతోందని మాఫ్రెండ్స్ చెప్పుకుంటున్నారు. అందు కే వచ్చా. ఇక్కడ మా బాబాయి వాళ్లింట్లో దిగా. ఇదిగో ఈ సెల్ఫోన్లో అంతా చిత్రీకరించి.. మా వాళ్లందరికీ పంపుతా’ అని అంటున్నప్పుడు ఆమె ముఖంలో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆమె ఒక్కరే కాదు.. పుణె నుంచి వచ్చిన విశ్వప్రతాప్.. ఢిల్లీలో చదువుతున్న ఏపీ విద్యార్థి రఘునందన్.. ఇలా యువత అంతా పాదయాత్ర ముగింపులో పాలుపంచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. తరలివస్తున్న శ్రేణులు... వైఎస్సార్సీపీకి చెందిన అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్ఛాపురం చేరుకుంటున్నారు. పలు ప్రాంతాల నుంచి సొంత వాహనాలు, బస్సులు, రైళ్లలో తరలివస్తున్నారు. నేటి కార్యక్రమం ఇలా... ఇచ్ఛాపురం సమీపంలోని కొజ్జీరియా గ్రామం నుంచి వైఎస్ జగన్ బుధవారం చివరి రోజున పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు లొద్దపుట్టి వద్ద మధ్యాహ్న భోజనవిరామం శిబిరం వద్దకు చేరు కుంటారు. ఒంటి గంటకు అక్కడి నుంచి బయలు దేరి 1.15 గంటలకు ఇచ్ఛాపురంలోని పైలాన్ వద్దకు చేరుకుంటారు. పాత బస్టాండ్ వద్దకు కాలినడకన చేరుకుంటారు. 1.30 గంటలకు అక్కడ భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. జన సంద్రం మధ్య ఎన్నికల సమరశంఖం పూరించనున్న జగన్ చరిత్ర సృష్టించిన పాదయాత్రతో జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకున్న వైఎస్ జగన్ ఇచ్ఛాపురం వేదికగా 2019 ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఇప్పటికే అందరినీ రాజకీయంగా, సామాజికంగా జాగృతం చేసిన వైఎస్ జగన్ ముగింపు సభలో... మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందో వివరిస్తూ ఇచ్ఛాపురం వేదికగా ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్నారు. అధికార పక్షం దాష్టీకాలను అడ్డుకునేలా పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపనున్నారు. సెల్ఫీలు.. లైవ్లు పన్నెండేళ్ల కొచ్చే పుష్కరాలు.. ఎప్పుడో వచ్చే జాతరలో జనం ఏ స్థాయిలో ఉత్సాహంగా కనిపిస్తారో.. అంతకన్నా రెట్టింపు సన్నివేశం ఇచ్ఛాపురంలో కనిపిస్తోంది. బైపాస్ రోడ్డు మీద నుంచే కనిపించే పాదయాత్ర పైలాన్ను వాహనాల్లోంచి చూస్తూ సంబరపడిపోతున్నారు. అంత దూరం నుంచే సెల్ఫోన్లు తీసి క్లిక్ మనిపిస్తున్నారు. ఇక దగ్గరకెళ్లి సెల్ఫీలు దిగేవాళ్లు లెక్కే లేదు. రకరకాల ఫొటోలు దిగేందుకు జనం పోటీపడుతున్నారు. ఇచ్ఛాపురంలో సంతోషాన్ని, ముగింపు ఉత్సవ సన్నాహాలను అనేక మంది లైవ్లో తమ సన్నిహితులు, మిత్రులకు చూపించడం అన్ని చోట్లా కనిపిస్తోంది. -
340వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం – 3,638.9 కి.మీ. 340వ రోజు నడిచిన దూరం – 10.7 కి.మీ. 08–01–2019, మంగళవారం,అగ్రహారం, శ్రీకాకుళం జిల్లా. ఉద్దానంలో దారుణ పరిస్థితిని మార్చాలన్న తపన కాస్తయినా లేని ప్రభుత్వాన్ని ఏమనాలి? పాదయాత్ర చివరి అంకానికి చేరుకుంది. ‘విజయ సంకల్పం’ స్తూపం వైపు అడుగులు చేరువయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పాదయాత్ర చేసేటప్పుడు వెంకట రాంబాబు అనే ఆటో డ్రైవర్ కలిశాడు. ఆయన ఒక్కగానొక్క కొడుకు మణికంఠకు బ్రెయిన్ ట్యూమర్. ఆస్పత్రులకు వెళ్తే రూ.ఆరు లక్షలు అవుతుందన్నారు.. ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. ఆ తండ్రి నిస్సహాయతను చూసి జాలేసింది. పిల్లాడికి వైద్యసాయం అందేలా చేశాను. ఆపరేషన్ పూర్తయి ఆ బిడ్డ ఆరోగ్యవంతుడయ్యాడు. ఈరోజు ఆ తండ్రి కొడుకును ఎత్తుకుని వచ్చి సంతోషాన్ని పంచుకుంటుంటే మనసంతా తృప్తితో నిండిపోయింది. ఈరోజు కవిటి మండలంలో పాదయాత్ర సాగింది. దేశంలోనే అత్యధికంగా కిడ్నీ వ్యాధికి గురయ్యే ప్రాంతమిది. కాళ్లు, మొహం, కళ్ల వాపులతో నడవడానికి సత్తువ లేని ఎందరో కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు. వారిలో నాలుగైదేళ్ల చిన్నారుల నుంచి పండు ముసలివారి వరకు ఉన్నారు. వారంతా నిరుపేదలైన వ్యవసాయ కూలీలు, మత్స్యకార కుటుంబాలవారే. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. మందులు లేక, డాక్టర్లు అందుబాటులో లేక, డయాలసిస్ సేవలు సరిగా అందక, పింఛన్లు రాక, ఆదుకునేవారే లేక జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. శ్రీహరిపురం వద్ద కలిసిన ఆ విధివంచితుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో దయనీయ గాథ. బుథియా అనే తాత ఒక కొబ్బరి కూలీ. కిడ్నీ వ్యాధిబారిన పడి ఏ పనీ చేయలేకపోతున్నాడు. అతని బిడ్డలు వలస కూలీలు. వేలకు వేలు ఖర్చు చేసి తండ్రికి చికిత్స చేయించలేని దుస్థితి వారిది. విధిరాత ఇంతేననుకుని, దేవుడిపై భారం వేసి ఇంటిపట్టునే ఉంటున్నానని ఆ తాత చెబుతుంటే గుండె బరువెక్కింది. బొడియా జమున కుటుంబ గాథ మరింత దయనీయం. ఒకే కుటుంబంలో కిడ్నీ వ్యాధితో నలుగురిని కోల్పోయిన విషాదం. ఒక్కొక్కరి వ్యథ వింటుంటే మనసు కలత చెందింది. ఒకప్పుడు ఉద్యానవనంలా వెలుగొందిన ఉద్దానాన్ని కిడ్నీ వ్యాధి కబళించి వేస్తోందా అనిపిస్తోంది. ఇక్కడివారిని పెళ్లి చేసుకోవడానికి బయట ప్రాంతాలవారు వెనుకంజ వేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పనిచేయడానికి ఉద్యోగులు కూడా ముందుకు రావడం లేదట. వలస వెళ్లిపోయినవారు, ఈ ప్రాంతాన్ని వదిలేసి బయట ప్రాంతాల్లో స్థిరపడ్డవారు ఎందరో ఉన్నారట. ఉద్దానం ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితిని మార్చాలన్న తపన కాస్తయినా లేని ప్రభుత్వాన్ని ఏమనాలి? చుట్టా దున్నా అనే అన్న కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ‘ఈ ప్రభుత్వం మంచినీళ్లు ఇవ్వడం లేదు కానీ వద్దన్నా మద్యాన్ని మాత్రం సరఫరా చేస్తోంది. అంతంతమాత్రంగా ఉన్న కిడ్నీలు మద్యం దెబ్బకు పూర్తిగా పాడయ్యాయి’ అంటూ ఆయన భార్య చుట్టా లక్ష్మి కన్నీటిపర్యంతమైంది. ప్రజల ప్రాణాలు పోతున్నా కనీస వైద్య సాయం అందించడంలో లేని శ్రద్ధ మద్యం వ్యాపారంపై ఉండటం దౌర్భాగ్యం. ప్రజల ఆరోగ్యం పాడైనా పర్లేదు.. ఆదాయం వస్తే చాలనుకునే పాలనలో ఉద్దానం వెలుగులు ఎండ మావులేనేమో! ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న..మీరు ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సేవలే లేనప్పుడు ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షలకు పెంచుతున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తున్నామని పెద్దపెద్ద ప్రకటనలివ్వడం ప్రజలను దారుణంగా వంచించడం కాదా? -వైఎస్ జగన్ -
కొత్త చరిత్రకు శ్రీకారం
పల్లె సీమలనూ, పట్టణాలనూ, నగరాలనూ, మహా నగరాలనూ ఒరుసుకుంటూ సాగిన సుదీర్ఘ మహా జన ప్రభంజన యాత్ర పూర్తికాబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017 నవంబర్ 6న ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం నుంచి ప్రారంభించిన ‘ప్రజా సంకల్పయాత్ర’ ఎన్నో అవాంతరాలను అధిగమించి నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియబోతున్నది. జగన్మోహన్రెడ్డికి ప్రజానీకంలో ఉన్న ఆదరాభిమానాలు అందరికీ సుపరిచితమే అయినా పాదయాత్రకు ఈ స్థాయిలో జనం పోటెత్తు తారని మొదట్లో ఎవరూ ఊహించలేదు. మొదలైనప్పుడు ఉన్న ఉరవడి, ఉత్సాహం చివరికంటా కొనసాగడం ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచింది. ప్రజలంతా ఎవరికి వారు పాదయాత్ర వివరాలు తెలుసుకుని ఆ దారిలో ఆయనకు స్వాగతం పలికేందుకు, వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహించే బహి రంగసభల్లో ఆయన ఏం చెబుతారో వినేందుకు తరలివచ్చిన తీరు దేశ చరిత్రలోనే అపూర్వం. ఆయన అడుగులో అడుగేయాలని, ఆయనతో తమ గోడు చెప్పుకోవాలని, ఆయన ఇచ్చే భరోసాతో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని లక్షలమంది ప్రజలు ఆత్రంగా ఎదురు చూశారు. తనను కలుసుకోవాలని, మాట్లాడాలని ఆశపడుతున్నవారిలో కొందరు కదల్లేని స్థితిలో ఉన్నారని తెలుసుకుని జగన్మోహన్రెడ్డే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఆయన్ను కలిసి ఏదో చెప్పాలని బలంగా కోరుకుంటున్నా చుట్టూ ఉన్న జనప్రవాహాన్ని చూసి నిస్సహాయంగా ఉండిపోయిన వృద్ధులనూ, పిల్లలనూ గమనించి తానే వారి దగ్గరకెళ్లి అక్కున చేర్చుకున్న తీరు, చిరునవ్వుతో ఆప్యాయంగా సంభాషించిన తీరు చూసి అందరూ చకి తులయ్యారు. ఒకరా ఇద్దరా... పాదయాత్ర పొడవునా వందలు, వేలమంది ఆయన ముందు తమ గోడు వినిపించుకున్నారు. చంద్రబాబు పాలనలో తమకెదురవుతున్న అన్యాయాలను చెప్పు కున్నారు. పాలకుల దన్నుతో ఊరూరా ఎటువంటి అక్రమాలు అడ్డూ ఆపూ లేకుండా సాగు తున్నాయో వివరించారు. వినతిపత్రాలిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తున్న తీరును తెలిపారు. కొందరైతే తామెదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను చెప్పుకున్నారు. తమ పింఛన్లను కావాలని నిలిపివేశారని కొందరు... నివాసగృహం లేక సతమతమవుతున్నామని మరికొందరు... పెద్ద చదువులు చదివినా నిరుద్యోగం తమను పీల్చిపిప్పి చేస్తున్నదని ఇంకొందరు ఆయనకు చెప్పారు. అరకొర వేతనాలిచ్చి వెట్టి చాకిరీ చేయించుకోవడాన్ని... ఏళ్లు గడుస్తున్నా తమకు రావాల్సిన బకాయిల్ని చెల్లించకపోవడాన్ని... నోటిఫికేషన్లు ఇస్తామని, ఖాళీలు భర్తీ చేస్తామని హామీలిచ్చి మోసపుచ్చడాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చినవారున్నారు. వీరందరూ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినవారే. తన పరిధిలో తీర్చగలిగినవాటిని అక్కడికక్కడే పరిష్కరించటం, అధికారం సిద్ధించాక చేయగలిగేవాటి విషయంలో ఓపిక పట్టమని కోరడం, భవిష్యత్తుపై విశ్వాసాన్ని నింపడం దారి పొడవునా కనబడింది. ఆయన్ను నిరుపేదలు,రైతులు, చేతివృత్తులవారు, కార్మి కులు, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు కలిశారు. ఆత్మీయ సమావేశాల్లో వివిధ వర్గాలవారు తమకు జరుగుతున్న అన్యాయాలను తెలిపారు. సర్కారీ అపసవ్య విధానాలను వీరందరూ వివరిస్తుంటే, అందువల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతుంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ఓర్పుతో విన్నారు. అవ గాహన చేసుకున్నారు. పరిష్కార మార్గాలు ఆలోచించారు. సరికొత్త విధానాలకు రూపకల్పన చేశారు. పేదరికం కోరల్లోంచి బయటకు రావాలంటే కుటుంబాల్లో పిల్లలు పెద్ద చదువులు చదివి డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని... అందుకు అవసరమైన చేయూత అందేవిధంగా విధివిధానాలు రూపొందిస్తామని వాగ్దానం చేశారు. సకల వర్గాలనూ స్పృశించేలా రూపకల్పన చేసిన నవ రత్నాల్లోని అంశాలను ఆయన వివరిస్తుంటే జనం కరతాళ ధ్వనులతో బహిరంగసభలు మార్మోగాయి. కాళ్లు బొబ్బలెక్కినా, ఎండలు మండిపోతున్నా, ఏకధాటిగా వర్షం కురుస్తున్నా, శీతగాలులు కోతపెడుతున్నా ఏ రోజూ జగన్మోహన్రెడ్డి వెరవలేదు. తన సంకల్పం నుంచి కాస్తయినా పక్కకు తప్పుకోలేదు. తాను అడుగుపెట్టిన ప్రాంతంలోని సమస్యలను అవగాహన చేసుకోవడం, వాటిని ప్రస్తావిస్తూ బహిరంగసభల్లో మాట్లాడటం, ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వర్తమాన రాజకీయాలను వివరించటం, వారిలో చైతన్యాన్ని నింపడం ఆయనొక యజ్ఞంలా నిర్వహించారు. ఇన్ని సభల్లో మాట్లాడినా, వేలమందితో నిత్యం సంభాషిస్తున్నా ఏనాడూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డుపై పరుషవాక్కులు పలకలేదు. తన హుందాతనాన్ని మరవలేదు. కానీ బాబు దీనికి భిన్నం. పాదయాత్ర తొలినాళ్లలో అది విజయం సాధించడం అసాధ్యమన్న భ్రమల్లో ఆయన మునిగి పోయారు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆ సంకల్పయాత్ర అంతకంతకు బలం పుంజుకోవడాన్ని గమ నించి తన అధికార బలంతో అనేక రూపాల్లో జగన్మోహన్రెడ్డి ఆత్మసై్థర్యాన్ని దెబ్బతీయాలని చూశారు. కానీ చివరకు చంద్రబాబే మనోసై్థర్యాన్ని కోల్పోయారు. తన పునాదులు కదులుతున్న వైనాన్ని గమనించి ప్రత్యేక హోదాతోసహా అనేక అంశాల్లో ‘యూ–టర్న్’లు తీసుకుని నవ్వుల పాలయ్యారు. వీటన్నిటికీ పరాకాష్టే విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్రెడ్డిపై జరిగిన విఫల హత్యాయత్నం. మొత్తానికి పధ్నాలుగు నెలలపాటు కొనసాగిన ఈ ప్రజా సంకల్పయాత్ర కోట్లాది జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేశ చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా, అపు రూపమైన అధ్యాయంగా ఆవిష్కృతమవుతుంది. నాయకుడంటే ఎలా ఉండాలో, ఎంత పరిణతితో మాట్లాడాలో ఈ ప్రజా సంకల్పయాత్ర ద్వారా జగన్మోహన్రెడ్డి చాటిచెప్పారు. -
జన యాత్ర
-
విజయ శంఖారావం
-
వైఎస్ఆర్ రైతు భరోసా
-
అమ్మ ఒడి పథకం
-
మేము వైఎస్ఆర్సీపీ సోల్జర్స్.. పార్టీ విజయం కోసం కృషిచేస్తాం
-
నడిచారు గెలిచారు
-
మెల్బోర్న్లో వైఎస్ జగన్కు అభినందన సభ
మెల్బోర్న్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వజ్ర సంకల్పంతో చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తుది అంకానికి చేరుకుంది. రేపటితో (జనవరి 9) జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుండటంతో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఆసీస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, నేమాని శర్మ,ఆదిత్య రెడ్డి, హరిబాబు చెన్నుపల్లి,రాజ్ దాసరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ ప్రతినిధులు పాల్గొని వైఎస్ జగన్ కి అభినందనలు తెలియజేసారు. -
వైఎస్ జగన్ను కలిసిన సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు
-
ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది: ధర్మాన
-
341వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారిలో భరోసా నింపుతూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తుది అంకానికి చేరింది. ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6వ తేదీన చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’, బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం వైఎస్ జగన్ పెద్ద కొజ్జిరియా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి లొద్దకుట్టి మీదుగా జననేత పాదయాత్ర ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర సాగుతుంది. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సూచకంగా ఏర్పాటు చేసిన విజయసంకల్ప స్తూపాన్ని జననేత ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి తన తండ్రి మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానం విజయస్తూపం, తన సోదరి షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం స్తూపం మీదుగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్లో జరిగే బహిరంగ సభ ప్రాంతానికి వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడ జననేత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడితో ఆయన చారిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 10వేల ఆర్థిక సాయం’
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం.. పాదయాత్ర కవిటికి చేరుకున్న సమయంలో ఆటో డ్రైవర్లు జననేతను కలిసి తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఇన్సురెన్స్, ఫైన్లు, ఫిట్నెస్ ఫీజులను ప్రభుత్వం పెంచేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు.. వాటిని తగ్గించాలని వైఎస్ జగన్ను కోరారు. వారి సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్.. ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జననేత హామీపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. 104 ద్వారా అన్ని పరీక్షలు చేయిస్తాం నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులు వైఎస్ జగన్ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కవిటి మండలంలో వందల మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు జననేత దృష్టికి తీసుకువచ్చారు. వైద్యం కోసం ప్రతి నెలకు 5 వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. వారి సమస్యలపై స్పందించిన జననేత.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి ఆర్థిక సాయం అందజేయడంతో పాటు.. 104 ద్వారా అన్ని పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన రైల్వేజోన్ సాధన సమితి సభ్యులు.. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ను ఉత్తరాంధ్ర రైల్వే జోన్ సాధన సమితి సభ్యులు కలిశారు. రైల్వే జోన్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని వారు జననేతకు వివరించారు. -
వైఎస్ జగన్ను కలిసిన కవిటి మండలం కిడ్నీ వ్యాధి బాధితులు
-
‘దేవుణ్ని కూడా బాబు వాడుకుంటున్నారు’
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ ప్రభుత్వం ఎన్నో అవరోధాలు సృష్టించినా, చివరకు భౌతికంగా అంతం చేసేందుకు హత్యయత్నానికి పాల్పడినా చలించకుండా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్విజయంగా తన పాదయాత్రను పూర్తి చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. వైఎస్ జగన్పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైఎస్ జగన్ పాదయాత్రకు సహకరించిన వారందరకీ కృతజ్ఞతలు తెలిపారు. రేపటితో(బుధవారం) ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు.పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురం పాత బస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశామని చెప్పారు. గొప్ప సంకల్పంతో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తిరుమల దర్శనం సందర్భంగా చంద్రబాబే టీడీపీ కార్యకర్తల చేత హడావిడి చేయించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. గతంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడు కూడా అదే విధంగా దుశ్చర్యలు చేయబోతున్నారని, దీనిపై తమకు పక్కా సమాచారం ఉందన్నారు. స్వామి వారిని కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం చంద్రబాబు అలవాటేనని విమర్శించారు. యాత్ర అనంతరం వైఎస్ జగన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారని వివరించారు. ఇదే అదనుగా వైఎస్ జగన్ పై దుష్ర్సచారం చేయించేందుకు చంద్రబాబు కుట్రపన్నారని ఆరోపించారు. దేవ దర్శనం సమయంలో ‘జై జగన్’ అంటూ నినాదాలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు రంగంలోకి దింపారని ఆరోపించారు. జగన్పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు తెగించారని, ప్రజలే వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.