
మాటలు చెప్తే అర్థంకాకపోతే ఆయన పవన్ కళ్యాణ్. మాట తప్పితే అది చంద్రబాబు..
సాక్షి, ఇచ్ఛాపురం: చంద్రబాబు దోపిడీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు సిండికేట్లా తయారయి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని భూముల నుంచి ఇసుక వరకు ప్రతిదాంట్లోనూ దోపిడీ పర్వం కొనసాగుతోందని విమర్శించారు. అందుకే చంద్రబాబుకు ‘అవినీతి చక్రవర్తి’ బిరుదు ఇవ్వడం జరిగిందన్నారు.
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం ఇచ్ఛాపురం వచ్చిన ఆమె ‘సాక్షి’టీవీతో మాట్లాడారు. ఇచ్ఛాపురం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నలుమూలల జనం నుంచి తరలిరావడంతో ఇసుక వేసినా రాలనంతగా జనం కనబడుతున్నారని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు.
నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిని ఆమె ఎద్దేవా చేశారు. ‘మాటలు రానివాడంటే లోకేశ్, మాటలు చెప్తే అర్థంకాకపోతే ఆయన పవన్ కళ్యాణ్. మాట తప్పితే అది చంద్రబాబు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకుంటారు కనుక తామంతా జగన్ వెంట ఉన్నామ’ని డాక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు.