
సాక్షి, న్యూఢిల్లీ : ఐదు కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న పోరాటం రోజురోజుకు ఉధృతరూపం దాలుస్తోంది. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బుధవారం కూడా ఆందోళనలు కొనసాగించారు.గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీలు బుధవారం ధర్నా చేపట్టారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం లోక్సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు.
ఇక హోదా ఉద్యమ సెగలు మంగళవారం పార్లమెంటును తాకిన సంగతి తెలిసిందే. విభజన కారణంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి హోదా తప్ప మరో ప్రత్యామ్నా యం లేదని నినదిస్తూ నాలుగేళ్లుగా అనేక రూపాలలో పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదికగా తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. పార్లమెంటు వెలుపల, లోపల ఆందోళనలతో ఆ పార్టీ ఎంపీలు మంగళవారం హోరెత్తించారు. సభలో 184 నిబంధన కింద నోటీసు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వాలి అని రాసి ఉన్న ప్లకార్డులతో స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment