
కంగారూలదే టైటిల్
ఫైనల్లో వెస్టిండీస్పై విజయం ముక్కోణపు వన్డే సిరీస్
బార్బడోస్: ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. బ్యాట్స్మెన్ వేడ్ (52 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆసీస్కు మెరుగైన స్కోరు అందించగా... బౌలర్ మార్ష్ (3/32) కీలక వికెట్లు పడగొట్టడంతో 58 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. కెన్సింగ్టన్లోని ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 270 పరుగులు చేసింది.
ఆరోన్ ఫించ్ (41 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్సర్), స్మిత్ (59 బంతుల్లో 46; 4 ఫోర్లు) ఫరవాలేదనిపించారు. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్... ఆసీస్ బౌలర్ల ధాటికి 45.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. చార్లెస్ (61 బంతుల్లో 45; 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. హాజెల్ వుడ్ 5 వికెట్లు తీశాడు. మార్ష్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... హాజెల్వుడ్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు దక్కాయి.