
బ్రెజిల్లో అడుగుపెట్టిన ఆసీస్ జట్టు
‘ఫిఫా’ వరల్డ్కప్
కర్టిబా (బ్రెజిల్): ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టు బ్రెజిల్లో అడుగుపెట్టింది. టోర్నీ కోసం ఇక్కడికి వచ్చిన మొదటి జట్టు ఇదే. రాత్రి వేళలో విటోరియా విమానాశ్రయానికి చేరుకున్న జట్టును కటుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య టౌన్ సెంటర్ హోటల్కు తరలించారు. దాదాపు 100 మంది బ్రెజిల్ అభిమానులు... ఆటగాళ్లను చూసేందుకు ఎయిర్పోర్ట్కు వచ్చారు. అయితే ప్లేయర్లు విమానం నుంచి నేరుగా తమకు కేటాయించిన బస్లోకి వెళ్లడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు.
సూట్లో వచ్చిన ఆటగాళ్లను కొంత మంది తమ కెమెరాల్లో బంధించారు. వరుసగా మూడోసారి వరల్డ్కప్ ఫైనల్స్కు అర్హత సాధించిన ఆసీస్... గ్రూప్-బిలో స్పెయిన్, నెదర్లాండ్స్, చీలి జట్లతో అమీతుమీ తేల్చుకోనుంది. జూన్ 3న క్రొయేషియా, ఇరాన్ జట్లు ఇక్కడికి వచ్చే అవకాశాలున్నాయి. అన్నింటికంటే చివరన జూన్ 11న దక్షిణ కొరియా, ఘనా, పోర్చుగల్ జట్లు ఇక్కడికి చేరుకుంటాయి. మరోవైపు ఆతిథ్య జట్టు బ్రెజిల్ సోమవారం నుంచి తమ బేస్ క్యాంప్ను ఏర్పాటు చేయనుంది. ఆరోగ్య పరీక్షల తర్వాత బుధవారం తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.