భారీ విజయంతో సిరీస్‌ కైవసం | Australia Thrash New Zealand To Clinch Series | Sakshi
Sakshi News home page

భారీ విజయంతో సిరీస్‌ కైవసం

Dec 29 2019 4:33 PM | Updated on Dec 29 2019 4:33 PM

Australia Thrash New Zealand To Clinch Series - Sakshi

మెల్‌బోర్న్‌: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయం సాధించింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ను 240 పరుగులకే ఆలౌట్‌ చేసిన ఆస్ట్రేలియా 247 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తో కైవసం​ చేసుకుంది. తొలి టెస్టులో ఆసీస్‌ 296 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ రోజు ఆటలో ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 168/5 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. దాంతో 488 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ ఆదిలోనే ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌(8) వికెట్‌ను కోల్పోయింది. ఆపై వెంటనే కేన్‌ విలియమ్సన్‌(0) డకౌట్‌గా నిష్క్రమించాడు. కాసేపటికి రాస్‌ టేలర్‌(2) సైతం నిష్క్రమించాడు. దాంతో కివీస్‌ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పయి కష్టాల్లో పడింది.

ఆ తరుణంలో ఓపెనర్‌ టామ్‌ బ్లండెల్‌(121)తో కలిసి నికోలస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. జట్టు స్కోరు 89 పరుగుల వద్ద ఉండగా నికోలస్‌(33) ఔట్‌ అయ్యాడు. ఇలా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ న్యూజిలాండ్‌ ఓటమి చెందగా, తొమ్మిదో వికెట్‌గా ఔటైన బ్లండెల్‌ మాత్రం సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండో టెస్టు ఆడుతున్న బ్లండెల్‌కు ఇది తొలి సెంచరీ కాగా అది వృథాగా మిగిలింది. ట్రెంట్‌ బౌల్ట్‌ ఆబ్సెంట్‌ హర్ట్‌గా స్టైకింగ్‌కు రాలేదు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లయన్‌ నాలుగు వికెట్లు సాధించగా, జేమ్స్‌ ప్యాటిన్‌సన్‌ మూడు వికెట్లు తీశాడు. లబూషేన్‌కు వికెట్‌ దక్కింది.  ఆసీస్‌ తన  తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేసిన ఆసీస్‌ ఆటగాడు ట్రావిస్‌ హెడ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement