
మాస్కో : సాదాసీదాగా సాగిన మ్యాచ్.. ఒక్క మెరుపు గోల్ తప్ప అభిమానులను అలరించిన క్షణాలు లేవు. నాకౌట్కు చేరామన్న ధీమాతో ఇరుజట్లు ఏ కేటగిరి ఆటగాళ్లను బెంచ్కే పరిమితం చేసి బరిలోకి దిగాయి. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా గ్రూప్ జీ టాపర్ కోసం జరిగిన పోరులో బెల్జియం 1-0తో ఇంగ్లండ్పై విజయం సాధించింది. దీంతో 82 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్పై బెల్జియం విజయం సాధించింది. 1936లో ఇంగ్లండ్పై గెలిచిన బెల్జియం తాజాగా రెండో సారి విజయానందం పొందింది. ఓవరాల్గా ఇరుజట్లు 22సార్లు తలపడగా బెల్జియం కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది.
తొలి అర్థభాగం చప్పగా సాగింది. ఒక్క గోల్ నమోదు కాకుండానే ప్రథమార్థం ముగిసింది. ఇరు జట్లు గోల్ కోసం పోరాడిన రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. ద్వితీయార్థం మొదలైన ఆరు నిమిషాలకు బెల్జియం ఆటగాడు అద్నాన్ జనుజాజ్.. ఇంగ్లండ్ పెనాల్టీ ఏరియా మీదుగా ఆటగాళ్ల గ్యాప్ నుంచి కళ్లు చెదిరే రీతిలో గోల్ చేశాడు. దీంతో బెల్జియం 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది.
ఇక మ్యాచ్ ముగిసే సరికి ఇరు జట్లు మరో గోల్ నమోదు చేయకపోవడంతో బెల్జియం విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బెల్జియం 14 అనవసర తప్పిదాలు చేయగా, ఇంగ్లండ్ 11 అనవసరం తప్పిదాలు చేసింది. రిఫరీలు బెల్జియం ఆటగాళ్లకు ఎల్లో కార్డు చూపించారు. ఈ మ్యాచ్లో గెలిచిన బెల్జియం జలై 2న జపాన్తో రౌండ్ 16లో తలపడనుంది. ఇక ఓడిపోయిన ఇంగ్లండ్ జులై 3న కొలంబియాతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment