
బ్యాంకాక్: ఆసియా క్రీడల్లో మళ్లీ క్రికెట్కు చోటు దక్కనుంది. 2022లో చైనాలోని హాంగ్జౌలో జరిగే క్రీడల్లో క్రికెట్ను ఆడించాలని ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ) నిర్ణయించింది. అలాగే ఆస్ట్రేలియాకు ఆసియా క్రీడల్లో అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. 2010, 2014 ఆసియా గేమ్స్లో టి20 ఫార్మాట్లో క్రికెట్ క్రీడను ఆడించారు. కానీ గతేడాది ఇండోనేసియాలో జరిగిన క్రీడల్లో మాత్రం ఈ ఆటను తొలగించారు.
రెండు సార్లు క్రికెట్ ఆడించినా భారత్ మాత్రం బరిలోకి దిగలేదు. స్వతంత్రంగా ఉండాలనుకునే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)... భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గొడుగు కిందకు వచ్చేందుకు నిరాకరిస్తూ... ఆసియా గేమ్స్కు దూరంగా ఉంది. ఆసియా ఒలింపిక్స్ మండలి తాజా నిర్ణయాన్ని ఐఓఏ స్వాగతించింది. వచ్చే క్రీడల్లో టీమిండియా ఆడేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా తెలిపారు. మరోవైపు బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘2022 గేమ్స్కు చాలా సమయం ఉంది. ముందు చర్చించి, ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుంటాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment