
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఢిల్లీ పోరాడి ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ ఆదిలోనే పృథ్వీ షా(9) వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత కోలిన్ మున్రో(26), శ్రేయస్ అయ్యర్(13), గ్లెన్ మ్యాక్స్వెల్(6)లు కూడా స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఢిల్లీ 74 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది.
ఆ దశలో రిషబ్ పంత్ -విజయ్ శంకర్ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 88 పరుగులు జోడించి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 79 పరుగులు నమోదు చేసిన తర్వాత రిషబ్ ఔటయ్యాడు. ఇక విజయ్ శంకర్(54 నాటౌట్; 31 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు) కడవరకూ పోరాటం సాగించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి బంతి వరకూ పోరాటం సాగించిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన చెన్నై 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై ఇన్నింగ్స్ను షేన్ వాట్సన్, డుప్లెసిస్లు ఆరంభించారు. ఒక ఎండ్లో డుప్లెసిస్ నిలకడగా ఆడితే, మరో ఎండ్లో వాట్సన్ మాత్రం విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించి చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఆది నుంచి చెలరేగి ఆడిన వాట్సన్.. 25 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డు ప్లెసిస్(33)తో కలిసి తొలి వికెట్కు 102 పరుగులు జత చేశాడు. కాగా, పరుగు వ్యవధిలో చెన్నై రైనా(1) వికెట్ను కోల్పోవడంతో వాట్సన్ కాసేపు నెమ్మదించాడు. ఆ తర్వాత అంబటి రాయుడితో కలిసి ఇన్నింగ్స్ను పునర్మించిన వాట్సన్ మరోసారి బ్యాట్కు పనిచెప్పాడు. ప్రధానంగా సొగసైన గ్యాప్ షాట్లతో వాట్సన్ అలరించాడు. అయితే అమిత్ మిశ్రా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన వాట్సన్ మూడో వికెట్గా ఔటయ్యాడు. దాంతో మరోసారి సెంచరీ చేస్తాడనుకున్న చెన్నై అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే వాట్సన్ ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన ధోని దూకుడును కొనసాగించాడు. తనదైన స్టైల్లో ఢిల్లీ బౌలర్లలోపై విరుచుకుపడిన 22 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో ధోని (51 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించాడు. మరొకవైపు రాయుడు(41; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా సమయోచితంగా ఆడటంతో చెన్నై భారీ స్కోరు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment