
'ముందు కప్... తర్వాతే పాప'
అడిలైడ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని మనం కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. అలాగే అతనిపై కాస్త జాలి కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకనుకుంటున్నారా... ధోని భార్య సాక్షిసింగ్ శుక్రవారం ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ సమయంలో ధోని తన కుటుంబాన్ని ఎంతగానో మిస్సయ్యాడన్నది వాస్తవం.
ఈ సందర్భంగా ధోని కొన్ని అశ్యర్యకరమైన అంశాలను శనివారం మీడియాతో ప్రస్తావించాడు. పాపను చూడటానికి ఈ మధ్యకాలంలో భారత్కు వెళ్లాలనుకుంటున్నారా.. అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ధోనీ స్పందిస్తూ 'నాకు కూతురు పుట్టింది. సాక్షి, పాప ఇద్దరు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. నేను ప్రస్తుతం జాతీయ జట్టుకు ఆడుతున్నాను. వరల్డ్కప్ అనేది భారత్కు అత్యుత్తమమైనది. నా మొదిటి ప్రాధాన్యం క్రికెట్, ప్రపంచ కప్ ముగిసిన తర్వాత పాపను చూడటానికి భారత్ వెళ్తాను' అని చెప్పడంతో ఆశ్యర్యపోవడం విలేకరి వంతయింది.
అనంతరం ధోని క్రికెట్ గురించి మాట్లాడుతూ 'వరల్డ్ కప్లో భారత్ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 15న దాయాది పాకిస్తాన్తో తలపడుతుంది. అందరు అనుకున్నట్లుగా పెద్దగా ఏం ఆలోచించడం లేదు. ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇతర టెస్ట్ దేశాలతో ఎలా ఆడతామో పాక్తో మ్యాచ్ కూడా నాకు అలాగే అనిపిస్తుంది' అని తెలిపాడు.
ఆస్ట్రేలియాలో భారత జట్టు వైఫల్యం గురించి ధోని ప్రస్తావిస్తూ... ఏ ఆటగాడికైనా విశ్రాంతి అనేది అవసరం. నాలుగు టెస్టులు, వాటి తర్వాత ముక్కోణపు సీరిస్ ఆడటం అనేది చాలా కష్టమని, అందుకే వైఫల్యాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నాడు. ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో ఉండటం కూడా ఓటములకు కారణమన్నాడు. వరల్డ్కప్ కోసం సన్నద్ధమయ్యేందుకు తమకు కొంత విరామం దొరకడంతో అందరూ నూతనోత్సాహంతో ఉన్నారని చెప్పాడు. సమయం దొరకడంతో ఆటగాళ్లు కప్ కోసం సిద్ధమైనట్టు ధోని తెలిపాడు.