
ఆక్లాండ్ : న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో కూడా టీమిండియా పరాజయం పాలై సిరీస్ను అతిథ్య జట్టుకు సమర్పించేసుకుంది. శనివారం ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్లో జరిగిన రెండో వన్డేలో 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలయ్యింది. కాగా మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో నిలవడంతో పాటు సిరీస్ను కైవసం చేసుకుంది. (అయ్యర్.. ఆ షాట్ అవసరమా!)
భారత ఇన్నింగ్స్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి తన బ్యాటింగ్తో జట్టును విజయానికి దగ్గరగా తీసుకువచ్చినా మిగిలిన ఆటగాళ్ల సహాకారం కరువైంది. చివర్లో నవదీప్ సైనీ తన మెరుపు బ్యాటింగ్తో గెలుపుపై ఆశలు చిగురించినా కైల్ జేమిసన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అవడంతో టీమిండియా పరాజయం ఖాయమైంది. ఇక చివర్లో ఒత్తిడిని జయించలేక 48.3 ఓవర్లలో 251 పరుగుల వద్ద టీమిండియా ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 55, శ్రేయస్ అయ్యర్ 52, నవదీప్ సైనీ 45 పరుగులతో రాణించగా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్, సౌదీ, జేమిసన్, కొలిన్ డి ఇంగ్రామ్లు తలా రెండు వికెట్లు తీశారు.
అంతకుమందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్మెన్లలో గప్టిల్ 79, రాస్ టేలర్ 73, నికోల్స్ 45 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో చాహల్ 3వికెట్లు, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీశారు. కాగా నామమాత్రంగా మారిన మూడో వన్డే ఫిబ్రవరి 11న మౌంట్ మాంగనూయిలో జరగనుంది. కనీసం చివరి మ్యాచ్లోనైనా నెగ్గి టీమిండియా క్లీన్స్వీప్కు గురవకుండా ఉంటుందమో వేచి చూడాలి.
(కోహ్లి అంచనా తప్పింది..!)
Comments
Please login to add a commentAdd a comment