
చెలరేగిన భారత బౌలర్లు, వెస్టిండీస్ 211 ఆలౌట్
వెస్టిండీస్తో తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారమిక్కడ ఆరంభమైన తొలి డే/నైట్ వన్డేలో భారత బౌలర్ల ధాటికి కరీబియన్లు 48.5 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో రైనా, జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టారు.అశ్విన్ రెండు, షమీ వికెట్ తీశారు.
విండీస్ జట్టులో డారెన్ బ్రావో (59) టాప్ స్కోరర్. బ్రావో, చార్లెస్ (42) మినహా ఇతర బ్యాట్స్మెన్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కరీబియన్లకు ఆరంభంలోనే షాక్ తగిలింది. విండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ రెండో బంతికే సున్నా చుట్టేశాడు. గేల్ను భువనేశ్వర్ రనౌట్ చేశాడు. ఆ తర్వాత బ్రావో, చార్లెస్ కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినా ఇతర బ్యాట్స్ మెన్ క్రీజులో నిలవలేకపోయారు. జడేజా, రైనా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు టాపార్డర్ పనిపట్టారు. దీంతో విండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 49వ ఓవర్లో రాంపాల్ ను అశ్విన్ అవుట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది.