
మర్ఖమ్ (కెనడా): యువ షట్లర్ లక్ష్య సేన్ చెలరేగినా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. మిక్స్డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–3తో దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్లో తనీషా–ధ్రువ్ జంట 22–20, 14–21, 12–21తో నా యున్ జియాంగ్–చాన్ వాంగ్ జోడీ చేతిలో ఓడింది. బాలుర సింగిల్స్లో ప్రపంచ మూడో ర్యాంకర్ లక్ష్యసేన్ 16–21, 21–18, 21–12తో జీ హూన్ చోయ్ పై నెగ్గి ఆధిక్యాన్ని 1–1తో సమం చేశాడు.
అనంతరం బాలుర డబుల్స్లో కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల జోడీ 21–19, 19–21, 11–21తో యాగ్ షిన్–చాన్ వాంగ్ చేతిలో ఓడింది. బాలికల సింగిల్స్లో మాళవిక 17–21, 12–21తో గా యున్ పార్క్ చేతిలో ఓడటంతో భారత్ పరాజయం ఖాయమైంది. క్వార్టర్ ఫైనల్లో ఓటమి అనంతరం 5 నుంచి 8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ 3–1తో డెన్మార్క్పై గెలిచి నేడు మలేసియాతో పోరుకు సిద్ధమైంది.