లేటు వయసులో రెచ్చిపోయారు | IPL 2015: veterans shine | Sakshi
Sakshi News home page

లేటు వయసులో రెచ్చిపోయారు

Published Mon, May 25 2015 6:22 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

IPL 2015: veterans shine

కోల్కతా: టీ-20 ఫార్మాట్లో సాధారణంగా కొత్త ముఖాలు,  యువ క్రికెటర్లు సత్తాచాటుతుంటారు. సీనియర్లు, అందులోనూ 35 ప్లస్ వయసులో ఉన్న ఆటగాళ్లు ఈ ఫార్మాట్ పెద్దగా రాణించలేరు. తాజాగా జరిగిన ఐపీఎల్-8లో వెటరన్లు దుమ్మురేపారు. వయసు అన్నది ఓ సంఖ్య మాత్రమే కానీ ఆటకు ప్రతికూలం కాదంటూ లేటు వయసులో అదరగొట్టారు.  ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపించారు.

 చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన 36 ఏళ్ల నెహ్రా 22 వికెట్లు పడగొట్టాడు. మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక 35 హర్భజన్ కూడా ఐపీఎల్ ప్రదర్శన ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చాడు. ముంబై తరపున బరిలో దిగిన బంతితో పాటు కొన్నిసార్లు బ్యాట్తో రెచ్చిపోయాడు.  ఈ సీజన్లో 18 వికెట్లు పడగొట్టిన భజ్జీ.. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించాడు. కోల్కతా బౌలర్ బ్రాడ్ హాగ్ లేటు వయసులో విజృంభించాడు. 44 ఏళ్ల ఈ ఆస్ట్రేలియా బౌలర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వయసు క్రికెటర్. ఆడిన ఆరు మ్యాచ్ల్లో 9 వికెట్లు తీశాడు. చెన్నైతో మ్యాచ్లో 4 వికెట్లు పడగొట్టాడు. చెన్నై ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ వెస్టిండీస్ ఆటగాడి వయసు 32 ఏళ్లు. ఢిల్లీ ప్లే ఆఫ్కు అర్హత సాధించకపోయినా ఆ జట్టు స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అద్భుతంగా రాణించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన 36 ఏళ్ల బౌలర్ 15 వికెట్లు తీశాడు.

ఈ సీజన్లో 4 సెంచరీలు నమోదు కాగా, ఈ నాలుగూ 30  ప్లస్ వయసు ఆటగాళ్లే బాదడం విశేషం. బెంగళూరు క్రికెటర్లు డివిల్లీర్స్ (31), క్రిస్ గేల్ (36), రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ (34), చెన్నై ఓపెనర్ మెకల్లమ్ (34) సెంచరీలతో కదంతొక్కారు. ఐపీఎల్-8లో అత్యధిక సిక్సర్లు (38) సంధించింది 36 ఏళ్ల గేల్ కావడం మరో విశేషం. డివిల్లీర్స్ 513, గేల్ 491, మెకల్లమ్ 436 పరుగులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement