
మన దేశంలో క్రికెటర్లకు ఉన్న ప్రేక్షకారాధన అంతాఇంత కాదు. వారి అభిమానులు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సచిన్ను ఆరాధించేవారైతే అతడిని ఓ మానవాతీత వ్యక్తిగానే భావిస్తారు. ఇలాంటి కోట్లాది మందిలో కేరళలోని కాలికట్లో ఉన్న మలబార్ క్రిస్టియన్ కళాశాల చరిత్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎంసీ వశిష్ట్ ఒకరు. అయితే, మాస్టర్ బ్యాట్స్మన్పై తన అభిమానాన్ని వశిష్ట్ అందరికంటే భిన్నంగా పుస్తక రూపంలో విశిష్టంగా చాటుకున్నారు.
సచిన్ రిటైరైన 2013లోనే తమ కళాశాలలో ‘సచిన్స్ గ్యాలరీ’ పేరిట అతడి ఘనతలు, విశేషాల వివరాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఇందులో సచిన్పై 11 (తెలుగు, మలయాళం, తమిళం, కన్నడం, ఒడియా, బెంగాలీ, అస్సామీ, మరాఠీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లిష్) భాషల్లో రూపొందించిన 60 పుస్తకాలుండటం గమనార్హం. ఇన్ని భాషల్లో సచిన్ లైబ్రరీ ఏర్పాటు వెనుక దేశ సమైక్యతకు క్రికెట్ ఏవిధంగా తోడ్పడుతుందో చాటే ఉద్దేశమూ ఉండటం అభినందించదగ్గ విషయం.