
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వచ్చే వన్డే వరల్డ్ కప్ ఆడతాడని గతేడాదే స్పష్టం చేసిన నాగ్పూర్కు చెందిన 'క్రికెట్ జ్యోతిష్కుడు' నరేంద్ర బుందే.. ఇక రానున్న కాలం విరాట్ కోహ్లిదేనని తాజాగా పేర్కొన్నారు. కోహ్లి క్రికెట్ కెరీర్లో చిరస్మరణీయమైన రికార్డులు సాధిస్తాడని నరేంద్ర బుందే తెలిపారు. సచిన్ వంద సెంచరీల రికార్డుతో పాటు, అనేక రికార్డులను కోహ్లి బద్ధలు కొడతాడన్నారు.
2025 నాటికి సచిన్ సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడని పేర్కొన్న నరేంద్ర.. టీ 20, వన్డే వరల్డ్ కప్లను కోహ్లి నేతృత్వంలోని భారత్ జట్టు గెలుస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం కోహ్లికి శుక్రగ్రహం బలంగా ఉన్న కారణంగా విదేశాల్లో కూడా అతనికి తిరుగుండదన్నారు. రాబోవు ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అద్బుతమైన ప్రదర్శన చేస్తుందనే ఈ సందర్బంగా నరేంద్ర బుందే పేర్కొన్నారు. మరొకవైపు ఈ ఏడాది కోహ్లికి ఊహించని అదృష్టం కలిసొస్తుందన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎవ్వరూ చేసుకోని ఒప్పందం కోహ్లికి దక్కనుందన్నారు.
గతంలో సచిన్ క్రికెట్లో పునరాగమనం చేస్తారని, భారతరత్న వరిస్తుందని చెప్పిన బుందే..గంగూలీ పునరాగమనం, భారత్ 2011 ప్రపంచకప్ విజయం గురించి కూడా చెప్పారు. అలాగే ధోని మరో రెండేళ్లు ఆడతాడని గత ఏడాది చెప్పిన బుందే.. అదే క్రమంలో వరల్డ్ కప్ కూడా ఆడతాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment