
చండీగఢ్: భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. డిసెంబర్ 1న ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని స్పోర్ట్స్ జోన్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. 1958 కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొన్నప్పటి మిల్కా ఫోజును పోలి ఈ విగ్రహం ఉంటుంది. తాను మరణించిన తర్వాత యువ అథ్లెట్లకు ఈ మైనపు బొమ్మ స్ఫూర్తిగా ఉంటుందని 85 ఏళ్ల మిల్కా సింగ్ అన్నారు.
‘ఇది చాలా గొప్ప విషయం. సమున్నత వ్యక్తుల మధ్య నా విగ్రహం కూడా ఉండబోతున్నందుకు గౌరవంగా ఉంది. ఈ చివరి దశలో మిల్కా సింగ్ మరికొన్నేళ్లు జీవించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే నేను మరణించాక ఈ విగ్రహం భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుంది’ అని మిల్కా అన్నారు.