
విజయం దిశగా కర్ణాటక
రెండో ఇన్నింగ్స్లో తమిళనాడు 113/3
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్
ముంబై: రంజీ ట్రోఫీ డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక టైటిల్ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 628 పరుగులు వెనుకబడిన తమిళనాడు మ్యాచ్ నాలుగో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ప్రస్తుతం మరో 515 పరుగులు వెనుకబడిన ఆ జట్టుకు చివరి రోజు ఓటమి తప్పకపోవచ్చు! ఒక వేళ ఆలౌట్ కాకపోయినా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా కర్ణాటక రంజీ విజేతగా నిలవడం ఖాయం. అంతకు ముందు 618/7 పరుగుల ఓవర్నైట్ స్కోరు తో ఆట ప్రారంభించిన కర్ణాటక తమ తొలి ఇన్నిం గ్స్లో 762 పరుగులకు ఆలౌట్ అయింది. రంజీ ఫైనల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. వినయ్ కుమార్ (319 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఒకే మ్యాచ్లో సెంచరీ, 5 వికెట్లు సాధించిన రెండో ఆటగాడు, తొలి కెప్టెన్గా వినయ్ నిలిచాడు. మరో వైపు రంజీ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా గుల్ మొహమ్మద్ (319) రికార్డును అధిగమించిన అనంతరం కరుణ్ నాయర్ (560 బంతుల్లో 328; 46 ఫోర్లు, 1 సిక్స్) నిష్ర్కమించాడు.