
సాక్షి, స్పోర్ట్స్: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు రికార్డుల రారాజు, క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ అరుదైన మైలురాయి అందుకున్నాడు. సెంచరీలకు మారు పేరైన సచిన్.. ఎవరికి సాధ్యంకాని తన 50వ టెస్టు సెంచరీని 2010 డిసెంబర్ 19న దక్షిణాఫ్రికాపై సాధించాడు. దక్షిణాఫ్రికాలోని సెంచురియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సచిన్ (111) శతకం బాది టెస్టుల్లో 50 సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్గా గుర్తింపు పొందాడు.
ఇక ఈ ఘనత నమోదై ఏడేళ్లైనప్పటికి.. ఎవరు ఈ రికార్డును అధిగమించలేకపోవడం విశేషం. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ను భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక రెండో టెస్టులో 87 పరుగులతో భారత్ గెలవడంతో సిరీస్ సమమైంది. నిర్ణయాత్మక మ్యాచ్ అయిన మూడో టెస్టులో సచిన్ మరో సెంచరీ (146) రాణించడంతో మ్యాచ్ డ్రా అయి భారత్ సిరీస్ను కాపాడుకోగలిగింది.
అన్ని ఫార్మట్లలో కలిపి సచిన్ 34,357 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 200 టెస్టుల్లో 15,921 పరుగులు.. 463 వన్డేల్లో 18,426 పరుగులు చేసిన సచిన్..ఏకైక టీ20 ఆడి 10 పరుగులు చేశాడు. వన్డే చరిత్రలో తొలి డబుల్ సెంచరీ, అన్నిఫార్మట్లలో 100 శతకాల వంటి చెరగని రికార్డులు మాస్టర్ పేరిట ఉన్నాయి. సచిన్ తన చివరి మ్యాచ్ను 2013లో వెస్టిండీస్పై ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment