కాన్పూర్:భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాంగ్రెస్ తరుపున ఎన్నికల్లో ప్రచారం చేయడని ఆ పార్టీ ఎంపీ, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున దిగ్గజ బ్యాట్స్ మన్ ప్రచారం చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. 'సచిన్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ముంబై తరుపున రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ లో పాల్గొంటాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అతను పాలు పంచుకుంటాడనే వార్తులు పూర్తిగా నిరాధారం' అని శుక్లా తెలిపాడు.
యూపీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సచిన్ ను రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతి ఫలంగా సచిన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు వార్తలొచ్చాయి. అయితే వీటిని శుక్లా కొట్టి పారేశారు.