
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో సత్తా చాటేందుకు అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియర్స్ సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో ఆమె సహచర ప్లేయర్లంతా టోర్నీలో పాల్గొనడంపై మల్లాగుల్లాలు పడుతుంటే... సెరెనా మాత్రం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళుతోంది. సన్నాహాల్లో భాగంగా ప్రాక్టీస్ నిమిత్తం ఆమె తన ఇంట్లోనే నూతన టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేసుకుంది. ఇప్పటివరకు యూఎస్ ఓపెన్ డెకో టర్ఫ్ కోర్టుపై జరుగగా... ఈసారి తొలిసారిగా లేకోల్డ్ కోర్టుపై జరుగనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోర్టు స్థితిగతులపై అనుభవం పొందేందుకు స్వయంగా లేకోల్డ్ టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేసుకున్న సెరెనా రెండు నెలలుగా అదే ఉపరితలంపై ప్రాక్టీస్ చేస్తోంది. 2018, 2019 యూఎస్ ఓపెన్ టోర్నీల్లో రన్నరప్గా నిలిచిన విలియమ్స్ ఈ సీజన్లో విజేతగా నిలిచి 24 గ్రాండ్స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేసేందుకు పట్టుదలతో ఉంది. ఆగస్టు 31న యూఎస్ ఓపెన్ మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment