
సిక్కి జంటకే డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన తెలంగాణ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి వరుసగా రెండో ఏడాది జాతీయ సీనియర్ చాంపియన్షిప్లో మహిళల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. చండీగఢ్లో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో సిక్కి రెడ్డికి మిశ్రమ ఫలితాలు లభించాయి. మహారాష్ట్ర అమ్మాయి ప్రద్న్యా గాద్రెతో బరిలోకి దిగిన సిక్కి రెడ్డి డబుల్స్ ఫైనల్లో 22-20, 21-18తో రెండో సీడ్ అపర్ణా బాలన్-ప్రజక్తా సావంత్ (పీఎస్పీబీ) జంటను ఓడించింది.
44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగినా కీలకదశలో సిక్కి జంట పైచేయి సాధించి టైటిల్ను ఖాయం చేసుకుంది. గతేడాది కూడా సిక్కి-ప్రద్న్యా జంటకే మహిళల డబుల్స్ టైటిల్ దక్కింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (పీఎస్పీబీ) ద్వయం 20-22, 20-22తో అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్ (పీఎస్పీబీ) జోడీ చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచింది.
సింగిల్స్ విభాగాల్లో ఇద్దరు కొత్త చాంపియన్లు అవతరించారు. అన్నదమ్ముల మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో తమ్ముడు సమీర్ వర్మ (ఎయిరిండియా) 21-16, 21-16తో అన్న సౌరభ్ వర్మ (పీఎస్పీబీ)పై గెలిచి తొలిసారి జాతీయ చాంపియన్గా నిలిచాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో పి.సి.తులసి (కేరళ) 21-9, 21-13తో టాప్ సీడ్ తాన్వీ లాడ్ (పీఎస్పీబీ)పై నెగ్గి మొదటిసారి జాతీయ విజేతగా నిలిచింది.