
డు ప్లెసిస్ మెరుపులు
జోహన్సెస్బర్గ్: మూడు ట్వంటీ 20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ డీ కాక్ దూకుడుకు తోడు, కెప్టెన్ డు ప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సఫారీలు భారీ స్కోరు నమోదు చేశారు. డీ కాక్ 28 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో ఇన్నింగ్స్ కు చక్కటి పునాది వేయగా, డు ప్లెసిస్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడి 79 పరుగులు సాధించాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఏబీ డివిలియర్స్(13) తొలి వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. కాగా, ఆ తరుణంలో డీకాక్, డుప్లెసిస్ జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే చెత్త బంతులను బౌండరీలు దాటించింది. ఈ జోడీ 65 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన అనంతరం డీ కాక్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. అయితే ఆ తరువాత వచ్చిన డుమినీ(14)స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరాడు. ఆపై గత మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ మిల్లర్(33 ;18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి తనదైన శైలిలో ఆడటంతో సఫారీల పరుగుల వేగం పెరిగింది. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు సాధించింది. తొలి టీ 20 లో ఆసీస్పై దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే.