ఠాకూర్ క్షమాపణలను అంగీకరించిన సుప్రీం
న్యూఢిల్లీ: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చెప్పిన బేషరతు క్షమాపణలను సుప్రీం కోర్టు శుక్రవారం అంగీకరించింది. కోర్డు సూచనల మేరకు ఠాకుర్ ‘ తప్పుడు సాక్ష్యం ఇవ్వాలనే ఉద్దేశం నాకెంతమాత్రం లేదు. అనుకోకుండా కొంత సమాచార లోపం కారణంగానే ఇదంతా జరిగింది. అందుకే ఎలాంటి సంకోచం లేకుండా స్పష్టంగా, బేషరతుగా కోర్టుకు క్షమాపణలు చెబుతున్నాను’ అని గురువారం తన అఫిడవిట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
అంతకు ముందు సుప్రీం కోర్టు లోధా ప్యానెల్ ప్రతిపాదనల అమలు విషయంలో తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేసినందుకు ఠాకూర్ పై సుప్రీం సీరియస్ అయింది. కోర్టు ధిక్కరణ కేసును తప్పించుకోవాలంటే భేషరతుగా మరోసారి క్షమాపణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని ఈనెల 7న ఆదేశించింది. బీసీసీఐ స్వయంప్రతిపత్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకుండా చూడాలంటూ 2016, ఆగస్టులో ఠాకూర్ ఐసీసీకి లేఖ రాశారు. అయితే ఈ విషయంలో తాను ఎవరికీ లేఖ రాయలేదని నాడు కోర్టుకు తప్పుడు అఫిడవిట్ అందించారు.