
ధోని నిలబడ్డాడు.. కానీ
ఇండోర్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పేలవంగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కీలక వికెట్లను వరుసగా చేజార్చుకుని కష్టాల్లో పడింది. 40 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడిన టీమిండియాను కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆదుకున్నాడు. ధోని (40), భువనేశ్వర్ కుమార్ (14) కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. ప్రస్తుతం ధోనికి తోడుగా హర్భజన్ సింగ్(0) క్రీజ్ లో ఉన్నాడు.
అంతకుముందు టాపార్డర్లో రహానె (51) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ధోనీసేన ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 3 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (3) రబడా బౌలింగ్లో బౌల్డవయ్యాడు. ఆ తర్వాత ధవన్, రహానె జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. కాసేపటి తర్వాత ధవన్(23).. మోర్కెల్ బౌలింగ్లో అవుటవడంతో టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. విరాట్ కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపో్యాడు. జట్టు స్కోరు 82 పరుగుల వద్ద కోహ్లీ (12) రనౌటయ్యాడు. క్రీజులో కుదురుకున్న రహానె కూడా హాఫ్ సెంచరీ చేసిన వెంటనే.. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఇక రైనా రావడం ఆలస్యమన్నట్టు ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు. అక్షర్ పటేల్ (13).. స్టెయిన్ బౌలింగ్లో విక్కెట్ల ముందు దొరికిపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్, మోర్కెల్ లకు తలో రెండు వికెట్లు లభించగా, స్టెయిన్ రబడాలకు చెరో వికెట్ దక్కింది.