![vishnu couple fight for gold medal](/styles/webp/s3/article_images/2017/09/24/vishnu.jpg.webp?itok=yV1UK5in)
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో విష్ణువర్ధన్–ప్రార్థన తొంబారే (భారత్) ద్వయం 7–6 (7/4), 7–6 (8/6)తో సన్జార్ ఫెజీవ్–ఆరీనా ఫోల్ట్స్ (ఉజ్బెకిస్తాన్) జోడీపై నెగ్గి ఫైనల్కు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో నటనన్ కద్చాపనాన్–నిచా లెర్ట్పితాక్సిన్చాయ్ (థాయ్లాండ్) జంటతో విష్ణు–ప్రార్థన ద్వయం తలపడుతుంది.
మరోవైపు షార్ట్ కోర్స్ స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బటర్ఫ్లయ్ ఈవెంట్లో సజన్ ప్రకాశ్ రజత పతకాన్ని సాధించాడు. మహిళల బెల్ట్ రెజ్లింగ్లో దివ్య (70 కేజీలు), ప్రతీక్ష (75 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. బిలియర్డ్స్ ఈవెంట్లో సౌరవ్ కొఠారి ఫైనల్కు చేరాడు. సెమీస్లో సౌరవ్ 3–0తో థవత్ (థాయ్లాండ్)పై నెగ్గాడు.