
భారత్ అలవోకగా...
తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా
7 వికెట్లతో బంగ్లాదేశ్ చిత్తు
రాణించిన రహానే, ఉతప్ప
మిర్పూర్: సీనియర్లు లేకపోయినా... జట్టులో సత్తాకు కొదవ లేదని భారత యువ ఆటగాళ్లు నిరూపించారు. సమష్టి ప్రదర్శనతో బంగ్లా పర్యటనలో శుభారంభం చేశారు. ఆదివారం ఇక్కడి షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో రైనా బృందం 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.
కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (63 బంతుల్లో 59; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షకీబ్ అల్ హసన్ (58 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... అనాముల్ హక్ (60 బంతుల్లో 44; 7 ఫోర్లు), మహ్ముదుల్లా (44 బంతుల్లో 41; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ స్కోరు 16.4 ఓవర్లలో 100 పరుగులకు చేరిన దశలో భారీ వర్షం కురిసి మ్యాచ్కు చాలా సమయం పాటు అంతరాయం కలిగింది. ఆ తర్వాత డక్వర్త్ లూయీస్ నిబంధన ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 26 ఓవర్లలో 150 పరుగులుగా నిర్ణయించారు.
టీమిండియా 24.5 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అజింక్య రహానే (70 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్కు 99 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే మంగళవారం జరుగుతుంది.
రసూల్కు అవకాశం...
ఈ మ్యాచ్తో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశారు. ఆల్రౌండర్ పర్వేజ్ రసూల్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్లకు ఆ అవకాశం దక్కింది. జమ్మూ కాశ్మీర్ తరఫున భారత్కు ఆడిన తొలి క్రికెటర్గా రసూల్ చరిత్ర సృష్టించాడు. మరోవైపు రాబిన్ ఉతప్ప ఆరేళ్ల విరామం తర్వాత భారత్ తరఫున వన్డే ఆడటం విశేషం.
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) సాహా (బి) యాదవ్ 0; అనాముల్ (సి) రాయుడు (బి) రసూల్ 44; మోమినుల్ (సి) సాహా (బి) యాదవ్ 6; ముష్ఫికర్ (సి) రహానే (బి) రసూల్ 59; షకీబ్ (సి) అండ్ (బి) రైనా 52; మహ్ముదుల్లా (బి) మిశ్రా 41; నాసిర్ (సి) రహానే (బి) మిశ్రా 22; జియావుర్ (సి) రైనా (బి) యాదవ్ 2; మొర్తజా (బి) పటేల్ 18; రజాక్ (నాటౌట్) 16; అల్ అమీన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 272
వికెట్ల పతనం: 1-5; 2-35; 3-87; 4-134; 5-199; 6-229; 7-234; 8-235; 9-267.
బౌలింగ్: మోహిత్ శర్మ 5.4-1-23-0; ఉమేశ్ యాదవ్ 9-0-48-3; ఉతప్ప 0.2-0-0-0; అక్షర్ పటేల్ 10-0-59-1; మిశ్రా 10-0-55-2; రసూల్ 10-0-60-2; రైనా 5-0-24-1.
భారత్ ఇన్నింగ్స్: ఉతప్ప (ఎల్బీ) (బి) షకీబ్ 50; రహానే (సి) జియావుర్ (బి) మొర్తజా 64; పుజారా (ఎల్బీ) (బి) షకీబ్ 0; రాయుడు (నాటౌట్) 16; రైనా (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 8; మొత్తం (24.5 ఓవర్లలో 3 వికెట్లకు) 153
వికెట్ల పతనం: 1-99; 2-100; 3-135.
బౌలింగ్: మొర్తజా 5-0-25-1; అల్ అమీన్ 5-0-32-0; షకీబ్ 6-0-27-2; రజాక్ 5-0-34-0; జియావుర్ 1-0-9-0; మహ్ముదుల్లా 2.5-0-26-0.