సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ విధానసభ ఎన్నికలను కమలదళం....అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ ఎన్నికలో సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. అభ్యర్థులను ప్రకటించడం మినహా ఎన్నికలకు సంబంధించి అన్ని సన్నాహాలు చేసిన ఆ పార్టీ విజయంకోసం పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల సలహాలతో స్థానిక నాయకత్వం ఎన్నికల వ్యూహాన్ని రూపొందిస్తోందని అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోందని అంటున్నారు. విజయావశాశాలు గల నేతలకే టికెట్ ఇస్తారని చెబుతున్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించినట్లుగానే ఇక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభజనంతో గెలవాలని బీజేపీ ఆశిస్తోంది. దీంతోపాటు ఢిల్లీ కోసం మోదీ సర్కారు ఇటీవల చే పట్టిన చర్యలను వివరించి ఓట్లు అడగాలని భావిస్తోంది.
అనధికార కాలనీలకు చట్టబద్ధత కల్పించడం, నగరంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరచడం కోసం మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, సిక్కు అల్లర్ల బాధితులకు నష్టపరిహారం అందించడం, ఈ-రిక్షాలకు చట్టబద్ధత కల్పించడం వంటి చర్యలను ప్రధానంగా ప్రచారం చేయాలని ఆ పార్టీ యోచిస్తోంది. ఇంటింటికి ప్రచారంపై దృష్టి సారించాలంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలను ఆదేశించింది. ఏ ఒక్క ఇంటినీ విడిచిపెట్టరాదని, ప్రతి ఓటరును కలవాలలని ఆదేశించింది.బూత్స్థాయిలో ఎన్నికల ప్రచార బాధ్యతల నిర్వహణ కోసం 150 మంది సభ్యులతో ఓ కమిటీని కూడా నియమించింది. దళితులు, గ్రామీణులు, అనధికార కాలనీ వాసులు, మహిళలు... ఇలా అన్నివర్గ్గాల ఓటర్లను ఆక ట్టుకోవడానికి కమలదళం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఒక్కో వర్గాన్ని ఆకట్టుకునే బాధ్యతను నగరానికి చెందిన ఏడుగురు ఎంపీలకు అప్పగించింది. ప్రభుత్వ ఉద్యోగులలో నెలకొన్న అనుమానాలను నివృత్తి అంశానికి ప్రాధాన్యమివ్వనుంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రభుత్వోద్యోగులలో బీజేపీపట్ల వ్యతిరేకతకు దారితీయవచ్చని కొందరు అంటున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడం కోసం ఇటీవల ర్యాలీలో ప్రధానమంత్రి మోదీ పదవీ విరమణ వయసును తగ్గించే యోచన లేదని ప్రకటించారు. యువతను ఆకట్టుకోవడం 100 మందితో కూడిన బీజేపీ ఐటీ విభాగం... సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గ డ్కారీ, వెంకయ్యనాయుడు,జేపీ నడ్డా, పీయూష్గోయల్ , సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీలు పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోనున్నారు. ఎన్నికల ప్రచారం పాల్గొనాలంటూ హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్ ముఖ్యమంత్రులను కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎన్నికల ర్యాలీలో పాలుపంచుకోనున్నారు. ఢిల్లీకి చెందిన కేంద్ర మంత్రి డా. హర్షవర్ధన్కు కూడా ఎన్నికల బాధ్యతలను అప్పగించినప్పటికీ గతంలో మాదిరిగా ఆయన ఈసారి కీలకపాత్ర పోషించబోరని అంటున్నారు.
విధానసభ ఎన్నికలకు పకడ్బందీ వ్యూహం
Published Tue, Jan 13 2015 10:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement