
కాటేసిన కనుపాప
- కూతురిపై ఆరునెలలుగా అఘాయిత్యం
- కోలారు జిల్లాలో కీచక తండ్రి అరెస్టు
- నిందితుడు తిరుమలలో టీ వ్యాపారి
కేజీఎఫ్ (కర్ణాటక): కోలారు జిల్లాలో ఘోరం వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిని చెరబట్టాడు. బంగారుపేట తాలూకా బేతమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతంపల్లి గ్రామంలో ఇది చోటు చేసుకుంది. నీచ కృత్యానికి పాల్పడిన తండ్రి భాస్కర్ (36)ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, భాస్కర్కు ఏడవ తరగతి చదివే 14 సంవత్సరాల కూతురు ఉంది. గత ఆరు నెలల నుంచి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరించి అత్యాచారం చేస్తున్నాడు.
తిరుమల కొండపై టీ వ్యాపారం చేసే భాస్కర్ కొద్దిరోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలో ఫుల్లుగా తాగి కూతురని కూడా చూడకుండా అకృత్యానికి పాల్పడేవాడు. విషయం భార్యకు తెలిసినా పరువు పోతుందని మౌనంగా ఉండిపోయింది. ఆదివారం యథా ప్రకారం తిరుమల నుంచి వచ్చిన కామాంధుడు మద్యంమత్తులో బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగు వచ్చి బాలికను రక్షించి కీచకుణ్ని పోలీసులకు అప్పగించారు. భార్య ఫిర్యాదు మేరకు బేతమంగళ పోలీసులు నిందితునిపై పోక్సో చట్టం కింద నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.