'కేసీఆర్ మనసున్న మారాజు'
వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. బడ్జెట్లో సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలకు, సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. మంగళవారం ఉదయం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమంతో పాటు మానవ వనరులు, రైతులు, రాష్ర్టా సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ను రూపొందించారని తెలిపారు. నాలుగో విడత రైతు రుణమాఫీ కోసం రూ. 4 వేల కోట్లు కేటాయించామన్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా వ్యవసాయ రంగానికి రూ.35 వేల కోట్లు కేటాయించామని వివరించారు.
ప్రతిపక్షాలు ఇచ్చే మంచి సూచనలను ప్రజల అభివృద్ధి కోసం పరిగణలోకి తీసుకుంటామన్నారు. త్వరలో వరంగల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభించబోతున్నామని తెలిపారు. విద్యాశాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామన్నారు. విశ్వ విద్యాలయాల్లో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించామని వివరించారు. ఎస్సీల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను వారికే కేటాయించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. తెలంగాణ బడ్జెట్ అత్యంత అద్బుతమైన బడ్జెట్ అని కొనియాడారు. మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని కితాబిచ్చారు.