
12న వైఎస్సార్ సీపీలో చేరుతున్నా: దుర్గేష్
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్... వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నెల 12న వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు దుర్గేష్ ప్రకటించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు కృషి చేస్తానని, అందుకే వైఎస్సార్ సీపీలో చేరుతున్నానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు 2014 మార్చిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క నియోజకవర్గంలోనూ విజయం సాధించలేకపోయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీ-బీజేపీ కూటమిని దీటుగా ఎదుర్కొని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ జనగళాన్ని సమర్థవంతంగా విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు వైస్సార్ సీపీవైపు ఆకర్షితులవుతున్నారు.