
లాటరీ ఉచ్చులో ఖాకీ
- అక్రమ దందా కింగ్పిన్తో పోలీసులకు సంబంధాలు!
- రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న లాటరీ వ్యవహారం
- ముఖ్యమంత్రితో భేటీ అయిన హోం శాఖ కార్యదర్శి
- ప్రభుత్వాన్నే రద్దు చేయండి: హెచ్.డి.కుమారస్వామి
సాక్షి, బెంగళూరు : అక్రమంగా నిర్వహిస్తోన్న సింగిల్ డిజిట్ లాటరీల దందా రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలనే సృష్టిస్తోంది. ఈ దందాలో ఉన్నత స్థాయిలోని పోలీసు అధికారులు సైతం భాగస్వాములయ్యారనే వార్త లు కలకలం సృష్టిస్తున్నాయి. అక్రమ లాటరీల దందాలో కింగ్పిన్గా వ్యవహరించిన పారిరాజన్కు పోలీసు విభాగంలోని ఉన్నత స్థాయి అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు విభాగంలో కలకలం రేగుతోంది. ఈ విషయంపై విచారణ చేపట్టిన సీఐడీ కూడా ధ్రువీకరించింది. అక్రమ లాటరీల దందాలో కొంతమంది పోలీసు ఉన్నత అధికారులకు సంబంధాలున్నాయని మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందించింది. దీంతో ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వాన్నే కుదిపేసే స్థాయికి చేరుకుంది.
సిద్ధరామయ్య ఆరా
సీఐడీ నుంచి మధ్యంతర నివేదికను తెప్పించుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ దందాలో ఏయే అధికారులు భాగస్వామ్యులయ్యారే అంశంపై ఆరా తీస్తున్నారు. అక్రమ లాటరీల దందాలో రాష్ట్రానికి చెందిన ఓ ఐజీపీ, ఏడీజీపీతో పాటు కొంతమంది ఎస్పీ స్థాయి అధికారులు సైత ం భాగస్వామ్యులయ్యారని సీఐడీ తన మధ్యంతర నివేదికలో తేల్చినట్లు సమాచారం. ఇక కేజీఎఫ్కు చెందిన పారిరాజన్ను ఇప్పటికే ఎక్సైజ్, లాటరీ నిషేధ దళం అధికారులు సంయుక్తంగా దాడి చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న పారిరాజన్ నుంచి మరింత మంది పేర్లను సేకరించే దిశగా సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సీఐడీ తన మధ్యంతర నివేదికను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అందజేసిన నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి ఎస్.కె.పట్నాయక్ సిద్ధరామయ్యతో భేటీ అయ్యా రు. శనివారం సాయంత్రం బెంగళూరులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో ఎస్.కె.పట్నాయక్, సీఎం సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు. అక్రమ లాటరీల దందా విషయంపై చర్చించారు.
ప్రభుత్వాన్నే రద్దు చేయండి
ఈ నేపథ్యంలో శాంతిభ ద్రతల రక్షణలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి గవర్నర్ను కోరారు. శనివా రం బెంగళూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని ఆమ్ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.
అదనపు కమిషనర్ సస్పెన్షన్
సింగిల్ డిజిట్ లాటరీతో సంబంధం ఉందనే ఆరోపణలపై పశ్చిమ విభా గం అదనపు కమిషనర్ అలోక్కుమార్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం పొద్దుపోయిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధ్రువీకరించారు. ఉత్తర్వులు తన చేతికి అందేంతవరకూ ఈ విషయంపై స్పందించబోనని అలోక్కుమార్ మీడియాతో పేర్కొన్నారు.