
సాక్షి, బెంగళూరు: దేశంలో స్టార్టప్లకు అనువైన ప్రాంతంగా బెంగళూరు పేరుగాంచింది. అందరం కలిసి దేశానికి స్టార్టప్ రాజధానిగా బెంగళూరును మార్చాలి’ అని రాష్ట్ర ఐటీ బీటీ,పర్యాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే పిలుపునిచ్చారు. ప్యాలెస్ మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన సేంద్రియ, చిరుధాన్యాల
అంతర్జాతీయ వాణిజ్య మేళా–2018 ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో మంత్రి ప్రియాంక్ ఖర్గే, వ్యవసాయ మంత్రి క్రిష్ణబైరే తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఖర్గే మాట్లాడుతూ అగ్రి బిజినెస్ స్టార్టప్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. క్రిష్ణబైరే మాట్లాడుతూ వ్యవసాయ స్టార్టప్ల కోసం ఇకపై రూ. 10 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. దీనిద్వారా రై తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. ఐటీ స్టార్టప్ల్తో పాటు అగ్రి స్టార్టప్లకు బెంగళూరును కేంద్రంగా మలచాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొన్ని అగ్రిబిజినెస్ స్టార్టప్లకు నిధులను అందజేశారు. సుమారు 44 స్టార్టప్ కంపెనీలు నిధులను అందుకున్నాయి.
2.10 లక్షల మంది సందర్శకులు
సుమారు 2.10 లక్షల మంది మేళాను సందర్శించారు. ఈ వాణిజ్య మేళా ద్వారా రైతులు, దేశీయ, విదేశీ వ్యాపారులు, వినియోగదారులు ఒకే వేదికపైకి రాగలిగారు. 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో చిరుధాన్యాల ప్రదర్శన జరిగింది. 357 స్టాళ్లు ఇందులో తమ ప్రదర్శనలను సందర్శకులు, వినియోగదారుల నిమిత్తం ప్రదర్శనకు ఉంచాయి. రాష్ట్రం నలుమూలల నుంచి 14 రైతు సంఘాల సమాఖ్యలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. మేళా ద్వారా సుమారు రూ. 107 కోట్ల వ్యాపారం జరిగింది.