
నిరుద్యోగులకు తెలంగాణలోనూ అన్యాయమే
టీజేఏసీ చైర్మన్ కోదండరాం
కూసుమంచి(పాలేరు): తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలో జరుగుతున్న తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేయడమే తన అభి మతమన్నారు.
ప్రభుత్వంలోని కొందరు తాము లక్ష ఉద్యోగాలు ఇస్తాం కానీ అవకాశం ఉన్నప్పుడు అని ప్రకటించటం పద్ధతికాదన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎంను కలిశారా అని విలేకరులు ప్రశ్నించగా.. సీఎంను కలవడమంటే దేవుడికి ఉత్తరం రాసినట్లేనని చమత్కరించారు. కొత్తగా రాజకీయ పార్టీ పెడుతున్నారనే వదంతులపై స్పందిస్తూ.. ‘నేను దీనిపై ఆలోచించలేదు. ఏదైనా ఉంటే మీడియాకు చెబుతా’అని ముగించారు.