
హైదరాబాద్ : ప్రజా పోరాటాలపై రాజ్యహింస, ఎన్కౌంటర్ హత్యలకు వ్యతిరేకంగా ఈ నెల 28న ఖమ్మంలో అమరుల బంధుమిత్రులసంఘం ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించనున్నట్లు విరసం నేత వరవరరావు తెలిపారు. హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో బుధవారం జరిగిన పోస్టర్ ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్చి 2న ఛత్తీస్ఘడ్లోని పూజారి పరా– కాంకేర్ (తడపలగుట్ట) ఎన్కౌంటర్లో అమరులైన 10 మంది విప్లవకారుల సంస్మరణ సభను ఈ నెల 28న ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో ‘విప్లవోద్యమంలో ఆదివాసీ మహిళల పాత్ర’అంశంపై సామాజిక కార్యకర్త సోనిసోరి, కాత్యాయని విద్మహే (ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక) మాట్లాడతారని చెప్పారు.