
సాక్షి, హైదరాబాద్: గురుకుల సొసైటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీఓఈ) కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు తెరలేచింది. జేఈఈ, నీట్, ఎయిమ్స్, ఎంసెట్, క్లాట్, సీఏ–సీపీటీ తదితర పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఈ కాలేజీల్లో 2020–21 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ నెల 28 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై డిసెంబర్ 20తో ముగియనుంది. రాత పరీక్ష ద్వారా అర్హులను గుర్తించనున్నారు.
పదో తరగతి చదివే వారికే: సీఓఈ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులే అర్హులు. గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పదో తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ సొసైటీలో సీటు పొందాలనుకుంటున్నారనే అంశాన్ని పరిశీలించుకుని https://www.ts wreis.in, http://www.tgtwgurukulam.telangana.gov.inలో వివరాలు నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 28 కాలేజీలు, ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో 17 కాలేజీలున్నాయి. ఒక్కో కాలేజీలో 40 సీట్లుంటాయి. మొత్తంగా 1,800 సీట్లకు ప్రవేశాలు చేపట్టే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. కాలేజీల వివరాలు, రిజర్వేషన్లు, పరీక్ష విధానం తదితర సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపర్చారు.
Comments
Please login to add a commentAdd a comment