
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు జీతాలు ఇవ్వని మీడియా సంస్థలకు ప్రభుత్వ పరంగా ప్రకటనలను నిలిపివేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. ఈ మేరకు మండలిలో ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది రూ.వందల కోట్ల ప్రకటనలు మీడియా సంస్థలకు ఇస్తున్నప్పటికీ చాలా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు సిబ్బందికి సరిగ్గా జీతాలు ఇవ్వటం లేదని తెలిపారు.
ప్రభుత్వం ప్రకటనల డబ్బులు మీడియా సంస్థలకు కాకుండా నేరుగా జర్నలిస్టులకు జీతం కింద ఇవ్వాలని వివరించారు. మరో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు వేతనం విషయంలో భద్రత ఉండాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని అన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమాధానం ఇస్తూ.. జర్నలిస్టుల కోసం ఇప్పటివరకు రూ.30 కోట్లు ఇచ్చామని, వచ్చే బడ్జెట్లో మరో రూ.30 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో చర్చిస్తామని తుమ్మల అన్నారు.