
బిజీబిజీ
జెడ్పీకి ఎలక్షన్ ఫీవర్...
పాత ఫైళ్లను తిరగేస్తున్న అధికారులు
సెక్షన్లను విభజించి బాధ్యతలను అప్పగించిన సీఈఓ
జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డీపీఓ సురేశ్బాబు
ఎంపీటీసీ ఎన్నికలకు మండలానికో రిటర్నింగ్ అధికారి
అసిస్టెంట్, అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీఓ, ఎమ్మార్వోలు
అర్ధరాత్రి వరకు సాగిన కలెక్టర్ సమీక్ష
ఇందూరు,న్యూస్లైన్:
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు బిజీ అయిపోయారు. ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేనందున జిల్లా పరిషత్ అధికారులు, ఉద్యోగులు గత ఎన్నికలకు సంబంధించిన ఫైళ్లను వెతికి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే ఎన్నికల పక్రియను సజావుగా పూర్తి చేసేందుకు కలెక్టర్ అనుమతితో జెడ్పీ సీఈఓ రాజారాం జిల్లా పరిషత్లోని ఉద్యోగులకు సెక్షన్ల వారీగా విభజించి బాధ్యతలను అప్పగించారు. వారితో ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.
సిబ్బంది శాఖ సంబంధిత పనులను దాదాపుగా పక్కన పెట్టి ఎన్నికల పనుల్లో లీనమైపోయారు. జెడ్పీలో ప్రత్యేకంగా ఎన్నికల విభాగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన అధికారులు ఈ నెల 10న అన్ని మండల కార్యాలయా ల్లో, గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించారు. మరో రెండు రోజుల్లో పూర్తి ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ల జాబితాను తయారు చేయగా 12న వాటి ముసాయిదా జాబి తాను మండల కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. 13న వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, 15న తుది పోలింగ్ ష్టేషన్ల జాబితాను అధికారి కంగా ప్రకటిస్తారు. కాగా జెడ్పీటీసీ ఎన్నికలకు తెలు పు, ఎంపీటీసీ ఎన్నికలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను ముద్రించాడానికి గాను 20 మెట్రిక్ టన్ను ల పేపర్ను జిల్లా పరిషత్లో సిద్ధంగా ఉంచారు.
రిటర్నింగ్ అధికారిగా డీపీఓ
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఒక రోజులోనే అధికారుల నియామకం వేగవంతంగా పూర్తయింది. జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి సురేశ్బాబును నియమిస్తూ జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జెడ్పీటీసీ నామినేషన్లు జిల్లాపరిషత్లోనే స్వీకరించే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగా అనువభం, అందులో పంచాయతీ రాజ్ శాఖ కు చెందిన అధికారి కావడంతో డీపీఓకు రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలను అప్పగించారు. జెడ్పీటీసీ ఎన్నికల అసిస్టెంట్, అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీఓ, ఎమ్మార్వోలను నియమించారు. ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ప్రస్తుతం మండల ప్రత్యేకాధికారులుగా పని చేస్తున్న వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలను అప్పగించారు. వారు పనిచేసే మండలాల్లోనే విధులను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ జారీ చేశారు. అలాగే ఒకటవ అసిస్టెంట్, రెండవ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియమిం చారు. ఈ నెల 17వ తేదీ నుంచి జెడ్పీటీసీ నామినేషన్లను జిల్లా పరిషత్లో, ఎంపీటీసీ నామినేషన్లను మండల కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు.
అర్ధరాత్రి వరకు కలెక్టర్ సమీక్ష
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు తన చాంబర్లో జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్బాబులతో పాటు ఇతర సంబంధిత అధికారులతో సమీక్షిం చారు. ఏకదాటిగా మూడు గంటలకు పైగా ప్రతీ విషయంపై క్షుణ్ణంగా చర్చించి, పలు ఆదేశాలు, సూచనలు చేశారు. రాత్రికి రాత్రే రిటర్నింగ్, అసిస్టెంట్, అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల జాబితాను సిద్ధం చేశారు. అర్ధరాత్రి వరకు కలెక్టర్ అధికారులతో సమీక్షించడం ఇదే మొదటి సారి. అధికారులు కూడా ఓపికతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.