
సాక్షి, హైదరాబాద్: కాలుష్యరహితంగా తక్కువ ఖర్చులో విద్యుత్ఉత్పత్తి చేసే విధానాన్ని కనుగొన్న తమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం అందించాలని ఫ్లైవీల్ పవర్ మల్టిప్లికేషన్ ఎండీ భాస్కర శ్రీనివాస్ చాగంటి అన్నారు. ‘రూరల్ ఇన్నోవేటర్స్ స్టార్టప్ కాంక్లేవ్’లో పవర్ సెక్టార్లో జాతీయస్థాయిలో బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డును శనివారం ఎన్ఐఆర్డీలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి నుంచి అందుకున్నారు.
ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజలకు చౌకగా, కాలుష్యరహిత విద్యుత్ అందించాలనే ఈ ఆవిష్కరణ కోసం శ్రమించినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా ఉపయోగించని ‘ఫ్లైవీల్ పవర్ జనరేషన్’సాంకేతికతను రెండున్నర దశాబ్దాలపాటు తాను, తన భార్య చాగంటి బాల పరిశోధించి దీనిని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఇలాంటి సాంకేతికత దేశంలో ఎక్కడా లేదనేది కేంద్ర విద్యుత్ శాఖ, నీతి ఆయోగ్, డీఆర్డీవో, రైల్వే తదితర శాఖలు కితాబిచ్చినట్లు తెలిపారు.