Power generation
-
సోలార్ విద్యుత్ @100 గిగావాట్లు
న్యూఢిల్లీ: సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది.‘‘గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ దార్శనిక నాయకత్వంలో భారత్ చరిత్రాత్మక 100 గిగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని సాధించింది. పరిశుద్ధమైన, పర్యావరణ అనుకూల భవిష్యత్ కోసం విశ్రమించని మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ పెట్టారు. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని కేంద్ర సర్కారు లక్ష్యాన్ని విధించుకోగా, ఇందులో 100 మెగావాట్లు సోలార్ ద్వారా సమకూర్చుకోవాలన్నది ప్రణాళిక. కానీ, కరోనా విపత్తు, ఆ సమయంలో లాక్డౌన్లతో లక్ష్యం చేరిక రెండేళ్లు ఆలస్యమవడం గమనార్హం. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మోదీ సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ‘‘సోలార్ ప్యానెళ్లు, సోలార్ పార్క్లు, రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టులు విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి. ఫలితమే నేడు భారత్ 100 గిగావాట్ల సోలార్ ఇంధన లక్ష్యాన్ని సాధించింది. పర్యావరణ అనుకూల ఇంధనంలో భారత్ స్వీయ సామర్థ్యాలపై ఆధారపడడమే కాకుండా, ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపిస్తోంది’’అని ప్రహ్లాద్జోషి పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం ప్రతి ఇంటికి శుద్ధ ఇంధనాన్ని అందిస్తుందన్నారు. పదేళ్లలో చేరిక 2014 నాటికి దేశంలో సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 2.82 గిగావాట్లుగానే ఉండగా, పదేళ్లలో 100 గిగావాట్లను చేరుకోవడం విశేషం. 2025 జనవరి 31 నాటికి స్థాపిత సోలార్ సామర్థ్యం 100.33 గిగావాట్లు అయితే, మరో 84.10 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు దశలో ఉంది. మరో 47.49 గిగావాట్లు టెండర్ దశలో ఉండడం గమనార్హం. కేవలం 2024లోనే 24.5 గిగావాట్ల సామర్థ్యం కొత్తగా అందుబాటులోకి వచి్చంది. మరోవైపు 2014 నాటికి దేశంలో కేవలం 2 గిగావాట్ల సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం ఉంటే, 2024 నాటికి 60 గిగావాట్లకు చేరుకుంది. -
శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నాపట్టించుకోరా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన తాగు, సాగు నీటి అవసరాలు ఉన్నప్పుడే బోర్డు కేటాయించిన నీటిని ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ తరలించాలన్నది విభజన చట్టం, కృష్ణా బోర్డు పెట్టిన నిబంధన. కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను తుంగలో తొక్కుతోంది. దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేకున్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,300 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దాంతో ప్రాజెక్టులో నీటి మట్టం 874.4 అడుగులకు తగ్గిపోయింది. నీటి నిల్వ 160.91 టీఎంసీలకు పడిపోయింది. ఇదే కొనసాగితే శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు దిగువకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకొనే అవకాశం ఉండదు. తద్వారా రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లందించలేని దుస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో రైతులు, నీటి పారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆయకట్టులో పంటలు ఎండిపోతాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.తెలంగాణను నిలువరించని ప్రభుత్వంకృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను 2014లో తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టిన పాపం ఇప్పటికీ వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు కృష్ణా జలాలను తరలిస్తోంది. సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులకు అడ్డుపడుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం 2021లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించి వివాదానికి తెర దించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికీ తెలంగాణ మోకాలడ్డుతుండటంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి 2023లో రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, స్పిల్ వే సగం అంటే 13 గేట్లను ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నా కూటమి ప్రభుత్వం నిలువరించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర హక్కులు తెలంగాణకు తాకట్టువిభజన తర్వాత 2014లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులలో శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తన భూభాగంలో ఉందంటూ తెలంగాణ సర్కారు అప్పట్లో దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, సాగర్ స్పిల్ వేలో 13 గేట్లను నాటి చంద్రబాబు సర్కారు స్వాధీనం చేసుకోలేదు. తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలనే రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను అప్పట్లోనే సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. -
రక్తం తాగే గబ్బిలం..పరుగెడుతోంది మన కోసం..
గబ్బిలాలు అంటేనే కాస్త జలదరింపు.. అందులోనూ రక్తం తాగే గబ్బిలాలు ఇవి. వాటి పేరే ‘వాంపైర్ (రక్తపిశాచి) బ్యాట్స్’.. కానీ అవి మన కోసం పరుగెడుతున్నాయి.. పగలు, రాత్రి తేడా లేకుండా, అవసరమైనప్పుడల్లా ట్రెడ్మిల్పై పరుగెడుతున్నాయి.. ఇదేంటి రక్తపిశాచి గబ్బిలమేంటి? మన కోసం ట్రెడ్మిల్పై పరుగెత్తడమేంటి? అని డౌట్ వస్తోందా.. ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం.. ఓ పరిశోధనలో భాగం.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..ఆహార అలవాటే కీలకం..సాధారణంగా జంతువులు, కీటకాలు వేటికైనా ప్రొటీన్లు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు (షుగర్స్) వంటి అన్ని పోషకాలు ఉండే ఆహారం కావాల్సిందే. లేకుంటే అవి ఆరోగ్యంగా ఉండవు. బతకవు కూడా. శరీరంలో వివిధ జీవక్రియలు సరిగా సాగాలంటే.. వేర్వేరు పోషకాలు తప్పనిసరికావడమే దీనికి కారణం. కానీ వాంపైర్ గబ్బిలాలు చాలా చిత్రం. అవి కేవలం జంతువుల రక్తం మాత్రమే తాగుతూ బతికేస్తుంటాయి. అలా ఎలా జీవించ గలుగుతున్నాయన్నది తేల్చేందుకు టొరొంటో స్కార్బోరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.ట్రెడ్మిల్పై పరుగుపెట్టించడం ఎందుకు? సాధారణంగా జంతువులు కదలడానికి, వేటాడటానికి, తినడానికి.. ఇలా అన్నింటికీ శక్తి అవసరం. చాలా వరకు కార్బోహైడ్రేట్లు (షుగర్స్), కొవ్వుల నుంచే అవి శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. శాఖాహార, మాంసాహార జంతువులకు అవి తినే ఆహారం నుంచి ఇవి అందుతాయి. కానీ రక్తంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అతి తక్కువ... ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలే ఎక్కువ. కేవలం వీటితోనే వాంపైర్ గబ్బిలాలు ఎలా శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాయన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇందుకోసం జంతువుల రక్తంలో.. కాస్త రసాయన మార్పులు చేసిన అమైనో యాసిడ్లు కలిపి గబ్బిలాలకు తాగించారు. తర్వాత వాటిని చిన్నపాటి ట్రెడ్మిల్పై నిమిషానికి 10, 20, 30 మీటర్ల వేగంతో పరుగులు పెట్టించారు. ఆ సమయంలో వాటి శరీరంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతోంది, ఏ ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు.. ఏరకంగా జీర్ణం అవుతున్నాయన్నది పరిశీలించారు.దీనివల్ల మనకేంటి లాభం? సాధారణంగా జంతువుల్లో వివిధ రకాల ప్రొటీన్లు, ఎంజైమ్లు ఉత్పత్తికావడానికి, అవయవాలు సరిగా పనిచేయడానికి అమైనో ఆమ్లాలు అవసరం. కానీ వాంపైర్ గబ్బిలాలు అమైనో ఆమ్లాలను నేరుగా శక్తి ఉత్పత్తి కోసం వాడుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వాటిని అత్యంత వేగంగా జీర్ణం చేసుకుంటున్నట్టు తేల్చారు. దీన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తే.. క్షీరదాలు భౌతికంగా ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా శరీరంలో, ఆహారంలో చేసుకునే మార్పులను గుర్తించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కెన్నెత్ వెల్చ్ తెలిపారు. మనలో జీర్ణ వ్యవస్థ లోపాలను సరిదిద్దడం, సమస్యలకు ఔషధాల రూపకల్పన, పోషకాహార లోపానికి చేపట్టాల్సిన చర్యలు వంటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని వెల్లడించారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
పరిశ్రమ పరుగులు
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్లో 3.1 శాతం వృద్ధిని (2023 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఆగస్టు సూచీలో వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు సూచీని సమీక్షా నెల్లో వృద్ధి బాటన నిలబెట్టాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం... మైనింగ్ రంగం 0.2 శాతం పురోగమించింది. మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 3.9 శాతం వృద్ధిని సాధించింది.విద్యుత్ ఉత్పత్తి 0.5 శాతం ఎగసింది. ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.3 శాతం, విద్యుత్ ఉత్పత్తి 3.7 శాతం క్షీణించగా, తయారీ రంగం కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. కాగా తాజా సమీక్షా నెల్లో భారీ యంత్ర పరికరాల డిమాండ్కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 2.8 శాతంగా ఉంది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యింది. ఆరు నెలల్లో 4 శాతం వృద్ధి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ 4 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. -
హైడల్.. పవర్ ఫుల్
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఈ ఏడాది జలవిద్యుత్ ఆదుకుంది. కృష్ణా పరీవాహకంలోని ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు నిరంతర వరద కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది (2024–25)లో 4,050 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుదుత్పత్తి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) అంచనా వేసింది. ఇప్పటికే 3,828.52 ఎంయూల ఉత్పత్తి జరిగింది. కృష్ణా పరీవాహకానికితోడు గోదావరి పరిధిలోని సింగూరు, నిజాంసాగర్, పోచంపాడు జలాశయాల్లో ప్రస్తుతం గరిష్ట నీటిమట్టం మేరకు నిల్వలుండగా, ఎగువ నుంచి ఇంకా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం కృష్ణా జలాశయాల్లో 584.1, గోదావరి జలాశయాల్లో 137.5 కలిపి మొత్తం 721.6 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ నిల్వలతో మరో 2,206 ఎంయూల జలవిద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 6,034 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి అవకాశముంది. దిగివచ్చిన జలవిద్యుత్ ధరలుతెలంగాణ పరిధిలో 2,442 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రాలుండగా, అందులో 2,324 మెగావాట్ల వాటాను మన రాష్ట్రం కలిగి ఉంది. వీటికి సంబంధించిన విద్యుత్ ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం 2024–25లో రూ.1,129 కోట్లు అవుతుందని డిస్కంలు అంచనా వేశాయి. విద్యుదుత్పత్తి జరిగినా, జరగకపోయినా జెన్కోకు ఈ మేరకు ఫిక్స్డ్ ధర వ్యయాన్ని డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. తీవ్ర వర్షాభావంతో గతేడాది(2023–24) 830 ఎంయూల జలవిద్యుదుత్పత్తి మాత్రమే జరిగింది.జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్ ఫిక్స్డ్ ధర 2022–23లో యూనిట్కు రూ.2.32 ఉండగా, 2023–24లో ఉత్పత్తి తగ్గడంతో రూ.8.51కు పెరిగింది. దీంతో డిస్కంలు తీవ్రంగా నష్టపోయాయి. డిస్కంల సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగి యూనిట్కు రూ.5.72కు చేరడానికి కారణమైంది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 2.69 శాతం అధికం. ఈ ఏడాది 6000 ఎంయూలకు పైగా జలవిద్యుదుత్పత్తి జరిగే అవకాశాలుండడంతో మళ్లీ వాటి ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం గణనీయంగా తగ్గనుంది. యూనిట్కు కేవలం రూ.1.9 పైసల ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం అవుతుందని అంచనా. జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్కు ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. వెరియబుల్ కాస్ట్ ఉండదు. మొత్తంగా రూ.1129 కోట్ల వ్యయానికే 6,000 ఎంయూల జలవిద్యుత్ లభించనుంది. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఇది భారీ ఊరటతోపాటు వినియోగదారులకు భవిష్యత్లో విద్యుత్ చార్జీల పెంపు, ట్రూ అప్ చార్జీల వసూళ్ల నుంచి కొంత వరకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో అత్యధికంగా 2021–22లో 5,371 ఎంయూలు, ఆ తర్వాత 2022–23లో 5,741 ఎంయూల జలవిద్యుదుత్పత్తి అయ్యింది. మరమ్మతులు జరగక..459 ఎంయూల విద్యుదుత్పత్తికి గండి రాష్ట్రంలో మొత్తం 2,442 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాలుండగా, సుదీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో మొత్తంగా 301.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరగడం లేదు. మొత్తం జలవిద్యుదుత్పత్తి సామర్థ్యంలో 12.35 శాతం నిరుపయోగంగా మారింది. ఒకవేళ వీటికి సకాలంలో మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించి ఉంటే పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు 2,442 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి చేసుకోవడానికి ఈ ఏడాది అవకాశముండేది మరమ్మతులు జరపకపోవడంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 459 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి గండిపడింది. యూనిట్కు అత్యల్పంగా రూ.2.5 ధరతో లెక్కించినా సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా. పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరిగి ఉంటే ఇప్పటి వరకు మొత్తం 4,287 ఎంయూలకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరిగి వార్షిక లక్ష్యాన్ని దాటిపోయేది. -
బయటపడ్డ నాగార్జునసాగర్ జెన్ కో అధికారుల నిర్లక్ష్యం
-
నాగార్జునసాగర్లో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం
సాక్షి, నల్లగొండ జిల్లా: జెన్కో అధికారుల తీరుతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి భారీ అంతరాయం ఏర్పడింది. ఎనిమిది యూనిట్లలో కేవలం ఏడింటిలోనే విద్యుదుత్పత్తి జరుగుతోంది. రెండో యూనిట్ పనిచేయడం లేదు. ఏడాది క్రితం రెండో యూనిట్ రోటర్ స్పైడర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. అయినా నేటికి మరమ్మతులు చేయించకపోవడంతో రెండున్నర నెలలుగా విద్యుదుత్పత్తికి అంతరాయం కలుగుతోంది. మొత్తం ఎనిమిది యూనిట్లలో ఒక్కో యూనిట్లో ప్రతి రోజూ 100 మెగా వాట్ల ఉత్పత్తి జరుగుతుంది. 75 రోజులుగా సాగర్లో ఉత్పత్తి కొనసాగుతుండగా.. ఒక్కో రోజు 100 మెగా వాట్ల చొప్పున 750 మెగా వాట్ల నష్టం వాటిల్లుతోంది. అయినా మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సాగర్ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్న సమయంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ నుంచి సాంకేతిక పరికరాలు రావాలని అధికారులు సమాధానం చెప్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. -
‘విద్యుత్’కు రోల్మోడల్గా రాష్ట్రం
సాక్షి, పెద్దపల్లి: విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ విషయంలో తెలంగాణను దేశంలోనే రోల్మోడల్గా నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. 2030 నాటికి ఉండే డిమాండ్ను అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజీ తదితర రంగాల్లో దాదాపు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం, పెద్దపల్లిలో ఐటీ శాఖమంత్రి శ్రీధర్బాబుతో కలిసి భట్టి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం నిర్వహించిన బహిరంగ సభల్లో భట్టి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద 30 గ్రామాలను ఎంపిక చేసి, అక్కడ వ్యవసాయ మోటార్లకు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. తద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రైతులు వ్యవసాయ రంగానికి ఉపయోగించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని చెప్పారు. ఇందులో భాగంగా నందిమేడారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోలార్ పవర్ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాలోని కాచాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, అక్కడ అందుబాటులో ఉన్న 12 ఎకరాలు సేకరించి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను డిప్యూటీ సీఎం ఆదేశించారు.రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే భూమిపూజ చేస్తామని తెలిపారు. దశాబ్దానికి పైగా పెండింగ్లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్య పరిష్కారానికి ప్రజాప్రభుత్వం పరిష్కారం చూపించి, వారి ఖాతాల్లో రూ.18 కోట్లు జమ చేయడం సంతోషంగా ఉందన్నారు. పదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నేతలు.. రుణమాఫీపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేలు బజారున పడటం బాధ కలిగించింది ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారంపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ.. బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారునపడి కొట్లాడుకోవడం బాధ కలిగించిందని భట్టి అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల తగాదా వెనుక కాంగ్రెస్ పెద్ద తలకాయ ఉందని బీజేపీ ఆరోపించడం అర్థరహితమని పేర్కొన్నారు. కాగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘యాదాద్రి’లో డిసెంబర్లోగా విద్యుదుత్పత్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని అన్ని యూనిట్ల (ఐదు)లో విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రా రంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నా రు. మిగతా రెండు యూనిట్లలో మార్చి 31 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. బుధవారం మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ఆయన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనుల పురోగతిపై అ«ధికారులతో సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు.. మార్చి 31కి విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు సివిల్ పనులతోపాటు రైల్వే లైన్, రోడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు భట్టి చెప్పారు. బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇదే వేగంతో ప్రాజెక్టు పనులు పూర్తిచేసి యూనిట్ విద్యుత్తును రూ.6.35కు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు భూనిర్వాసితులకు భూసేకరణ నిధులతోపాటు, ప్రాజెక్టులో ఉద్యోగాలు కలి్పస్తామని, ఇచి్చన మాట ప్రకారం వారి కుటుంబాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. 2015 జూన్ 8న థర్మల్ పవర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన జరగ్గా, 2017 అక్టోబర్లో పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 నాటికి మూడు యూనిట్లు పూర్తి చేయాలని చేయాల్సి ఉన్నా.. చేయలేదన్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడిందని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమేనని మండిపడ్డారు. గత ప్రభుత్వం 50 శాతం దేశీయ బొగ్గును, 50 శాతం విదేశీ బొగ్గును వినియోగించాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా నూటికి నూరు శాతం దేశీయ బొగ్గును వినియోగించిందని, దీంతో పర్యావరణ వేత్తలు కేసు వేశారన్నారు. అందువల్లే ఎన్జీటీ క్లియరెన్స్ను సస్పెండ్ చేసిందని వివరించారు. అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే ఆలస్యమయ్యేది కాదని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్జీటీ క్లియరెన్స్ను తీసుకోవడంతోపాటు, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తద్వారానే ఆయిల్ సింక్రనైజేషన్ చేసే స్జేజీకి తెచి్చనట్లు పేర్కొన్నారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ పనులను గత ప్రభుత్వం ఆలస్యం చేసిందని, తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పనులను పూర్తి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జెన్కో ఎండీ రోనాల్డ్ రోస్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు. -
వరద కాలువలోనూ ‘విద్యుదుత్పత్తి’ చేయాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మిగులు జలాలను సది్వనియోగం చేసుకునే లక్ష్యంతో వరద కాలువ నిర్మాణం చేపట్టారు. ఈ కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మిడ్మానేరుకు నీటిని తరలిస్తారు. వరద కాలువ సామర్థ్యం 22 వేల క్యూసెక్కులు. 2010 నుంచి దీని ద్వారా మిడ్మానేరుకు నీటిని వదులుతున్నారు. గతంలో ఒక సీజన్లో అత్యధికంగా 56 వేల క్యూసెక్కుల నీటిని సైతం వదిలారు. ఈ కాలువ వద్ద పంప్హౌస్ నిర్మాణం చేస్తే 90 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటి ఆధారంగా 4 టర్బైన్లతో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించారు. ఈ కాకతీయ కాలువ సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు. ఒక్కో టర్బైన్ నుంచి 2,200 క్యూసెక్కుల నీటి ద్వారా 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 4 టర్బైన్ల ద్వారా 8,800 క్యూసెక్కుల నీటితో 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అయితే 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే వరద కాలువ నుంచి సైతం విద్యుదుత్పత్తి చేసే విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. 13 ఏళ్లుగా వరద కాలువ ద్వారా ప్రతి సంవత్సరం నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో గరిష్టంగా వరద కాలువ ద్వారా ఒక సీజన్లో 56 టీఎంసీల నీటిని విడుదల చేసిన సందర్భంగా కూడా ఉంది.ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా చేస్తున్న విద్యుదుత్పత్తికి మూడు రెట్లు ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది. కాకతీయ కాలువ టర్బైన్లతో పోలిస్తే వరద కాలువకు ఇలాంటి 10 టర్బైన్లు నిర్మించే అవకాశాలున్నాయి. శ్రీరాంసాగర్ జలాశయంలో పూడిక పేరుకుపోతుండడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. దీంతో గత పదేళ్లుగా 42 వరద గేట్లును ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. మరోవైపు వరద కాలువ ద్వారా కూడా నీటిని మిడ్మానేరుకు విడుదల చేస్తున్నారు. ఎగువ మహారాష్ట్ర నుంచి ప్రతిఏటా భారీగా వరద నీరు వస్తోంది. భవిష్యత్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వరదకాలువ వద్ద పంప్హౌస్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్తో వరద కాలువ ద్వారా నీటిని శ్రీరాంసాగర్ జలాశయంలోకి తరలించారు. కాగా 1,091 అడుగుల పూర్తి నీటిమట్టం ఉన్న ఎస్సారెస్పీకి 1,075 అడుగుల మేర నీటిమట్టం చేరగానే వరద కాలువ ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. -
ఇంత సోమరితనమా?
సాక్షి, హైదరాబాద్: ‘జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతుల నిర్వహణలో ఎందుకంత కాలయాపన చేశారు? ఇంత సోమరిగా ఉంటే.. మిమ్మల్ని కొనసాగించాల్సిన అవసరం ప్రభు త్వానికి లేదు’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు ఉధృతంగా వరదలు కొనసాగుతున్నా, జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకోలేకపోతున్నామని మండిపడ్డారు.జలవి ద్యుత్ కేంద్రాలకు సత్వరం మరమ్మతులు నిర్వ హించి, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయి లో పునరుద్ధరించాలని ఆదేశించారు. ‘జలకళ ఉన్నా హై‘డల్’’అనే శీర్షికతో ఈ నెల 7న సాక్షిలో ప్రచురించిన కథనంపై స్పందిస్తూ శనివారం ఆయన ప్రజాభవన్లో జెన్కో డైరెక్టర్లు, సీఈలతో సమీక్ష నిర్వహించారు. ఎగువ జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు నిర్వహించకపోవడంతో.. వరదల సమయంలో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేసుకొనే అవకాశం చేజారిపోయిందనే అంశాన్ని ఈ కథనం ఎత్తిచూపింది. మనసుపెట్టి పనిచేయండి.. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సమీక్షలో ప్రస్తావిస్తూ.. జెన్కో ఉన్నతాధికారుల పనితీరుపై ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతతో, మనసుపెట్టి పనిచేయాలని, నిర్లక్ష్యానికి, అలసత్వానికి తావు ఉండరాదని హెచ్చరించారు. శ్రీశైలం, జూరాల తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మర మ్మతుల విషయంలో గతంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో, వరదలు వస్తున్నా పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసుకోలేక పోతున్నా మని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇలాంటి జాప్యం పునరావృతం కారాదని ఆదేశించారు. విద్యుదు త్పత్తి కేంద్రాల పనితీరు, ఉత్పాదకతపై వారాని కోసారి తనకు నివేదికలను సమర్పించాలని ఆదే శించారు. విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య లు ఏర్పడినా తక్షణమే ఇంధన శాఖ ముఖ్య కార్య దర్శి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరా రు. విద్యుత్ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహి ంచే చీఫ్ ఇంజనీర్ల నుంచి రాతపూర్వకంగా వివర ణ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరా యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘విద్యుత్’ అంటే నిరంతరం పనిచేయాల్సిన శాఖ.. విద్యుత్ శాఖలో ఉద్యోగమంటే నిరంతరం పని చేయాల్సిన అత్యవసర శాఖలో విధులు నిర్వర్తి స్తున్నామనే అంశాన్ని అన్ని స్థాయిల్లోని అధికా రులు, ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలని భట్టి అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా నని భరోసా ఇచ్చారు. అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 17 రోజుల విద్యుదుత్పత్తికి సరిప డా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఇంధన శాఖ ఇన్చార్జి ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్కో డైరెక్టర్లు అజయ్, వెంకటరాజం, లక్ష్మయ్య తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
క్లీన్ ఎనర్జీకి బడ్జెట్లో ప్రతిపాదనలు.. ఎవరికి లాభమంటే..
దేశీయంగా చిన్న, మధ్య తరహా న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతామని బడ్జెట్ సమావేశాల్లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. 2070 నాటికి జీరో ఉద్గారాలతో క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేయాలని సూచించారు. భారతీయ మార్కెట్పై దృష్టి సారించే విదేశీ కంపెనీలు ఈ రంగంలో అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన ‘భారత్ స్మాల్ రియాక్టర్లు’, ‘భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల’కు సమీప భవిష్యత్తులో చాలా గిరాకీ ఏర్పడుతుందంటున్నారు. బడ్జెట్లో ప్రకటించిన విధంగా న్యూక్లియర్ టెక్నాలజీలో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉంచుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కార్బన్ నిర్మూలన ప్రణాళికల్లో భాగంగా అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 1000 MWe(మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కెపాసిటీ) సామర్థ్యం ఉన్న సంప్రదాయ అణు కర్మాగారాలు భారీ ఇంజినీరింగ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. భద్రతా సమస్యల కారణంగా భూమి లభ్యత, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇదీ చదవండి: కేంద్ర మంత్రుల జీతాలకు కేటాయింపులుఇదిలాఉండగా, వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ప్రకారం 300 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం ఉండే వాటిని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లగా నిర్వచించారు. వీటిని ఏర్పాటు చేసేందుకు తక్కువ సమయమే పడుతుంది. వీటి ద్వారా వచ్చే విద్యుత్తును సులభంగా సరఫరా చేయవచ్చు. మాడ్యులర్ డిజైన్ ప్లాంట్లను రిమోట్ ఏరియాల్లో నిర్మించేలా అనుమతులు కూడా త్వరితగతినే లభిస్తాయి. అందుకే ప్రభుత్వం బడ్జెట్లో ఈమేరకు ప్రతిపాదనలు చేసినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రియాక్టర్ల నిర్మాణం, ఇంజినీరింగ్ టెక్నాలజీ, విద్యుత్ పరికరాలు, భద్రత సేవలందించే సంస్థలు ప్రభుత్వ నిర్ణయంతో లాభపడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అంతలో వెళ్లమని.. ఇంతలో ఆగమని..
సాక్షి, హైదరాబాద్: రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతపై రాజకీయ రగడ జరుగుతోంది. 1971లో 62.5 మెగావాట్ల విద్యుదుత్పత్తితో ప్రారంభమైన ఈ విద్యుత్ కేంద్రం జీవితకాలం ఎప్పుడో ముగిసింది. అయినా మరమ్మతులు చేస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. సాంకేతిక సమస్యలతో గత నెల 4వ తేదీ నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇకపై మరమ్మతులు చేసినా ఫలితం ఉండదనే భావనకు జెన్కో వచ్చింది. అక్కడున్న 65 మంది ఇంజనీర్లు, 230 మంది అపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓ అండ్ ఎం) సిబ్బంది, మరో 40 మంది అకౌంట్స్, పీఎంజీ విభాగాల్లో పనిచేస్తుండగా, జూన్ 4 నుంచి వీరికి పనిలేకుండా పోయింది. అక్కడి సబ్స్టేషన్, ఇతర అత్యవసర వ్యవస్థల నిర్వహణకు అవసరమైన సిబ్బంది మినహా మిగిలిన ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాలకు బదిలీ చేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది.తొలిదఫాలో 44 మంది ఇంజనీర్లు, నలుగురు కెమిస్ట్లను నిర్మాణదశలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డెప్యూటేషన్పై బదిలీ చేస్తూ గత నెలలో జెన్కో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే ఒత్తిడితో రెండురోజులకే ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు నెలకు రూ.4 కోట్లకు పైగా వ్యయం అవుతుండగా, ఉత్పత్తి నిలిచిపోయి ఉద్యోగులందరూ ఖాళీగా ఉండడంతో జెన్కోకు ఆర్థికంగా భారంగా మారింది. కొత్త విద్యుత్ కేంద్రంనిర్మించే వరకు వారిని అక్కడే కొనసాగించాలని ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్టు చర్చ జరుగుతుండగా, కొత్త కేంద్రం నిర్మాణానికి 4 నుంచి 8 ఏళ్లు పట్టనుందని జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నా...రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ భారంగా మారినా స్థానికంగా వస్తున్న రాజకీయ ఒత్తిళ్లతో గత ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నారు. 2019 మార్చి 31లోగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) గతంలో ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో గడువును 2029 వరకు పొడిగించింది. 62.5 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి జరగడం లేదు. గరిష్టంగా 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, అధిక బొగ్గు వినియోగిస్తుండడంతో ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదు. కాలుష్యం సైతం అనుమతించిన స్థాయికి మించి జరుగుతోంది. దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చు చేసి బయటి నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతులు నిర్వహిస్తే 15 రోజుల్లో ఉత్పత్తిని ప్రారంభించి మరికొన్ని రోజుల పాటు నెట్టుకు రావొచ్చని, పూర్తిస్థాయిలో మరమ్మతుల నిర్వహ ణకు కనీసం రూ.30కోట్లకు పైగా ఖర్చు అవుతుందని జెన్కో వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా ఎంత కాలం పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి నెల కొంది. ఈ నేపథ్యంలో జెన్కో ఆర్థిక ప్రయోజనాల రీత్యా ఈ విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయక తప్పని పరిస్థితి నెలకొంది. ‘సూపర్ క్రిటికల్’ నిర్మాణ బాధ్యతపై జెన్కో అభ్యంతరంరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో అక్కడే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జెన్కో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. కొత్త విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ఆధ్వ ర్యంలోనే నిర్మించాలని కోరుతున్నారు. వాస్తవా నికి నైజాం ప్రభుత్వం 1931లో రామగుండంలో ఏ–థర్మల్, బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణా నికి 3000 ఎకరాలు కేటాయించింది. ఏ– థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గతంలోనే మూసివే యగా, ఇందుకు సంబంధించిన స్థలంలో దాదాపు 1200 ఎకరాలను 90వ దశకం మధ్యలో బీపీఎల్ అనే సంస్థకు కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక బీ–థర్మల్ కేంద్రానికి దాదాపు 700 ఎకరాల స్థలం ఉండగా, కబ్జాలు పోగా 550 ఎకరాలే మిగిలాయి. 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఈ స్థలం సరిపోదు. బీపీఎల్కు కేటాయించిన స్థలంలో కొంత స్థలాన్ని జెన్కోకు అప్పగిస్తే కొత్త విద్యుత్ కేంద్రం నిర్మించుకుంటామని జెన్కో ఉద్యోగులు కోరుతున్నారు. -
భారీ పెట్టుబడులకు అదానీ రెడీ
అహ్మదాబాద్: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ పునరుత్పాదక (రెన్యువబుల్స్ౖ) విద్యుదుత్పత్తిపై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. 2030కల్లా 40 గిగావాట్ల (జీడబ్ల్యూ) పునరుత్పాదక సామర్థ్యాన్ని నిర్మించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తద్వారా 2050కల్లా వివిధ బిజినెస్లలో నికరంగా కర్బనరహితం(నెట్ జీరో)గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గ్రూప్ పునరుత్పాదక(సౌర, పవన) విద్యుత్లో 10 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇకపై ప్రతీ ఏడాది 6–7 జీడబ్ల్యూను జత చేసుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా 50 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఒక్కో మెగావాట్కు రూ. 5 కోట్ల పెట్టుబడుల అంచనాతో మదింపు చేస్తే 2030కల్లా రూ. 2 లక్షల కోట్లను వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ వెల్లడించారు. వీటితోపాటు 5 జీడబ్ల్యూ పంప్ స్టోరేజీ సామర్థ్యా న్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో అమిత్ సింగ్ తెలిపారు. విద్యుత్కు అధిక డిమాండ్ నెలకొనే రాత్రి వేళల్లో విద్యుదుత్పత్తికి వీలుగా స్టోరేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. కార్బన్ క్రెడిట్స్.. రెన్యువబుల్ సామర్థ్యాల వినియోగం ద్వారా లభించే కార్బన్ క్రెడిట్స్కుతోడు మరికొన్ని ఇతర చర్యల ద్వారా 2050కల్లా అదానీ గ్రూప్ నెట్ జీరోకు చేరనున్నట్లు అమిత్ పేర్కొన్నారు. గతేడాది(2023–24) అదానీ గ్రీన్ ఎనర్జీ 2.8 జీడబ్ల్యూ సామర్థ్యాలను జత చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 6 జీడబ్ల్యూ సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదానీ గ్రూప్ ఈ ఏడాది (2024–25) వివిధ విభాగాలపై భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించింది. వివిధ కంపెనీలలో రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది. -
ఏపీలో ‘థర్మల్’ ధగధగ
నాడు రాష్ట్రంలో విద్యుత్తు కోతలు... పారిశ్రావిుక రంగంలో వెతలు, జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, విద్యుత్తు కార్యాలయాల ముందు ధర్నాలు. రాత్రీ, పగలూ ఒకటే యాతన. ఇటు వ్యవసాయ రంగం, అటు పారిశ్రామిక రంగం కుదేలు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల కష్టాలు చెప్పనవసరం లేదు. పవర్ హాలీడేలతో నరక యాతనే. నేడు కరెంటు కష్టాలు లేవు...కోతలు అసలే లేవు. జనంలో అప్పటి మాదిరిగా ఆగ్రహోద్వేగాల జాడే లేదు. పారిశ్రామికం, వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆయా రంగాల్లో ఉత్పత్తి భేషుగ్గా నమోదవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకుల మోముల్లో దరహాసం కనిపిస్తోంది. దీనికి కారణం సీఎం జగన్ తీసుకున్న చర్యలు.. దూర దృష్టి. సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు ఫలితంగా రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విద్యుత్ వెలుగులీనుతోంది. విద్యుదుత్పత్తికి ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడానికి జగన్ ముందు చూపే కారణం. చంద్రబాబు హయాంలో ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు సామరŠాధ్యనికి తగ్గట్టుగా విద్యుత్ను ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉండేవి. అవే ప్లాంట్లు జగన్ పాలనలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అదనపు సామరŠాధ్యన్ని జోడించుకుని పురోగతిని సాధించాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో దాదాపు 45 శాతం ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్టుల నుంచే సమకూరుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాçßæమే ప్రధాన కారణం. అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని ఆ రంగ నిపుణులే చెబుతున్నారు. గత ప్రభుత్వ అసమర్థత శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో రూ.8,432 కోట్ల అంచనా వ్యయంతో స్టేజ్ 1ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, 2012లో ఒక యూనిట్ 800 మెగావాట్లు, 2013లో మరో 800 మెగావాట్ల యూనిట్ను పూర్తి చేయాలని నిర్ధేశించారు. కానీ అలా జరగలేదు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నడిచే మొదటి ప్రాజెక్ట్ ఇది. విదేశీ తయారీదారుల నుంచి సాంకేతికతను బదిలీ చేయడంలో అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్ట్ ప్రారంభించడంలో జాప్యం చోటుచేసుకుంది. తర్వాత అంచనా వ్యయం రూ.12,230 కోట్లకు పెంచారు. అయితే స్టేజ్ 1 నిర్మాణం కోసం తీసుకున్న రూ.12942.28 కోట్ల అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. అవన్నీ కలిపి మొత్తంగా రూ.20 వేల కోట్లకు చేరాయి. వీటిలో గత ప్రభుత్వం అసమర్ధత కారణంగా రూ.4200 కోట్లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గుర్తించలేదు. అప్పులతోపాటు రూ.2106.75 కోట్ల నష్టాల్లోకి ప్లాంటు వెళ్లిపోయింది. జగన్ సర్కారు సమర్ధత అలాంటి ప్లాంటులో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి చేయూతనందించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు త్వరితగతిన పనులు పూర్తి చేయించి, గతేడాది మార్చిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగలేదు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణంపైనా దృష్టి సారించించారు. గతేడాది డిసెంబర్లో దానినీ అందుబాటులోకి తెచ్చారు. బొగ్గు కొరతకు చెక్ దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జగన్ సర్కారు ప్రణాళికలు అమలు చేస్తోంది. గతంలో ఒక్క రోజు నిల్వలకే అప్పటి ప్రభుత్వం నానా తంటాలు పడేది. ఉత్పత్తి లేక విద్యుత్ కోతలు విధించేది. ► ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు సమకూర్చుకుంటున్నాయి. ►సాధారణంగా 65 శాతం నుంచి 75 శాతం వరకు ఉండే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వద్ద 1000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ►ఈ మేరకు వీటీపీఎస్లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,12,350 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ►ఆర్టీపీపీలో 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తే అక్కడ 1,28,715 మెట్రిక్ టన్నులు తెచ్చి ఉంచారు. కృష్ణపట్నంలో 29 వేలు ఉత్పత్తికి వాడాల్సి ఉంటే 9,0971 మెట్రిక్ టన్నులు అందుబాటులో పెట్టారు. ►ఈ నిల్వలు వారం రోజుల వరకూ విద్యుత్ ఉత్పత్తికి సరిపోతాయి. బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ► కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతోపాటు, టెండర్ల ద్వారా విదేశీ బొగ్గును రప్పించుకుంటున్నాయి. ►శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ►ఇది కాకుండా థర్మల్ కేంద్రాలకు ఎంసీఎల్ నుంచి ఏటా 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకుంది. ►ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్సీసీఎల్లు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ)కు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. -
సౌర విద్యుత్లో ఏపీ ముందడుగు
సాక్షి, అమరావతి: మన రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ టాప్ 5 రాష్ట్రాల్లో స్థానం సంపాదించే దిశగా సాగుతోంది. సోలార్ వ్యర్థాలపై విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ ఈ నివేదిక రూపొందించింది. దేశంలో గతేడాది (2022–23లో) సుమారు 100 కిలో టన్నుల సౌర వ్యర్థాల ఉత్పత్తి జరిగిందని, 2030 నాటికి వీటి ఉత్పత్తి 600 కిలో టన్నులకు చేరుతుందని వెల్లడించింది. సౌర వ్యర్థాల్లో దాదాపు 67 శాతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనే సౌర విద్యుత్ ప్రాజెక్టులు భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. మన దేశంలో 2070 నాటికి కాలుష్యపూరితమైన కర్బన ఉద్గారాలను పూర్తిగా సున్నా స్థాయికి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 2030 నాటికి ఒక మిలియన్ టన్నుల కాలుష్యాన్ని వాతావరణం నుంచి పారద్రోలాలని రాష్ట్రాలకు చెప్పింది. ఇందులో భాగంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచుతోంది. మన దేశం 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకొంది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ ఇప్పటికే స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గించి ఆదర్శంగా నిలిచింది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో రాష్ట్రం 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి కూడా పెంచుతూ రాష్ట్రం టాప్ 5 రాష్ట్రాల్లో నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది. రీసైక్లింగ్ చేస్తే సరి వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం, తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరుల కారణంగా ప్రపంచం మొత్తం పునరుత్పాదక ఇంధనం వైపు దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 23 రెట్లు పెరిగింది. రానున్న ఆరేళ్లలో (2030 నాటికి) 292 గిగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యాన్ని పెంచాలనేది లక్ష్యం. అయితే సోలార్ మాడ్యూల్స్, ఫీల్డ్ నుండి వచ్చే వ్యర్థాలు ఓ సవాలుగా మారనున్నాయి. నిజానికి ఫోటో వాల్టాయిస్ (పీవీ)ల జీవిత కాలం 25 ఏళ్లు. ఆ తర్వాత అవి వ్యర్ధాలుగా మారతాయి. కాకపోతే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు కొన్ని పీవీలు పగిలిపోవచ్చు. కొంత కాలం తరువాత కొన్ని పనిచేయకపోవచ్చు. కొన్ని నాణ్యత పరీక్షల్లో విఫలమై పక్కన పడవచ్చు. రవాణా సమయంలో కొన్ని దెబ్బతింటాయి. అలాంటివి వ్యర్థాలుగా మారుతుంటాయి. ఈ మాడ్యూల్స్లో సిలికాన్, కాపర్, టెల్లూరియం, కాడ్మియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. దేశంలో ఇప్పుడున్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచే 2030 నాటికి సుమారు 340 కిలోటన్నుల వ్యర్ధాలు రావచ్చని అంచనా. ఈ వ్యర్ధాల్లో 10 టన్నుల సిలికాన్, 18 టన్నుల వెండి, 16 టన్నుల కాడ్మియం, టెల్లూరియం ఉంటాయి. కొత్తగా వచ్చే ప్రాజెక్టులతో కలిపి వ్యర్ధాలు 600 కిలోటన్నులకి చేరుకోవచ్చు. 2050 నాటికి దాదాపు 19,000 కిలో టన్నులకి పెరుగుతాయని అంచనా. వ్యర్ధాలను తొలగించడం కోసం రీసైక్లింగ్ వ్యవస్థలను ప్రోత్సహించడమే సరైన మార్గం. అంతేకాదు రసాయన ప్రక్రియల సహాయంతో రీసైక్లింగ్ చేస్తే వెండి, సిలికాన్ను కూడా తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
‘పునరుత్పాదక విద్యుత్’.. రెండో స్థానంలో ఏపీ
సాక్షి, విశాఖపట్నం: భారత్లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు లక్ష్యం (రెన్యువబుల్ పవర్ ఆబ్లిగేషన్ (ఆర్పీవో))లో 2021–22 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నెడ్క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ రమణారెడ్డి తెలిపారు. కర్ణాటక 41.3 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 28.5 శాతంతో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021–22 నాటికి ఆర్పీవో లక్ష్యాన్ని 21.18 శాతంగా నిర్దేశించగా ఏపీ దాన్ని అధిగవిుంచిందని వివరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), నెడ్క్యాప్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్లో క్లీన్ గ్రోత్ డ్రైవింగ్ పోర్ట్, ఎనర్జీ ఇంటెన్సివ్లో క్లీన్ ఇన్వెస్ట్మెంట్, కర్బన ఉద్గారాల నియంత్రణలో పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన పరిశ్రమల పాత్ర’ అనే అంశంపై శనివారం విశాఖలో సదస్సు జరిగింది. ఇందులో రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 9,008.78 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఈ రంగంలో దేశంలో ఐదో స్థానంలో నిలిచామని వివరించారు. ఇందులో సోలార్ పవర్ 38.50 గిగావాట్లు కాగా విండ్ పవర్ 44 గిగావాట్లు ఉందని తెలిపారు. దీంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ కింద 36.15 మెగావాట్లు, పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.97 మెగావాట్లు, చిన్న హైడ్రో ప్రాజెక్టుల నుంచి 106.80 మెగావాట్లు ఉత్పత్తి అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీ దేశానికే ఆదర్శం.. 2020లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పునరుత్పాదక విద్యుత్ ఎగుమతుల పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమణారెడ్డి తెలిపారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలోనూ రాష్ట్రం 37 శాతంతో దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 4,745.60 మెగావాట్ల సామర్థ్యంతో 8 ప్రాజెక్టులు నడుస్తున్నాయని చెప్పారు. మరో 3,260 మెగావాట్ల సామర్థ్యంతో 4 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అలాగే 2,350 మెగావాట్లతో 2 ప్రాజెక్టులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో, 59,357 మెగావాట్లతో 47 ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయని వివరించారు. ఈ మొత్తం 61 ప్రాజెక్టుల్లో 26,050 మెగావాట్ల సామర్థ్యంతో 23 ప్రాజెక్టులు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని తెలిపారు. పంప్డ్ హైడ్రో ఎలక్ట్రికల్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. 21 ప్రాంతాల్లో 16.18 గిగావాట్ల ఉత్పత్తికి, 37 ప్రాంతాల్లో 42.02 గిగావాట్ల ఉత్పత్తికి పీఎస్పీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రం పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులకు పూర్తి అనుకూలంగా ఉందన్నారు. కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుం బిగించింది.. ఈ సదస్సులో వర్చువల్గా పాల్గొన్న కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా.యువరాజ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ లైఫ్ కార్యక్రమం ద్వారా విద్యుత్ రంగంలో 51.3 శాతం, రవాణా రంగంలో 13.2 శాతం కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుంబిగించిందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా ఈ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా చేరుకోగలమని ఆకాంక్షించారు. 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. అదే ఏడాది నాటికి భారత్లో హైడ్రోజన్ డిమాండ్ 13 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందన్నారు. ఇది 2050 నాటికి 28 ఎంఎంటీ దాటుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. దానికనుగుణంగా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ ప్రదీప్ జె తారకన్, సీఐఐ చైర్మన్ డా.లక్ష్మీప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా, షాబాద్: రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో శుక్రవారం జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి డిమాండ్కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ను ఉత్పత్తిని చేస్తామన్నారు. విద్యుత్ రంగంపై గత ప్రభుత్వం రూ.81 వేల కోట్లకుపైగా అప్పుల భారం మోపిందని ఆయన విమర్శించారు. ఈ భారాన్ని అధిగమిస్తూ, విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని వెల్లడించారు. ఈ మేరకు సౌరశక్తి, పవనశక్తి, హైడెల్, చెత్త నుంచి తయారు చేసే కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలు తీరుస్తుందని చెప్పారు. చందనవెల్లి భూసేకరణలో అక్రమాలపై విచారణ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతాబాద్, చందనవెల్లి గ్రామాల్లో పరిశ్రమల కోసం చేసిన భూ సేకరణలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన భూ బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజమైన లబ్థిదారులకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. -
‘మాచ్ఖండ్’లో రికార్డుస్థాయి విద్యుత్ ఉత్పత్తి
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో 88.627 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. తరచూ జనరేటర్ల మరమ్మతులతో సతమతమయ్యే ఉద్యోగులు, ఏడాది కాలంగా తీవ్రంగా శ్రమించి ఈ ప్రాజెక్టును గాడిలో పెట్టారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యేలా ఈ ప్రాజెక్టులో ఆరు జనరేటర్లు ఉన్నాయి. మూడు జనరేటర్ల నుంచి 51 మెగావాట్లు, మరో మూడు జనరేటర్ల నుంచి 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 66 ఏళ్లుగా ఈ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి జరుగుతున్నా, పురాతన యంత్రాలు కావడంతో పూర్తి స్థాయి ఉత్పత్తి జరగలేదు. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే నీరు డుడుమ, జోలాపుట్టు జలశాయాల్లో ఉన్నప్పటికీ, తరచూ జనరేటర్ల మరమ్మతులతో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగలేదు. ఈ సమస్యలతో స్టేషన్ ఐదుసార్లు షట్డౌన్ అయ్యేసరికి దీనిపై ప్రాజెక్టు ఎస్ఈ, డీఈఈలు, ఏఈఈలు దృష్టి పెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో తీవ్రంగా శ్రమించి ప్రాజెక్టును గాడిలో పెట్టారు. దీని ఫలితమే గతేడాది డిసెంబరులో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత ఏడాది డిసెంబర్లో 88.627 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. గడచిన 25 ఏళ్లలో ఇదే అత్యధికం. గత ఏడాది జూన్ నెలలో 79.42 మిలియన్ యూనిట్లు, జూలైలో 84.75, ఆగస్టులో 86.275, సెప్టెంబర్లో 69.54, అక్టోబర్లో 86.58, నవంబర్లో 82.62, డిసెంబర్లో 88.627 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ ఉత్పత్తి జరిగింది. శతశాతం ఉత్పాదన విద్యుత్ ఉత్పత్తిలో మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం పని తీరు ఎంతో ప్రత్యేకం. చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన శత శాతం జరుగుతోంది. నాగార్జునసాగర్, సీలేరు విద్యుత్ కేంద్రాలకు దీటుగా ఉత్పాదకత ఉంటుంది. డిసెంబర్లో రికార్డు స్థాయి ఉత్పత్తి జరగడం సిబ్బంది పనితీరుకు నిదర్శనం. రానున్న రోజుల్లో మరింత మెరుగైన విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తాం. – ఏవీ సుబ్రహ్మణ్యేశ్వరావు, సీనియర్ ఇంజనీర్, మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం -
గృహాలపై సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించండి
సాక్షి, హైదరాబాద్: సొంత అవసరాలకు విద్యుదుత్పత్తి చేసుకునే విధంగా గృహాలు, కమర్షియల్ భవనాలపై సౌరవి ద్యుత్ పలకల ఏర్పాటును ప్రోత్సహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. సౌరవిద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకునేవారి కోసం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పా దక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో)పై సచివాలయంలో మంగళవారం ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీతో కలిసి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్లో విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. 1–3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకుంటే కిలోవాట్కు రూ.18 వేలు, 3–10 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకుంటే కిలోవాట్కు రూ.9 వేలు చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. సమీక్షలో టీఎస్ రెడ్కో ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి రెడ్కో వీసీ, ఎండీ ఎన్.జానయ్య పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
Isro: ఫ్యూయెల్ సెల్ టెస్ట్ సక్సెస్
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త(ఇస్రో) ఏడాదిలోనూ దూసుకుపోతోంది. కొత్త సంవత్సరం తొలిరోజున పీఎస్ఎల్వీ-సీ58తోపాటు గగనతలంలోకి పంపిన ఫ్యుయల్ సెల్ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరుకు సంబంధించిన డేటాను సేకరించింది. ఈ డేటాతో ఫ్యుయెల్ సెల్ పనితీరును పూర్తిస్థాయిలో విశ్లేషించనుంది. ఈ విషయాన్ని ఇస్రో శుక్రవారం ‘ఎక్స్’లో ప్రకటించింది. భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లో వాడే విద్యుత్ ఉత్పత్తి కోసం ఇస్రో ఫ్యుయెల్ సెల్ను రూపొందించింది. వంద వాట్ల క్లాస్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యుయెల్సెల్ను విజయవంతంగా పరీక్షించి విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ రసాయన చర్యలో ఫ్యుయెల్ సెల్ కేవలం నీటిని మాత్రమే బై ప్రోడక్ట్గా విడుదల చేసింది. ఇదే లాంచ్ వెహికిల్లలో ఇస్రో ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోశాట్ను కూడా నింగిలోకి తీసుకెళ్లింది. దీంతో పాటు మరో 10 పరికరాలను కూడా నింగిలోకి మోసుకెళ్లింది. అంతరిక్షంలో వెలువడే ఎక్స్-రే కిరణాల మూలాలపై పరిశోధించేందుకు ఎక్స్పోశాట్ను ఇస్రో నింగిలోకి పంపింది. నాసా తర్వాత అంతరిక్షంలో వెలువడే ఎక్స్రే కిరణాలపై పరిశోధన చేస్తున్నది ఇస్రోనే కావడం విశేషం. ఎక్స్రే కిరణాల మీద పరిశోధనకుగాను అమెరికా 2021లో ఐఎక్స్పీఈ శాటిలైట్ను నింగిలోకి పంపింది. POEM-3 on PSLV-C58: VSSC/ISRO successfully tests a 100 W class Polymer Electrolyte Membrane Fuel Cell on PSLV-C58's orbital platform, POEM3.https://t.co/f5SGqh1ZUR Powering missions with efficiency and emitting only water, these fuel cells are the future for power production in… pic.twitter.com/lCbsZF9UIB — ISRO (@isro) January 5, 2024 ఇదీచదవండి..15 మంది భారతీయులున్న షిప్ హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ చెన్నై’ -
అతి పెద్ద కలప గాలిమర!
క్రిస్మస్ పర్వదినం రోజున వెలుగులు విరజిమ్మే క్రిస్మస్ చెట్టు గురించి మనందరికీ తెలుసు. కేవలం ఆ చెట్టు కలపను వాడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాలి మర (విండ్ టర్బైన్ టవర్)ను తయారు చేశారంటే నమ్మగలరా?. కానీ ఇది నిజంగానే స్వీడన్లో ఉంది. గోథన్బర్గ్ నగర శివారులో పెనుగాలుల నడుమ కూడా ఠీవిగా నుంచుని విద్యుదుత్పత్తి చేస్తూ 400 ఇళ్లలో వెలుగులు నింపుతోంది! 492 అడుగుల ఎత్తయిన ఈ గాలిమరను పూర్తిగా కలపతోనే నిర్మించడం విశేషం. కలపతో తయారైన అత్యంత ఎత్తయిన విండ్ టర్బైన్ టవర్ ఇదే. క్రిస్మస్ ట్రీగా పరిచితమైన స్ప్రూస్ జాతి చెట్టు కలపను దీని నిర్మాణంలో వాడారు. దాని కలప అతి తేలికైనది, అత్యంత దృఢమైనది. ‘‘విండ్ టర్బైన్ టవర్ల నిర్మాణంలో ఉక్కును వాడతారు. కానీ అత్యంత ఎత్తైన టవర్ల తయారీ, తరలింపు, నిర్వహణ కష్టం. స్టీల్ ముక్కలను చిన్న భాగాలుగా చాలా నట్లతో బిగించాలి. తుప్పు పట్టకుండా చూడాలి. స్టీల్ భాగాల తయారీకి వేల గంటలపాటు ఫర్నేస్ను మండించాలి. భారీగా కర్బన ఉద్గారాలు వెలువడతాయి. కానీ చెక్క టవర్ తయారీ చాలా సులువు. తరలింపు సమస్యలుండవు. పర్యావరణహితం కూడా. క్రిస్మస్ ట్రీ తయారీకి చెట్టు పై భాగాన్ని నరకగా వచ్చే కలపనే వాడుతాం. కనుక అటవీ విధ్వంసమన్న మాటే లేదు. ఉక్కుతో పోలిస్తే చెక్కతో అతి తక్కువ శ్రమతో చాలా ఎక్కువ టవర్లను నిర్మించవచ్చు’’ అని దీన్ని తయారు చేసిన స్వీడన్ అంకుర సంస్థ మోడ్వియన్ తెలిపింది. ‘‘ఏటా 20,000 ఉక్కు టర్బైన్లను నిర్మిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ఏటా 10 శాతమైనా చెక్క టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’’ అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంద్రంలో ‘విండ్ పవర్’
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు, వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటన్నిటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సముద్రంలో ఏర్పాటు చేసే పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్–2023ను తాజాగా ప్రకటించింది. సముద్రంలో విండ్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండే చోటు కోసం జరిగే సర్వేకు మూడేళ్లు ఉన్న గడువును ఐదేళ్లకు పెంచింది. అలాగే ప్రాజెక్టుల లీజు వ్యవధి 35 ఏళ్లుగా నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్వాహకులు మెగావాట్కు రూ.1లక్ష సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలని చెప్పింది. అయితే ఇది రిఫండబుల్ అని స్పష్టం చేసింది. థర్మల్ కంటే ఖర్చు తక్కువ పవన శక్తి సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకి చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడంలో సహాయపడుతోంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) విశ్లేషణ ప్రకారం.. విండ్ పవర్ వృద్ధి రేటు వచ్చే దశాబ్దంలో 15 శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో దేశంలోని సముద్రంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్ విక్రయానికి ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. రాష్ట్రంలో సముద్రం అనుకూలం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 8,998.323 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో పవన విద్యుత్ 4,083.37 మెగావాట్లుగా ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పుణె)కి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్ర ప్రాంతాల్లో గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. -
విద్యుత్ సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, అభివృద్ధిలో కీలక పాత్ర విద్యుత్ రంగానిదేనని, ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ వినియోగమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేయకపోగా.. విద్యుత్తు సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ సరఫరాకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టులే కారణమని.. బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ ఏమాత్రం లేదని పేర్కొన్నారు. గురువారం భట్టి శాసనసభలో రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి.. స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. చివరిగా చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సభలో భట్టి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కరెంటును ఒక్కరోజులో ఉత్పత్తి చేయలేరు. కానీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే 24 గంటల కరెంటు అందించామని చెప్పిన బీఆర్ఎస్.. అందుకు అవసరమైన విద్యుత్ను ఎలా అందుబాటులోకి తెచ్చిందో చెప్పలేదు. అందుకే వాస్తవాలు ప్రజలకు తెలియటం కోసం శ్వేతపత్రాన్ని విడుదల చేశాం. తెలంగాణ ఏర్పడే నాటికి టీఎస్ జెన్కో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు. దీనికితోడు తెలంగాణ ఏర్పాటుకు ముందే.. ఇక్కడ 2,960 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళికలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అవి ఉత్పత్తి ప్రారంభించాయి. ఆ కొత్త విద్యుత్ కేంద్రాలే అనంతర కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ను అందించడంలో కీలకపాత్ర పోషించాయి. గత ప్రభుత్వం పూర్తి చేసినది ఒక్కటే.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1,800 మెగావాట్లు వచ్చేలా నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసినది కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే. ఇది పూర్తి కావడానికీ సుదీర్ఘకాలం పట్టింది. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. ఎక్కువ బొగ్గు వినియోగించాల్సి రావటం, కాలుష్యం వెదజల్లటం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనితో వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. మరో ప్రాజెక్టు బొగ్గుగనులకు అత్యంత దూరంగా నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా కోసమే ఏటా రూ.800 కోట్లు అదనపు వ్యయం అవుతుంది. ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే.. ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతోంది. భారీగా పెండింగ్ బకాయిలు రాష్ట్ర డిస్కంలు మొత్తం రూ.62,461 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్ 31 నాటికి విద్యుత్ శాఖ అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఇందులో రూ.30,406 కోట్లు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం. ఇదేకాకుండా విద్యుదుత్పత్తి, సరఫరా సంస్థలకు మరో రూ.28,673 కోట్ల బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిల వల్లే డిస్కంలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించాల్సినవే రూ.14,193 కోట్లు. విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల (ట్రూఅప్) కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని మాటిచ్చి.. చెల్లించని రూ.14,928 కోట్ల భారం డిస్కంలపైనే పడింది. గుండె బరువెక్కుతోంది విద్యుత్ శాఖ అప్పులకు తోడు ప్రభుత్వం కరెంటు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలతో కలుపుకొంటే ఈ మొత్తం రూ. 1.14 లక్షల కోట్లకు చేరింది. నాకు అప్పు అంటేనే భయం. వ్యక్తిగతంగా నేను అప్పు చేయను. కానీ ప్రస్తుతం నాకు వచ్చిన ఆర్థిక, విద్యుత్ శాఖల సమీక్షల సందర్భంగా గత ప్రభుత్వం చేసిపెట్టిన అప్పులు చూసి గుండె బరువెక్కుతోంది. ముందు చూపు ఏది? రాష్ట్రంలో 2014 నాటికి కరెంటు డిమాండ్ 5,661 మెగావాట్లు. దానికి 2.7 రెట్లు ఎక్కువ విద్యుత్ అందించేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముందుచూ పుతో ఉంటే.. ఇప్పటి డిమాండ్కు 2.7 రెట్లు ఎక్కు వగా అంటే 39 వేల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండాలి. అలా జరగలేదు. కనీసం డిమాండ్కు తగ్గట్టు కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. కాంగ్రెస్ హయాంలోని ప్రణాళికలతోనే.. యూపీఏ ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితమే ముందుచూపుతో తగిన ప్రణాళికలను అమల్లోకి తేవటంతో దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాల ద్వారా 7,778 మెగావాట్లు అందుబాటులో ఉంది. పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ అందాలన్న ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్తగూడెం థర్మల్ కేంద్రం, కాకతీయ రెండో దశ, సింగరేణి జైపూర్ కేంద్రం, పులిచింతల హైడల్ కేంద్రం సహా పలు కొత్త విద్యుదుత్పత్తి సంస్థలకు ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించింది. వీటితో 2,960 మెగావాట్ల కరెంటు అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఏపీ నుంచి 1,800 మెగావాట్లు, ఎనీ్టపీసీ రామగుండం నుంచి 4 వేల మెగావాట్లు.. కలిపి 5,800 మెగావాట్లు సమకూరాయి. ఇలా అన్నీ కలిపి 16,538 మెగావాట్ల విద్యుత్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే రాష్ట్రానికి అందుతోంది. అదే బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లతో నష్టాలే తప్ప ఒరిగిందేమీ లేదు. రోజువారీ మనుగడకూ కష్టంగా.. డిస్కంలు రోజువారీ మనుగడ కోసం కూడా అలవికాని అప్పులు చేయాల్సిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవడం చాలా కష్టం. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్ల.. డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉన్నాయి. విద్యుత్ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయాల్సిన గత సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో కుదేలయ్యాయి. ఇలాంటి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందినా.. మేం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్ను బాధ్యతాయుత, పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉన్నాం..’’ అని భట్టి పేర్కొన్నారు. -
విద్యుత్ పొదుపుతో భవిష్యత్కు వెలుగు
సాక్షి, అమరావతి: ఇంట్లో కావాల్సినంత వెలుతురు ఉంటుంది.. కానీ విద్యుత్ దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. బయటి నుంచి చల్లగాలి శరీరాన్ని తాకుతున్నా.. ఫ్యాన్లు, ఏసీలు ఆపడానికి ఇష్టపడం. ఈ విధంగా విద్యుత్ పొదుపులో మనం చేస్తున్న చిన్నపాటి నిర్లక్ష్యమే భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు తీసుకువచ్చే ప్రమాదముంది. వచ్చే 39 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి వనరులు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మేలుకోకపోతే విద్యుత్ వెలుగులకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ పొదుపుతో పాటు పర్యావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ సహా అనేక దేశాలు విద్యుత్ పొదుపు చర్యలకు నడుం బిగించాయి. మన దేశంలో ఈ బృహత్తర యజ్ఞానికి ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేసి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు చేపట్టింది. అలాగే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గురువారం నుంచి ఈ నెల 20 వరకు వారోత్సవాలను నిర్వహిస్తోంది. భవిష్యత్ తరాల కోసం.. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టిస్తోంది. అలాగే భవిష్యత్లో విద్యుత్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. భవిష్యత్ విద్యుత్ అవసరాలకు ఇవి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి తీసుకుంటోంది. మన దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపీ.. 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, బయో డీజిల్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఇంధన భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తున్నాయి. అయితే విద్యుత్ వెలుగులను భావితరాలకు అందించడానికి నేటి తరం కూడా తమ వంతు బాధ్యతగా విద్యుత్ పొదుపు పాటించాల్సిన అవసరముంది. ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. బొగ్గు కొరతతో తిప్పలు.. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అణు విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. చైనా, ఆ్రస్టేలియాలో బొగ్గు కొరత వల్ల పలు దేశాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జపాన్లోనూ విద్యుత్ సంక్షోభం నెలకొంది. శీతాకాలంలోనైనా వెచ్చదనాన్నిచ్చే దుస్తులు ఉపయోగించాలని.. హీటర్లకు వాడే విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని అక్కడి ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. అమెరికాలో గతేడాది కంటే 15 శాతం విద్యుత్ వినియోగంతో పాటు సహజ ఇంధన ధరలు పెరగడంతో అక్కడ ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్ బకాయి చెల్లించలేని పరిస్థితి వచ్చింది. భారత్లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. అలాంటి థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఈపీడీసీఎల్కు ఈఈఎస్ఎల్ ప్రశంసలు సాక్షి, విశాఖపట్నం: ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3,265.47 కోట్ల విలువైన 5,062.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఆదా చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ఆదర్శంగా నిలిచింది. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఈపీడీసీఎల్ను ఎనర్జీ ఎఫీషియన్సీ సర్విస్ లిమిటెడ్ సీఈవో విశాల్కపూర్ ప్రశంసించారు. అలాగే 2018–19 నాటికి 6.68 శాతంగా ఉన్న నష్టాలను.. 2023–24 సెపె్టంబర్ నాటికి 5.14 శాతానికి తగ్గించుకుంది. ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వి తేజ్ మాట్లాడుతూ.. ‘ఇంధన పొదుపు సామర్థ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రవేశపెట్టిన పాలసీని అమలుచేస్తూ విజయాలు సాధిస్తున్నాం. పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం, మున్సిపల్, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు ఎక్కువగా జరిగేలా చూస్తున్నాం. రూఫ్టాప్ సోలార్ విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాం. వినియోగదారులు చేస్తున్న ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తున్నాం’ అని చెప్పారు. -
ఏపీ ఇంట.. ఈ–వంట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతోన్న అనేక సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుండటం ఓ విశేషం కాగా..దేశంలో అమలు చేసే ఏ పథకానికైనా రాష్ట్రం ఎంపిక అవుతుండటం మరో విశేషం. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రాం (ఎన్ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రాం (ఈఈఎఫ్పీ) పథకాలకు ఏపీ ఎంపికైంది. కుకింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఇండక్షన్ కుక్స్టవ్లను ఈఈఎస్ఎల్ సరఫరా చేయనుంది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో చురుకుగా వ్యవహరిస్తున్న యూపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ వీటిని పంపిణీ చేయనున్నట్లు ఈఈఎస్ఎల్ తెలిపింది. ఈ–కుక్కర్తో ఆరోగ్యం.. ‘ఎన్ఈసీపీ’ ద్వారా ఇచ్చే ఈ స్టవ్లు వంటకు ఉపయోగించే సంప్రదాయ సహజ వాయువు (ఎల్పీజీ), బయోమాస్ వంటి ఇంధనాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనున్నాయి. వంటకు వినియోగించే ఇంధనాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి్సన అవసరం, అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన ఆగత్యం తప్పుతుంది. సాంప్రదాయ వంట పద్ధతుల కంటే 25–30% ఖర్చును దీనివల్ల ఆదా చేయవచ్చు. ఈ–కుకింగ్ ద్వారా చేసిన వంటకు, గ్యాస్ ఉపయోగించి వండిన ఆహారానికి ఎలాంటి తేడా ఉండదు. పైగా వంట పొయ్యి వద్ద పొగతో అనారోగ్యానికి గురికావాలి్సన అవసరం రాదు. వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం వీలవుతుంది. హానికరమైన బయోమాస్ ఆధారిత వంటకు దూరంగా పరిశుభ్రమైన వంట పద్ధతులను ప్రజలకు అలవాటు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఫ్యాన్లతో ఇళ్లలో విద్యుత్ ఆదా.. ‘ఈఈఎఫ్పీ’ ద్వారా జగనన్న ఇళ్లలో విద్యుత్ ఆదా ఫ్యాన్లను పంపిణీ చేసేందుకు ఇటీవల గోవాలో జరిగిన జీ20 సదస్సులో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ సంతకాలు చేసి, ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తోన్న ఇళ్లకు 6 లక్షల ఎల్ఈడీ బల్బులు, 3 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 3 లక్షల బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ మోటర్(బీఎల్డీసీ) సీలింగ్ ఫ్యాన్లు సరఫరా చేయనున్నారు. ఒక్కో ఇంటికీ 4 ఎల్ఈడీ బల్బులు, 2 ట్యూబ్ లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ ఫ్యాన్లను రాయితీపై అందించనున్నారు. రూ.400 కోట్లతో పంపిణీ చేసే ఈ ఉపకరణాల వల్ల ప్రతి ఇంటికీ ఏడాదికి 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుంది. తొలి దశలో 15.6 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలను వినియోగించడం వల్ల ఏడాదికి 1,145 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మిగులుతుందని అంచనా. విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. ఏపీ ముందుకు రావడం అభినందనీయం వంటశాలలలో ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాలను వినియోగించడం ద్వారా ఎల్పీజీ, కిరోసిన్ ఆధారిత వంటపై ఆధారపడటాన్ని తగ్గించడం మా లక్ష్యం. ఇందుకోసం మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్ (ఎంఈసీఎల్)తో కలిసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ–స్టవ్లను పంపిణీ చేయనున్నాం. పాండిచ్చేరి, కేరళ, లడ్హాక్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాం. జగనన్న ఇళ్లలో బీఎల్డీసీ ఫ్యాన్లు అందించేందుకు ఏపీ ముందుకు రావడం అభినందనీయం. – విశాల్ కపూర్, సీఈవో, ఈఈఎస్ఎల్ -
ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది. ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కంలు అదే రేటుకి అదే జెన్కో ద్వారా విద్యుత్ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ వెసులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా అదే రేటుకి కొంటే జెన్కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం. దీంతో జెన్కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్)లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కంలకు గానీ విద్యుత్ను విక్రయించుకోవచ్చు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్ పూల్ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్ను డిస్కంలు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కలి్పంచింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్ను ఐఈఎక్స్లో విక్రయిస్తారు. అంతా ఐఈఎక్స్లోనే విద్యుత్ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్కోలు, డిస్కంలకు ఉన్న ప్రధాన మార్కెట్ ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్ 27న ప్రారంభమైన ఐఈఎక్స్ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్ క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు, 600కుపైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, 4,600కు పైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్లో 8,469 మిలియన్ యూనిట్ల లావాదేవీలు జరిగాయి. యూనిట్ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ లావాదేవీలకు జెన్కోలు, డిస్కంల నుంచి గరిష్టంగా యూనిట్కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్) వసూలు చేస్తోంది. -
వ్యర్థాల ద్వారా ఏటా 65 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి!
న్యూఢిల్లీ: భారీ మొత్తంలో వెలువడుతున్న వ్యర్థాలను వినియోగించుకుని భారత్ వార్షికంగా 65 గిగావాట్ల (జీడబ్ల్యూ) విద్యుత్ ఉత్పత్తిని సాధించగలదని ఈ రంగంలో నిపుణులు అంచనావేస్తున్నారు. ఇది 2030 నాటికి 165 గిగావాట్లకు, 2050 నాటికి 436 గిగావాట్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వారు విశ్లేషించారు. వేస్టేజ్ నిర్వహణపై ఇక్కడ రెండు రోజుల వర్క్షాపు జరిగింది. వర్క్షాపులో వెల్లడైన అంశాల ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం 65 మిలియన్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పరిమాణం 2030 నాటికి 165 మిలియన్ టన్నులకు, 2050 నాటికి 436 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. మునిసిపల్ చెత్తలో 75–80 శాతమే సమీకరణ జరుగుతోంది. ఇందులో 22 నుండి 28 శాతం మాత్రమే ప్రాసెస్ జరిగి, శుద్ధి అవుతోంది. తగిన రీతిన వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిగే వ్యవస్థ రూపొందితే.. పర్యావరణ పరిరక్షణలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. -
‘థర్మల్’ ధగధగలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోంది. గత నెలలో సీలేరు బేసిన్ జలవిద్యుత్ కేంద్రాలు గరిష్ట విద్యుత్ ఉత్పత్తి నమోదు చేయగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగన్నర నెలల్లో థర్మల్ యూనిట్లు తమ సత్తా చాటాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 18 అర్ధరాత్రి వరకూ ఏపీ జెన్కో థర్మల్ యూనిట్లు 10,108.196 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 12,994.987 మిలియన్ యూనిట్లు సరఫరా చేయడం విశేషం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కేవలం నాలుగన్నర నెలల స్వల్ప వ్యవధిలోనే 2,886.791 మిలియన్ యూనిట్ల అధిక ఉత్పిత్తి జరిగింది. గత ఏడాది ఆగస్టు 18న ఏపీ జెన్కో థర్మల్ విద్యుదుత్పత్తి 60.616 మిలియన్ యూనిట్లు కాగా.. ఈ ఏడాది ఇదేరోజు ఉత్పత్తి 84.537 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. పెరిగిన పీఎల్ఎఫ్.. ఏపీ జెన్కో తన అనుబంధ సంస్థ ఏపీపీడీసీఎల్తో కలిపి మొత్తం మూడు ప్లాంట్లలో 5,810 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్వహిస్తోంది. కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది మార్చి 10న 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 18 వరకూ ఈ కేంద్రాలు మొత్తం సగటున 51.84 పీఎల్ఎఫ్ సాధించగా ఈ సంవత్సరం ఇదే కాలంలో 66.61 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీపీ) పీఎల్ఎఫ్ 64.10 నుంచి 72.43 శాతానికి పెరిగింది. అలాగే, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్) పీఎల్ఎఫ్ 73.59 నుంచి 78.38 శాతానికి చేరింది. దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం పీఎల్ఎఫ్ 27.46 శాతం నుంచి 53.98 శాతానికి పెరిగింది. సామర్థ్యాన్ని మించి ఉత్పత్తి.. నిజానికి.. వర్షాకాలంలో తగ్గాల్సిన విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు.. బొగ్గు తడిసి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. అయినప్పటికీ రాష్ట్ర గ్రిడ్ అవసరాలను సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్కో ఉత్పత్తి పెంచుతూ వస్తోంది. ఆర్టీపీపీ మూడో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. గత మే 8న ఏకంగా 224 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి నమోదు చేసింది. ఆర్టీపీపీ ఒకటో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. అదే మే 25న 219 మెగావాట్లు ఉత్పత్తి నమోదైంది. డాక్టర్ ఎన్టీటీపీఎస్ 6వ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. మే 15న 219 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి జరిగింది. ఇక్కడే ఐదో యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు కాగా.. మే 24న 217 మెగావాట్లు ఉత్పత్తి సాధించింది. ఏపీ జెన్కోను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని.. థర్మల్ యూనిట్లలో విద్యుదుత్పత్తి పెంచడం ద్వారా ఏపీ జెన్కోను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో మా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలవల్లే ఏపీ జెన్కో ప్రగతిబాటలో పయనిస్తోంది. రాష్ట్ర అవసరాలను 45–50 శాతం వరకూ సమకూరుస్తోంది. రాష్ట్రానికి ఎక్కువ పరిమాణంలో బొగ్గు కేటాయించేలా సీఎం, ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. అందువల్లే అంతరాయం లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ రికార్డులు సాధిస్తున్నాం. – కేవీఎన్ చక్రధర్బాబు, ఎండీ, ఏపీ జెన్కో -
Fact Check: ఆరుబయట ఉంటే తడవదా!?
సాక్షి,అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతోపాటు రకరకాల ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు సంస్థలు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం రాష్ట్రంలో ఎక్కడా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. అయినా, ‘విద్యుత్ ఉత్పత్తి లేదు.. కోతలే!’ అంటూ సోమవారం ‘ఈనాడు’ మళ్లీ ఓ అసత్య కథనాన్ని వండివార్చింది. వాస్తవ పరిస్థితులను అధికారులు ఎన్నిసార్లు వివరించినా పెడచెవిన పెట్టి, విద్యుత్ సంస్థల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చపత్రిక తీరుపై విద్యుత్ సంస్థలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ మేరకు డిస్కంలు, ఏపీ జెన్కో ‘సాక్షి’కి వాస్తవాలు వెల్లడించాయి. ఆ వివరాలు.. ‘కోత’ లేకుండా సరఫరా.. ఇక ఏటా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల రాకతో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో జూలై లేదా ఆగస్టు నెలల్లో కృష్ణా బేసిన్లోకి నీరు రావడంవల్ల జల విద్యుదుత్పత్తి ప్రారంభమయ్యేది. అలాగే, ఇది గాలుల సీజన్ అయినందున పవన విద్యుత్ అధికంగా వస్తుంది. అయితే, ఈ ఏడాది ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఇలాంటి అనూహ్య పరిస్థితులతో ఏర్పడ్డ విద్యుత్ కొరత కారణంగా రెండు మూడ్రోజులు అక్కడక్కడా స్వల్ప అంతరాయాలు ఏర్పడ్డాయి. కానీ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి వెంటనే అన్ని రకాల చర్యలు తీసుకున్నాయి. దీంతో ఆదివారం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 91.097, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 48.842, ఎస్పీడీసీఎల్ పరిధిలో 89.445 కలిపి మొత్తం 229.384 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినా ఎక్కడా కోతలేకుండా ఆ మేరకు విద్యుత్ను రాష్ట్ర గ్రిడ్ నుంచి డిస్కంలు సరఫరా చేశాయి. గతేడాది ఇదే రోజు విద్యుత్ వినియోగం 200.138 మిలియన్ యూనిట్లు కాగా ఈ ఏడాది డిమాండు ఊహించని విధంగా 29.146 మిలియన్ యూనిట్లు అధికంగా ఉంది. అయినా, రాష్ట్రంలో లభిస్తున్న విద్యుత్కు అదనంగా బహిరంగ మార్కెట్లో రూ.30.137 కోట్లు వెచ్చించి 50.621 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసి మరీ విద్యుత్ సమకూర్చాయి. ముందస్తు ప్రణాళికతో ఉత్పత్తి చేయడంతో పాటు ఇలా కొనుగోళ్లు చేస్తుండటంవల్లే కోతల్లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమైంది. వాస్తవాలిలా ఉంటే.. విద్యుత్ సరఫరా చేయకుండా డిస్కంలు చేతులెత్తేశాయని పచ్చ పత్రిక నానా యాగీచేసింది. వర్షాకాలంలో సర్వసాధారణం వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తడిసిన బొగ్గు వినియోగించడం సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పుడే, ఈ ఏడాదే ఇది కొత్తగా జరుగుతున్నది కాదు. బొగ్గును ఆరుబయట స్టాక్ ఉంచడంవల్ల వానకు తడుస్తుంది. అందువల్ల బొగ్గులో నీటిశాతం ఎక్కువ ఉంటుంది. అంతమాత్రానికే ‘థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ముందస్తుగా నిల్వచేయడంలో ఏపీ జెన్కో అధికారులు విఫలమయ్యారంటూ ‘ఈనాడు’ గగ్గోలు పెట్టడం సరికాదు. నిజానికి.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉంది. అందువల్లే కేంద్ర ఇంధన, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులు వారంలో రెండు మూడ్రోజులు జనరేషన్ సంస్థల అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ కేటాయింపులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల ప్రకారమే ఆయా బొగ్గు గనుల నుంచి ఉత్పత్తికి అంతరాయం లేకుండా ఏపీ జెన్కో బొగ్గు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం వీటీపీఎస్, ఆర్టీపీపీలో రెండ్రోజులు, కృష్ణపట్నంలో పది రోజులు, హిందూజాలో మూడ్రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. -
నెలాఖరులోగా గ్రిడ్కు ‘సూపర్ థర్మల్’!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న 1,600 (2 *800) మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి దశలోని 800 మెగావాట్ల యూనిట్ను ఈ నెలాఖరులో గా గ్రిడ్కు అనుసంధానం చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. తొలి యూనిట్ ద్వారా గత రెండు వారాలుగా 650 మెగావాట్ల వరకు నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్తగా నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు, సామర్థ్యం పరీక్షల్లో భాగంగా నిరంతరంగా 72 గంటల పాటు పూర్తి స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాణిజ్యపరమైన ఉత్పత్తికి అర్హత సాధించిన తేదీ(కమర్షియల్ ఆపరేటింగ్ డేట్/సీఓడీ)ని ప్రకటిస్తారు. సీఓడీ ప్రకటన తర్వాత విద్యుత్ కేంద్రాన్ని గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 800 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యంతో తొ లి యూనిట్లో విద్యుదుత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ ఏ ర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ను 27 నుంచి గ్రిడ్కు సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) నుంచి ఇటీవల స్లాట్లను పొందింది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులోగా తొలి యూనిట్ సీఓడీ ప్రకటన ప్రక్రియ పూర్తి చేసుకుని గ్రిడ్కు అనుసంధానం కానుంది. వచ్చే అక్టోబర్లో రెండో యూనిట్కు సీఓడీ ప్రక్రియ నిర్వహించాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణంలో మూడున్నరేళ్ల జాప్యం ! ఎన్టీపీసీ తొలి యూనిట్ నుంచి జూన్ 2020, రెండో యూనిట్ నుంచి నవంబర్ 2020 నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును జూలై 2023కు పొడిగించారు. యూనిట్–1 నిర్మా ణం దాదాపు 8 నెలల కిందటే పూర్తయింది. కాగా, బాయిలర్లోని రీహీటర్ ట్యూబ్స్కు పగుళ్లు రావడంతో గత డిసెంబర్లో జరగాల్సిన సీఓడీ ప్రక్రియను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరమ్మతుల్లో భా గంగా ట్యూబ్స్కు పగుళ్లు వచ్చి న చోట కట్ చేసి వెల్డింగ్తో మళ్లీఅతికించారు. ఏకంగా 7,500 చోట్లలో వెల్డింగ్ చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచి్చన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాల్సి ఉండగా, తొలి దశ కింద 1,600 మెగా వాట్ల కేంద్రాన్ని నిర్మి స్తున్న విషయం తెలిసిందే. రూ.10,599 కోట్ల అంచనా వ్య యంతో తొలి దశ ప్రాజెక్టును చేపట్టగా, గత మార్చి నాటికి రూ.10,437 కోట్ల వ్య యం జరిగింది. పనుల్లో జాప్యంతో అంచనా వ్యయా న్ని రూ.10,998 కోట్లకు పెంచారు. డిస్కంలకు ఊరట..! ఎన్టీపీసీ తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే నిరంతరం పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు వీలుపడుతుంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్ను రాష్ట్ర పంపిణీ సంస్థ (డిస్కం)లు అధిక ధరలతో పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే విద్యుత్ కొనుగోళ్ల భారం కొంత వరకు తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు. -
విద్యుదుత్పత్తిని ఆపేయండి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపేయాలని తెలంగాణ జెన్కోను కృష్ణా బోర్డు ఆదేశించింది. నీటి కేటాయింపులు చేయాలని ఎలాంటి ప్రతిపాదన పంపకుండా, బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు తరలిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ జెన్కో సీఎండీకి కృష్ణాబోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని కృష్ణా బోర్డుకు బుధవారం ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేసేలా తెలంగాణ జెన్కోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కృష్ణాబోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కృష్ణాబేసిన్లో ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే తక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడాన్ని ఎత్తిచూపారు. దాంతో కృష్ణానదిలో నీటిలభ్యత తగ్గుతుందని, ఆ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులోను లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని సంరక్షించుకుని తాగు, సాగునీటి అవసరాల కోసం వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇకపై ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయవద్దని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కానీ.. తెలంగాణ జెన్కో కృష్ణా బోర్డు ఆదేశాల భేఖాతరు చేస్తూ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులను దిగువకు వదలేస్తుండటం గమనార్హం. -
ఎన్టీపీసీ లాభం రూ.4,907 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ జూన్తో ముగిసిన త్రైమాసికానికి రూ.4,907 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,978 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం రూ.43,561 కోట్ల నుంచి రూ.43,390 కోట్లకు తగ్గింది. జూన్ క్వార్టర్లో 103.98 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 104.42 బిలియన్ యూనిట్లుగా ఉంది. కోల్ ప్లాంట్లలో లోడ్ ఫ్యాక్టర్ 77.43 శాతంగా ఉంది. -
76 శాతం థర్మల్ ప్లాంట్ల నుంచే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం విద్యుత్ అవసరాల్లో దాదాపు 76 శాతం అవసరాలను థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచే సమకూర్చుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,750 కోట్ల యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా లోక్సభలో విద్యుత్, పునరుత్పాదక ఇంథన శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ఉద్దేశంతో నిర్మిస్తున్న భిన్నరకాల విద్యుత్ ప్లాంట్ల వివరాలనూ మంత్రి వెల్లడించారు. ‘మొత్తంగా 25వేలకుపైగా మెగావాట్ల సామర్థ్యంతో 18 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారు. వాటిలో ఒకటి గ్యాస్ ఆధారిత థర్మల్ ప్లాంట్ ఉంది. మొత్తంగా 18వేల మెగావాట్ల సామర్థ్యంతో 42 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. 8వేల మెగావాట్ల సామర్థ్యంతో అణువిద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతున్నారు. డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ సామర్థ్యం దేశం సొంతం. 3.6 శాతం మిగులును సాధించాం. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పుడూ 0.7 శాతం మిగులును సాధించాం’ అని మంత్రి వెల్లడించారు. అయితే 2023 ఏప్రిల్–జూన్ కాలంలో మాత్రం 0.2 శాతం లోటు కనిపించిందని మరో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మంత్రి వెల్లడించడం గమనార్హం. -
కృష్ణాలో పెరిగిన వరద
సాక్షి, అమరావతి/హొళగుంద(కర్నూలు)/శ్రీశైలం ప్రాజెక్ట్: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం ఆల్మట్టి డ్యామ్లోకి 1,14,445 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 64.41 టీఎంసీలకు చేరుకుంది. దాంతో ఆల్మట్టి డ్యామ్ సగం నిండినట్లయింది. మరో 65 టీఎంసీలు చేరితే డ్యామ్ పూర్తిగా నిండిపోతుంది. మహారాష్ట్ర, కర్ణాటకలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆల్మట్టిలోకి మంగళవారం వరద ఉద్ధృతి మరింత పెరగనుంది. ప్రస్తుతం ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాలకు.. స్థానికంగా కురిసిన వర్షాలు తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్లోకి 13,675 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో ఆడ్యామ్లో నీటి నిల్వ 19.09 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ నిండాలంటే ఇంకా 18 టీఎంసీలు అవసరం. ఇక జూరాల ప్రాజెక్టులోకి 26,244 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 33,235 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 4,045 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 35.47 టీఎంసీలకు చేరుకుంది. మూసీ ప్రవాహంతో నాగార్జునసాగర్కు దిగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 8,532 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.73 టీఎంసీలకు చేరుకుంది. మున్నేరు, వాగులు, వంకల నుంచి ప్రకాశం బ్యారేజ్లోకి 10,917 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 7,785 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 3,132 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు భారీగా వరద కృష్ణా నది ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ప్రవాహం జోరందుకుంది. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 30 టీఎంసీలను దాటింది. సోమవారం ఉదయం 64,023 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. నీటి చేరిక ఇలాగే ఉంటే నెలాఖరు నాటికి డ్యాం నిండి ఎల్ఎల్సీ కింద వరి సాగుకు అవకాశం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శివమొగ్గ, ఆగుంబే, వరనాడు, తీర్థనహళ్లి తదితర డ్యాంల ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వరద నీరు చేరికపై వారు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం దిగువ కాలువకు తాగునీటి అవసరాలకు బోర్డు అధికారులు ఈ నెల 28 తర్వాత నీటిని విడుదల చేయనున్నారు. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా సోమవారం ఉదయం 1,602.84 అడుగులకు చేరుకుంది. అలాగే పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30 టీఎంసీల నిల్వ ఉంది. 24ఏఎల్ఆర్129: తుంగభద్ర రిజర్వాయర్లోకి చేరిన వరద నీరు 24ఎస్ఆర్ఐ 30ఏ – 812 అడుగులు వద్ద శ్రీశైలం డ్యాం నీటిమట్టం -
పవన విద్యుత్కు యూనిట్కు రూ.2.64
సాక్షి, అమరావతి: పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన టారిఫ్ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఖరారు చేసింది. ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకుని పదేళ్లు దాటిన తరువాత యూనిట్ రూ.2.64 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. 11వ సంవత్సరం నుంచి 20 ఏళ్ల వరకు ఇదే టారిఫ్ వర్తిస్తుందని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 2,100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు చెందిన 22 పీపీఏలకు ఆ సంస్థలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం ఏపీఈఆర్సీ ఈ టారిఫ్ను నిర్ణయించింది. అదే విధంగా ప్రాజెక్టు జీవిత కాలాన్ని 25 ఏళ్లుగా సంస్థలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. కానీ దానిని 30 ఏళ్లుగా ఏపీఈఆర్సీ పరిగణించింది. ప్రాజెక్టు ఏర్పాటుకు మెగావాట్కు ఐదెకరాల చొప్పున ఆ సంస్థలు ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్నాయి.పీపీఏ గడువు ముగిసేనాటికి వాటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఏపీఈఆర్సీ అంచనా వేసింది. దానిని పరిగణనలోకి తీసుకుని యూనిట్ ధరను ఖరారు చేసినట్లు కమిషన్ వెల్లడించింది. మీరు అడిగినంత ఇవ్వలేం మొదటి పది సంవత్సరాలకు యూనిట్కు రూ.3.43 చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. అయితే ప్రస్తుత మార్కెట్ ధరల మేరకు 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకూ యూనిట్కు రూ.3.50 టారిఫ్ సెట్ చేయాలని పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్సీని కోరాయి. ఏపీఈఆర్సీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్ల టారిఫ్ రూ.3.43గా నిర్ణయించామని, ఆ సమయంలో సుంకం కూడా యూనిట్పై రూ.2.4 తగ్గించామని, కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది. 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు యూనిట్కు రూ.2.64గా నిర్ధారించింది.20 ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. కొనసాగితే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది. వృద్ధికి అనుగుణంగా.. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 10,785.51 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4096.65 మెగావాట్లు. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పెరుగుదల నమోదు చేసుకుంది. వాతావరణ మార్పులకు ప్రభుత్వ చర్యలు తోడవడంతో ఏపీలో పవన విద్యుత్కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పూణె)కి చెందిన పరిశోధకులు వారి అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. -
‘జల విద్యుత్’కు గ్రీన్ సిగ్నల్ వచ్చేనా ?
అశ్వాపురం: అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ బ్యారేజీని జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సోమవారం సందర్శించారు. జలవనరుల శాఖ అధికారులు మ్యాప్ ద్వారా బ్యారేజీ నిర్మాణ వివరాలను ఆయనకు తెలియజేశారు. సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ బ్యారేజీకి అనుబంధంగా 280 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బ్యారేజీ పనులు పిల్లర్ల వరకు పూర్తయినా జల విద్యుత్ కేంద్రం నిర్మాణంపై ఇంతవరకూ గ్రీన్ సిగ్నల్ రాలేదు. కాగా, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే జెన్కో సీఎండీ సీతమ్మ సాగర్ బ్యారేజీని సందర్శించారని సమాచారం. రాష్ట్రంలోనే కీలకం.. సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద నిర్మించనున్న 280 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం రాష్ట్రంలోనే కీలకంగా మారనుంది. సీతమ్మ సాగర్ జల విద్యుత్ కేంద్రంలో ఏడు బల్బ్ టర్బైన్ల యూనిట్లు ఉంటాయి. ఒక్కో యూనిట్ ద్వారా 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఈ కేంద్రం నుంచి ఏడాదికి సుమారు 1016.88 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. రాష్ట్రంలో ఇప్పటి వరకు జల విద్యుత్ కేంద్రాలన్నీ కృష్ణా నదిపైనే ఉన్నాయి. వీటి సామర్థ్యం 2,369 మెగావాట్లు. గోదావరిపై పోచంపాడు వద్ద 36 మెగావాట్లు, నిజాంసాగర్ వద్ద 10 మెగావాట్లు, సింగూరు వద్ద 15 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి నదిపై 280 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఇదే కీలకం కానుంది. బీటీపీఎస్ను సందర్శించిన సీఎండీ మణుగూరు రూరల్ : జెన్కో సీఎండీ ప్రభాకర్రావు సోమవారం మణుగూరులోని బీటీపీఎస్ను సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బీటీపీఎస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు, జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలను చేపట్టాలన్నారు. అనంతరం బీటీపీఎస్ రైల్వేలైన్ నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జెన్కో డైరెక్టర్లు టీఆర్కే.రావు, ఎం.సచ్చిదానందం, వెంకటరాజం, అజయ్, లక్ష్మయ్య, విద్యుత్ సౌధ సీఈ రత్నాకర్, బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, జలవనరులశాఖ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ రాంబాబు, ఏఈ నవీన్, విజిలెన్స్ అధికారులు వినోద్కుమార్, ముత్యంరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు రాంప్రసాద్, పార్వతి, రమేష్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్పత్తిలో జెన్కో పరుగు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలో ఏటా 8% విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. దానికి తగ్గట్టు అంచనాలకు మించి జెన్కో 45.38% విద్యుత్ను గ్రిడ్కు అందిస్తోంది. దీంతో డిస్కంలపై ఆర్థిక భారం తగ్గుతోంది. తత్ఫలితంగా ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీల నుంచి వినియోగదారులకు ఉపశమనం లభిస్తుంది. పెరుగుతున్న సామర్థ్యం.. నాగార్జున సాగర్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 287.213 మిలియన్ యూనిట్ల అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో ఇటీవల 800 మెగావాట్ల 8వ యూనిట్లో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించి, గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరగనుంది. మరోవైపు మాచ్ఖండ్లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్పీసీ), ఏపీ జెన్కో సంయుక్తంగా మాచ్ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ 98 మెగావాట్ల సామర్థ్యం గల మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇతర చిన్న జలవిద్యుత్ కేంద్రాల మాదిరి ఇది సీజన్లో పనిచేసేది కాదు. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. అప్పర్ సీలేరులో 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ (పీఎస్పీ) నిర్మించాలని ఇప్పటికే కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి జెన్కో అనుమతి తీసుకుంది. దీని నిర్మాణానికి టెండరు డాక్యుమెంటును జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదించింది. రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనుంది. సరికొత్త రికార్డులు.. రాష్ట్ర గ్రిడ్ విద్యుత్ డిమాండ్ గతేడాది మే నెలలో 5,947.39 మిలియన్ యూనిట్లు కాగా ఏపీ జెన్కో 1,989.37 మిలియన్ యూనిట్లు (33.45 శాతం) సమకూర్చింది. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో రాష్ట్ర విద్యుత్ డిమాండు 6,430.72 మిలియన్ యూనిట్లకు పెరగ్గా ఏపీ జెన్కో 2,917.99 మిలియన్ యూనిట్ల (45.38 శాతం)ను రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్కు అందించింది. గతేడాది కంటే 989.37 మిలియన్ యూనిట్లు (12 శాతం) అధికంగా సరఫరా చేసింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) ప్రైవేటు ఉత్పత్తి సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేయాల్సిన భారం నుంచి కొంతమేరకు ఉపశమనం లభిస్తోంది. దీనివల్ల విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు చార్జీల పెంపు భారం తప్పుతోంది. ప్రభుత్వ సహకారం.. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో అత్యధిక భాగం ఏపీ జెన్కో ద్వారా సమకూర్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్దేశించారు. వారి మార్గదర్శకం మేరకు, ప్రభుత్వ సహకారంతో తక్షణమే 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం. అదే విధంగా థర్మల్ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచుతున్నాం. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)కి జూలైలో శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దీంతో థర్మల్, హైడల్, సోలార్ కలిపి ఏపీ జెన్కో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8,789.026 మెగావాట్లకు చేరుతుంది. – కేవీఎన్ చక్రధర్ బాబు, ఎండీ, ఏపీ జెన్కో -
విద్యుత్ వెలుగులు.. ఉత్పత్తిలో ఏపీ జెన్కో రికార్డు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీ జెన్కో) విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులు నమోదు చేస్తోంది. మే నెలలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఏపీ జెన్కో 12 శాతం అధికంగా విద్యుత్ సరఫరా చేసింది. రాష్ట్ర విద్యుత్ డిమాండులో ఏపీ జెన్కో గత ఏడాది మే నెల 33.45 శాతం సమకూర్చగా ఈ ఏడాది అదే నెలలో అంచనాలకు మించి 45.38 శాతం గ్రిడ్కు అందించడం గమనార్హం. గత ఏడాది మేనెలలో రాష్ట్ర గ్రిడ్ విద్యుత్ డిమాండు 5947.39 మిలియన్ యూనిట్లు కాగా ఏపీ జెన్కో 1989.37 మిలియన్ యూనిట్లు సమకూర్చింది. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో రాష్ట్ర విద్యుత్ డిమాండు 6430.72 మిలియన్ యూనిట్లకు పెరగ్గా ఏపీ జెన్కో 2917.99 మిలియన్ యూనిట్లను రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్కు అందించిది. ఏపీ జెన్కో రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర గ్రిడ్కు గత సంవత్సరం మేనెలలో సరఫరా చేసిన విద్యుత్ కంటే ఈ సంవత్సరం మేనెలలో 989.37 మిలియన్ యూనిట్లు అధికంగా సరఫరా చేయడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అధికంగా విద్యుత్ వినియోగం పెరిగిన సమయంలో సైతం ఏపీ జెన్కో సగటున 45 శాతం పైగా సమకూర్చుతుండటం విశేషం. జెన్కో విద్యుత్ ఉత్పత్తి పెంచడంవల్ల ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రయివేటు ఉత్పత్తి సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన భారం తగ్గినట్లే. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు ఛార్జీల పెంపు భారం తప్పింది. ఇది వినియోగదారులకు ఉపశమనం కలిగించే అంశం. గత వేసవి సీజన్లలో లాగే ఈ ఏడాది మేలో కూడా డిమాండు సాధారణంగా ఉండి ఉంటే ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా వాటా 50 శాతం దాటి ఉండేదని గణాంకాలను బట్టి తేటతెల్లమవుతోంది. ‘సాగర్’ రికార్డు నాగార్జున సాగర్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం నలబై ఏళ్లలో ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 287.213 మిలియన్ యూనిట్ల అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసింది. ప్రాజెక్టు నలబై ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. ప్లాంట్లలో ఉద్యోగులు అంకిత భావంతో కృషి చేయడం, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చక్కటి మార్గదర్శకంతో ప్రోత్సహించడంవల్లే ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి పెరిగిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) పెరగడానికి పాటుపడినందుకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్కో ఛైర్మన్ కె. విజయానంద్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఉద్యోగులను అభినందించారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (డాక్టర్ ఎన్టీటీపీఎస్) లో ఇటీవల ౖప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్కు అనుసంధానం చేసిన 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్ వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)కి వచ్చే నెల శ్రీకారం చుడతామని ఎండీ ఉద్యోగులకు తెలిపారు. దీంతో ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థం 5810 మెగావాట్ల నుంచి 6610 మెగావాట్లకు పెరుగుతుంది. ఏపీ జెన్కో (థర్మల్, హైడల్, సోలార్ కలిపి) మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8789.026 మెగావాట్లకు పెరగనుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ప్రణాళిక : ఎండీ చక్రధర్ బాబు విద్యుత్ రంగంలో అపార అనుభవం ఉన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మార్గదర్శకత్వంలో ఇంధన, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంపూర్ణ సహాయ, సహకారాలతో ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి సామర్థ్యం మరింతగా పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల విద్యుత్ డిమాండు పెరుగుతోంది. ఏ రంగం ప్రగతికైనా విద్యుత్ కీలకం. ప్రతి యేటా విద్యుత్ డిమాండు 8 శాతం పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యుత్ డిమాండులో అత్యధిక భాగం సాధ్యమైనంత మేరకు పూర్తి స్థాయిలో ఏపీ జెన్కో ద్వారా సమకూర్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకం చేశారు. చదవండి: ప్రగతి పథంలో ఆర్టీసీ వారి మార్గదర్శకం మేరకు 5000 మెగావాట్ల సామర్థ్యంగల పంప్డ్ స్టోరేజి ప్లాంట్ల (పీఎస్పీ) ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం. పీక్ డిమాండు సమయంలో ఉత్పత్తి పెంచడానికి, సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి హఠాత్తుగా పడిపోయినప్పుడు గ్రిడ్కు సరఫరా చేసేందుకు పీఎస్పీలు చాలా ఉపయోగపడతాయి. పీక్ డిమాండు సమయంలో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన భారం కూడా వీటివల్ల తప్పుతుంది. ఈ ఆలోచనతోనే అప్పర్ సీలేరులో 1350 మెగావాట్ల పీఎస్పీ నిర్మించాలని ఇప్పటికే కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి అనుమతి తీసుకున్నాం. దీని నిర్మాణానికి టెండరు డాక్యుమెంటును జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదించింది. రూ. 11,154 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నాం. -
విద్యుత్ ఉత్పత్తిలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నిరంతరం నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్ను సరఫరా చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్(ఏపీ జెన్కో) మరో ముందడుగు వేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్)లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్ను ఆదివారం విజయవంతంగా గ్రిడ్కు అనుసంధానం చేసింది. ఈ యూనిట్ బాయిలర్ సూపర్ క్రిటికల్ సాంకేతికత, శక్తి సామర్థ్య టర్బైన్, జనరేటర్తో 80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. నీటిని ఆదా చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. యూనిట్ను పూర్తి లోడ్తో నడపడానికి రోజుకు దాదాపు 9,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరమవుతుంది. విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే బూడిద వృథా అవ్వకుండా వంద శాతం వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవలే నెల్లూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో కూడా 800 మెగావాట్ల యూనిట్–3 వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించారు. ఎన్టీటీపీఎస్లో కొత్త యూనిట్ ట్రయల్ ఆపరేషన్తో ఏపీ జెన్కో థర్మల్ ఇన్స్టాల్డ్ సామర్థ్యం 8,789 మెగావాట్లకు చేరుకుంది. ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో రెండు 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్లు ఏపీలోనే ప్రారంభమవ్వడం విశేషం. ప్రస్తుతం రాష్ట్ర గ్రిడ్కు ఏపీ జెన్కో రోజూ 102 నుంచి 105 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా చేస్తోంది. ఇది మొత్తం వినియోగంలో దాదాపు 40 నుంచి 45 శాతంగా ఉంది. జూలై నెలాఖరుకల్లా వాణిజ్య ఉత్పత్తి.. కొత్త యూనిట్ వాణిజ్య ఉత్పత్తిని వచ్చే నెల చివరికల్లా మొదలయ్యేలా చూడాలని ఏపీ జెన్కో, బీహెచ్ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. గ్రిడ్ అనుసంధానం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన విద్యుత్ ఉత్పత్తిని సాధించాలన్నారు. విద్యుత్ రంగానికి సీఎం వైఎస్ జగన్, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని వివరించారు. అత్యుత్తమ విధానాలు అవలంభించడానికి, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో, అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నిర్వహణలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో ఏపీ జెన్కో డైరెక్టర్లు చంద్రశేఖరరాజు, బి.వెంకటేశులురెడ్డి, సయ్యద్ రఫీ, సత్యనారాయణ, ఆంటోనీ రాజా పాల్గొన్నారు. -
సింగరేణి @ 4000 మెగావాట్లు !
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ విద్యుదుత్పత్తి రంగంలో తెలంగాణ జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానంగా కొత్త విద్యుత్ కేంద్రాల స్థాపన ద్వారా తమ థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 4000 మెగావాట్లకు పెంచుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిపిన సింగరేణి సంబురాల్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఈ విషయాన్ని ప్రకటించారు. సింగరేణి సంస్థ ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 2 వేల ఎకరాల్లో 1,200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తూ, ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల కొత్త సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను ఇటీవలే ప్రారంభించింది. 800 మెగావాట్ల మరో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 2800 మెగావాట్లకు పెంచుకోలని ఈ ఏడాది ప్రారంభంలోనే సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజాగా 4000 మెగావాట్లకు థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించడంతో, మరో 1200(2్ఠ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను సంస్థ ఏర్పాటు చేయాల్సి ఉండనుంది. 4400 మెగావాట్లకూ పెరిగే అవకాశం.. కొన్నేళ్ల నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో 600 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు. దాంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 1600(2్ఠ800) మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లను సింగరేణి నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సింగరేణి థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 4400 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉంది. జెన్కో, ఎన్టీపీసీలకు గట్టి పోటీ.. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) రాష్ట్రంలో మొత్తం 4042.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ పూర్తి సామర్థ్యం 8042.5 మెగావాట్లకు పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎన్టీపీసీ’ రామగుండంలో 2600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తుండగా, చివరి దశలోని 1600(2్ఠ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తయితే సంస్థ సామర్థ్యం 4200 మెగావాట్లకు పెరగనుంది. అదే సమయంలో 4400 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో సింగరేణి ఎన్టీపీసీని వెనక్కి నెట్టి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది. సౌర విద్యుత్ రంగంలో సైతం.. సింగరేణి సంస్థ భారీగా సౌర విద్యుదుత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి, 224 మెగావాట్ల ప్లాంట్ల పనులు పూర్తయి విద్యుదుత్పత్తి జరుగుతోంది. మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల పనులు చివరి దశలో ఉన్నాయి. భూపాలపల్లి, మందమర్రి, మణుగూరులో మరో 250 మెగావాట్ల సౌర విద్యత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సంస్థ సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం 550 మెగావాట్లకు పెంచుకోవాలని నిర్ణయించింది. -
‘సింహాద్రి’లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత
పరవాడ(అనకాపల్లి జిల్లా): సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. విద్యుత్ సరఫరాకు తగినంత డిమాండ్ లేని కారణంగా (రిజర్వు షట్డౌన్) రెండో యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుత్కు తగినంత డిమాండ్ లేకపోవడం వల్ల శుక్రవారం ఉదయం సంస్థలో 3, 4 యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి యూనిట్ నుంచి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. అవసరాలను బట్టి 2, 3, 4 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. అయితే, విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ లేని కారణంగా మొదటి యూనిట్ను కూడా త్వరలో తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
అవసరమైనంత విద్యుత్ అందిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిమాండ్ తగ్గట్టుగా ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రజలకు కరెంటు అందిస్తున్నాయని, ఇకమీదట కూడా ఎంత అవసరమైనా విద్యుత్ను సరఫరా చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులతో శుక్రవారం ఆయన వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా, రికార్డు స్థాయిలో 12,653 మెగావాట్ల గరిష్ట డిమాండ్తో 251 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం జరుగుతున్నా.. విద్యుత్ కోతలు విధించడం లేదని తెలిపారు. భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడం కోసం విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. భారీగా పెరుగుతున్న డిమాండ్ ఇంధన డిమాండ్ ఏటా పెరుగుతూ వస్తున్నదని, గతేడాది గరిష్ట డిమాండ్తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 27.51 శాతం పెరిగిందని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఉదాహరణకు, 2020 మార్చి నెలలో ఇంధన డిమాండ్ 5,853.39 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది మార్చిలో నెలవారీ ఇంధన డిమాండ్ దాదాపు 16 శాతం పెరుగుదలతో 6,781.54 మిలియన్ యూనిట్లకు చేరుకుందని చెప్పారు. అదేవిధంగా, 2020 మే నెలలో సగటు రోజు డిమాండ్ 180.69 మిలియన్ యూనిట్లుకాగా, ఈ ఏడాది మే 17 వరకు సగటు రోజు డిమాండ్ 16.33 శాతం పెరుగుదలతో 210.20 మిలియన్ యూనిట్లు ఉందని ఆయన వివరించారు. ఒక్క వైజాగ్ నగరంలోనే 2018–19లో 6,696 మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ డిమాండ్ 2021–22లో 8,164 మిలియన్ యూనిట్లకు, అంటే 22 శాతం పెరిగిందన్నారు. ఈ విధంగా ఇంధన వినియోగం పెరగడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంకేతమని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 9 గంటలు పగటిపూట విద్యుత్ సరఫరా ఉచిత విద్యుత్ పథకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా, ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. విద్యుత్ శాఖ ఎల్లప్పుడూ సన్నద్ధం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను మెరుగుపరచడానికి ప్రయతి్నస్తున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలతో రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా డిస్కంలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయని, సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నాయని ఆయన వివరించారు. థర్మల్ పవర్ ప్రొడక్షన్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్లు, పవర్ నెట్వర్క్ మొదలైన వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఏపీ విద్యుత్తు సంస్థలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మే 18న నమోదైన 251మిలియన్ యూనిట్ల డిమాండ్లో దాదాపు 103.294 మిలియన్ యూనిట్ల డిమాండ్ను ఏపీజెన్కో ప్లాంట్లు తీర్చాయని సంస్థ ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథీ్వతేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆవు పేడతో కరెంట్! వేములవాడలో బయోగ్యాస్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్లో రాష్ట్రంలోనే తొలిసారిగా బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో కోడెల సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ ఉండే 200 ఆవుల పేడ ఆధారంగా బయోగ్యాస్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే బయోగ్యాస్తో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో వేములవాడ పట్టణ అభివృద్ధి అథారిటీ(వీటీడీఏ) ద్వారా రూ.31.60 లక్షలను మంజూరు చేశారు. ఈ విద్యుత్ ప్లాంట్ను జూన్ ఒకటో తేదీలోగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మేరకు వేములవాడ మున్సిపల్ అధికారులు ప్లాంటు నిర్మాణ పనులను కోడెల సంరక్షణ కేంద్రం ఆవరణలో చేపట్టారు. సమీపంలోనే ఉన్న ప్రాంతీయ ఆస్పత్రికి ఇక్కడ ఉత్పత్తి అయ్యేవిద్యుత్ను అనుసంధానం చేయనున్నారు. నిత్యం 2.5 టన్నుల పేడతో.. తిప్పాపూర్లోని కోడెల సంరక్షణ కేంద్రంలో నిత్యం అందుబాటులో ఉండే 2.5 టన్నుల పశువుల పేడను బయోగ్యాస్ ప్లాంటుకు అందించనున్నారు. ఈ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయ్యే 30 కేవీఏ బయోగ్యాస్తో విద్యుత్ తయారు అవుతుంది. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే పర్యావరణహిత విద్యుత్ను వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి, వేములవాడ రాజన్న ఆలయానికి వినియోగించనున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయి.. తిప్పాపూర్లో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్లాంటు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాం. మరో పక్షం రోజుల్లో ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేసి, గ్రీన్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తాం. – నర్మద, మున్సిపల్ ఏఈ, వేములవాడ -
కృష్ణపట్నానికి ‘మహానది’ బొగ్గు
సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు కొరత తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజెన్కో) చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చేందుకు వీలుగా థర్మల్ కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన బొగ్గు సరఫరాను పెంచడానికి వివిధ సంస్థలతో ఇంధన సరఫరా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా.. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించింది. ఈ బొగ్గు సరఫరా సోమవారం నుంచి రైలుమార్గంలో మొదలైంది. ఫలించిన నిరంతర ప్రయత్నం.. ఏపీజెన్కో, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లు 5,811 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనికోసం ఎంసీఎల్ నుంచి సంవత్సరానికి 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్సీసీఎల్లు రాష్ట్రంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లకు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. అయితే, కొంతకాలంగా తీవ్ర బొగ్గు కొరత ఏర్పడటంతో సరఫరా కూడా మందగించింది. కేంద్ర ప్రభుత్వమే థర్మల్ కేంద్రాలకు బొగ్గు కోటాను నిర్ణయించడం మొదలుపెట్టింది. మరోవైపు.. థర్మల్కు బొగ్గు నిల్వలను సమకూర్చుకోవాలని కూడా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల నిరంతర పర్యవేక్షణలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు కోల్ ఇండియా లిమిటెడ్, మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్తో సంప్రదింపులు జరిపారు. దీంతో ఈ ఏడాది మార్చి 10 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల యూనిట్కు మే 1 నుంచి బొగ్గును కేటాయించడానికి ఎంసీఎల్ అంగీకరించింది. మరింత మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తి కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ యూనిట్తో రాష్ట్రంలోని రోజువారీ విద్యుత్ అవసరాలకు దాదాపు 16 మిలియన్ యూనిట్లు సమకూరుతున్నాయి. మహానది నుంచి దీనికి బొగ్గును సరఫరా చేయడంవల్ల విద్యుదుత్పత్తి మెరుగుపడుతుంది. తద్వారా అన్ని రంగాలకు ఎలాంటి లోడ్ రిలీఫ్ (ఎల్ఆర్)లు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. పెరుగుతున్న స్టేట్ గ్రిడ్ డిమాండ్ను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. – కేవీఎన్ చక్రధర్బాబు, ఎండీ, ఏపీజెన్కో -
‘సీలేరు’లో మరో రెండు విద్యుదుత్పత్తి యూనిట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాలను పెంచడంలో భాగంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులను సాధించడంలో మరో ముందడుగు పడింది. దిగువ సీలేరు హైడ్రో పవర్ హౌస్ వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ 115 మెగావాట్ల సామర్ధ్యంతో నాలుగు యూనిట్లు పనిచేస్తున్నాయి. తాజా అనుమతులతో యూనిట్ల సంఖ్య ఆరుకు పెరగనుంది. మరో 230 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రానుంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం వద్ద పవర్ కెనాల్ పనులను మెరుగుపరచనున్నారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంపాక్ట్ అసెస్మెంట్ విభాగం నుండి ఏపీ జెన్కోకు ఆదేశాలు అందాయి. ఉత్పత్తి సామర్ధ్యం పెంచేలా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. మోతుగూడెం వద్ద గల సీలేరు కాంప్లెక్స్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ స్థాపిత సామర్థ్యం 460 మెగావాట్లు. పవర్ హౌస్ నిర్మాణ సమయంలోనే 115 మెగావాట్ల సామర్ధ్యం గల మరో రెండు యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉండేలా చర్యలు తీసుకున్నారు. రూ. 415 కోట్లతో నిర్మించే ఈ యూనిట్లు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ఇంధన డిమాండ్ను తీర్చడానికి దోహదపడుతుంది. ఈ యూనిట్ల పనులను 2024 చివరికి పూర్తి చేయాలని ఏపీ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 2వ దశలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్–3 ఈ ఏడాది మార్చిలో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ యూనిట్ రోజూ దాదాపు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్ను రాష్ట్రానికి అందిస్తోంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల నూతన యూనిట్ మరో నెల రోజుల్లోనే వినియోగంలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్ ప్రారంభించిన 3 నెలల తర్వాత వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయి. కాంట్రాక్టర్ సిద్ధం దిగువ సీలేరు హైడ్రో ప్రాజెక్ట్ విస్తరణకు పర్యావరణ అనుమతి వచ్చిన విషయాన్ని ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్బాబు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్కో సీఎండీ కె.విజయనంద్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పీక్ టైమ్ డిమాండ్ను తీర్చడానికి, ప్రీమియం ధరకు విద్యుత్ కొనుగోలును నివారించడానికి అదనపు యూనిట్ల నిర్మాణాన్ని ఏపీ జెన్కో చేపట్టిందని, తద్వారా విద్యుత్, డబ్బు రెండూ ఆదా అవుతాయని చక్రధర్బాబు తెలిపారు. సీలేరులో అదనపు యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని, కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నందున, పనులను వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేస్తామని వివరించారు. విజయానంద్ స్పందిస్తూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతర పర్యవేక్షణ, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం వల్లనే ఇంధన రంగంలో ఇన్ని మైలురాళ్లను సాధించగలుగుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో జెన్కో డైరెక్టర్లు సత్యనారాయణ, వెంకటేశులురెడ్డి పాల్గొన్నారు. -
భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే
కర్నూలు(రాజ్విహార్): భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని గుమ్మితంతండా వద్ద ఏర్పాటుచేస్తున్న 5,230 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును ఆయన సోమవారం పరిశీలించారు. సజ్జల మాట్లాడుతూ ఒకే యూనిట్ నుంచి సోలార్(సూర్యరశ్మి), విండ్(గాలి మరల ద్వారా), హైడల్(నీటి) ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3 వేల మెగా వాట్లు, విండ్ పవర్ 550 మెగా వాట్లు, హైడల్ పవర్ 1,680 మెగా వాట్లు, మొత్తం 5,230 మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదేళ్లలో పూర్తి చేసి, నేషనల్ గ్రిడ్కు అనుసంధానం చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. ఈ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 23వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించిందని, ఇందులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని గ్రీన్కో ప్రతినిధులతో అన్నారు. వైఎస్సార్సీపీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, బీవై రామయ్య పాల్గొన్నారు. -
అలల ఒడి నుంచి విద్యుత్!
సాక్షి, అమరావతి: సముద్ర అలల నుంచి విద్యుత్ పుట్టించవచ్చా.. సముద్ర కెరటాలతో వెలుగులు పంచవచ్చా.. ఆటుపోట్ల నుంచి శక్తిని ఉత్పత్తి చేయవచ్చా.. అనే అలోచనలతో శాస్త్రవేత్తలు జరుపుతున్న ప్రయోగాలు విజయవంతమై ఆచరణలోకి వస్తున్నాయి. ప్రపంచానికి భవిష్యత్లో కరెంటు కష్టాలు ఉండవనే ఆశలు కల్పిస్తున్నాయి. సముద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో సవాళ్లు, గ్రిడ్ కనెక్టివిటీ లేకపోవడంతో ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. మార్కెట్లలో గ్రిడ్లు చిన్నవిగా, అస్థిరంగానూ ఉంటాయి. అయినప్పటికీ సాంకేతికంగా.. ఆర్థిక పరంగా కష్టం, ఖర్చుతో కూడుకున్న ఓషన్ థర్మల్ ఎనర్జీ, వేవ్, టైడల్ పవర్ జనరేషన్ వంటి సముద్ర పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు ప్రస్తుతం 31 దేశాల్లో విస్తరిస్తున్నాయి. మెరైన్ టెక్నాలజీల నుంచి విద్యుత్ ఉత్పత్తి రెండేళ్ల క్రితంతో పోలిస్తే 33 శాతం పెరిగింది. మన రాష్ట్రంలోనూ అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఆలోచనపై అధ్యయనం జరిగిందంటే.. ఈ సాంకేతికత ఎంతగా విశ్వవ్యాప్తమయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐరోపాలో ఈ ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర శక్తి సామర్థ్యంలో 98 శాతం వాటా దక్షిణ కొరియా, ఫ్రాన్స్, కెనడా దేశాలదే. పెట్రోలియం, పెట్రోలియం ఆధారిత ఇంధనాలపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉండటంతో అనేక దేశాలు సముద్రం, ఉష్ణ, హైడ్రోజన్, ఆఫ్ షోర్ విండ్, సోలార్ వంటి టెక్నాలజీలలో పెట్టుబడి పెడుతున్నాయి. రెట్టింపు కంటే ఎక్కువ విద్యుత్ ఆగ్నేయాసియాలో అలల నుంచి విద్యుత్ ఉత్పత్తికి గల అవకాశాలను నిపుణులు పరిశీలించారు. అక్క డి తీర ప్రాంతాలకు టైడల్ శక్తిని ఉత్పత్తి చేసే సా మర్థ్యం ఉందని గుర్తించారు. భారత్, పసిఫిక్ మ హాసముద్రంలోని మారిటైమ్ ఆగ్నేయాసియా అ ని పిలిచే ద్వీపాలు, సముద్ర సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి. పునరుత్పాదక శక్తి సాంకేతికతలను అక్కడ నివసిస్తున్న 660 మిలియన్లకు పైగా ప్రజలకు ఎలా ఉపయోగించవచ్చనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. వాటిలో భాగంగా ఓషన్ థర్మల్ ఎనర్జీ, లవణ సాంకేతికతలు, వేవ్, టైడల్ పవర్ జనరేషన్ వంటి సముద్ర పునరుత్పాదక శక్తిపై దృష్టి సారించారు. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐరెనా) చెబుతున్న దాని ప్రకారం.. సముద్రాలకు పునరుత్పాదక శక్తి సామర్థ్యం చాలా ఎక్కువ. సముద్ర విద్యుత్ చిన్న ద్వీపం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు తక్కువ ఖర్చుతో, నాణ్యమైన విద్యుత్ అందించగలదని, సముద్రపు నీటి డీశాలినేషన్ ద్వారా తాగునీటి సరఫరాను పెంచుతుందని ‘ఇన్నోవేషన్ ఔట్లుక్–ఓషన్ ఎనర్జీ టెక్నాలజీస్’ నివేదిక నిర్ధారించింది. దీనివల్ల అదనంగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. స్థానికుల జీవనోపాధి మెరుగుపడుతుంది. సామాజిక–ఆర్థిక ప్రయోజనం లభిస్తుందని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు సవాళ్లను అధిగమించి, సముద్ర శక్తిని ఒడిసిపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ అధ్యయనం రాష్ట్రంలోనూ సముద్ర అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు పడ్డాయి. విశాఖ–కాకినాడ మధ్య తీరంలో 100 కేవీ అలల విద్యుత్ సంస్థను ఏర్పాటు చేయాలని భావించారు. నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (నెడ్కాప్) ఆధ్వర్యంలో అలల విద్యుత్పై ఓ అధ్యయనానికి శ్రీకారం జరిగింది. అలల విద్యుత్ కేంద్రాలు నెలకొల్పితే వాటిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ మొత్తాన్నీ జెన్కో కొనుగోలు చేసే అవకాశాలపైనా చర్చ జరిగింది. ఇందుకోసం 12 తీర ప్రాంతాల్లో కూడా అలల విద్యుత్ అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే, ప్రస్తుత తరుణంలో ఈ ప్రయత్నం అత్యంత ఖర్చుతోనూ, సాంకేతికంగా కష్టంగానూ కూడుకున్న వ్యవహారం కావడంతో మరింత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేవరకూ వేచి ఉండటం మంచిదని భావించి ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం లేదు. భవిష్యత్లో పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా మన రాష్ట్రంలోనూ అలల నుంచి కరెంట్ పుట్టే అవకాశాలు ఉన్నాయని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. -
సింగరేణికి మరో వందేళ్ల ఉజ్వల భవిష్యత్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతూ బహుముఖ వ్యాపార విస్తరణ చర్యలు తీసుకుంటున్న సింగరేణికి మరో వందేళ్లకుపైగా ఉజ్వల భవిష్యత్ ఉందని సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ అన్నారు. మరో ఐదేళ్లలో 10 కొత్త గనులు, 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో సుస్థిర ఆర్థిక పునాదులు ఏర్పరచుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్.. సింగరేణి తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, జాతిపిత మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించారు. అనంతరం సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సారి బొగ్గు ఉత్పత్తి 50 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు పెరిగిందని, టర్నోవర్ రూ.12 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు పెరిగిందని వివరించారు. ఇదే ఒరవడితో తదుపరి రూ.32 వేల కోట్ల టర్నోవర్, రూ.2 వేల కోట్ల లాభాల దిశగా పురోగమిస్తున్నామని వెల్లడించారు. సింగరేణి సంస్థ నెలకొల్పిన థర్మల్ విద్యుత్ కేంద్రం 90 శాతంపైగా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను సాధించి దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాలను అధిగమించి జాతీయ స్థాయిలో నంబర్ 1గా నిలవడం సింగరేణి కార్మికుల పనితీరుకు, అంకితభావానికి నిదర్శనని పేర్కొన్నారు. సింగరేణి పనితీరుకు మెచ్చి సీఎం కేసీఆర్.. మరో 800 మెగావాట్ల ప్లాంట్ను అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి సంస్థ అందించే థర్మల్ విద్యుత్ 2 వేల మెగావాట్లకు చేరుతుందని, అలాగే ప్రస్తుతం నిర్మించిన 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు అదనంగా మరో 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. పలువురికి సన్మానాలు ఈ సందర్భంగా సింగరేణి భవన్ నుంచి ఎంపిక చేసిన ఉత్తమ అధికారులు.. డీజీఎం(ఐటీ) గడ్డం హరిప్రసాద్, ఎస్ఓఎం (మార్కెటింగ్) సురేందర్ రాజు, ఉద్యోగుల నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ అహ్మద్, ఎంవీ డ్రైవర్ సుధాకర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఈడీ(కోల్ మూవ్మెంట్) జె.అల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం (మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, సీఎంవోఏఐ సాధారణ కార్యదర్శి ఎన్.వి.రాజశేఖరరావు, అడ్వైజర్(లా) లక్ష్మణ్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్ పాల్గొన్నారు. -
చెత్తతో ‘పవర్’ ఫుల్
సాక్షి, అమరావతి: మున్సిపాలిటీల్లో రోజురోజుకు పెరుగుతున్న చెత్తను.. ఉపయుక్తంగా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా చెత్త ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి కార్పొరేషన్తో పాటు సమీపంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను.. ప్రాసెస్ చేసేలా విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ గత నెలలో ఆదేశించారు. ఆ మేరకు ప్లాంట్ సామర్థ్యం, నిర్వహణపై రూపొందించిన నివేదికను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సమర్పించగా.. ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. దీంతో 7.5 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిద్ధమైంది. సమీప పట్టణ స్థానిక సంస్థల నుంచి రోజుకు సగటున 400 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 22 పట్టణ స్థానిక సంస్థల నుంచి చెత్త తరలింపు.. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 22 పట్టణ స్థానిక సంస్థలను క్లస్టర్గా ఏర్పాటు చేయనున్నారు. వీటి పరిధిలో రోజూ సుమారు 850 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంచనా వేసింది. ఇందులో 400 మెట్రిక్ టన్నులు పొడి వ్యర్థాలు కాగా, మిగిలింది తడి చెత్త. తడి వ్యర్థాలను ముమ్మిడివరం, అమలాపురంలో ఏర్పాటు చేసిన కంపోస్ట్ ప్లాంట్ల ద్వారా ఎరువుగా మారుస్తున్నారు. మిగిలిన చోట్ల ఉన్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్మేనేజ్మెంట్ ప్లాంట్లలో ఇనుము, గాజు, ప్లాస్టిక్, రబ్బర్ వంటివి వేరుచేస్తున్నారు. పునర్ వినియోగానికి, బయో ఎరువుగా మార్చేందుకు వీలులేని చెత్తను రాజమండ్రి వద్ద ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్కు తరలిస్తారు. పర్యావరణానికి హాని కలగకుండా.. దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టడం, నదీ జలాల్లో పడేయడం వంటి చర్యలు పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని నీతి ఆయోగ్ తేల్చింది. ఈ నేపథ్యంలో ఘన వ్యర్థాలను ఆధునిక పద్ధతుల్లో విద్యుత్గా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు అనుగుణంగా రూ.640 కోట్లతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో రెండు విద్యుత్ ప్లాంట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వీటిలో రోజూ సుమారు 1,600 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి దాదాపు 20 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఆయా ప్లాంట్లకు సమీపంలోని మున్సిపాలిటీల్లో సేకరించిన వ్యర్థాలను ఈ ప్లాంట్లకు తరలిస్తున్నారు. వీటి తరహాలోనే త్వరలో రాజమండ్రి వద్ద కూడా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
వచ్చేస్తోంది ‘పాతాళ విద్యుత్’.. ఎండుగడ్డితోనూ ఇంధనం
భూమికి 20 కిలోమీటర్ల అడుగున ఉద్భవించే ఉష్ణానికి రాళ్లు కూడా కరిగిపోతాయి. అక్కడ జనించే వేడిని శక్తివంతమైన తరంగాల ద్వారా బయటకు తెచ్చి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంటున్నారు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు. ఇప్పటికే ప్రయోగాలను పూర్తి చేసిన ఆ శాస్త్రవేత్తలు వచ్చే ఏడాది నుంచి ‘పాతాళ విద్యుత్’ ఉత్పత్తి చేసేందుకు వేగంగా ముందుకెళ్తున్నారు. మరోవైపు టర్కీలో రోడ్లపై వచ్చీపోయే వాహనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. ఇస్తాంబుల్ నగరంలో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. మన దేశంలోని పంజాబ్లో గడ్డి, ఇతర పంట వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. భారత్, అమెరికా, టర్కీ దేశాల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తి కోసం కొత్త ప్రయోగాలపై ఓ లుక్కేద్దాం పదండి. సాక్షి, అమరావతి: జల విద్యుత్.. థర్మల్ విద్యుత్.. పవన విద్యుత్.. సౌర విద్యుత్.. హైడ్రోజన్ విద్యుత్.. అణు విద్యుత్.. ప్రపంచం మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలివి. వీటికి తోడు కొత్త రకం విద్యుత్ ఉత్పత్తి విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే.. పరిమిత వనరులను వినియోగించుకుని.. అధిక ఫలితాలను సాధించే దిశగా చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తున్నాయి. భూమి పొరల మధ్య వేడిని ఒడిసిపట్టి.. ఉపరితలం నుంచి భూమి లోపలికి 20 కిలోమీటర్ల మేర రంధ్రం చేసి.. అక్కడ ఉండే అపరిమిత వేడిని బయటకు తీసుకువచ్చి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయడమే జియో థర్మల్ విద్యుత్ విధానం. భూమి పొరల్లోకి అంత లోతున రంధ్రం చేస్తే అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అంత వేడికి రాళ్లు కూడా కరిగిపోతాయంటారు. అంత వేడిని తట్టుకుని పనిచేసే డ్రిల్స్ ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేవు. అందుకే డ్రిల్స్ స్థానంలో శక్తిమంతమైన తరంగాలను వాడాలని నిర్ణయించారు. అక్కడి నుంచి ఉష్ణాన్ని పైకి రప్పించి.. భూమి ఉపరితలంపై ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. చీకటైతే సోలార్ పవర్ ఉండదు. నదులు ఎండిపోతే జలవిద్యుత్ ఉండదు. బొగ్గు లేకపోతే థర్మల్ ఉత్పత్తి జరగదు. కానీ, ఇవేమీ లేకపోయినా జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఆగదు. ఈ ప్రాజెక్టుకు ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు. కాబట్టి అడవులు, ప్రకృతి వనరులను ధ్వంసం చేయాల్సిన అవసరం రాదు. భూమిపై ఎక్కడైనా.. సమయంలోనైనా కరెంటును ఉత్పత్తి చేయొచ్చు. ఈ టెక్నాలజీపై అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ప్రయోగశాలలో పరీక్షలు కూడా పూర్తి చేశారు. 2024 నాటికి జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నారు. ట్రాఫిక్ నుంచీ విద్యుత్ ఉత్పత్తి టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ట్రాఫిక్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రోడ్ల మధ్యలోని డివైడర్ దగ్గర ప్రత్యేక పరికరాన్ని ఉంచుతున్నారు. ఆ పరికరంపై సోలార్ పవర్ ప్లేట్ అమర్చుతున్నారు. వాహనాలు వెదజల్లే వేడి ద్వారా ఆ సోలార్ ప్లేట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అదే పరికరానికి ఫ్యాన్ రెక్కల లాంటి వంపు తిరిగిన మూడు రెక్కలు అమర్చి, వాటికి టర్బైన్స్ పెడుతున్నారు. ఏదైనా వాహనం రోడ్డుపై వేగంగా వెళ్లినప్పుడు వచ్చే అధిక గాలి తగలగానే ఆ రెక్కలు గుండ్రంగా తిరుగుతున్నాయి. వాటికి సెట్ చేసిన టర్బైన్ కూడా తిరుగుతుంది. దాంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అవుతున్న విద్యుత్తో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. మిగిలిన కరెంటును ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఈ పరికరాల్లో వాతావరణాన్ని పరిశీలించే సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇవి భూకంపాల్ని కూడా గుర్తిస్తాయట. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి ఎంత ఉందో కూడా కనిపెడతాయట. వ్యవసాయ వ్యర్థాలతో విద్యుత్ మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పంట వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంలా వినియోగిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇక్కడి రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టేవారు. దీనివల్ల ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కాలుష్య సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. ముందుగా పంట వ్యర్థాలను పొగ రాకుండా మండించి బాయిలర్ నుంచి ఉత్పత్తి అయ్యే నీటి ఆవిరి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్తో పంజాబ్లో పరిశ్రమలను నడిపిస్తున్నారు. -
24న కృష్ణా బోర్డు ఆర్ఎంసీ భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశం ఈ నెల 24న హైదరాబాద్లో జరగనుంది. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ నియమావళిని రూపొందించడమే అజెండాగా ఈ సమావేశం ఉంటుంది. ఇప్పటికే ఆర్ఎంసీ నాలుగుసార్లు సమావేశమై శ్రీశైలం, సాగర్ నిర్వహణపై సమగ్రంగా చర్చించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఏ కాలువకు ఎప్పుడు నీరు విడుదల చేయాలి, విద్యుత్ ఉత్పత్తిని ఎలా చేయాలి, మళ్లించిన వరద జలాలను లెక్కలోకి తీసుకోవాలా... వద్దా... అనే అంశాలపై ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదాను 24న జరిగే భేటీలో చర్చించి, ఆమోదించనుంది. ఆ తర్వాత కృష్ణా బోర్డుకు ముసాయిదా నివేదిక సమర్పించనుంది. కృష్ణా బోర్డు సర్వసభ్య సమావేశంలో ఈ ముసాయిదాను చర్చించి, రెండు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు దానిలో మార్పులు, చేర్పులు చేసి నిర్వహణ నియమావళిని ఖరారు చేస్తారు. ఈ నియమావళి ఆధారంగా ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహించడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చరమగీతం పాడాలనేది బోర్డు లక్ష్యం. -
విద్యుత్ వస్త్రాలు.. కరెంట్ రోడ్లు..!
సాక్షి, అమరావతి: మనం ధరించే వస్త్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దానితో మన జేబులోనే సెల్ఫోన్ చార్జింగ్ పెట్టుకోవచ్చు. నడిచే రోడ్లపై కూడా కరెంట్ను సృష్టించవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు నిశ్చింతగా చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా... దీనిని ఆచరణలో సాధ్యం చేసి చూపించారు ఇంగ్లండ్, చైనా, స్విట్జర్లాండ్ వంటి దేశాల శాస్త్రవేత్తలు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో గ్రీసు దేశానికి చెందిన థేల్స్ అనే శాస్త్రవేత్త మొదటిసారి విద్యుత్ ఉనికిని గుర్తించారు. నాటి నుంచి విద్యుత్ రంగంలో సాంకేతికత రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. అవసరాలకు అనుగుణంగా నిత్యం కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఆ ఆవిష్కరణలు ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయి. ఒంటిపైన విద్యుత్ ఉత్పత్తి ఇంగ్లండ్లోని నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సౌరశక్తితో విద్యుత్ను ఉత్పత్తి చేసే వస్త్రాన్ని తయారు చేశారు. దీంతో ఫ్యాంట్ జేబులోనే సెల్ఫోన్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. నూలు పోగుల మధ్య 1,200 సూక్ష్మ సోలార్ ప్యానెల్స్ను అమర్చి ఈ వస్త్రాన్ని ఎండలో ఉంచి సౌరశక్తిని గ్రహించేలా చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇందుకోసం పరిశోధకులు 51 సెంటీమీటర్ల పొడవు, 27 సెంటమీటర్ల వెడల్పు ఉన్న వస్త్రాన్ని తయారు చేశారు. నీటిలో తడిచినా పాడవకుండా అందులో ఒక్కో సోలార్ సెల్ను పాలిమర్ రెజిన్ కోటింగ్ చేసి వాటర్ ప్రూఫ్గా మార్చారు. ఒక్కో సోలార్ సెల్ను చిన్న వైరుతో అనుసంధానం చేసి తీగగా మార్చారు. రెండు నూలు పోగుల మధ్య సోలార్ సెల్ తీగను అమర్చుకుంటూ వస్త్రాన్ని రూపొందించారు. ఈ వస్త్రాలు 400 మిల్లీవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశాయి. ఈ విద్యుత్ సెల్ఫోన్ చార్జింగ్కు సరిపోతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వస్త్రాన్ని 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఉతకవచ్చని వెల్లడించారు. దీనిని మరింత అభివృద్ధి చేసి జాకెట్లు, ఇతర వస్త్రాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రోడ్డుపైనే కరెంట్ ఉత్పత్తి విద్యుత్, ఆటోమొబైల్ రంగాలకు మధ్య సంబంధం రోజురోజుకూ బలపడుతోంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సోలార్ వంటి సా«ధనాల ద్వారా బ్యాటరీలకు చార్జింగ్ పెట్టడం జరుగుతోంది. ఇటీవల విద్యుత్ వాహనాలు పెరుగుతుండటంతో టైర్ల తయారీ కంపెనీలు చార్జింగ్ విభాగంలో కూడా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాయి. విద్యుత్ను ఉత్పత్తి చేసే టైర్లను తయారు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన గుడ్ ఇయర్ అనే అంతర్జాతీయ టైర్ల తయారీ సంస్థ ‘గుడ్ ఇయర్ బీహెచ్03’ అనే పేరుతో తయారు చేసిన కొత్త రకం టైర్లు, రోడ్డుతో రాపిడి (ఫ్రిక్షన్) వలన కలిగే వేడిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి సహకరిస్తాయి. ఇలా మారిన విద్యుచ్ఛక్తి కారులోని బ్యాటరీలను చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు చైనా, స్విట్జర్లాండ్, మరికొన్ని దేశాల శాస్త్రవేత్తలు సైకిల్, బైక్లు, కార్లు వంటి వాహనాలు నడిచే రోడ్లపై విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో ఈ ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసి ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం నాన్–స్లిప్ ఉపరితలం ఉన్న రోడ్లపై 50 చదరపు సెంటీ మీటర్ల పరిమాణం, రెండు సెంటీ మీటర్ల మందంతో ఉన్న సౌర పలకలను అమర్చుతున్నారు. ఇవి కాంక్రీట్ రహదారులకంటే గట్టిగా, వాహనాల బరువును తట్టుకునేలా రూపొందిస్తున్నారు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గృహ, వ్యాపార సముదాయాల అవసరాలకు వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ సర్కార్ ముందడుగు
-
65 శాతం పర్యావరణ అనుకూల విద్యుత్
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి తన మొత్తం విద్యుదుత్పత్తిలో 65 శాతాన్ని శిలాజేతర ఇంధనాల నుంచే కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీపై సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. 2030 నాటికి 90 గిగావాట్ల సోలార్ ఎక్విప్మెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ప్రస్తుతం ఈ సామర్థ్యం 20 గిగావాట్లుగా ఉన్నట్టు చెప్పారు. 15–20 గిగావాట్ల సోలార్ ఎక్విప్మెంట్ తయారీ సామర్థ్యం ఏర్పాటు దశలో ఉన్నట్టు తెలిపారు. పీఎల్ఐ పథకం కింద మరో 40 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు కానున్నట్టు చెప్పారు. అధిక సామర్థ్యం కలిగిన సోలార్ ఎక్విప్మెంట్ తయారీకి మళ్లాలని పరిశ్రమకు సూచించారు. మన దేశంలో ఇప్పటికే పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 170 గిగా వాట్లకు చేరుకుందని, మరో 80 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు దశలో ఉన్నట్టు చెప్పారు. ‘‘2030 నాటికి 50 శాతం పర్యావరణ అనుకూల ఇంధన విద్యుత్ సాధిస్తామని హామీ ఇచ్చాం. కానీ, దానికంటే ఎక్కువే సాధిస్తాం. 2030 నాటికి 65 శాతం కంటే ఎక్కువ సామర్థ్యం పర్యావరణ అనుకూల ఇంధనాల నుంచి ఉంటుంది. 2030 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను 33 శాతం తగ్గిస్తామని చెప్పాం. ఇప్పటికే 30 శాతం తగ్గించే స్థాయికి చేరుకున్నాం. కనుక 2030 నాటికి 45 శాతం తగ్గింపు లక్ష్యాన్ని సాధిస్తాం’’అని మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. -
ప్రజలకు అందుబాటు ధరల్లో విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు, భవిష్యత్ తరాలకు అందుబాటు ధరలో విద్యుత్ పుష్కలంగా ఉండేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం ఇంధనశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవడంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 2017–18లో 50,077 మిలియన్ యూనిట్లు ఉన్న డిమాండ్ 2021–22లో 60,943 మిలియన్ యూనిట్లకు (21.6 శాతం) పెరిగిందని తెలిపారు. వచ్చే మార్చి నాటికి డిమాండ్ రోజుకు 250 మిలియన్ యూనిట్లకు చేరుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం) స్టేజ్–2 (1్ఠ800 మెగావాట్లు) ఈ నెలాఖరుకు, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో స్టేజి–5 (1్ఠ800 మెగావాట్లు) వచ్చే మార్చి నాటికి ప్రారంభించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. పునరుత్పాదక విద్యుత్కు పెద్దపీట డిమాండ్ను అందుకోవడంతోపాటు విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు ఢోకా లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, నెడ్క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం!
పురాతన కాలం నుంచే భారతీయ సంస్కృతికి, వ్యవసాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సింధు నాగరికత కాలంలో వ్యవసాయం గురించి మనం చదువుకునే ఉంటాము. అప్పటి వినూత్న వ్యవసాయ పద్దతులతో ప్రజలు.. పంటలను సమృద్ధిగా పండించారు. కాగా, ఓ రైతు తాజాగా వినూత్న తరహాలో వ్యవసాయం చేస్తున్నాడు. కాగా, సృజనాత్మకత విషయానికి వస్తే భారతీయులు ప్రతీ ఒక్కరినీ ఓడించగలరని మరోసారి రుజువైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ రైతు ట్రేడ్మిల్ వంటి యంత్రంపై ఎద్దును నడిపిస్తూ సాగుకు కావాల్సిన నీటిని, మోటర్ల సాయంతో కరెంట్ను ఉత్పత్తి చేస్తున్నాడు. కాగా, ఎద్దు ట్రేడ్మిల్ వంటి యంత్రంపై నడుస్తుండగా పైపుల ద్వారా నీరు పంట పొలాలకు చేరుతోంది. అలాగే, మోటర్ల సాయంతో కరెంట్ను సైతం ఉత్పత్తి చేసి పంటల సాగుకు వాడుకుంటున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదరు వీడియోకు ‘రూరల్ ఇండియా ఇన్నోవేషన్. ఇట్స్ అమేజింగ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు సదరు క్రియేటివ్ రైతులను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. స్వదేశీ ఆవిష్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతాయని అన్నాడు. మరో యూజర్ మాత్రం.. జంతువులను శారీరకంగా హింసిస్తున్నాడంటూ కామెంట్స్ చేశాడు. RURAL INDIA Innovation. It’s Amazing!! pic.twitter.com/rJAaGNpQh5 — Awanish Sharan (@AwanishSharan) September 23, 2022 -
శ్రీశైలం డ్యామ్ @ 884
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయం నీటిమట్టం శనివారం సాయంత్రానికి 884.80 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాజెక్టులైన జూరాల, సుంకేసుల నుంచి 1,32,829 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. 10 అడుగుల మేరకు తెరచిన 2 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 55,966 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.769, ఎడమగట్టు కేంద్రంలో 17.008 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం 66,703 క్యూసెక్కుల నీటిని, స్పిల్ వే ద్వారా 1,03,623 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు వదిలారు. బ్యాక్వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 5,208 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కుల నీటిని వదిలారు. డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 1 మి.మీ. వర్షం కురిసింది. ప్రస్తుతం జలాశయంలో 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు, నాగార్జున సాగర్ జలాశయానికి వరదనీటి రాక తగ్గుముఖం పట్టింది. దీంతో రేడియల్ క్రస్ట్ గేట్లను తగ్గించారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 2 రేడియల్ క్రస్ట్గేట్లు, కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 1,25,577 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుండి అంతే నీటిని విడుదల చేస్తున్నారు. 8 రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా 64,128 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,886 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి మొత్తం 97,014 క్యూసెక్కులు వదులుతున్నారు. కుడి, ఎడమకాల్వలు, వరదకాలవకు కలిపి 15,563 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం 589.20 అడుగులు 309.6546 టీఎంసీలు ఉంది. ఎగువనుండి వచ్చే వరదను బట్టి గేట్లను పెంచడం, తగ్గించడం గేట్లను మూసివేయడం చేస్తున్నారు. కృష్ణా నదిపైగల జలాశయాలన్నీ జలకళతో ఉన్నాయి. -
పవర్ ఎవర్ 'గ్రీన్'
సాక్షి, అమరావతి: విద్యుత్ షాక్ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి స్మార్ట్గా ఆలోచించారు. సోలార్.. సో బెటర్ అని భావించారు. గ్రీన్ పవర్.. ఎవర్ గ్రీన్... అని విశ్వసించి తన ఐదు అంతస్తుల భవనం గోడలకు సౌర ఫలకాలను అమర్చారు. భవనాన్ని సోలార్ ప్యానల్ ఎలివేషన్తో అద్భుతంగా తీర్చిదిద్దారు. అందరూ భవనాలపై రూఫ్టాప్ సోలార్ సిస్టంను ఏర్పాటు చేస్తుంటారు. కానీ, ఆయన దానికి భిన్నంగా గోడలకు నిలువుగా ప్యానల్స్ను అమర్చారు. ఫుల్ ఎకో గ్రీన్ హోటల్గా రికార్డు సృష్టించారు. స్మార్ట్ సిటీ విశాఖపట్నంలోని గురుద్వార జంక్షన్ వద్ద ‘స్మార్ట్ ఇన్ ది గెస్ట్ హౌస్’ పేరుతో అన్నె నారాయణరావు (బాబ్జి) అనే వ్యాపారి నిర్మించిన ఈ భవనం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయంగా.. ఆదర్శవంతంగా... ఐదు అంతస్తుల భవనానికి సోలార్ ప్యానళ్లను నిలువుగా అమర్చడంతో అద్భుత డిజైన్లా కనిపిస్తుంది. ఈ భవనం ఆకర్షణీయంగా, అందరికీ ఆదర్శంగా కూడా ఉంది. భవనం ఎలివేషన్ కోసం నలుపు రంగు అద్దాలకు బదులుగా దాదాపు 200 సోలార్ ప్యానళ్లను నిలువుగా ఏర్పాటు చేశారు. ఈ ప్యానల్స్ రోజుకు దాదాపు 100 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. నెట్ మీటరింగ్ ద్వారా భవనానికి అవసరమైన 40శాతం విద్యుత్ వినియోగించుకుంటారు. మిగిలిన విద్యుత్ను యూనిట్ను రూ.6 చొప్పున ఏపీఈపీడీసీఎల్ ద్వారా గ్రిడ్కు విక్రయిస్తారు. రాత్రి వేళ భవన అవసరాలకు గ్రిడ్ నుంచి కరెంటు తీసుకుంటారు. ఈ భవనానికి సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రూ.45 లక్షలు ఖర్చయినట్లు యజమాని బాబ్జి ‘సాక్షి’కి తెలిపారు. తాము వినియోగించుకోగా, మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం ద్వారా ఎనిమిదేళ్లలో పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. భవనం పైన మరో 70 సోలార్ పలకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా... దేశం మొత్తం విద్యుత్ వినియోగంలో మూడో వంతు కన్నా ఎక్కువగా భవనాల్లోనే ఉంటుంది. ముంబైలోని ఓ డేటా సెంటర్లో దాదాపు ఒక మెగావాట్ సామర్థ్యం గల దేశంలోనే అతిపెద్ద బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ వర్టికల్ సోలార్ సిస్టంను 2019లో ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో విశాఖపట్నంలోనే తొలిసారిగా ఈ తరహాలో ‘స్మార్ట్ ఇన్ ది గెస్ట్ హౌస్’ పేరుతో ఒక హోటల్ నిర్మించారు. ఇక్కడ 15 రోజుల కిందట విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు 250 నుంచి 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని యజమాని బాబ్జి తెలిపారు. త్వరలోనే పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు సంప్రదాయ గాజు అద్దాల స్థానంలో సౌర పలకలు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తితోపాటు సూర్య కిరణాలను నిరోధించి థర్మల్ ఇన్సులేషన్ తరహాలో పనిచేస్తాయి. దీనివల్ల ఏసీల వినియోగాన్ని కూడా తగ్గించవచ్చు. గాజు వినియోగం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారించవచ్చని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో మాదే తొలి గ్రీన్ బిల్డింగ్ ‘పర్యావరణాన్ని కాపాడటంతోపాటు విద్యుత్ బిల్లుల భారం నుంచి బయటపడటం కోసం ఎంతో శ్రమించి భవనం మొత్తం సోలార్ పలకలతో నిర్మించాం. భవనం రూఫ్టాప్ మీద కూడా సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో రాష్ట్రంలోనే మాది తొలి గ్రీన్ బిల్డింగ్ అని భావిస్తున్నాం. ఈ మేరకు సర్టిఫికెట్ పొందడం కోసం విశాఖ నగరపాలక సంస్థ అధికారులకు దరఖాస్తు చేశాం.’ –బాబ్జి, భవన యజమాని, విశాఖపట్నం -
ఇతర రాష్ట్రాలకూ విద్యుత్ ఎగుమతి
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను భారీ స్థాయిలో నెలకొల్పడం ద్వారా భవిష్యత్లో ఇతర రాష్ట్రాలకు విద్యుత్ను ఎగుమతి చేసే స్థాయికి ఏపీ చేరనుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం వర్చువల్ విధానంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కొత్త యూనిట్ల ప్రారంభం ద్వారా రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్(ఎస్డీఎస్టీపీఎస్) కృష్ణపట్నం రెండో దశలో 800 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి ఈ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(డాక్టర్ ఎన్టీటీపీఎస్) ఐదో దశలో మరో 800 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకొస్తుందని మంత్రి వివరించారు. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక(పవన, సౌర, జల) ఇంధన ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దేశంలోనే ఇది వినూత్న ప్రయోగమన్నారు. ఇంత భారీ స్థాయిలో విద్యుదుత్పత్తి వల్ల మన రాష్ట్రం నుంచి విద్యుత్ను వాణిజ్య పరంగానూ ఎగుమతి చేయవచ్చని మంత్రి వివరించారు. అప్పులు, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చటం, ట్రూ అప్, ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ, నైపుణ్య అభివృద్ధి వంటి అంశాలపై అసత్య ప్రచారాలను ప్రజలు విశ్వసించరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భవిష్యత్లోనూ పెద్ద ఎత్తున పవన విద్యుదుత్పత్తికి అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటిరోలోజీ ఇచ్చిన నివేదికను మంత్రి స్వాగతించారు. -
దేశంలో రికార్డ్ స్థాయిలో సౌర వెలుగులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో రికార్డు స్థాయిలో 7.2 గిగావాట్ల సౌర విద్యుత్ తోడైంది. 2021 సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 59 శాతం వృద్ధి అని మెర్కామ్ ఇండియా రిసర్చ్ తెలిపింది. భారత సౌర విద్యుత్ మొత్తం సామర్థ్యం ప్రస్తుతం 57 గిగావాట్లకు చేరుకుంది. ‘గతేడాది జనవరి–జూన్లో 4.5 గిగావాట్ల సౌర విద్యుత్ కొత్తగా జతకూడింది. 2022 ఏప్రిల్–జూన్లో 59 శాతం అధికమై 3.9 గిగావాట్లు తోడైంది. 2022 జనవరి–జూన్లో, అలాగే జూన్ త్రైమాసికంలో ఈ రంగంలో అత్యధిక సామర్థ్యం జతకూడింది. సరఫరా పరిమితులు, పెరుగుతున్న ఖర్చులతో అధిక సవాళ్లు ఉన్నప్పటికీ సౌరశక్తి విషయంలో భారత్ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. ఏప్రిల్–జూన్లో 9 గిగావాట్ల ప్రాజెక్టుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థలు టెండర్లను పిలిచాయి. 2021తో పోలిస్తే ఇది 8 శాతం వృద్ధి. 2022 ఏప్రిల్ 1 నుంచి సోలార్ మాడ్యూల్స్పై 40, సోలార్ సెల్స్పై 25 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అమలవుతోంది. దీంతో వీటి ధరలు గణనీయంగా పెరిగాయని ఆయన చెప్పారు. చదవండి: మా రేంజ్ అంతే.. డాక్టర్లకు వల-వెయ్యి కోట్ల తాయిలాలపై డోలో 650 తయారీ కంపెనీ స్పందన -
సహజ వెలుగులు ప్రసరించాల్సిందే!
సాక్షి, అమరావతి: సహజ వెలుగుల వినియోగాన్ని పెంచడం ద్వారా వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరోసారి దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర అవసరాలకు వినియోగించే విద్యుత్లో దాదాపు 25 శాతం విద్యుత్ను సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి నుంచే తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు 2022–23కి పునరుత్పాదక కొనుగోలు బాధ్యత (ఆర్పీవో)ను తాజాగా ప్రకటించింది. లక్ష్యాన్ని సాధించలేకపోతే జరిమానా.. గతేడాది 21 శాతంగా ఉన్న ఆర్పీవో అంతకుముందు రెండేళ్లలో వరుసగా 17 శాతం, 19 శాతంగా ఉంది. ఈ లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ వంద శాతం పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఏపీతోపాటు గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు మాత్రమే నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. లక్ష్యానికి తగ్గట్టుగా పునరుత్పాదక విద్యుత్ను వినియోగించలేకపోయిన రాష్ట్రాల్లో యూనిట్కు 25 పైసల నుంచి 30 పైసల వరకూ తొలి ఏడాది జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. ఆ తర్వాత దాన్ని యూనిట్కు 35 పైసల నుంచి 50 పైసలకు పెంచాలనుకుంటోంది. ధరలను నిర్ణయించే అధికారం ఈఆర్సీదే.. 2030 చివరి నాటికి ఆర్పీవోను 43 శాతానికి పెంచుతామని కేంద్రం వెల్లడించింది. 2023–2030 మధ్య 24.61 శాతం నుంచి 43.33 శాతం వరకు ఆర్పీవోను పెంచుకుంటూ వెళ్లనుంది. దీనిలో పవన విద్యుత్ ఆర్పీవో లక్ష్యం.. 0.81–6.94 శాతం. కాగా జల విద్యుత్ 0.35–2.82 శాతం, సౌర విద్యుత్ 23.44–33.57 శాతంగా ఉంటుంది. రాష్ట్రాలు దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. పునరుత్పాదక విదుŠయ్త్ ధరలను కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) నిర్ణయించనుంది. ఏపీలో ఆర్ఈ సామర్థ్యం 10,826 మెగావాట్లు.. దేశంలో 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఈ ఏడాది చివరి నాటికి 175 గిగావాట్లు పూర్తి చేయాలనుకుంటోంది. కాగా రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి పునరుత్పాదక విద్యుత్ (ఆర్ఈ) స్థాపిత సామర్థ్యం దాదాపు 10,826 మెగావాట్లకు చేరింది. దీనిలో 4,096.65 మెగావాట్లు పవన విద్యుత్, 3,490.48 మెగావాట్లు సౌర విద్యుత్, 1,610 మెగావాట్లు జల విద్యుత్, 566.04 మెగావాట్లు జీవ(బయో) విద్యుత్, 162.11 మెగావాట్లు చిన్న జల విద్యుత్, ఇతర పునరుత్పాదక విద్యుత్ 900.72 మెగావాట్లు ఉన్నాయి. -
వికసించిన ‘సౌర’ పుష్పం
సహజ వనరుల వినియోగంలో జీవీఎంసీ రోల్ మోడల్గా వ్యవహరిస్తోంది. తన పరిధిలోని అన్ని వ్యవస్థల్లో సోలార్ విద్యుత్ వినియోగిస్తోంది. వినూత్నంగా ఆలోచిస్తూ విద్యుత్ బిల్లులు ఆదా చేయడంతో పాటు కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ముడసర్లోవలో రిజర్వాయర్లో దేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్.. తాజాగా మేహాద్రిగెడ్డపై మరో ప్లాంట్ను పూర్తి చేసింది. రూ.14.04 కోట్లతో 3 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ నుంచి విద్యుదుత్పత్తి గత నెల 30 నుంచి ప్రారంభమైంది. సాక్షి, విశాఖపట్నం : సోలార్ విద్యుత్పై నగర ప్రజలకు అవగాహన కల్పించి.. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు జీవీఎంసీ ఒక్కో ప్రాజెక్టు పూర్తి చేస్తోంది. ఇప్పటికే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా ఏకంగా 7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తయ్యేలా వివిధ ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది. తమ పరిధిలో ఉన్న జీవీఎంసీ భవనాలపై విద్యుత్ ‘సౌర’భాలు పూయిస్తోంది. నీటిపై సౌర ఫలకలు తేలియాడుతూ విద్యుత్ ఉత్పత్తి చేసేలా దేశంలోనే అతి పెద్ద తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ముడసర్లోవలో రిజర్వాయర్లో రూ.11.37 కోట్లతో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు నిర్మించింది. దేశంలో తొలి అతి పెద్ద ప్రాజెక్టుకు బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. ఇప్పుడు దానికంటే పెద్ద ప్రాజెక్టును మేహాద్రి గెడ్డపై ఏర్పాటు చేసి.. ఔరా అనేలా చేసింది. రూ.14.04 కోట్లు.. 3 మెగావాట్లు 2019 డిసెంబర్లో పనులు ప్రారంభించి, ఈ ఏడాది మార్చిలో పూర్తి చేశారు. రూ.14.04 కోట్లతో మొత్తం 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టు సిద్ధమైంది. తడిచినా తుప్పుపట్టని, జర్మన్ టెక్నాలజీ కలిగిన అత్యాధునిక ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. రెండు మీటర్ల పొడవు, ఒక మీటర్ వెడల్పు కలిగిన 9,020 ఫోమ్ టెక్నాలజీతో కూడిన ఎల్లో ట్రూపర్స్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. గుర్గావ్కు చెందిన రెన్యూ సోలార్ సిస్టమ్ ప్రై. లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టింది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(వీసీఐసీడీపీ)లో భాగంగా ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి అర్బన్ క్లైమేట్ చేంజ్ రెసిలియన్స్ ట్రస్ట్ ఫండ్(యూసీసీఆర్టీఎఫ్) నిధులతో ప్రాజెక్టు పూర్తి చేసింది. 12 ఎకరాలు.. 40 శాతం నీరు ఆదా సాధారణంగా 3 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ నిర్మించేందుకు 12 ఎకరాల విస్తీర్ణం అవసరం ఉంటుంది. కానీ మేహాద్రి రిజర్వాయర్లో నీటి ఉపరితలంపై ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో 12 ఎకరాలు ఆదా చేయగలిగారు. రిజర్వాయర్లోని 0.1 శాతం విస్తీర్ణంలో అంటే 0.005 చ.కి.మీ విస్తీర్ణంలో సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్స్ నీటి ఉపరితలంపై ఉండటంతో రిజర్వాయర్లోని నీరు ఆవిరి కాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా 40 శాతం వరకూ నీటిని కూడా ఆదా చేస్తుంది. మరో మైలురాయి అధిగమించాం.. ఇటీవల కాలంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్పై దృష్టిసారించాం. విద్యుత్ ఆదా చేస్తే ప్రజలతో పాటు నగరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయంలో నగరవాసులకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ముందుగా జీవీఎంసీ నుంచే సోలార్ విద్యుత్ వినియోగం ప్రారంభిస్తున్నాం. మేహాద్రిగెడ్డపై రెండో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు మంచి ఫలితాలందిస్తోంది. – గొలగాని హరి వెంకటకుమారి, నగర మేయర్ ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత కమిషనర్ సూచనల మేరకు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించాం. మేహాద్రిగెడ్డపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ఐదేళ్ల పాటు అప్పగించాం. 20 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఆధునిక సాంకేతికతతో ప్యానెల్స్ ఏర్పాటు చేశాం. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రాజెక్టులతో దాదాపు 20 వేల టన్నులకు పైగా కర్బన ఉద్గారాల్ని నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాం. – రవికృష్ణరాజు, జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ -
దేశంలో డిస్కంల బకాయిలు రూ.1,32,432 కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.1,32,432 కోట్లకు చేరాయి. గతేడాది జూన్లో రూ.1,27,306 కోట్ల బ కాయిలు ఉండగా ఈ ఏడాది నాలుగు శాతం పెరిగాయి. ఉత్పత్తిదారులు, డిస్కంల మధ్య విద్యుత్ కొనుగోలు లావాదేవీల్లో పారదర్శకత తీసుకురావడానికి 2018 మే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రాప్తి పోర్టల్ ఈ వివరాలను వెల్లడించింది. విద్యుత్ సరఫరాకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేసేందుకు విద్యుత్ ఉత్పత్తిదారులు డిస్కంలకు 45 రోజుల గడువు ఇచ్చారు. ఆ గడువు తర్వా త కూడా చెల్లించని మొత్తం రూ.1,15,128 కోట్లుగా ఉంది. ఇది ఏడాది కిందట ఇదే నెలలో రూ.1,04,095 కోట్లుగా ప్రాప్తి పోర్టల్ పేర్కొంది. దీన్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, జమ్మూ–కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్లలోని డిస్కంలదే ఎక్కువ. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రూ.6,627.28 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేసి ఇప్పించాల్సిందిగా తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. జెన్కోల కోసం డిస్కంలకు రుణాలు గడువు ముగిసిన తరువాత డిస్కంలు బకాయిలను ఆలస్యంగా చెల్లించినందుకు జెన్కోలు జరిమానా వడ్డీని వసూలు చేస్తుంటాయి. కానీ కేంద్రం ఈ జరి మానా సర్చార్జీలను మాఫీచేసింది. దీర్ఘకాలిక రుణాల గడువును పదేళ్ల వరకు పెంచుతూ గత మే నె లలో ప్రభుత్వం రూ.90 వేల కోట్ల లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ స్కీమ్ (ఎల్ఐఎస్)ను ప్రకటించింది. తద్వారా డిస్కంలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)ల నుంచి రుణాలు పొందాయి. ఆ తరువాత ఎల్ఐ ఎస్ ప్యాకేజీని రూ.1.35 లక్షల కోట్లకు పెంచారు. విద్యుత్ ఉత్పత్తి కంపెనీ (జెన్కో)లకు ఊరట కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జెన్కోలకు కట్టాల్సిన బకాయిలు చెల్లిస్తారని ప్రభుత్వం భావించింది. -
వ్యర్థానికి అర్థం.. ఏపీ ప్రభుత్వ కృషి ఫలితం
సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లోని ఘన వ్యర్థాలను సేకరించి వీలైనంత మేర పునర్ వినియోగానికి అనువుగా మానవాళికి ఉపయోగపడేలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాన్ని ఇవ్వబోతోంది. ముఖ్యంగా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న సంకల్పంతో గుంటూరు, విశాఖపట్నం నగరాల సమీపంలో ఏర్పాటు చేసిన రెండు జిందాల్ ఎకోపోలిస్ పవర్ ప్లాంట్లలో ఒక దానిని మంగళవారం అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అందుకు అనుగుణంగా గుంటూరు జిల్లా కొండవీడు సమీపంలోని ప్లాంట్ వద్ద ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ప్లాంట్లో కొన్ని నెలలుగా భారీ స్థాయిలో చెత్తను మండించి సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 1,600 టన్నుల చెత్త అవసరం కాగా, ప్రస్తుతం సమీపంలోని పట్టణాల నుంచి 830 టన్నులు మాత్రమే వస్తోంది. గతంలో ఈ ప్లాంట్ గరిష్టంగా 11 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకుంది. అయితే, ప్లాంట్ అవసరాలు తీర్చేందుకు మరికొన్ని పట్టణాల నుంచి కూడా చెత్తను ఇక్కడకు తరలించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు యోచిస్తున్నారు. జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను డిస్కంలు తీసుకుంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల నుంచి ప్రతిరోజు సుమారు 6,900 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నట్టు క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమం ద్వారా తెలుస్తోంది. ఆ చెత్తను వీలైనంత మేర పర్యావరణానికి హాని కలగని రీతిలో ప్రాసెస్ చేసి అర్థవంతంగా మార్చేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రూ.640 కోట్లతో ప్లాంట్లు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులబెట్టడం, నదీ జలాల్లో పడేయడం వంటి చర్యలు పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నట్టు నీతి ఆయోగ్ పేర్కొంది. ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా మారాయని, జీవజాలం కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో ఘన వ్యర్థాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ పద్ధతుల్లో అర్థవంతంగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. దాంతో ఆంధ్రప్రదేశ్లో రూ.640 కోట్లతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో రెండు జిందాల్ ఎకోపోలిస్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు, వాటికి అవసరమైన చెత్తను సమీపంలోని మునిసిపాలిటీల నుంచి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు రెండు ప్రాంతాల్లో మొత్తం 30 మెగావాట్ల (15+15) సామర్థ్యంతో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆయా సంస్థలకు అవసరమైన చెత్తను సమీప మునిసిపాలిటీల నుంచి అందిస్తున్నారు. ఇక్కడ పర్యావరణానికి హాని కలగని రీతిలో విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ప్లాంట్ల డిమాండ్ మేరకు మరింత చెత్తను గ్రామాల నుంచి కూడా సేకరించి అందించాలని యోచిస్తున్నారు. కాగా, త్వరలో రాజమండ్రి వద్ద మరో 7.5 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే మరో 400 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. -
ఏపీజెన్కో ప్రాజెక్టులో పగిలిపోయిన ఈఎస్పీ హాపర్స్
ముత్తుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్టులో శుక్రవారం 2వ యూనిట్కి సంబంధించిన (ఈఎస్పీ) యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ హాపర్స్ పగిలిపోయాయి. 30 టన్నుల బూడిద సామర్థ్యం కలిగిన 2 హాపర్స్ హటాత్తుగా పగిలిపోవడంతో ప్రాజెక్టు అంతా ఫ్లైయాస్(బూడిద) వ్యాపించి, దట్టంగా పైకిలేచింది. ఇప్పటికే 1వ యూనిట్లో విద్యుదుత్పత్తి నిలిపివేయగా, ఈ ఘటనతో 2వ యూనిట్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయింది. బూడిదతో నిండిపోయే ఈ ఇనుప రేకులతో తయారు చేసిన హాపర్స్ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి, బూడిదను తొలగించాల్సిన బాధ్యత ప్రత్యేకంగా ఒక కాంట్రాక్టు సంస్థ నిర్వహిస్తోంది. అయితే, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం, యాష్ ప్లాంట్ ఇంజనీర్ల పర్యవేక్షణలోపం కారణంగా ఈ ఘటన జరిగింది. అయితే, ఈ హాపర్స్ నుంచి బూడిద సక్రమంగా వెలుపలకు రాకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి, పగిలిపోయి ఉంటాయని మరో వాదన వినిపిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి జరిగే క్రమంలో నిత్యం వేల టన్నుల ఫ్లైయాస్ వెలుపలకు చేరుతుంది. ఈ క్రమంలో 2 హాపర్స్ నిండిపోయి, పగిలిపోవడం వల్ల ఈ ప్రాంతమంతా బూడిద అలుముకొంది. పూర్తిగా విద్యుదుత్పత్తి నిలిపివేశారు. దీంతో కిందపడే బూడిదను ట్రాక్టర్ల ద్వారా తొలగించే ప్రక్రియ చేపట్టారు. మండుటెండల్లో విద్యుచ్ఛక్తికి విపరీతమైన డిమాండ్ ఉన్న పరిస్థితిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో కార్మికులు, ఉద్యోగులు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం, ప్రాణనష్టం జరగలేదు. -
జల విద్యుదుత్పత్తి ఈ ఏడాదీ 100 శాతం
సాక్షి, హైదరాబాద్: జల విద్యుదుత్పత్తి విషయంలో తగ్గేదే లేదన్న ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జలాశయాల్లో నిల్వలు, సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా గతేడాది తరహాలో ఈ ఏడాది కూడా 100 శాతం సామర్థ్యంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నట్టు తెలంగాణ జెన్కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు వెల్లడించాయి. రానున్న వర్షా కాలంలో ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభమైన వెంటనే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభిస్తామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ అలా.. రాష్ట్రం ఇలా శ్రీశైలం, నాగార్జునసాగర్లో విద్యుదుత్పత్తి విషయమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా శ్రీశైలంలో తెలంగాణ విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి జరుపుతోందని ఏపీ ఆరోపిస్తుండగా..విద్యుదుత్పత్తి అవసరాల కోసమే శ్రీశైలం జలాశయం నిర్మాణం జరిగిందంటూ రాష్ట్రం వాదిస్తోంది. రాష్ట్ర అవసరాల మేరకు జలవిద్యుదుత్పత్తి కొనసాగిస్తామని, జల విద్యుత్ కేంద్రాలపై కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పెత్తనాన్ని అంగీకరించేది లేదని తేల్చిచెబుతోంది. దుర్వినియోగం కాదు.. 2500 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన తెలంగాణలోని జలవిద్యుత్ కేంద్రాల్లో 100 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాలని జెన్కోను ఆదేశిస్తూ గతేడాది జూన్ 28న తెలంగాణ ఇంధన శాఖ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేయడంతో నీళ్లు వృథాగా సముద్రం పాలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీశైలం జలాశయం వేసవికి ముందే ఖాళీ అయింది. కృష్ణా నదికి గతేడాది 1,100 టీఎంసీలు రాగా, ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 5 టీఎంసీలకు మించి నిల్వలు లేవు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విచ్చలవిడిగా విద్యుదుత్పత్తి జరిపి శ్రీశైలం జలాశయాన్ని దుర్వినియోగం (మిస్ మ్యానేజ్మెంట్) చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే రాష్ట్ర విద్యుత్ అవసరాలు భారీగా పెరిగిపోయాయని, ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు జల విద్యుదుత్పత్తి తప్ప మరో మార్గం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇది దుర్వినియోగం కాదని, సంక్షోభ నివారణ కోసం జల విద్యుదుత్పత్తి చేస్తున్నామని పేర్కొంటోంది. -
సింహాద్రిలో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ
పరవాడ (పెందుర్తి): అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపంతో మంగళవారం ఉదయం నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తిని బుధవారం పునరుద్ధరించారు. వర్షం కారణంగా మంగళవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింహద్రి ఎన్టీపీసీలో నాలుగు యూనిట్లలో రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే. నిపుణులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. బుధవారం ఉదయానికల్లా 1, 3, 4 యూనిట్ల నుంచి పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా, మధ్యాహ్నం 12 గంటలకు రెండో యూనిట్ నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ప్రస్తుతం నాలుగు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోందని పీఆర్వో టి.మల్లయ్య వివరించారు. -
సింహాద్రిలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
పరవాడ/పెదగంట్యాడ/సీలేరు: అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం వల్ల 4 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 2వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింహాద్రి ఎన్టీపీసీలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ను కలపాక, గాజువాక 400 కేవీ సబ్స్టేషన్లకు సరఫరా చేస్తారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఉరుములు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం వల్ల సబ్స్టేషన్ల లైన్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సింహాద్రి ఎన్టీపీసీలోని 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన సాంకేతిక నిపుణులు.. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి కల్లా నాలుగో యూనిట్ నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరుగుతుందని, బుధవారం ఉదయానికి మిగిలిన 3 యూనిట్ల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. హిందూజా, సీలేరులోనూ అంతరాయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వల్ల సాంకేతిక లోపం తలెత్తడంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోనూ 420 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. పెందుర్తి 400 కేవీ సబ్స్టేషన్ నుంచి గ్రిడ్కు వెళ్లాల్సిన లైన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో యూనిట్లు ట్రిప్ అవ్వడంతో మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖ, అనకాపల్లి, పాడేరు జిల్లాల్లోని పలు చోట్ల తెల్లవారుజామున 3.15 నుంచి 5 గంటల వరకు విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యను పరిష్కరించి విద్యుత్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు. హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో కలపాక వద్ద గల సబ్స్టేషన్లో హై ఇన్సులేషన్ ఫీడర్ ఆగిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
గాలి పటాలతో కరెంటు ఉత్పత్తి..
-
గాలిపటాలతో విద్యుత్ ఉత్పతి..!
ఆధునిక యుగంలో మనిషి జీవితానికి, విద్యుత్కు ఉన్న అనుబంధం విడదీయలేనిది. క్షణం పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. భరించలేని పరిస్థితి. పదుల సంఖ్యలో విద్యుత్ ఉపకరణాలు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న విద్యుత్కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడుతోంది. బొగ్గు సంక్షోభం గతేడాది పలు దేశాలను చీకట్లోకి నెట్టేసింది. జల, సౌర, పవన, అణు, గ్యాస్ తదితర మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా కూడా.. మనిషి అవసరాలకు సరిపోవడం లేదు. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని భారీగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. – సాక్షి, అమరావతి స్కాట్లాండ్కు చెందిన రాడ్.. గాలిపటాలతో విద్యుత్ను పుట్టించే సరికొత్త టెక్నాలజీని కనిపెట్టారు. గాలిమరల ద్వారా విద్యుత్ తయారు చేస్తున్నప్పుడు.. గాలి పటాల ద్వారా ఎందుకు విద్యుత్ తయారు చేయకూడదని ప్రశ్నించుకున్న ఆయన.. ‘ఫ్లయింగ్ టర్బైన్’ టెక్నాలజీని ఆవిష్కరించారు. గాలి పటాలు ఎగురుతున్నప్పుడు విడుదలయ్యే శక్తిని కింద ఉండే గ్రౌండ్ స్టేషన్ విద్యుత్గా మారుస్తుంది. ఈ పద్ధతిలో చాలా తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి. 10 కిలోమీటర్ల ఎత్తులోనూ గాలి పటాలు విద్యుత్ను జనరేట్ చేయగలవు. ఇవి నిరంతరం ఎగురుతూ ఉంటే ఒక ఇంటికి సరిపడే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయం, పరిశ్రమలు, చేపలు పట్టుకునే పడవలు, ఫ్యాక్టరీలు ఇలా అనేక చోట్ల ఈ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. క్లబ్లో కాళ్లు కదిపితే చాలు.. బ్రిటన్లోని ఒక నైట్ క్లబ్ సంస్థ.. తమ వద్దకు వచ్చి డ్యాన్స్ చేసే వారి శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా విద్యుత్ తయారు చేస్తోంది. ఈ విద్యుత్ను అవసరమైనప్పుడు వాడుకునేలా.. భద్రపరుచుకునే ఏర్పాటు కూడా చేసింది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా కాలుష్యాన్ని నియంత్రించి, వాతావరణ మార్పులను అరికట్టవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా ఏపీలో ఇప్పటికే చెత్త నుంచి కరెంటు తయారు చేసే విధానాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిలో తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. బొగ్గు కొరత నుంచి బయటపడటం కోసం బ్లూ హైడ్రోజన్ను జపాన్ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. జపాన్లోని టోక్యోలో బ్లూ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో వాహనాలు కూడా ప్రయోగాత్మకంగా నడిపారు. -
సోలార్ పవర్లో ఏపీ సూపర్
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. ఈ రంగంలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలోకి భారత్ చేరగా.. మన దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలిచింది. మెర్కామ్ ఇండియా తాజా రీసెర్చ్ నివేదిక ప్రకారం 2021లో మన దేశం రికార్డు స్థాయిలో 10 గిగావాట్ల సౌరవిద్యుత్ సామర్థ్యాన్ని స్థాపించింది. దీన్లో 50 శాతం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నెలకొల్పినట్లు అధ్యయనంలో వెల్లడైంది. 2020లో దేశంలో సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం పెరుగుదల 3.2 గిగావాట్లు మాత్రమే ఉంది. అంటే 2020తో పోలిస్తే 2021లో పెరుగుదల 210 శాతంగా నమోదైంది. దీంతో డిసెంబర్ 2021 చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం సామర్థ్యం 49 గిగావాట్లకు చేరుకుంది. సోలార్ రూఫ్టాప్ ఇన్స్టలేషన్లు 2021లో 138 శాతం పెరిగాయి. ఇవి రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పునరుత్పాదక రంగంలో మొదటి మూడు రాష్ట్రాలుగా ఇవి నిలిచాయి. కోవిడ్–19 కారణంగా 2020లో నెలకొల్పాల్సిన ప్రాజెక్టులు 2021లో స్థాపించడంతో ఇది సాధ్యమైంది. ఎదురవుతున్న సవాళ్లు మనదేశం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో ప్రపంచంలో నాలుగో స్థానంలో, సౌరశక్తిలో ఐదో స్థానంలో, పవన విద్యుత్లో నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో మనదేశం ఈ ఏడాది 175 గిగావాట్ల ఇన్స్టలేషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనుకుంటోంది. అయితే కస్టమ్స్ సుంకం, దిగుమతుల్లో ఎదురవుతున్న పరిమితులు, గ్లోబల్ సప్లయ్ చైన్ సమస్యలు, అధిక జీఎస్టీ.. తదితర అంశాల్లో పునరుత్పాదక విద్యుత్ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది. -
పునరుత్పాదక రంగంలో ఉపాధి వెలుగులు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, వినియోగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. వీటి ద్వారా కాలుష్యాన్ని నివారించడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కూడా కల్పించవచ్చు. కేవలం పవన విద్యుత్ ద్వారా దేశంలో మిలియన్కు పైగా ఉద్యోగాలను సృష్టించవచ్చని గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్యూఈసీ ) తెలిపింది. ‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో పవన శక్తి నుండి గ్రీన్ రికవరీ అవకాశాలను సంగ్రహించడం’ అనే అంశంతో విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. ఇండియా, బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ ఐదు దేశాలూ కోవిడ్ –19 సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ గ్రీన్ రికవరీ చర్యల్లో ఆర్థిక వృద్ధిని సాధించగల పవన విద్యుత్ వనరులను కలిగి ఉన్నాయని వెల్లడించింది. పవన విద్యుత్తులో ఐదు దేశాలు కలిపి 25 ఏళ్లలో 2.23 మిలియన్ ఉద్యోగాలు, దాదాపు 20 గిగావాట్ల అదనపు విద్యుత్ సాధిస్తాయని చెప్పింది. దాదాపు 25 మిలియన్ల గృహాలకు విద్యుత్ అందించవచ్చని వెల్లడించింది. భారత దేశంలో 25 సంవత్సరాల్లో అదనంగా 229 మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా వేసింది. ఏపీ సామర్ధ్యం 10,785.51 మెగావాట్లు దేశంలో నూతన, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,56,347.45 మెగావాట్లు. ఏపీలో పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 10,785.51 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 162.11 మెగావాట్లు చిన్న జలశక్తి వనరుల ద్వారా, 1,610 మెగావాట్లు పెద్ద జలశక్తి వనరుల ద్వారా, 4,096.65 మెగావాట్లు పవన విద్యుత్, 536.04 మెగావాట్లు బయో విద్యుత్, 4,380.71 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉన్నాయి. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీని ద్వారా పునరుత్పాదక వనరుల విద్యుత్ను ప్రోత్సహిస్తూ, పర్యావరణ పరిరక్షణలో ఏపీ భాగమవుతోంది. ప్రభుత్వాల ఉమ్మడి చర్యలు శిలాజయేతర ఇంధన వనరుల నుండి 2030 నాటికి 500 గిగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి ఆటోమేటిక్ రూట్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్డీఐ)లను అనుమతిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు వేయడం, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం వంటి చర్యలు చేపట్టింది. సౌర, పవన విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు అమ్మడానికి కేంద్రం 2025 జూన్ 30 వరకూ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీలు మినహాయింపు ఇచ్చింది. ఏపీ తీసుకునే సోలార్ విద్యుత్కు కూడా ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు వర్తించనుంది. ఈ చర్యలతో పునరుత్పాదక రంగం బలపడి, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. -
సరిలేరు నీకెవ్వరు.. వెలుగుల సీలేరు
సీలేరు: సీలేరు విద్యుత్ కేంద్రం..50 ఏళ్ల చరిత్ర.. నిరాటంకంగా విద్యుత్ కాంతులు..ఇప్పటికీ నంబర్ వన్..అదే వెలుగు..అదే ఖ్యాతి. విద్యుత్ కేంద్రాలలో సరిలేరు నీకెవ్వరు అన్నట్టు దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రకృతి సేదదీరిన పచ్చని అడవుల్లో ఒక్కొక్క నీటి బొట్టు ఒకచోట చేరి కొండలు, వాగుల నుంచి జాలువారి నీటి ప్రవాహంలా మారి బలిమెల నదిగా పేరు పొందింది. ఒకచోట నుంచి మరో ప్రాంతానికి పచ్చని కొండల మధ్య నుంచి ఒంపుసొంపులుగా ప్రవహిస్తూ ప్రతి ఊరు, ప్రతి గొంతును తడుపుతూ ఏటా లక్షలాది రైతుల ఆనందానికి చిరునవ్వుగా సీలేరు నది ప్రసిద్ధి చెందింది. 50 ఏళ్ల ముందు స్వదేశీ, విదేశీ పరిజ్ఞానంతో కారడవుల్లో విద్యుత్ కేంద్రాలను నిర్మించి నీటితో విద్యుత్ ఉత్పత్తి తయారయ్యేలా గొప్ప చరిత్రను సృష్టించి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిరంతరం అందిస్తోంది. మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రం స్వాతంత్య్రం వచ్చాక సీలేరు నదిపై 1955 ఆగస్టు నెలలో మొట్టమొదటి సారిగా మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇందులో ఆరు యూనిట్లు ఉన్నాయి. తొలుత మూడు యూనిట్లు ప్రారంభించి, తర్వాత మిగిలిన యూనిట్లను ఏర్పాటు చేసి 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ఏపీ, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో ఉత్పత్తి అయిన విద్యుత్ ఇరు రాష్ట్రాలు సమానంగా పంచుకుని 220 కేవీ లైన్ల ద్వారా ఒడిశాకు సరఫరా అవగా ఏపీ వాటా పెందుర్తి కూడా చేరుతోంది. సీలేరు: 240 మెగావాట్లు ఆంధ్రప్రదేశ్లో మాచ్ఖండ్ తర్వాత 1960లో సీలేరు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఒకటి, రెండు యూనిట్లు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 1964లో 3,4 యూనిట్లు విదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇక్కడ 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 220 కేవీ లైన్ల ద్వారా గాజువాకకు, మరో లైన్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరుకు చేరుతుంది. డొంకరాయి: 25 మెగావాట్స్ సీలేరు నుంచి విద్యుత్ ఉత్పత్తి అయిన అనంతరం విడుదలైన నీటితో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇది 1972లో నిర్మించారు. ఈ విద్యుత్ కేంద్రానికి పైన డొంకరాయి డ్యామ్ను కూడా అప్పట్లోనే నిర్మించారు. ఇక్కడ నీరు వృథా కాకుండా రెండు మార్గాల్లో నీరు విడుదలయ్యే విధంగా అప్పటి ఇంజనీర్లు నిర్మించడం విశేషం. మోతుగూడెం(పొల్లూరు): 460 మెగావాట్స్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు మాదంటే మాది అంటూ గొడవలు పడిన విద్యుత్ కేంద్రం ఇది. 1976లో నిర్మించిన ఈ జలవిద్యుత్ కేంద్రంలో ఒకేసారి నాలుగు యూనిట్లు నిర్మించారు. ఒక్కో యూనిట్ 115 మెగావాట్ల చొప్పున మొత్తం 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇదే ప్రాజెక్టులో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.537 కోట్ల వ్యయంతో రెండు యూనిట్లు నిర్మించి మరో 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. సీలేరు నది ఇరు రాష్ట్రాలకు సిరి సీలేరు విద్యుత్ కాంప్లెక్సు పరిధిలోని జలవిద్యుత్ కేంద్రాలు, జలాశయాలకు నేటికి గొప్ప చరిత్ర ఉంది. పత్రికల్లో ఎన్నో కథనాలు, ఎన్నో రికార్డులు, అవార్డులు వచ్చాయి. బలిమెల నది బలిమెలలో పుట్టి గోదావరి వరకు చేరుతుంది. ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఐడల్ విద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేయడంలో బలిమెల నదే కీలకం. రెండు రాష్ట్రాల విద్యుత్, వ్యవసాయ, తాగునీటి అవసరాలకు ఇక్కడ నుంచే నీటిని సరఫరా చేస్తారు. బలిమెల 32 కిలోమీటర్ల విస్తరణలో ఉంది. శతకోటి ఘనపుటడుగుల నీటి సామర్ధ్యంతో ఉంటుంది. ముందుగా మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయిన అనంతరం నీరు 86 కిలోమీటర్లు కొండల మధ్య ప్రవహించి బలిమెలలోకి చేరుతోంది. ఇరు రాష్ట్రాలు నీటిని సమానంగా పంచుకుంటారు. ఏపీ వాటాగా ఉన్న నీరు 18 కిలోమీటర్లు ప్రవహించి గుంటవాడలోకి చేరుతోంది. సీలేరులో విద్యుత్ ఉత్పత్తి అనంతరం పవర్ కెనాల్ ద్వారా 30 కిలోమీటర్లు ప్రవహించి గుంటవాడ జలాశయంలోకి చేరుతోంది. డొంకరాయిలో విద్యుత్ తయారై రెండు మార్గాల్లో నీటి విడుదల జరుగుతోంది. రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయిన, గోదావరి పంటలకు నీరు కావాల్సి ఉన్న మెయిన్ డ్యాం ద్వారా నీరు విడుదల చేస్తారు. అలా కాకుండా విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు కెనాల్ ద్వారా ఏవీపీ డ్యామ్కు చేరుతుంది. అక్కడ నుంచి మోతుగూడెం విద్యుత్ కేంద్రానికి చేరుకుని 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 38 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే నీటిని కలుపుకుని శబరి నదిలో కలుస్తోంది. అక్కడ నుంచి గోదావరిలోకి చేరుతోంది. గ్రిడ్కు విద్యుత్ అందించడంలో సీలేరుదే ఘనత విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంలో సీలేరు కాంప్లెక్సుకు నేటికి ఓ రికార్డు ఉంది. 50 ఏళ్లు పూర్తయినా విద్యుత్ ఉత్పత్తిలో నంబర్ వన్గా నిలుస్తోంది. ఇక్కడ నిరాటంకంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికి 50 శాతం విద్యుత్ సీలేరు నుంచే అందుతుంది. ఇటీవల సీలేరును సందర్శించినప్పుడు ఇక్కడ విద్యుత్ కేంద్రాల గొప్పతనం మరింత తెలుసుకున్నాం. – బి.శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ జెన్కో ఇంజనీర్లు, కార్మికుల కృషి వల్లే .. 50 ఏళ్లకు ముందు ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగుల కృషి ఈ విద్యుత్ కేంద్రాల ఘనత. ప్రతి ఏటా డిస్పాచ్ అధికారులు ఇచ్చిన లక్ష్యాలను మించి సమయానికి తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించిన ఘనత ఈ విద్యుత్ కేంద్రాలకు ఉంది. ప్రతి ఏటా సీలేరు నుంచి గోదావరి పంట భూములకు నీరు అందిస్తున్నాం. – రాంబాబు, చీఫ్ ఇంజనీర్, మోతుగూడెం అధికారుల ప్రశంసలు మర్చిపోలేను సీలేరు విద్యుత్ కేంద్రంలో ఉద్యోగం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ విద్యుత్కేంద్రాలు కన్నతల్లిలాంటివి. ఇక్కడ ఉద్యోగం చేయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించడంపై అధికారుల ప్రశంసలు మర్చిపోలేను. – రమేష్కుమార్, ఏడీ, జలవిద్యుత్ కేంద్రం, సీలేరు. -
దేశంలో.. సింగరేణి ఆ ఘనత సాధించి నెంబర్ వన్గా నిలిచింది
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2021–22లో డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నంబర్వన్గా నిలిచింది. అత్యధిక సామర్థ్యం(పీఎల్ఎఫ్)తో విద్యుదుత్పత్తి జరపడం తో ఈ ఘనత సాధించింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) ర్యాంకింగ్లో సింగరేణి విద్యుత్ కేంద్రం 2021 ఏప్రిల్– డిసెంబరు మధ్యకాలంలో 87.18% పీఎల్ఎఫ్ సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) 73.98% తో రెండో, 70.29 % తో పశ్చిమ బెంగాల్ జెన్కో మూడో స్థానంలో నిలిచాయి. 29% వృద్ధి.. 2020–21లో డిసెంబర్ నా టికి సింగరేణి కేంద్రం 5,335 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా, 2021–22 డిసెంబర్ నాటికి 29% వృద్ధి తో 6,904 ఎంయూల విద్యు దుత్పత్తి చేసింది. విద్యుత్ అమ్మకాలు రూ.2,386 కోట్ల నుంచి 20% వృద్ధితో రూ.2,879 కోట్లకు పెరి గాయి. మంగళవారం ఆయన ఇక్కడ సమీక్షించా రు. శ్రీరాంపూర్ రైల్వేలైన్ విద్యుదీకరణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, లోయర్ మానేర్ డ్యాంపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ సర్వే పనులను నెలాఖరులోగా, డీపీఆర్ను ఫిబ్రవరిలోగా పూర్తి చేసి మార్చి లో టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. -
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపండి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం కుడి, ఎడమగట్టు కేంద్రాల నుంచి విద్యుదుత్పత్తి తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిం ది. ఈ మేరకు బోర్డు సభ్యులు (విద్యుత్) ఎల్బీ ముంతంగ్ ఈ నెల 18న లేఖ రాశారు. విద్యుదుత్పత్తి ఆపకుంటే రిజర్వాయర్ పరిధిలో తాగు, సాగునీటికి కష్టాలు తప్పవని హెచ్చరించారు. అక్టోబర్ 15న జలాశయంలో 885 అడుగుల నీటి మట్టం వద్ద 216.8 టీఎంసీల నిల్వ ఉండగా, నవంబర్ 18 నాటికి 856.10 అడుగుల వద్ద 94.91 టీఎంసీలకు తగ్గిపోయాయని పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో నిల్వలు గరిష్ట మట్టానికి చేరుకోవడంతో, ఎగువ నుంచి వస్తున్న నీళ్లు వృథాగా సముద్రం పాలు అవుతున్నాయని తెలిపారు. -
మైనింగ్, విద్యుదుత్పత్తి జోరు
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి పారిశ్రామిక రంగం వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో దేశీయ సగటు కంటే రాష్ట్రం మెరుగైన వృద్ధిరేటు నమోదు చేసినట్లు గణాంకాల శాఖ తాజా నివేదికలో పేర్కొంది. కోవిడ్తో భారీగా దెబ్బతిన్న మైనింగ్ రంగం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి (ఏప్రిల్ – జూలై) 37.4 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మైనింగ్ రంగంలో 25.3 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. ఇక 2020–21 ఏప్రిల్ – జూలైతో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రంలో 23.1 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి రేటు 15.2 శాతానికే పరిమితమైంది. నాలుగు నెలల కాలానికి రాష్ట్ర తయారీ రంగంలో 20.7 శాతం వృద్ధి నమోదు కాగా దేశవ్యాప్తంగా 39 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల కాలంలో రాష్ట్ర పారిశ్రామికోత్పత్తిలో 22.8 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాల శాఖ తెలిపింది. పెరుగుతున్న కొనుగోళ్ల శక్తి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో కొనుగోళ్ల శక్తిని పెంచుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది నాలుగు నెలల కాలంలో వివిధ రంగాల్లో ప్రజల వినియోగంలో గణనీయమైన వృద్ధిరేటు నమోదైంది. గతేడాది నిర్మాణ రంగంలో నాలుగు నెలల కాలంలో 41.7 శాతం క్షీణత నమోదు కాగా ఈ ఏడాది ఏకంగా 56 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగంలో 57.8 శాతం, పేస్టులు, సౌందర్య సాధనాలు, ఇంటిని శుభ్రపరచే నాన్ కన్జూమర్ డ్యూరబుల్స్ వినియోగంలో 156.4 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాల శాఖ పేర్కొంది. గతేడాది కోవిడ్తో దెబ్బతిన్న ప్రైమరీ, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ రంగాలు కూడా క్రమంగా వృద్ధి బాట పట్టాయి. -
వెంటాడుతున్న బొగ్గు భయం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం వెంటాడుతోంది. ఆంధ్రప్రదేశ్ సహా దాదాపు 14 రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో విద్యుదుత్పత్తికి విఘాతం కలుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా విద్యుత్ సంక్షోభంపై సోమవారం సమావేశం నిర్వహించగా ప్రధాని మోదీ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. బొగ్గు సంక్షోభంపై తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ సీఎం వైఎస్ జగన్ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మిగులు విద్యుదుత్పత్తి కలిగిన రాష్ట్రాలు కొరత ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర విద్యుత్ శాఖ మంగళవారం పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. సంక్షోభాన్ని పట్టించుకోకుండా మిగులు కరెంట్ను పవర్ ఎక్స్చేంజ్ల్లో విక్రయిస్తే ఆ రాష్ట్రాల కేటాయింపులను తగ్గిస్తామని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ స్టేషన్ల వద్ద ఎవరికీ కేటాయించకుండా ఉన్న 15 శాతం కోటా నుంచి విద్యుత్ను వాడుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. దేశమంతా కటకట.. దేశవ్యాప్తంగా 1,65,066 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకి 18,70,400 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఉన్న 73,16,600 మెట్రిక్ టన్నుల బొగ్గు సగటున నాలుగు రోజులకు సరిపోతుంది. నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం మంగళవారం నాటికి 116 థర్మల్ కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. వీటిలో 15 కేంద్రాల్లో బొగ్గు అసలు లేదు. 27 కేంద్రాలలో ఒక్క రోజుకు మాత్రమే సరిపడా ఉంది. 20 కేంద్రాల్లో రెండు రోజులకు, 21 కేంద్రాల్లో మూడు రోజులకు, మరో 20 కేంద్రాల్లో నాలుగు రోజులకు, ఐదు కేంద్రాల్లో ఎనిమిది రోజులకు, 8 కేంద్రాల్లో ఆరు రోజులకు మించి బొగ్గు చాలదు. దీంతో దేశవ్యాప్తంగా 1,42,054 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఇలా.. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో ప్రస్తుతం నాలుగు రోజులకు సరిపడా 48,600 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో 26,900 మెట్రిక్ టన్నులు ఉండగా ఇది ఒక్క రోజుకే సరిపోతుంది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో 69,700 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నందున నాలుగు రోజులు విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. సింహాద్రిలో 13,900 మెట్రిక్ టన్నుల బొగ్గు ఒక్క రోజుకే సరిపోనుంది. వీటన్నిటి ఉత్పత్తి సామర్థ్యం 9,370 మెగావాట్లు కాగా ప్రస్తుతం బొగ్గు కొరతతో సగం కూడా విద్యుదుత్పత్తి జరగడం లేదు. -
శ్రీశైలం డ్యాం రెండుగేట్ల ఎత్తివేత
శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల)/ సత్రశాల(రెంటచింతల): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో ఆదివారం రాత్రి రెండు గేట్లను ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరద ప్రవాహం పెరగడం, డ్యాం నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకోవడంతో రాత్రి 8.30 గంటల సమయంలో రెండు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,600 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టులు, హంద్రీనది నుంచి 2,02,265 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు 56,684 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శనివారం నుంచి ఆదివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.461 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.693 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా హంద్రీ–నీవా సుజలస్రవంతికి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 211.4385 టీఎంసీల నీరునిల్వ ఉంది. సాగర్లో 311.1486 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి భారీగా నీరు వస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం పెరుగుతోంది. సాగర్లో 589.70 అడుగుల మట్టంలో 311.1486 టీఎంసీల నీరు ఉంది. కుడికాలువకు 9,217 క్యూసెక్కులు, ఎడమకాలువకు 8,718 క్యూసెక్కులు, 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16,138, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 28,379, ఎస్ఎల్బీసీకి 2,400, వరదకాలువకి 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ నుంచి మొత్తం ఔట్ఫ్లో 65,252 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ నుంచి టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టుకు 44,030 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ప్రాజెక్ట్ డీఈ దాసరి రామకృష్ణ, ఏడీఈ నర్సింహారావు ఆదివారం తెలిపారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు 4 క్రస్ట్ గేట్ల నుంచి, విద్యుదుత్పత్తి ద్వారా మొత్తం 44,783 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
విద్యుత్ను పొదుపుగా వాడండి
సాక్షి, అమరావతి: దేశంలో బొగ్గు సంక్షోభం నెలకొన్న కారణంగా మన రాష్ట్రంపైన కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో విద్యుత్ సంస్థలకు సహకరించాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతి వినియోగదారుడు విద్యుత్ పొదుపుపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పీక్ అవర్స్గా పిలుచుకునే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏసీల వంటి పరికరాల వాడకం తగ్గించుకోవాలన్నారు. ఈ మేరకు విజయవాడలో శనివారం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహకారమందించాలి.. బొగ్గు కొరత సంక్షోభాన్ని అధిగమించేందుకు తగిన సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ ఇప్పటికే లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్రంలో 2,300 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పనిచేయడం లేదని తెలిపారు. వాటికి ఓఎన్జీసీ, రిలయెన్స్ నుంచి గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని సీఎం కోరారు. అలాగే బొగ్గు కొనుగోలు ధరలు, విద్యుత్ మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగినందున రాష్ట్ర విద్యుత్ సంస్థలు బొగ్గు కొనుగోలు చేయడానికి రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పడిపోయిన జెన్కో ఉత్పత్తి.. కోవిడ్ తర్వాత విద్యుత్ వినియోగం 2019తో పోలిస్తే 2021లో దేశవ్యాప్తంగా 18 శాతం, ఏపీలో 20 శాతం పెరిగింది. ఒకవేళ కోవిడ్ లేకపోతే జరిగే వినియోగం కంటే ఇది 8 శాతం ఎక్కువ. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి వినియోగిస్తున్న 190 మిలియన్ యూనిట్లలో 80 మి.యూనిట్ల విద్యుత్ ఏపీ జెన్కో ద్వారా అందుతోంది. ప్రస్తుతం జెన్కో ఉత్పత్తి 50 శాతం (40 మి.యూ)కి పడిపోయింది. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి రోజుకు 40 మి.యూ విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా అందులో 75 శాతం (30 మి.యూ) మించి ఉత్పత్తి అవ్వట్లేదు. జల విద్యుత్ ఉత్పత్తి 25 మిలియన్ యూనిట్ల వరకే చేయగలం. రోజుకి 15 మి.యూ సౌర విద్యుత్ వస్తోంది. 30 మి.యూ పవన విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా.. కేవలం 5 నుంచి 10 మి.యూనిట్లకే పరిమితమవుతోంది. బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగాయి.. రాష్ట్రంలో 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తుండగా ఈ నెల 8 నుంచి యూనిట్ సగటు ధర రూ.15కు పెరిగింది. ఇండోనేషియా నుంచి సరఫరా అయ్యే బొగ్గు ఏప్రిల్లో టన్ను 86.68 డాలర్లుండగా ఇప్పుడు 162 డాలర్లు అయ్యింది. మనరాష్ట్రంలో ఉన్న 5 వేల మెగావాట్ల థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. జెన్కో ప్లాంట్లకి రోజుకు 70,000 టన్నుల బొగ్గు అవసరం. గత నెలలో 24,000 టన్నులు మాత్రమే బొగ్గు అందుబాటులో ఉంది. కేంద్రాన్ని కోరాక అది ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు చేరింది. 20 బొగ్గు ర్యాక్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేశాం.. బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు రాబోయే వేసవి కోసం నిల్వలు పెంచుతాయి. ఈ నేపథ్యంలో 2022 కోసం రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్స్ కేటాయించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అలాగే దేశంలో విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు, బొగ్గు సరఫరా ఒప్పందాలు లేని కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపేసిన కొన్ని ప్లాంట్లలో వెంటనే తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించాం. విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి గత రెండేళ్లలో ప్రభుత్వం చేయగలిగినంత సహాయం చేసింది. దాదాపు రూ.34,340 కోట్ల ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటుకే రూ.9,165 కోట్లు చెల్లించింది. మార్చి 2019 నాటికి రూ.27,239 కోట్లు ఉన్న విద్యుత్ సంస్థల మొత్తం నష్టాన్ని మార్చి 2021 నాటికి రూ.27,552 కోట్ల వద్దనే నిలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించేసింది. బొగ్గు కొరత సంక్షోభం ప్రభావం విద్యుత్ రంగంపై తాత్కాలికమేనని భావిస్తున్నాం. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు కృషి చేస్తాయి.