వారంలో జనగామకు వస్తా.. | Coming Soon To The Janagama | Sakshi
Sakshi News home page

వారంలో జనగామకు వస్తా..

Jul 11 2018 2:39 PM | Updated on Jul 11 2018 2:39 PM

Coming Soon To The Janagama - Sakshi

‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని మంత్రి హరీష్‌రావుకు చూపిస్తున్న ఎమ్మెల్యే రాజయ్య 

లింగాలఘణపురం: వారం రోజుల్లో జనగామకు వస్తా..చీఫ్‌ ఇంజనీర్, ఇంజనీర్లతో వచ్చి కలెక్టర్‌ను కూర్చోబెట్టి తొవ్వ తీస్తా. వీలైనంత తొందరలో నీళ్లు అందించేందుకు సాయం చేస్తానని భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్‌ హరీష్‌రావు రైతులకు హామీ ఇచ్చారు. రఘునాథపల్లి మండల అశ్వరావుపల్లి రిజర్వాయర్‌ నుంచి వచ్చే ప్రధాన కాల్వ జనగామ పట్టణంలో భూసేకరణ రెండున్నర కిలో మీటర్లు ఆగిపోయింది.

దీంతో అసంపూర్తిగా ఉన్న కాల్వ నిర్మాణంతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై మండలంలోని అన్ని గ్రామాల రైతులు మంగళవారం హైదరాబాద్‌లో భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావును ఎమ్మెల్యే రాజయ్య ఆధ్వర్యంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ‘కాల్వ పూర్తి కాదు..నీళ్లు రావు’ శీర్షికన ఈనెల 6న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.

ఈ కథనంలోని వివరాలను ఎమ్మెల్యే రాజయ్య మంత్రి హరీష్‌రావుకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో ప్లాట్లు ఉండడంతో భూసేకరణ జరుగలేదని, చుట్టూ నీళ్లు వచ్చి మీకు రాకపోవడంతో ఎవరికైనా బాధ ఉంటది.. ఇక్కడ మాట్లాడినట్లు ఒక్క నిమిషంలో అయ్యే పనులు కావు.. జనగామకే వచ్చి ఒక పూట ఉంట కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్వోను పిలిపించి మాట్లాడుతా.  

ఏదో తొవ్వ తీసి వీలైనంత తొందరగా నీళ్లు వచ్చేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులంతా ఆనందం వ్యక్తం చేశారు. మంత్రిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు నాగేందర్, జెడ్పీటీసీ రంజిత్‌రెడ్డి, మండల ఇన్‌చార్జి ఉపేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ శ్రీనువాసు, మార్కెట్‌ డైరెక్టర్లు భాస్కర్‌రెడ్డి, భాగ్యమ్మ, నాయకులు బోయిని రాజు, దూసరి గణపతి, దుంబాల భాస్కర్‌రెడ్డి, పోకల శంకరయ్య, గవ్వల మల్లేశం, లింగాల వెంకటేష్, వీరయ్య, శ్రీనువాసురెడ్డి ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement