
సాక్షి, వనపర్తి: ముడుపులు ఇవ్వనిదే పనిచేయడం లేదని కొత్తకోటకు చెందిన ఓ వ్యక్తి మున్సిపాలిటీ సిబ్బంది తీరుపై విసుగు చెంది ఏకంగా వీడియో రూపంలో పలు గ్రూపుల్లో బుధవారం పోస్టు చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తకోటకు చెందిన హన్మంతుకు కృష్ణ, కర్ణ, రాములు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. హన్మంతుకు స్థానిక విద్యానగర్లోని భారతీ విద్యామందిర్ పాఠశాల సమీపంలో 14–14, 14–15 అనే నంబర్లపై ఇల్లు ఉంది. ఇటీవల తన ఇంటిని ముగ్గురి కుమారుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు. కుమారుల్లో ఒకరైన రాము 3 నెలల క్రితం ఆ రిజిస్ట్రేషన్ పేపర్లను స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో సమర్పించి ముగ్గురు అన్నదమ్ములపై ఇంటి నంబర్లను మార్చాలని దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే పేర్లు మార్చడంతోపాటు మరో కొత్త ఇంటి నంబరు ఇచ్చేందుకు రూ.3 వేలు లంచం ఇవ్వాలంటూ బిల్ కలెక్టర్ భాస్కర్, జూనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ అడిగారని, దీంతో బిల్ కలెక్టర్ భాస్కర్కు రూ.వెయ్యి ఇచ్చినా సరిపోలేదని కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితుడు రాము ఆరోపించారు. తమ తండ్రిపై ఉన్న సొంత ఇంటిని కుమారుల పేరుపై మార్చుకునేందుకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ రుసుం చెల్లించామని, లంచం ఇచ్చుకోలేమని ఎన్నిమార్లు చెప్పినా వారిద్దరూ వినిపించుకోలేదని రాము వాపోయారు. దీంతో బుధవారం ఏకంగా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వాట్సప్ ద్వారా కోరిన వీడియో కలకలం రేపింది. ఈ విషయమై కొత్తకోట మున్సిపాలిటీ కమిషనర్ కతలప్పను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. సిబ్బంది లంచం అడిగినట్లు ఆధారాలు ఉంటే వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితుడు రాము
Comments
Please login to add a commentAdd a comment