
కొనసాగుతున్న తవ్వకం పనులు
* రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అధికారులు
మంచాల: బోరుబావిలో పడిన చిన్నారిని బయటకు తీసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల చిన్నారి గిరిజ ఆదివారం ఉదయం బోరు బావిలో పడిన విషయం తెలిసిందే. అదే రోజు 11.30కు ప్రారంభమైన రిస్క్యూ ఆపరేషన్ సోమవారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. ఎన్డీ ఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ టీంలు నిర్విరామంగా పనిచేస్తున్నా బాలికను కనుగొనలేకపోయారు. 45 అడుగుల లోతులో చిన్నారి ఉందని భావిస్తున్న అధికారులు దాని పక్కనే జేసీబీల సాయంతో తవ్వకం చేపట్టారు.
42 అడుగుల వద్ద ఓ పెద్ద బండరాయిని గుర్తించిన అధికారులు దాన్ని తొలగించేందుకు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత 48 అడుగుల వద్ద మరో బండరాయి రావడంతో తవ్వకం పనులు మరింత ఆలస్యమయ్యాయి. 50 అడుగుల వరకు తవ్వకం పూర్తయిన తర్వాత బోరు వైపు రంధ్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో చీకటి పడడంతో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎన్. శ్రీధర్, జేసీ ఎంవీ.రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారు.