కనురెప్పే కాటేసింది! | Father daughter sexual assault | Sakshi
Sakshi News home page

కనురెప్పే కాటేసింది!

Published Sun, May 24 2015 1:38 AM | Last Updated on Thu, Aug 16 2018 4:21 PM

కనురెప్పే కాటేసింది! - Sakshi

కనురెప్పే కాటేసింది!

గిరిజన బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది తండ్రే
అత్యాచారానికి ఒడిగట్టి ఆపై హత్య  విచారణలో నేరం ఒప్పుకున్న తండ్రి


వికారాబాద్/బంట్వారం/మోమిన్‌పేట్: కనురెప్పే కంటిపాపను కాటేసింది! కన్నతండ్రే కామాంధుడయ్యాడు. గిరిజన బాలిక ‘హత్యా’చారం కేసులో విస్తుపోయే నిజం వెలుగుచూసింది. తండ్రి మెగావత్ క మాల్ తన బిడ్డపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అఘాయిత్యానికి ఒడిగట్టిన తర్వాత.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దుండగులు తనపై దాడి చేసి కుమార్తెను అపహరించారని అతడు కట్టుకథ అల్లినట్లు స్పష్టమైంది.

రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన సిమ్రాన్(14) వేసవి సెలవుల అనంతరం సొంతూరుకు తండ్రి కమాల్‌తో కలిసి వస్తుండగా అత్యాచారం, హత్యకు గురైన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 24 గంటల్లోనే మిస్టరీని ఛేదించారు. కమాల్ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నేరం చేసినట్లు అంగీకరించాడు.

ఆ కత్తి, మోపెడ్ కమాల్‌వే..
సంఘటనా స్థలంలో దొరికిన కత్తితోపాటు మోపెడ్ టైర్ల గుర్తులు కమాల్ వాహనానివేనని పోలీసులు నిర్ధారణకు రావడంతో గుట్టురట్టయింది. అంతేకాకుండా రాత్రి 9 గంటలకు ఘటన జరిగితే అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఫిర్యాదు చేయకపోవడం కూడా పోలీసుల అనుమానానికి తావిచ్చింది. ఈ కోణంలోనే దర్యాప్తు సాగించిన పోలీసులు.. వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో వీడియో ఫుటేజీని సైతం పరిశీలించారు. సాయంత్రం 7.26 గంటలకు గుల్బర్గా ప్యాసింజర్ రైలులో వికారాబాద్‌కు కమాల్ చేరుకున్నాడు. అక్కడ్నుంచి నేరుగా స్థానిక రాజీవ్ గృహకల్ప కాలనీలోని ఓ ఇంటికి వెళ్లారు.

అక్కడే ఉన్న తన మోపెడ్‌ను తీసుకొని పెట్రోల్ పోయించుకుని వస్తానని చెప్పిన కమాల్.. బయటికి వెళ్లి మద్యం తాగి వచ్చాడు. తర్వాత కూతురుతో కలసి సొంతూరుకు బయల్దేరాడు. మార్గమధ్యంలో మోత్కుపల్లి గేటు సమీపంలో అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కట్టుకథ చెప్పాడు. ఒక ఆటోలో వచ్చిన దుండగులు తనపై దాడి చేసి కూతురును అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు 30 మంది ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వదిలేశారు. కమాల్‌కు గతంలో పలు దొంగతనాలతో సంబంధం ఉండడం, జైలుకు వెళ్లి వచ్చిన నేరచరిత్ర ఉండడం, బలిష్టిగా ఉన్నా అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో కమాల్ నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలిసింది.
 
ఐదు బృందాలతో దర్యాప్తు
గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసులు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. వేకువజామునే కమాల్‌ను మోమిన్‌పేట పోలీసు స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. ఆ తర్వాత మరోసారి విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆదివారం విలేకర్ల సమావేశంలో ప్రకటి స్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement