
షర్మిల పరామర్శయాత్ర పెడ్యూల్ లో స్వల్ప మార్పులు
హైదరాబాద్: వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో చేపట్టనున్నపరామర్శ యాత్ర షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దివంగత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల జరప తలపెట్టిన యాత్ర డిసెంబర్ 8న మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా ఈనెల 8వ తేదీ సోమవారం ఉదయం లోటస్ పాండ్ నుంచి షర్మిల యాత్ర ఆరంభించనున్నారు. తొలుత కొత్త బ్రాహ్మణపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించిన అనంతరం పరామర్శ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తొలిరోజు ఇర్విన్, దేవుని వడ్కల్, వెలిజాలలో మూడు కుటంబాలను షర్మిల పరామర్శిస్తారు.
అనంతరం అదే రోజు సాయంత్రం కల్వకుర్తిలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. తొమ్మిదవ తేదీ ఉదయం అమ్రాబాద్ లో ఓ కుటుంబాన్ని పరామర్శించి తరువాత అచ్చంపేటలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. 10వ తేదీన పెంటవల్లి, చిట్యాల, రాణిపేట, నందిన్నెలో మూడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. ఆ రోజు రాత్రికి దయార్ లో ఆమె బస చేస్తారు. 11వ తేదీ ఉదయం జూరాల నుంచి పరామర్శయాత్ర ఆరంభం కానుంది. కొన్నూరు, కోసి, అమీన్ కుంట, ఇండావూర్ లో ఐదు రైతు కుటుంబాలను షర్మిల పరామర్శించి.. సాయంత్రం కొడంగల్ లో బస చేస్తారు. 12 వ తేదీ పెద ఎర్కిచర్ల, గుండ పాటవల్లి, నర్సప్ప గూడ, మలావూర్ లో నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించడంతో మహబూబ్ నగర్ జిల్లా యాత్ర ముగియనుంది. ఆరోజు సాయంత్రం షాద్ నగర్ మీదుగా షర్మిల హైదరాబాద్ కు చేరుకుంటారు.