వాళ్లు జిల్లాకు ఏం జేసిండ్రు? | Harish rao fired on congress | Sakshi
Sakshi News home page

వాళ్లు జిల్లాకు ఏం జేసిండ్రు?

Published Mon, Jun 18 2018 2:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Harish rao fired on congress  - Sakshi

నల్లగొండ: ‘తెలంగాణ రాష్ట్రం రావడం నల్లగొండ జిల్లా ప్రజల అదృష్టం. ఇన్నేళ్లూ కాంగ్రెస్‌ నాయ కులకు ఓట్లేసి పెద్ద నాయకులుగా తయారు చేస్తే వారంతా కలిసి జిల్లాను ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతంగా మార్చారు. ఈ జిల్లాను ముంచి పులిచింతల ప్రాజెక్టు నిర్మించి ఆంధ్రాకు బహుమానంగా ఇచ్చారు’ అని ఆ జిల్లా కాంగ్రెస్‌ నాయకులపై నీటి పారుదల, మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గండికొట్టి నాగార్జునసాగర్‌కు నీరు రానివ్వకుండా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణానికి పాటుపడ్డారే తప్ప.. జిల్లా అభివృద్ధికి వారు చేసింది ఏంటని ప్రశ్నించారు.

ఆదివారం నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతు సమన్వయతి సమితి కార్పొరేషన్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ఆయన నకిరేకల్‌లో నిమ్మ, నల్లగొండలో బత్తాయి మార్కెట్‌లను ప్రారంభించారు. అనంతరం నల్లగొండ మార్కెట్‌ యార్డులో జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో మరేమంత్రి చేపట్టలేని మంత్రి పదవులు అనుభవించిన జానారెడ్డి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రైట్‌ హ్యాండ్‌గా తిరిగిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నా అంత పవర్‌ఫుల్‌ మంత్రి లేడని గర్వంగా చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ జిల్లాకు ఏం చేసిండ్రు? అని ప్రశ్నించారు.

ఇన్నేళ్లలో కాంగ్రెస్‌ నాయకులు చేయలేని అభివృద్ధి పనులు నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందన్నారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ, మూసీ కాలువల ఆధునీకరణ, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. పెద్ద నాయకులమని చెప్పుకునే వీరు జిల్లాకు మెడికల్‌ కాలేజీని ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకులు అధికారంలో కొనసాగితే మరో పులిచింతల ప్రాజెక్టు నిర్మించి ఆంధ్రాకు అప్పగించేవారని ఎద్దేవా చేశారు.

ఆంధ్రా ఏజెంట్లుగా పనిచేశారు...
జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఆంధ్రా పాలకులకు ఏజెంట్లుగా పనిచేశారని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించా రు. వారంతా జిల్లాలోని ఫ్లోరైడ్‌ నిర్మూలనకు కృషి చేయలేదన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు వీరేశం, కిషోర్, ఫైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement