చేపా.. చేపా.. ఎప్పుడు తినాలి? | Sakshi
Sakshi News home page

చేపా.. చేపా.. ఎప్పుడు తినాలి?

Published Fri, Nov 10 2017 2:57 AM

It is best to eat any fish curry in any month. - Sakshi

మనలో చాలా మందికి చేపల కూర అంటే నోరూరుతుంది.. అయితే మీరు తినే చేప గురించి మీకు తెలుసా..? ఏ నెలలో ఏ ఫిష్‌ కర్రీ తింటే మంచిది..? ఈ విషయాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనంపై ఓ లుక్కేయండి..

మత్స్య సంపద ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారతదేశం ఏడో స్థానంలో ఉంది. చేపల పెంపకంలో అధునాతన పద్ధతులను అమలు చేయడం ద్వారా గత 50 ఏళ్లుగా మనదేశం ఈ స్థానాన్ని నిలుపుకుంటోంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం.. 2014లో మనదేశం సుమారు 3.4 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సముద్ర జీవులను ఉత్పత్తి చేసింది. ఇది పార్శా్వనికి ఒక వైపు మాత్రమే. కొన్ని అధ్యయనాలు ఏం చెపుతున్నాయంటే.. దేశంలో మత్స్య రంగం విస్తరణ ప్రస్తుతం అత్యున్నత దశకు చేరిందని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో చేపలు దొరికే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నిబంధనలకు నీళ్లు..
అసలు ఈ సమస్యకు కారణం ఏమిటంటే.. సముద్ర తీర ప్రాంతాల్లో సీజనల్‌ ఫిషింగ్‌(కాలానుగుణ చేపల వేట)పై కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. గుడ్లు పెట్టే, పిల్లలను పొదిగే దశలో చేపలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంది. అయితే ఈ నిబంధనలు సక్రమంగా అమలవుతున్న దాఖలాలు ఎక్కడా లేవని కర్ణాటక మైసురులోని ఇండియాస్‌ నేచుర్‌ కన్సర్వేషన్‌ ఫౌండేషన్‌కు చెందిన సముద్ర జీవశాస్త్రవేత్త మయురేష్‌ గంగల్‌ పేర్కొన్నారు. మార్కెట్‌ డిమాండ్‌ను అందుకునేందుకు మత్స్యకారులు ఈ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని చెప్పారు.

‘నో యువర్‌ ఫిష్‌’ క్యాంపెయిన్‌
ఈ పరిస్థితులను మార్చేందుకు మరో ఇద్దరు సహచరులతో కలసి గంగల్‌ ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం తరఫున పోరాడటం.. మత్స్యకారుల చేపల వేట పద్ధతుల్లో మార్పులు చేయడం కాకుండా.. చేపల వినియోగదారుల ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం వీరి ప్రధాన ఉద్దేశం. ఈ ఏడాది ప్రారంభంలో ఈ టీమ్‌ ‘నో యువర్‌ ఫిష్‌’(మీ చేప గురించి తెలుసుకోండి) క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. భారత పశ్చిమ తీరంలో సరైన చేపల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. అంతేకాక ఈ టీమ్‌ చేపల సంతానోత్పత్తి, గుడ్లు పెట్టే దశలను వివరిస్తూ ఏ నెలలో ఏ చేపను తినాలో సూచిస్తూ ఓ క్యాలెండర్‌ను సైతం రూపొందించింది.

ఆహారపు అలవాట్లలో మార్పులు
కొన్ని చేపలు కొన్ని సీజన్లలో సంతానోత్పత్తి చేస్తాయని, అయితే ఆ సమయంలో సంతానోత్ప త్తికి భంగం కలిగిస్తే వాటికి కొత్త తరం ఉండ బోదని గంగల్‌ చెప్పారు. భారతీయుల ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావడం వల్ల చేపల వేట, వివిధ రకాల చేపల డిమాండ్‌లో మార్పు వస్తుందని ఈ బృందం భావిస్తోంది. సాధారణంగా ఎక్కువగా వంటలకు ఉపయో గించే 25 రకాల చేపలు, రొయ్యలను పరిశీలకులు గుర్తించారు. ఇందులో టైగర్‌ రొయ్య లాంటి కొన్ని రకాలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటే.. బాంబే డక్‌(వనమట్టాలు లేదా కోకాముట్ట) చేపలను స్థానికంగా వంటలకు ఉపయోగిస్తుంటారు. ఈ వివరాలను ఓ వెబ్‌సైట్‌ ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. తొమ్మిది ముఖ్యమైన రకాల సముద్ర జీవులకు సంబంధించి ఒక క్యాలెండర్‌ను రూపొందించారు. దీనిని పాఠశాలలు, యూనివర్సిటీలు, సామాజిక సంస్థలకు అందజేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లు ఈ కేలండర్‌ ఆధారంగా తమ మెనూలను మార్చుకునేందుకు సిద్ధపడ్డాయి కూడా. అలాగే ఏ నెలలో ఏ చేపను తినాలనే దానికి సంబంధించి ఉచిత ఎస్‌ఎంఎస్‌ సదుపాయాన్ని కూడా అందజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ ఇంగ్లిష్‌లో ఉంది. చేపల పేర్లను మరాఠీలో అందిస్తున్నారు. మరిన్ని భాషల్లో ఈ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చేందుకు ఈ బృందం సన్నాహాలు చేస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement